అయోమయంలో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి..!

4 May, 2021 14:49 IST|Sakshi

ఢిల్లీ:  ముందు నుంచి ఊహించినట్లే ఐపీఎల్‌-14 సీజన్‌ మధ్యలోనే నిలిచిపోయింది. తొలి అంచె పూర్తి చేసుకుని రెండో అంచెలోకి అడుగుపెట్టే సమయంలో ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడింది. భారత్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తూ వచ్చింది. మరొకవైపు బయోబబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా క్రికెటర్లకు కరోనా రావడంంతో కలకలం మొదలైంది.

నిన్న కేకేఆర్‌, సీఎస్‌కే క్యాంపులో వెలుగుచూసిన కరోనా.. ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శిబిరాన్ని కూడా ఆందోళనకు గురి చేసింది.  వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్‌ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 9 మందికి కరోనా సోకడంతో ఐపీఎల్‌ను రద్దు చేయకతప్పలేదు. నిన్నటి వరకూ కచ్చితంగా జరిపి తీరుతామని పేర్కొన్న బీసీసీఐ.. ఎట్టకేలకు దిగివచ్చింది. క్రికెటర్లకు ఏమైనా అయితే అది మరింత తలనొప్పిగా మారే ప్రమాదం ఉండటంతో టోర్నీని వాయిదా వేసింది.

అయోమయంలో ఆసీస్‌ క్రికెటర్లు..
ఐపీఎల్‌ మధ్యలోనే ఆగిపోవడంతో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పటికే కొంతమంది లీగ్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోగా, ఇంకా చాలామంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోయారు. వారితో పాటు ఆసీస్‌కు చెందిన కోచింగ్‌ స్టాఫ్‌, సహాయక సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటి అనేది అర్థం కావడం లేదు. ఈ విషయంలో బీసీసీఐ ముందుగానే భరోసా ఇచ్చినా.. ఆస్ట్రేలియాకు భారత్‌ నుంచి విమానరాకపోకలు నిలిపివేయడంతో అనిశ్చితి నెలకొంది.

మే15 వరకూ భారత్‌ విమానాలను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము ఎలా స్వదేశాలకు వెళ్లాలో వారికి అర్థం కావడం లేదు. దీనిపై క్రికెట్‌  ఆస్ట్రేలియా(సీఏ) కూడా తాము ఏమీ చేయలేమని చేతులెత్తేయడంతో ఇక వారికి బీసీసీఐ, భారత  ప్రభుత్వమే దిక్కు. ఇక్కడ బీసీసీఐ పెద్దలు, భారత పెద్దలు చొరవ తీసుకుంటే గానీ వారు ఆస్ట్రేలియాకు వెళ్లే పరిస్థితి లేదు.  ఇప్పుడు ఐపీఎల్‌ను రద్దు చేసిన బీసీసీఐ.. విదేశీ క్రికెటర్లను సురక్షితంగా వారి వారి దేశాలకు పంపే పనిలో పడింది. 

ఇక్కడ చదవండి: IPL 2021 సీజన్‌ రద్దు: బీసీసీఐ
విరాళంపై రూటు మార్చిన కమిన్స్‌!

>
మరిన్ని వార్తలు