Pragyan Ojha: గేల్‌, పూరన్‌.. మీ ఆలోచన తప్పు

27 Apr, 2021 08:37 IST|Sakshi

అహ్మదాబాద్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమికి వారి బ్యాటింగ్‌ అప్రోచ్‌ సరిగా లేకపోవడమేనని టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా విమర్శించాడు. వారు బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు భారీ స్కోర్లు నమోదు చేయాలనే లక్ష్యంతో వచ్చి చిత్తు అవుతున్నారని ఓజా అభిప్రాయపడ్డాడు. కనీసం బోర్డుపై ఎంత స్కోరు ఉంచితే బాగుంటుందో అనే విషయంలో క్లారిటీ లేక ఒత్తిడిలో పడిపోతున్నారన్నాడు.

ప్రధానంగా క్రిస్‌గేల్‌-నికోసల్‌ పూరన్‌లు అనవసరపు ఒత్తిడితో ఘోరంగా విఫలమవుతున్నారన్నాడు. వారిపై భారీ అంచనాలు ఉండటంతో ఎక్కువ పరుగులు చేయాలనే ఉద్దేశంతో సహజసిద్దమైన ఆటను వదిలేశారన్నాడు. అసలు పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ప్లానింగ్‌ బాలేదని, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నాడు.

క్రిక్‌బజ్‌ మాట్లాడిన ఓజా.. ‘ ఆ ఇద్దరూ కేవలం భారీ స్కోర్లు చేయాలనే వస్తున్నారు. ఒక మంచి ఆరంభం దొరికిన తర్వాత ఆ ఆలోచన చేయాలి. పరిస్థితుల్ని బట్టి గేమ్‌ ప్లాన్స్‌ మార్చడం లేదు. పెద్ద క్రికెటర్లమనే ఆలోచన పక్కన పెట్టండి.. అప్పుడే మీరు పరుగులు చేయగలరు. ముందు 160-170 స్కోరు బోర్డుపై ఉంచాలనే ఆలోచనతో బ్యాటింగ్‌కు రండి.. వారిద్దరూ 180-190 పరుగులు చేయాలనే లక్ష్యంతో వస్తున్నారు. అదే మీపై ఒత్తిడి పెంచుతుంది. అసలుకే ఎసరు తెస్తుంది. మీ ఆలోచన తప్పు’ అని ఓజా విమర్శించాడు.

నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 123 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (31), క్రిస్‌ జోర్డాన్‌ (30)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో పంజాబ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. గేల్‌ గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ కాగా, పూరన్‌(19)లు ఘోరంగా విఫలమయ్యారు.  అనంతరం ఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలుపొందింది. మోర్గాన్‌ (40 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు , 2 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (32 బంతుల్లో 41; 7 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇక్కడ చదవండి: 
మీ విదేశీ ఆటగాళ్లను ఇవ్వండి: ఆర్‌ఆర్‌ రిక్వెస్ట్‌

హర్షల్‌ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు

మరిన్ని వార్తలు