CWC 2023 IND VS NZ Semi Final: టాస్‌ గెలిస్తే సగం మ్యాచ్‌ గెలిచినట్లే..! 

15 Nov, 2023 08:50 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 15) అత్యంత కీలక సమరం జరుగనుంది. ముంబై వేదికగా జరుగనున్న తొలి సెమీఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. భారీ అంచనాలు కలిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. వాంఖడే పిచ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు పూర్తిగా సహకరించనుందని అంచనాలు ఉండటంతో ఏ జట్టైనా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవాలని భావిస్తుంది.

ఈ పిచ్‌పై గతంలో పరుగుల వరద పారిన సందర్భాలు కోకొల్లలు. ఇదే టోర్నీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచినప్పటికీ బౌలింగ్‌ ఎంచుకుని చేయరాని తప్పు చేసింది. అనంతరం ఫలితం (302 పరుగుల భారీ తేడాతో ఓటమి) అనుభవించింది. ఇది దృస్టిలో ఉంచుకుని ఇరు జట్లు టాస్‌ గెలిస్తే తప్పక బ్యాటింగ్‌ ఎంచుకుంటాయి. ఈ మైదానంలో మరో అడ్వాంటేజ్‌ కూడా ఉంది. బౌండరీ చిన్నదిగా ఉండటంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాది భారీ స్కోర్లకు దోహదపడగలరు. తొలుత బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే మిగతా పనిని పేస్‌ బౌలర్లు చూసుకుంటారు.

ఈ పిచ్‌ తొలుత బ్యాటింగ్‌కు ఎంతగా సహకరిస్తుందో, సెకెండాఫ్‌లో పేస్‌ బౌలింగ్‌కు అంతగానే సహకరిస్తుంది. ఇది కూడా మనం ఇటీవలే చూశాం. లీగ్‌ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 357 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో భారత పేసర్లు షమీ (5/18), సిరాజ్‌ (3/16), బుమ్రా (1/8) రెచ్చిపోయి లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చారు.

ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని టాస్‌ గెలిచిన జట్టు తప్పక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంటుంది. జట్టు ఏదైనా టాస్‌ గెలిచిందా.. సగం మ్యాచ్‌ గెలిచినట్లే. ఇక వాతావరణం విషయానికొస్తే.. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా  రిజర్వ్‌ డే ఉంది. కాబట్టి వంద వాతం పూర్తి మ్యాచ్‌కు ఢోకా ఉండదు.  మరి ఏ జట్టు గెలిచి ఫైనల్‌కు చేరుతుందో, ఏ జట్టు ఓడి ఇంటిబాట పడుతుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు