IND Vs SA ODI Series: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. టీమిండియాకు కొత్త హెడ్‌ కోచ్‌! ఎవరంటే?

16 Dec, 2023 11:29 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు.. డిసెంబర్‌ 17న జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ప్రోటీస్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ సిరీస్‌కు భారత కెప్టెన్‌గా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనుండగా, పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. 

అయితే ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్‌ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌తో పాటు ఫీల్డింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లు కూడా ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌​​కు అందుబాటులో ఉండకపోయినట్లు సమాచారం. 

అతడి స్ధానంలో నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ స్టాప్‌, సౌరాష్ట్ర లెజెండ్‌ సితాన్షు కొటాక్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నట్లు క్రిక్‌బజ్‌ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అదే విధంగా భారత మాజీ వికెట్‌ కీపర్‌ అజ‌య్ ర‌త్రా ఫీల్డింగ్ కోచ్‌గా, ర‌జిబ్ ద‌త్తా బౌలింగ్ కోచ్‌గా వన్డే సిరీస్‌ కోసం బాధ్యతలు చేపట్టనున్నారు.

మరి ద్రవిడ్‌..?
కాగా వన్డే సిరీస్‌ అనంతరం టీమిండియా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకుంది. తాజాగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కూడా జట్టుతో కలిశారు. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు భారత్‌ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదు.

ఈ సారి ఎలాగైనా సఫారీలను ఓడించి చరిత్ర సృష్టించాలని రోహిత్‌ సేన భావిస్తోంది. ఈ క్రమంలోనే ద్రవిడ్‌తో కూడిన కోచింగ్‌ బృందం దగ్గరుండి భారత జట్టు సన్నాహాకాలను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. టెస్టు సిరీస్‌ కంటే ముందు వార్మాప్‌ మ్యాచ్‌ల్లో భారత తలపడనుంది. అదే విధంగా వర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిష్‌లో భాగంగా జరగుతున్న టెస్టు సిరీస్‌ కాబట్టి ద్రవిడ్‌ ప్రత్యేకంగా దృష్టిసారించాడు. ఈ నేపథ్యంలోనే వన్డేలకు దూరంగా ఉండాలని మిస్టర్‌ డిఫెండ్‌బుల్‌ నిర్ణయించుకున్నాడు.

>
మరిన్ని వార్తలు