గెలిచేది వైఎస్సార్‌సీపీ జెండా.. నిలిచేది జగన్ అజెండా

24 Nov, 2023 13:09 IST|Sakshi

బొబ్బిలి గడ్డపై గర్జించిన సామాజిక సాధికార యాత్ర

రుణాల మాపీపై చంద్రబాబు పంగనామాలు పెట్టాడు, జగన్ టీడీపీ వదిలిన అప్పులు  తీర్చారు - డిప్యూటీ సీఎం బూడి

జగన్ ఆశీస్సులతో 11,500 ఎకరాలకు సాగునీరిచ్చాం. బొబ్బిలి రాజులు సొంత ఆస్తులు పెంచుకున్నారు - ఎమ్మెల్యే శంబంగి

గెలిచేది వైఎస్ఆర్ సీపీ జెండా... నిలిచేది జగన్ అజెండా - కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి

చెరకు రైతులను టీడీపీ మోసం చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 35 కోట్లు వసూలు చేసి చెల్లించింది - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే  సాధ్యం - ఎంపీ బెల్లాన

సాక్షి విజయనగరం: జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర గర్జించింది. అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య వైఎస్సార్ సీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర బొబ్బిలిలో అడుగుపెట్టింది. ఈ  సందర్బంగా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిదులుముచ్చటించారు. అనంతరం బొబ్బిలి జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్,  జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు. 

రుణాల మాపీపై బాబు పంగనామాలు పెట్టాడు, జగన్ టీడీపీ వదిలిన అప్పులు  తీర్చారు - డిప్యూటీ సీఎం బూడి

ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ  ఈ ప్రాంతాన్ని గత పాలకులు ఎంతలా విస్మరించారో, యువనేత జగన్ సీఎం అయ్యాక ఎలా ప్రజల కలలను సాకారం చేసారో ప్రజలు గమనిoచాలన్నారు. బొబ్బిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. ఎస్టీ మహిళ అయిన పుష్ప శ్రీవాణి, ఎస్టీ నేత అయిన పీడిక రాజన్నదొర, బీసీ వర్గానికి చెందిన తాను ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొని పాలన సాగించడమే సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. 25 మంది కేబినెట్ మంత్రులు ఉండగా, వారిలో 17 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారని గుర్తు చేసారు. గడిచిన ఎన్నికలలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసారనే లెక్క లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు పంగనామాలు పెట్టి మోసం చేస్తే, జగన్ సీఎం  కాగానే బాబు ఎగ్గొట్టిన అప్పులన్నీ  తీరుస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు పింఛన్ రూ. 3 వేలు చేయబోతున్నారని, ఎప్పుడూ రెండు వేళ్లు చూపే టీడీపీ నేతలకు పండగ నుంచి మూడు వేలు తీసుకుని వారికి మూడు వేళ్లు చూపాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్థాయి సంపన్నుల పిల్లలు ఎలా చదువుకుంటారో, పేదల పిల్లలు కూడా అలానే అభ్యసించాలని ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారని వివరించారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిత కోసం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారని, బొబ్బిలి రాజుల పిల్లలే ఆంగ్లంలో చదువుకోవాలా, ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా అని జగన్ నాడు - నాడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో బొబ్బిలిలో శంబంగి చిన  అప్పల నాయుడును, రాష్ట్రంలో జగన్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ముత్యాల నాయుడు ఉద్గాటించారు. 

జగన్ ఆశీస్సులతో 11,500 ఎకరాలకు సాగునీరిచ్చాం. బొబ్బిలి రాజులు సొంత ఆస్తులు పెంచుకున్నారు - ఎమ్మెల్యే శంబంగి

బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన  అప్పలనాయుడు మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ సారథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి నాలుగున్నరేళ్లలో 11,500 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించామని, మరో 4,500 ఎకరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలనను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారని వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని ఖ్యాతి జాతీయ స్థాయిలో జగన్ కు మాత్రమే ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 606 హామీలిచ్చి కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అర్హతలే ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నారని, కుల, మతాలకు, రాజకీయాలకు తావు లేకుండా అమలు చేస్తున్నారని వెల్లడించారు. బొబ్బిలి రాజులను నమ్ముకుంటే సొంత డబ్బుతోనైనా ఆదుకుంటారని ప్రచారం చేసుకుంటే, ప్రజల నమ్మి గెలిపిస్తే సొంత ఆస్తులే పెంచుకుని ఓటర్లను వంచించారని  విమర్శించారు. 

గెలిచేది వైఎస్సార్ సీపీ జెండా... నిలిచేది జగన్ అజెండా - కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి

కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, బొబ్బిలి అడ్డా.. జగన్ అన్న అడ్డాగా నిలిపి బొబ్బిలి కోటపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎప్పుడూ గెలిచేది వైెఎస్సార్ సీపీ జెండానే అని, ఎన్నడూ నిలిచేది జగన్ అజెండానే అని అభివర్ణించారు. జగన్ ను విమర్శించే టీడీపీ నాయకులకు తాను సవాల్ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథికంగా మేలు చేసినట్లు చెప్పే ధైర్యం తమకు ఉందని, అలా చెప్పే దమ్ము తెలుగు తమ్ముళ్లకు ఉందా అని సవాల్ విసిరారు.  జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందో, చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగిందో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇది దళితుల, ఎస్టీల, బీసీల ప్రభుత్వమని, పేదల కోసం పాటుపడుతోందని వివరించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసారో, ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు.

చెరకు రైతులను టీడీపీ మోసం చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి వసూలు చేసి చెల్లించింది - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బొబ్బిలిలో సామాజిక సాధికార యాత్రకు వచ్చిన ప్రజానీకాన్ని చస్తుంటే  జన సునామీని తలపిస్తోందన్నారు.  ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మోసం చేసి ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్నారని, వారిని చెప్పే మాయ మాటలను నమ్మవద్దని హితవు పలికారు. చెరకు రైతులను షుగర్ ఫ్యాక్టరీ నిలువునా ముంచేసి మోసం చేస్తే వైెఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి ముక్కుపిండి వసూలు చేసి రైతులకు అందించామన్నారు. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల రూపు రేఖలు మారుస్తున్న ఘనత జగన్ దేనని కొనియాడారు. వెనుకబడిన వర్గాలన్నీ జగన్  సారథ్యంలో అథికారం అనుభవిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పనుల కోసం బొబ్బిలి రాజుల గేటు వద్ద కాపలా కాయాలని వివరించారు. తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చి రైతులను ఆదుకున్నామని, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి కూడా అండగా ఉంటామన్నారు. 

విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే  సాధ్యం - ఎంపీ బెల్లాన 

విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ,  రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు చేరువ చేస్తున్నారన్నారు. సంక్షేమం ఓ వైపు, అభివృద్ధి మరోవైపున చేస్తూ జగన్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఏకైక నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega