Sanju Samson: పెద్దగా నష్టపోయేదేమీ లేదు.. విచిత్రాలు జరుగుతాయి.. కాబట్టి

30 Sep, 2021 09:14 IST|Sakshi
Sanju Samson- Photo Courtesy: IPL Twitter

Sanju Samson On Loss Against RCB: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓటమిపై రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ స్సందించాడు. తమ ఓపెనర్లు శుభారంభం అందించినా దానిని కొనసాగించలేకపోయామని, మిడిలార్డర్‌ మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. తమ బౌలర్లు శక్తిమేర రాణించారని తెలిపాడు. కాగా ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా ఆర్సీబీతో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌(58), యశస్వి జైస్వాల్‌(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్‌ దారుణంగా విఫలమైంది. 

రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ(19), క్రిస్‌ మోరిస్‌(14) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌.. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరును కట్టడి చేయలేక పేలవ బౌలింగ్‌ ప్రదర్శనతో చతికిలపడింది. దీంతో రాయల్‌ వర్సెస్‌ రాయల్‌ పోరులో రాజస్తాన్‌కు ఘోర పరాభవం తప్పలేదు. 

ఈ నేపథ్యంలో కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మాట్లాడుతూ... ‘‘బ్యాటింగ్‌కు పిచ్‌ సహకరిస్తున్నా మా బ్యాటర్ల టైమింగ్‌ మిస్‌ అయింది. మిడిలార్డర్‌ బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని అందిపుచ్చుకుంటే బాగుండేది. అయినా, ఇకపై మేం పెద్దగా నష్టపోయేదేమీ లేదు. తదుపరి మ్యాచ్‌లలో మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో చిత్ర విచిత్రాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఆఖరి మ్యాచ్‌ ఆడేంత వరకు మమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తూ ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నాడు. కాగా తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ నాలుగింటిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది.

స్కోర్లు: రాజస్తాన్‌: 149/9 (20)
ఆర్సీబీ: 153/3 (17.1)

చదవండి: Team India Head Coach: కుంబ్లే వద్దన్నాడు.. టీమిండియాకు కొత్త విదేశీ కోచ్‌!
IPL 2021: ఐపీఎల్‌ చరిత్రలో ఇలా తొలిసారి..

మరిన్ని వార్తలు