ఫోర్లు వద్దు.. సిక్సర్లే ముద్దంటున్న పంజాబ్ షారుక్‌ ఖాన్‌‌ ‌

8 Apr, 2021 19:18 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ 2021లో అరంగేట్రం చేయబోతున్న పంజాబ్ కింగ్స్‌ యువ బ్యాట్స్‌మెన్ షారుక్​ ఖాన్‌పై అందరి దృష్టి కేంద్రీకృమైంది. ఐపీఎల్‌లో అదరగొట్టాలని ఉవ్విళూరుతున్న ఈ చెన్నై కుర్రాడు.. అందుకు తగ్గట్టుగానే నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు.  పేసర్‌, స్పిన్నర్‌ అన్న తేడా లేకుండా ఎడాపెడా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. బంతిని స్టాండ్స్‌ దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్న షారుక్‌.. ఫోర్లు కొట్టడం కన్నా సిక్సర్లు బాదటంపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా షారుక్‌ విధ్వంసానికి సంబంధించిన తాజా వీడియోను పంజాబ్‌ పోస్ట్‌ చేసింది.

షారుక్‌.. నయా సిక్స్‌ హిట్టింగ్‌ మెషీన్‌‌.. ఫోర్లు కొట్టడం కన్నా సిక్సర్లు బాదడంపైనే అధిక ఆసక్తి అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఇది ట్రైలర్‌ మాత్రమే.. పూర్తి సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ తమ ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో షారుక్​​ను పంజాబ్ జట్టు​ రూ.5.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఈ సీజన్‌లో అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే.. షారుక్‌పై చేసిన వ్యాఖ్యల బట్టి చూస్తే అతనిపై ఏమేరకు అంచనాలున్నాయో స్పష్టమవుతుంది.

కుంబ్లే అతన్ని హార్డ్‌ హిట్టర్‌ పోలార్డ్‌తో పోల్చడం సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది. 25 ఏళ్ల షారుక్‌ దేశవాళీ క్రికెట్‌లో పెద్ద స్కోర్లేమీ చేయకపోయినప్పటికీ, అలవోకగా సిక్సర్లు బాదగల సామర్ధ్యం ఉన్న కారణంగా పంజాబ్‌ అతన్ని ఏరికోరి మరీ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్​ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్​లో తమ తొలి మ్యాచ్​ను ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్​తో ఆడనుంది.
చదవండి: ధోనిలో ఇంకా ఆ సత్తా ఉంది.. మరిన్ని ఐపీఎల్‌లు ఆడగలడు

మరిన్ని వార్తలు