అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో.. వివాహేతర సంబంధం..

5 Sep, 2023 06:42 IST|Sakshi

రంగారెడ్డి: చేతులు, కాళ్లు తాళ్లతో బిగించి.. గోనెసంచిలో వేసి.. నడుముకు రాయికట్టి చెరువులో పడేసి యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ యాదయ్యగౌడ్‌ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం మండల పరిధిలోని హైతాబాద్‌ చెరువులో ఓ గోనె సంచిలో మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తలపై కొట్టి, కాళ్లు, చేతులు తాళ్లతో బిగించి, నడుముకు బండరాయి కట్టి గోనెసంచిలో వేసి పడేసినట్లు గుర్తించారు. మృతుడిని మండల పరిధిలోని సంకెపల్లిగూడ గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవీణ్‌(31)గా గుర్తించారు.

వివాహేతర సంబంధమే కారణమా..?
ప్రవీణ్‌కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమ గా మారింది. హత్యకు అక్రమ సంబంధమే కారణమై ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు కుమ్మరి ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు