ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై దాడి! అల్లుడిని దారుణంగా..

31 Oct, 2023 11:46 IST|Sakshi

అడ్డుకోబోయిన యువకుడిపై కత్తితో దాడి!

యువతి కుటుంబసభ్యులపై కేసు నమోదు..

ఉలిక్కిపడిన గ్రామస్తులు!

సాక్షి, సంగారెడ్డి: నెల రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై కత్తులతో దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. హత్నూర మండల పరిధిలోని నస్తీపూర్‌ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీరుడి అనిల్‌ రామచంద్రాపురం మండలంలోని స్టేషన్‌ నాగులపల్లి గ్రామానికి చెందిన అశ్విని (దగ్గరి బంధువులు) నెల రోజుల క్రితం ఇరువురి కుటుంబాలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.

తమకు ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. దీంతో అప్పటినుంచి నస్తీపూర్‌లోని అనిల్‌ ఇంటి వద్దే నూతన దంపతులు ఉంటున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నవంబర్‌ 5న పెద్దల సమక్షంలో వివాహం జరిపించేందుకు యువకుడి కుటుంబీకులు నిశ్చయించి పెళ్లిపత్రికలు ముద్రించారు.

విషయం తెలుసుకున్న యువతి కుటుంబీకులు, బంధువులు సోమవారం తెల్లవారుజామున నస్తీపూర్‌లోని అనిల్‌ ఇంటిపై దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్తున్న క్రమంలో అడ్డుకోబోయిన భర్త అనిల్‌పై కత్తితో తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన అనిల్‌ను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనిల్‌ తండ్రి నీరుడి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుకుమార్‌ తెలిపారు.
ఇవి చదవండి: 'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం!

మరిన్ని వార్తలు