కోవిడ్ బాధితుల కోసం ఉచిత ఆక్సిజన్‌ హబ్‌లు..

2 May, 2021 08:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్‌ రోగుల కోసం చందానగర్‌ సర్కిల్‌లో ఏర్పాట్లు  

హుడాకాలనీ కమ్యూనిటీహాల్‌లో ప్రారంభానికి సిద్ధం 

సాక్షి, మియాపూర్‌: నగరంలో రోజు రోజుకు కరోనా రెండో దశ వైరస్‌ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. దీంతో కరోనా బారిన పడిన వారికి ఆస్పత్రిలో బెడ్స్‌ దొరకక, ప్రాణవాయువు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఆక్సిజన్‌ పడకలు దొరకడం ఎంతో కష్టంగా మారింది. ఎంతో మంది ఆక్సిజన్‌ అందక ప్రాణాలు విడిచిన సంఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కొన్ని కార్పొరేట్‌ సంస్థల సహకారంతో కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 

కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. 
చందానగర్‌ సర్కిల్‌–21 పరిధిలో రెండు చోట్ల ఆక్సిజన్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్‌లలో పడకలతో పాటు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రెటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో శ్వాస సమస్య తో బాధపడేవారు ఈ హబ్‌లలో ఉచితంగా చికిత్స పొందవచ్చు. కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినట్లయితే కూడా ఈ హబ్‌లలో చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఆక్సిజన్‌ హబ్‌లు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. 

 చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ, ఐకియా సహకారంతో కోవిడ్‌ బాధితులకు ఉచితంగా ఆక్సిజన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీతో ఐకియా సంస్థ ఆక్సిజన్‌ హబ్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఐకియా సంస్థ సొంత నిధులతో ఆక్సిజన్‌ హబ్‌ ఏర్పాట్లకు కావాల్సిన యంత్రాలు, బెడ్స్‌ను సమకురుస్తోంది.  
మొదటి దశలో భాగంగా చందానగర్‌లోని హుడా కాలనీ కమ్యూనిటీ హాల్‌లో 30 పడకలతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రెటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 
 అదే విధంగా త్వరలోనే మియాపూర్‌ డివిజన్‌ పరిధిలో కూడా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రెటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సమయత్తం అవుతున్నారని అధికారులు  తెలిపారు. 
 హుడాకాలనీ కమ్యూనిటీహాల్‌ ఆక్సిజన్‌ హబ్‌లో టెలి మెడిసిన్‌ సౌకర్యాన్ని కూడా  సమకురుస్తున్నారు. 
 కరోనా లక్షణాలు లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే కూడా ఈ హబ్‌లలో ఉచితంగా చికిత్స పొందవచ్చని అధికారులు తెలిపారు. 

ఉచితంగా సేవలు పొందవచ్చు.. 
కరోనా లక్షణాలు లేకపోయిన శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆక్సిజన్‌ను ఉచితంగా అందించేందుకు చందానగర్‌లోని హుడా కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాట్లు చేస్తు న్నారు. జోనల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆక్సిజన్‌ హబ్‌ల పనులను వేగవంతం చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం. కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో ఎంతో మంది బెడ్స్, ఆక్సిజన్‌ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ కేంద్రాలలో ఉచితంగా సేవలు పొందవచ్చు.

– సుధాంశ్, డీసీ చందానగర్‌ సర్కిల్‌–21  

మరిన్ని వార్తలు