కరోనా: భారత హాకీ దిగ్గజం ఇక లేరు

8 May, 2021 17:28 IST|Sakshi

కరోనాతో రవీందర్‌ పాల్‌ సింగ్  కన్నుమూత

మాస్కో ఒలింపిక్స్‌  విజేత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ 

సాక్షి, లక్నో: కరోనా మహమ్మారి  మరో క్రీడాకారుడిని బలి తీసుకుంది. భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60) కరోనా కారణంగా శనివారం కన్నుమూశారు. ఏప్రిల్ 24న కరోనా సోకడంతో లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే వైరస్‌ నుంచి కోలుకొని సాధారణ వార్డుకు  చేర్చిన అనంతరం శుక్రవారం అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో  వెంటిలేటర్‌ సపోర్ట్‌తో చికిత్స అందించినా  ఫలితం లేకుండా పోయింది. రవీందర్‌ పాల్‌ మరణంపై హాకీ ఇండియా ట్విటర్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేసింది. క్రీడా మంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. ఒక గోల్డెన్‌ క్రీడాకారుడిని  కోల్పోయిదంటే ట్వీట్‌ చేశారు.  ‍క్రీడా రంగానికి ఆయన చేసిన  సేవలు చిరస్మరణీయం అంటూ నివాళులర్పించారు.  

కాగా 1980లో మాస్కో ఒలింపిక్  విజేత జట్టులో  రవీందర్‌ పాల్‌ సింగ​ ఉన్నారు. అలాగే కరాచీ వేదికగా జరిగిన 1980, 83 ఛాంపియన్స్‌ ట్రోఫీల్లోనూ పాల్గొన్నారు. 1983 సిల్వర్‌ జూబ్లీ కప్‌ (హాంకాంగ్‌), 1982 ప్రపంచకప్‌ (ముంబై, 1982 ఆసియా కప్‌ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1984 లాస్‌ ఏంజెల్స్‌‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు. లక్నోలో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు.

చదవండి:  కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!
శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్‌?!

మరిన్ని వార్తలు