ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అశ్విని–తనీషా జోడీ 

14 Sep, 2023 01:51 IST|Sakshi

కౌలూన్‌: హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో బుధవారం అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మినహా మిగతా భారతీయ క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అశ్విని–తనీషా ద్వయం 21–19, 21–19తో లి చియా సిన్‌–టెంగ్‌ చున్‌ సున్‌ (చైనీస్‌ తైపీ) జోడీపై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప–సుమీత్‌ రెడ్డి (భారత్‌) జోడీ 16–21, 21–16, 18–21తో చెన్‌ టాంగ్‌ జీ–తో ఈ వె (మలేసియా) జంట చేతిలో... సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 19–21, 10–21తో హీ యోంగ్‌ కాయ్‌ టెర్రీ–టాన్‌ వె హాన్‌ జెస్సికా (సింగపూర్‌) జోడీ చేతిలో ఓడిపోయాయి.  పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లక్ష్య సేన్‌ బరిలోకి దిగకుండా తన ప్రత్యరి్థకి ‘వాకోవర్‌’ ఇవ్వగా... ప్రియాన్షు రజావత్‌ 13–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఆకర్షి 18–21, 10–21తో వైయోన్‌ లీ (జర్మనీ) చేతిలో, మాళవిక 14–21, 12–21తో జాంగ్‌ యి మాన్‌ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో విష్ణువర్ధన్‌ గౌడ్‌–కృష్ణప్రసాద్‌ (భారత్‌) ద్వయం 14–21, 19–21తో సుంగ్‌ హున్‌ కో–బేక్‌ చోల్‌ షిన్‌ (కొరియా) జోడీ చేతిలో ఓడింది.   
 

మరిన్ని వార్తలు