కామారెడ్డిలో పోటీపై షబ్బీర్‌ అలీ క్లారిటీ

23 Oct, 2023 17:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను నియోజవర్గం మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ. కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని షబ్బీర్‌ ఆలీ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ కామారెడ్డి వచ్చారన్నారు. తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనని షబ్బీర్‌ ఆలీ తేల్చిచెప్పారు.

‘కేసీఆర్‌కు స్వాగతం  పలుకుతున్నాను. కామారెడ్డికి రండి.. ఇద్దరం పోటీలో ఉందాం. ఇద్దరం ప్రజాక్షేత్రంలో తలబడదాం. మీ నిజాయితీని నిరూపించుకోండి.  నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ప్రజలే నిర్ణయిస్తారు. అంతే కానీ నీవు అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరు’  అని తెలిపారు.

కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్‌ అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రత్యర్థిగా కేసీఆర్‌ఉండటంతోనే పోటీకి షబ్బీర్‌ ఆలీ విముఖత వ్యక్తం చేస్తారనేది ఆ రూమర్ల సారాంశం. కేసీఆర్‌పై పోటీకి దిగితే అది తన పొలిటికల్‌ కెరీర్‌పై పడుతుందంటూ వార్తలు వ్యాపించాయి. ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్‌ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని తాజాగా ఖండిస్తూ తన పోటీ కామారెడ్డి నుంచేనని స్పష్టం చేయడంతో  ఆ రూమర్లకు ఫుల్‌ స్టాప్‌ పడింది. 

ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

‘‘క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’

మరిన్ని వార్తలు