కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు

21 Nov, 2023 12:04 IST|Sakshi

బోడుప్పల్‌: కాంగ్రెస్‌ పార్టీ 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నాయకురాలు చామకూర ప్రీతిరెడ్డి వచ్చారు. గతంలో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన దానగల్ల అనిత బీఆర్‌ఎస్‌లో చేరగా, వారం రోజుల క్రితం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి కలిసి మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరాలని కోరారు.. తమను బీఆర్‌ఎస్‌లో చాలా ఇబ్బందులకు గురి చేశారని అందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వివరించారు.

విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కార్పొరేటర్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ ఇంటికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రలోభపెడుతున్నారని వాదించారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారికి ఓట్లు వేయవద్దంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి ప్రీతిరెడ్డి కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అడ్డుకున్న వారిలో కాంటెస్ట్‌డ్‌ కార్పొరేటర్‌ రాపోలు ఉపేందర్, నాయకులు చెంచల నర్సింగ్‌రావు, గోపు రాము, జయేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ శ్రేణులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు