IPL 2021: అందరూ ధోనిలు కాలేరు.. పంత్‌కు కాస్త సమయం ఇవ్వండి

14 Oct, 2021 20:21 IST|Sakshi

Everyone Cant Be MS Dhoni, Give Rishabh Pant Some Time Says Ashish Nehra : ఐపీఎల్‌-2021 సీజన్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి తన జట్టును ఫైనల్‌కు చేర్చేందుకు విఫలయత్నం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషబ్‌ పంత్‌కు టీమిండియా మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా మద్దతు పలికాడు. సారధిగా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌లోనే పంత్‌ తనను తాను నిరూపించుకున్నాడని, 2007 టీ20 ప్రపంచకప్‌లో ధోని టీమిండియాను విజేతగా నిలిపినట్లుగా పంత్‌ కూడా తన జట్టును ఛాంపియన్‌గా నిలపాలని ఆశించడం అత్యాశే అవుతుందని తెలిపాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ తర్వాత ఈ ఏడాది ఢిల్లీ సారధ్య బాధ్యతలను భుజానికెత్తుకున్న పంత్‌.. సీనియర్లు, జూనియర్లతో సమతూకం కలిగిన జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని, అతనికి నిలదొక్కుకునేందుకు మరికాస్త సమయమిచ్చి, వచ్చే సీజన్‌లో కూడా కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించాడు. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు మినహా పంత్‌ సారధ్య బాధ్యతలకు వంద శాతం న్యాయం చేశాడని, అతన్ని కెప్టెన్‌గా కొనసాగించాలా వద్దా అన్నది అనవసరమైన రాద్దాంతమని అభిప్రాయపడ్డాడు.

కెప్టెన్‌గా పంత్‌కు వీలైనన్ని అవకాశాలు కల్పించాలని, అది వ్యక్తిగతంగా అతనికి, జట్టుకు ఉపయోగకరమని ఈ ఢిల్లీ ఆటగాడు పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్‌లో లీగ్‌ దశ వరకు టేబుల్‌ టాపర్‌గా నిలిచిన డీసీ జట్టు క్వాలిఫైయర్స్‌లో చెన్నై, కేకేఆర్‌ జట్ల చేతిలో వరుస ఓటములతో ఫైనల్‌ చేరకుండానే ఇంటి దారి పట్టింది. 
చదవండి: సీనియర్లకు రెస్ట్‌.. టీమిండియాలోకి ఐపీఎల్‌ హీరోస్‌..!

మరిన్ని వార్తలు