CWC 2023: రోహిత్‌ శర్మను ఉద్దేశించి కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యలు వైరల్‌

22 Nov, 2023 18:16 IST|Sakshi

భారత్‌లో క్రికెట్‌ రూపురేఖలను మార్చి వేసిన ఘనత కపిల్‌ డెవిల్స్‌కే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. వన్డే వరల్డ్‌కప్‌-1983లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్‌దేవ్‌ సేన.. అనూహ్య రీతిలో చాంపియన్‌గా నిలిచింది.

ఇంగ్లండ్‌ గడ్డ మీద.. అప్పటికే రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలా టీమిండియాకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.

ఈ క్రమంలో 2011లో సొంతగడ్డ మీద ధోని సేన మరోసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచి.. ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేసింది. పుష్కరకాలం తర్వాత రోహిత్‌ బృందం కూడా అదే పునరావృతం చేస్తుందని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో అజేయ రికార్డుతో ఫైనల్‌తో దూసుకెళ్లిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఐదుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానుల హృదయాలు కూడా ముక్కలయ్యాయి.

ఆస్ట్రేలియా ఆరోసారి జగజ్జేతగా నిలిచిన సంబరంలో మునిగిపోతే.. టీమిండియా కన్నీటితో మైదానాన్ని వీడింది. ఈ నేపథ్యంలో అభిమానులంతా రోహిత్‌ సేనకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ​మాజీ కెప్టెన్‌, టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌.. రోహిత్‌ శర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘‘రోహిత్‌.. ఇప్పటికే నువ్వు చేసే పనిలో మాస్టర్‌వి అయిపోయావు.

నీకోసం ఇంకెన్నో విజయాలు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివి మనసుకు బాధ కలిగిస్తాయని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకం కోల్పోవద్దు’’ అంటూ రోహిత్‌ కళ్లలో నీళ్లు నిండిన ఫొటోను కపిల్‌ షేర్‌ చేశాడు.

ఇక జట్టును ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియా మొత్తం నీతో ఉంది. మీరంతా చాంపియన్సే బాయ్స్‌. తలెత్తుకోండి. ట్రోఫీ గెలవాలన్నది మీ అంతిమ లక్ష్యం. కానీ దానితో పనిలేకుండానే మీరు ఇప్పటికే విజేతలుగా నిలిచారు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది’’ అని కపిల్‌ దేవ్‌ బాసటగా నిలిచాడు. 

మరిన్ని వార్తలు