IPL 2022 Auction: మెగా వేలానికి ముందు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన అంబటి రాయుడు 

2 Feb, 2022 17:41 IST|Sakshi

ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు, తెలుగు క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు. మెగా వేలంలో కేవలం బ్యాటర్‌గా అయితే భారీ ధర పలికే అవకాశం లేదని, వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా రిజిస్టర్‌ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వేలంలో పాల్గొనే తుది జాబితా వెలువడ్డాక ఈ విష‌యం వెలుగుచూసింది. 

అయితే, వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాయుడుకు వికెట్ కీపింగ్ కొత్తేమీ కాదు. గ‌తంలో పలు మార్లు దేశ‌వాళీ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లోనూ వికెట్ కీప‌ర్‌గా దర్శనమిచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన స‌మ‌యంలో చాలా సందర్భాల్లో వికెట్‌కీపింగ్‌లోనూ మెరిశాడు. ఐపీఎల్‌ వేలంలో ఎప్పుడూ బ్యాటర్ల విభాగంలోనే పోటీ పడే రాయుడు.. ఈసారి వేలంలో వికెట్ కీప‌ర్‌ కమ్‌ బ్యాటర్ల విభాగంలో పేరు నమోదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుతం రాయుడు వయసు 36 ఏళ్లు కావడంతో వేలంలో క‌ఠిన ప‌రిస్థితులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉందని తెలిసి ఇలా చేసి ఉంటాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్‌కే.. గ‌తేడాది రాయుడును రూ. 2.20 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. గ‌తేడాది లీగ్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన అతను 28 స‌గ‌టుతో 257 ప‌రుగులు చేశాడు. ఓవరాల్‌గా రాయుడు తన ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 175 మ్యాచ్‌లు ఆడి 29 స‌గ‌టుతో 3916 ప‌రుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచ‌రీలు, ఓ సెంచ‌రీ ఉన్నాయి. 
చదవండి: టీమిండియాపై చెలరేగిన దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు కరోనా..

మరిన్ని వార్తలు