ఫిబ్రవరి 1 నుంచే ప్రాక్టికల్స్... షెడ్యూల్ విడుదల చేసిన బోర్డ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 28న థియరీ పరీక్షలు మొదలవుతాయని తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటికన్నా ముందు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
రెండో శనివారం, ఆదివారం కూడా రెండు సెషన్స్లో ప్రాక్టికల్స్ ఉంటాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మరో సెషన్ ఉంటుందని బోర్డ్ తెలిపింది. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఎన్విరాన్మెంట్ పరీక్ష ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.