కరోనా వచ్చి వెళ్లాక.. వదలని బాధలు ఇవే!

19 Dec, 2021 05:00 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబళించిన కరోనా మహమ్మారి దాని బారినపడి కోలుకున్న బాధితుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జుట్టు రాలడం మొదలు పళ్లు కొరకడం వరకు ఎన్నో కొత్త సమస్యలు సృష్టించిందని తేలింది. ఆపాదమస్తకమంతా మనిషి శరీరంలో కరోనా తెచ్చిన మార్పులు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం. 

జుట్టు 
కరోనా బారినపడిన 2–3 నెలల్లోనే బాధితులకు విపరీతంగా జుట్టు రాలినట్లు ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. టెలోజెన్‌ ఎఫ్లువియమ్‌ అనే పరిస్థితే ఇందుకు కారణమని తేల్చింది. 
శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, ఆకలి లేకపోవడం, వైరస్‌ బారిన పడ్డామన్న ఆందోళన, లాక్‌డౌన్ల విధింపుతో ఒత్తిడి లేదా మహమ్మారి వ్యాప్తితో జీవనశైలిలో వచ్చిన మార్పులు కేశాల సాధారణ ఎదుగుదల, అవి రాలే కాలచక్రంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. 
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏమిటంటే రాలిన జుట్టులో చాలా వరకు లేదా మొత్తమంతా తిరిగి వస్తుందని రిచర్డ్‌ స్పెన్సర్‌ అనే ట్రైకాలజిస్ట్‌ తెలిపారు. 

మానసిక ఆరోగ్యం 
క్వారంటైన్, భౌతికదూరం నిబంధనలు బాధితుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఈ పరిణామం వారిలో ఆందోళన, ఉద్రేకం, కుంగుబాటు, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీసింది. 
కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల్లోనే ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు మానసిక అనారోగ్యానికి గురైనట్లు ఒక అధ్యయనం తెలిపింది. 
ప్రతి ముగ్గురు కరోనా రోగుల్లో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడ్డట్లు మరో సర్వే తేల్చింది. 

కళ్లు 
కరోనా వ్యాప్తితో సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువ కావడం వల్ల చాలా మంది కళ్లు పొడిబారడం, దురదపెట్టడం, ఎర్రబడటం, మసకబారడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. తెరలపై ఉండే నీలికాంతి ప్రభావమే ఇందుకు కారణం. 
పలు అధ్యయనాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 11 శాతం మంది కళ్ల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో చాలా మందికి తరచుగా సోకుతున్నది కళ్లకలక. 

ఉదరం 
కొందరు గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం... కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇరిటబుల్‌ బౌవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) అనే పేగుల సంబంధ వ్యాధి కేసులు పెరిగాయి. పొత్తికడుపులో నొప్పి, విరేచనాలు, మలబద్ధకం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కరోనా బాధితులకు తలెత్తాయి.
ఒత్తిడి, ఆందోళన కారణంగా ఐబీఎస్‌ వంటి రోగాల సంఖ్య పెరిగాయని ఓ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అభిప్రాయపడ్డారు. 

పళ్లు 
కరోనా వ్యాప్తి మొదలయ్యాక పళ్లు కొరకడం, బిగపట్టడంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. ఏడీఏ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం 2,300 మంది డెంటిస్టుల్లో 71 శాతం మంది ఇదే విషయాన్ని తెలియజేశారు. బ్రక్సిజం అని పిలిచే ఈ వ్యాధి మనిషి తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వస్తుందన్నారు. 
జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకా రం ఇదే కాలంలో పంటి, దవడ నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. 

బరువు 
కరోనా మహమ్మారిని వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్లు/క్వారంటైన్‌ నిబంధనలతో ప్రజల బరువులో మార్పులు చోటుచేసుకున్నాయి. తక్కువగా తినడం, శారీరక శ్రమ తగ్గడం లేదా ఒత్తిడి ఇందుకు కారణం కావొచ్చు. 
ఒక అధ్యయనం ప్రకారం కరోనా రోగుల్లో 39 శాతం మంది బరువు పెరిగారు. 

కాలేయం 
కరోనా వ్యాప్తి కాలంలో తీవ్ర మద్యపాన సేవనం వల్ల తలెత్తే హెపటైటిస్‌ అనే కాలేయ వ్యాధి కేసుల సంఖ్య భారీగా పెరినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని చికిత్స కోసం బాధితులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. 
కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కొందరు బాధితుల్లో కాలేయ ఆమ్ల ద్రవాల స్థాయి సైతం పెరిగింది.  

పాదాలు 
పాదాల సంబంధ వ్యాధుల వైద్యురాలు ఎమ్మా కొన్నాకీ ప్రకారం ప్రజల్లో కండరాలు పట్టేయడం, మడమలు నొప్పిపెట్టడం వంటి సమస్యలు పెరిగాయి. పాదాలకు ఆసరా కల్పించే పాదరక్షలు ధరించే పరిస్థితి లేకపోవడం ఈ సమస్యకు ఒక కారణమై ఉండొచ్చని ఆమె అంచనా వేశారు.
అరికాలు, చీలమండ, దాని వెనుకాల నొప్పితో బాధపడే వారి కేసుల సంఖ్య కూడా పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. 

చర్మం 
కరోనా నుంచి కోలుకున్న బాధితులు ఎదుర్కొన్న అతిసాధారణ చర్మ సంబంధ సమస్యల్లో దద్దుర్లు ఒకటి. 
కాళ్లు, చేతులు ఎరుపెక్కడం, నొప్పి రావడం, చర్మం దురదపెట్టడం దీని లక్షణాలు. ఈ పరిస్థితిని ‘కోవిడ్‌ టోస్‌’గా పేర్కొంటారు.  

మరిన్ని వార్తలు