ఒకరికి తెలీయకుండా ఒకరు.. కుటుంబాన్ని చిదిమేసిన కరోనా

22 May, 2021 07:56 IST|Sakshi
రఘు, భూలక్ష్మీ, కుమారస్వామి(ఫైల్‌)

కొడుకు, తల్లి, తండ్రి మృతి

ఒకరి మృతి విషయం మరొకరికి తెలియని వైనం

సాక్షి, మంచిర్యాల: మండలంలోని తాళ్లపేటలో ఓ కుటుంబాన్ని కరోనా చిదిమేసింది. పదిహేను రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురిని బలితీసుకుంది. భర్త మృతి విషయం భార్యకు తెలియదు.. భార్య మరణం విషయం భర్తకు తెలియదు.. వీరిద్దరి మరణం కుమారుడికి తెలియదు. కుమారుడు లేడనే విషయం తల్లిదండ్రులకూ తెలియదు. ఒకరి మరణ వార్త మరొకరికి తెలియకుండా అందరూ చనిపోయారు. గ్రామానికి చెందిన విశ్రాంత సింగరేణి కార్మికుడు అక్కనపెల్లి కుమారస్వామి(70), ఆయన భార్య భూలక్ష్మీ(65), కుమారుడు రఘు(28) గత పదిహేను రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దీంతో తండ్రీకొడుకులు కరీంనగర్‌ ఆస్పత్రిలో చేరారు.

తల్లి తాళ్లపేటలో హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంది. ఆసుపత్రిలో చేరిన మూడు రోజులకే రఘు ఈ నెల 9న మృతిచెందాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. అతను మృతిచెందిన మరుసటి రోజే హోం ఐసోలేషన్‌లో ఉన్న తల్లి భూలక్ష్మీ ఈ నెల 10న మృతిచెందింది. వీరిద్దరు మృతిచెందిన విషయం కుమారస్వామికి తెలియదు. తీరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు కూడా గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఇలా ఒకే కుటుంబంలో కరోనా బారిన పడ్డ ముగ్గురు పదిహేను రోజుల్లో మృత్యువాత పడడం తాళ్లపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది.

చదవండి: కరోనా సోకిన వారిలో ఆకస్మిక మరణాలకు కారణాలెన్నో.. 

మరిన్ని వార్తలు