IPL 2021: ఈసారైనా వాళ్లు ట్రోఫీ సాధిస్తే చూడాలని ఉంది!

9 Oct, 2021 15:13 IST|Sakshi

Lance Klusener Comments On IPL Winner: ఐపీఎల్‌-2021 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నుంచి ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌ మొదలుకానుంది. అక్టోబరు 10న క్వాలిఫయర్‌-1, అక్టోబరు 11న ఎలిమినేటర్‌, అక్టోబరు 13న క్వాలిఫయర్‌-2, అక్టోబరు 15న ఫైనల్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ విజేత గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ లాన్స్‌ క్లూసెనర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ గెలిస్తే చూడాలని ఉందన్నాడు. ఆర్సీబీ ట్రోఫీ సాధించాలని ఆకాంక్షించాడు. 

ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘విరాట్‌, ఏబీ వంటి వంటి స్టార్‌ ప్లేయర్లు ఒకే జట్టులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ జట్టు(ఆర్సీబీ) ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. ఈ విషయం మా మనసును కలిచివేస్తోంది. బెంగళూరు కప్‌ గెలిస్తే బాగుంటుంది. ఈసారి వాళ్లు కచ్చితంగా విజేతలుగా నిలుస్తారని భావిస్తున్నా. ఒక్కసారైనా వాళ్లు ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా ప్లే ఆఫ్స్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచిన ఆర్సీబీ... శుక్రవారం నాటి మ్యాచ్‌లో టేబుల్‌ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో వైజాగ్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌.. చివరి బంతిని సిక్సర్‌గా మలిచి ఆర్సీబీ గెలుపును ఖరారు చేశాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలిచి చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

ఇక 9 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కోహ్లి సేన అక్టోబరు 11న.. షార్జా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇందులో గెలిస్తే క్వాలియర్‌-1లో ఓడిన జట్టుతో ఆర్సీబీ.. క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ ఆడుతుంది. ఇక ఈ సీజన్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్‌ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చదవండి:  IPL 2021: టీ20 వరల్డ్‌కప్‌ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా!
MI Vs SRH: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్‌ నబీ

మరిన్ని వార్తలు