మయాంక్, రాహుల్ ధనాధన్
పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు
ముంబై: ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్లు), రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఐపీఎల్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరు దంచేసేందుకు పోటీపడటంతో 5వ ఓవర్లోనే పంజాబ్ స్కోరు 50 పరుగులకు చేరింది. 10.1 ఓవర్లోనే వందను దాటేసింది.
మయాంక్ 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మిగతా వారిలో క్రిస్ గేల్ (11) విఫలమైనా... దీపక్ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్ 2 సిక్సర్లు), షారుఖ్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో ధాటిగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో వోక్స్, మెరివాలా, రబడా, అవేశ్ ఖాన్– తలా ఒక వికెట్ పడగొట్టారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కడపటి వార్తలందేసరికి 13 ఓవర్లలో రెండు వికెట్లకు 125 పరుగులు చేసింది. క్రీజులో ధావన్ 78 పరుగులతో, పంత్ 4 పరుగులతో ఉన్నారు.