ఏంది రెడ్డి.. ఏకంగా ధోని వికెట్‌నే లేపేసావు

18 Mar, 2021 18:08 IST|Sakshi

చెన్నై: టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని జీవితంలో ఒక్కసారి కలిస్తే చాలనుకున్న ఓ యువ ఆటగాడు.. ఏకంగా అతని వికెట్‌నే పడగొట్టేశాడు. తన అభిమాన ఆటగాడితో ఓ ఫొటో చాలనుకున్న ఆ కుర్రాడు.. ఏకంగా అతని సారథ్యంలోనే ఆడబోతున్నాడు. అతనెవరో కాదు మన తెలుగు బిడ్డ, రైతు బిడ్డ, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఈ సీమ బిడ్డను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. టైటిల్‌ సాధనే లక్ష్యంగా సన్నాహకాలను మొదలు పెట్టిన సీఎస్‌కే జట్టు.. అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టింది. క్యాంప్‌లో కెప్టెన్ ధోనితో పాటు ఆ జట్టు ఆటగాళ్లు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, జగదీషన్, సాయి కిషోర్, హరి నిషాంత్, హరిశంకర్ రెడ్డి తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. 

ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా 22 ఏళ్ల హరిశంకర్ రెడ్డి.. అద్భుతమైన బౌలింగ్‌తో ధోనిని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో హరిశంకర్‌ రెడ్డి వేసిన అద్భుతమైన  ఇన్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన ధోని.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హరిశంకర్‌ రెడ్డి బంతి వేగం ధాటికి ధోని లెగ్‌ స్టంప్‌ గాల్లో పల్టీలు కొడుతుంది. దీంతో ఈ వీడియో చూసిన వారందరూ 'ఏంది రెడ్డి.. ఎంత పని చేశావ్‌.. ఫోటో దిగితే చాలనుకొని ఏకంగా ధోని వికెట్‌నే గాల్లోకి లేపేసావ్‌' అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు 'సూపర్ రెడ్డి.. అద్భుతంగా బౌలింగ్‌ చేశావు.. ఏకంగా ధోని లెగ్ స్టంప్‌కే ఎసరు పెట్టేసావు' అంటూ అభినందిస్తున్నారు. కాగా, ప్రాక్టీస్‌లో అదరగొడుతున్న హరిశంకర్ రెడ్డికి తుది జట్టులో ఆడే అవకాశం దొరుకుతుందో లేదో వేచి చూడాలి.

చదవండి:
ఐపీఎల్‌లోకి రాయచోటి క్రికెటర్‌ ఎంట్రీ.. చెన్నై ట్వీట్‌

మరిన్ని వార్తలు