-
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్డమ్లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. -
రేటే 'బంగార'మాయెనే..!
1990లో 1 కేజీ బంగారం = మారుతీ 800 కారు2000లో 1 కేజీ బంగారం = మారుతీ ఎస్టీమ్2005లో 1 కేజీ బంగారం = టయోటా ఇన్నోవా2010లో 1కేజీ బంగారం = టయోటా ఫార్చూనర్2016లో 1 కేజీ బంగారం = బీఎండబ్ల్యూ ఎక్స్12019లో 1 కేజీ బంగారం = వోల్వో ఎస్602024లో 1 కేజీ బంగారం = ఆడి క్యూ52030 వరకు దాచిపెట్టుకుంటే... ఏకంగా ప్రైవేట్ జెట్నే కొనేయొచ్చేమో!అతిశయోక్తిగా ఉంది కదూ! ఆకాశమే హద్దుగా.. రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి దూకుడు చూస్తే ఏమో.. పసిడి పెరగావచ్చు అనిపించక మానదు!! ఏడాది క్రితం 10 గ్రాములు రూ.60,000 స్థాయిలో ఉన్న బంగారం రేటు తాజాగా రూ. 75,000 స్థాయికి చేరి ధర‘ధగ’లాడిపోతోంది. అసలే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అట్టుడుకుతుంటే... పులిమీద పుట్రలా పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మిసైళ్ల మోతతో ప్రపంచానికి ముచ్చెమటలు పడుతున్నాయి.అధిక ధరలతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థలను ఈ యుద్ధభయాలు వెంటాడుతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనమైన బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీనికితోడు అమెరికా డాలర్ ప్రాభవానికి గండిపడటంతో ప్రభుత్వాలు కూడా కనకాన్నే నమ్ముకుని, ఎగబడి కొంటున్నాయి. మరోపక్క, రేటెంతైనా తగ్గేదేలే అంటూ జనాలు సైతం పసిడి వెంటపడుతున్నారు.ఇలా అన్నివైపుల నుంచి డిమాండ్ పోటెత్తి రేటు ’మిసైల్’లా దూసుకెళ్తోంది. అసలు ఈ స్వర్ణకాంతులకు కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా పసిడి నిల్వల సంగతేంటి? ఈ గోల్డ్ రష్.. పుత్తడిని ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది? పసిడిలో పెట్టుబడికి ఏ రూటు బెటర్? ఇవన్నీ తెలుసుకోవాలంటే బంగారు‘గని’ అలా తవ్వొద్దాం పదండి!!యుగాలుగా ప్రపంచమంతా కాంతులీనుతున్న లోహం ఏదైనా ఉందంటే నిస్సందేహంగా బంగారమే! అందుకే వేల సంవత్సరాల నుంచి, ఏ నాగరికత చూసినా పసిడి వేట కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం భూమ్మీద ఉన్న బంగారం మొత్తంలో దాదాపు 86 శాతం గడచిన 200 ఏళ్లలోనే తవ్వి తీసినట్లు చరిత్రకారులు, జియాలజిస్టులు చెబుతున్నారు. అధునాతన మైనింగ్ టెక్నిక్లు అందుబాటులోకి రావడంతో 18వ శతాబ్దం ఆరంభంలో పెద్దయెత్తున పసిడి ఉత్పత్తి ప్రారంభమైంది.కాలిఫోర్నియా గోల్డ్ రష్ అన్నింటిలోకెల్లా ప్రాచుర్యం పొందింది. 1848 నుంచి 1855 నాటికి ఇక్కడ 2 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని వెలికి తీయడం విశేషం. ఇక 1890 వరకు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా టాప్–3 పుత్తడి ఉత్పత్తి దేశాలుగా ఉండేవి. అయితే, 1886లో దక్షిణాఫ్రికాలోని విట్వాటర్స్రాండ్ బేసిన్లో కనుగొన్న నిక్షేపాలు ఆ దేశ ముఖచిత్రంతో పాటు ప్రపంచ పసిడి మార్కెట్ను సైతం సమూలంగా మార్చేశాయి. అతిపెద్ద బంగారు క్షేత్రాల్లో ఒకటిగా ఇది చరిత్ర సృష్టించింది.శతాబ్దం పాటు ఉత్పత్తిలో రారాజుగా స్వర్ణకాంతులతో మెరిసిపోయింది. 1970లో దక్షిణాఫ్రికా పసిడి ఉత్పత్తి 1,002 టన్నుల గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ దేశం కూడా ఒకే ఏడాదిలో ఇంత బంగారాన్ని ఉత్పత్తి చేయలేదు. 1980 నుంచి పసిడి ధరలు అంతకంతకూ పెరగడంతో ప్రపంచంలో చాలా చోట్ల స్వర్ణం కోసం వేట జోరందుకుంది. 2007 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఆవిర్భవించడం విశేషం. ప్రస్తుతం 40కి పైగా దేశాల్లో పుత్తడి మైనింగ్ జోరుగా సాగుతోంది.ఉత్పత్తి మందగమనం...వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 3,655 టన్నుల బంగారం గనుల నుంచి ఉత్పత్తయింది. ఇదే ఇప్పటిదాకా ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి తగ్గుముఖం పట్టి, గత మూడేళ్లుగా ఉత్పత్తి ఎదుగూబొదుగూ లేకుండా 3,600 టన్నులకే పరిమితమవుతోంది. ఒకప్పుడు ప్రపంచ బంగారు గనిగా పేరొందిన దక్షిణాఫ్రికా ఇప్పుడు వెలవెలబోతోంది. చైనా 2023లో 370 టన్నులను ఉత్పత్తి చేసి ‘టాప్’లేపింది. తర్వాత టాప్–10లో రష్యా (310 టన్నులు), ఆస్ట్రేలియా (310), కెనడా (200), అమెరికా (170), కజక్స్థాన్ (130), మెక్సికో (120), ఇండోనేషియా (110) దక్షిణాఫ్రికా (100), ఉజ్బెకిస్థాన్ (110), పెరూ (90) ఉన్నాయి. రికార్డు ధరల నేపథ్యంలో పాత బంగారం రీసైక్లింగ్ కూడా పుంజుకుంటోంది. 2023లో 9 శాతం పెరిగి 1,237 టన్నులకు చేరింది. ప్రస్తుత ప్రపంచ పసిడి ఉత్పత్తిలో 32 శాతం వాటా చైనా, రష్యా, ఆస్ట్రేలియాలదే కావడం గమనార్హం.తవ్విందెంత.. తవ్వాల్సిందెంత?ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా భూమి నుంచి వెలికితీసిన బంగారం మొత్తం 2,01,296 టన్నులుగా అంచనా. ఇందులో ఆభరణాల రూపంలోనే దాదాపు సగం, అంటే 93,253 టన్నులు ఉంది. దీని విలువ 7.2 ట్రిలియన్ డాలర్లు. ప్రైవేటు పెట్టుబడుల రూపంలో 3.4 ట్రిలియన్ డాలర్ల విలువైన 44.384 టన్నుల (22%) స్వర్ణం వాల్టుల్లో భద్రంగా ఉంది. వివిధ దేశాల (సెంట్రల్ బ్యాంకులు) వద్ద నిల్వలు 34,211 టన్నులు (17%). వీటి విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగంలో ఉన్నది 29,448 టన్నులు (15%). 2.3 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుత ధర ప్రకారం ఈ బంగారం మొత్తం విలువ 15.6 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,303 లక్షల కోట్లు. ఇక భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్న బంగారం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ కంపెనీలు కనుగొన్న కచ్చితమైన నిల్వలు 53,000 టన్నులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి (3,600 టన్నులు) ప్రకారం చూస్తే, మరో 15 ఏళ్లలో ఈ నిల్వలన్నీ అయిపోతాయి. ఈలోగా కొత్త నిక్షేపాలను కనిపెట్టాలి. లేదంటే ఉత్పత్తి అడుగంటి, రీసైక్లింగ్పై ఆధారపడాల్సిందే!రేటెందుకు పరుగులు పెడుతోంది?ఏ వస్తువు (కమోడిటీ) ధరకైనా గీటురాయి డిమాండ్, సరఫరానే. గత కొన్నేళ్లుగా గనుల నుంచి పసిడి ఉత్పత్తి మందగించింది, భూమిలో మిగిలున్న నిల్వలు అడుగంటుతున్నాయి. 2021 నుంచి భారీ నిక్షేపాలేవీ దొరకడం లేదు. దీంతో భవిష్యత్తులో స్వర్ణం మరింత అరుదైన లోహంగా మారనుంది. మరోపక్క ఆభరణాల డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. వన్నె తగ్గని సురక్షిత పెట్టుబడి, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ల వంటి సాధనాల ద్వారా పుత్తడిలో మదుపు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లు చెప్పడంతో పాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ నిధులను తగ్గించుకుంటున్నాయి.ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంది. ఆంక్షల భయాలకు తోడు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో సగటున ఏటా 800 టన్నులు కొన్నాయి. ఇటీవల కొనుగోళ్ల జోరు పెంచిన మన ఆర్బీఐ వద్ద 817 టన్నుల బంగారం ఉంది. ఇక పారిశ్రామిక అవసరాలు (ఎలక్ట్రానిక్స్, డెంటిస్ట్రీ, అంతరిక్ష రంగం) ఎగబాకుతున్నాయి. ఇలా సరఫరా మందగించి.. డిమాండ్ పెరిగిపోవడమే బంగారం పరుగుకు ప్రధాన కారణం. ఇక రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తోడు, ఇరాన్–ఇజ్రాయెల్ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది.ఈ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణం ఎగసి జేబుకు చిల్లుపెడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనాల్లోకి, ముఖ్యంగా బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫిబ్రవరిలో 2,000 డాలర్లకు అటూఇటుగా ఉన్న ఔన్స్ బంగారం ధర ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలతో భగ్గుమంది. తాజాగా 2,449 డాలర్ల ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొండెక్కి కూర్చున్న వడ్డీరేట్లు ఇకపై దిగొచ్చే అవకాశాలున్నాయి. ఇది పసిడికి మరింత డిమాండ్ను పెంచడంతో పాటు ధరలు ఎగిసేందుకు దారితీసే అంశం.స్టోర్ ఆఫ్ వాల్యూలో టాప్..ప్రపంచంలో ఏ అసెట్ (ఆస్తి)కీ లేనంత స్టోర్ ఆఫ్ వాల్యూ బంగారం సొంతం. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే మన దగ్గర ఏదైనా అసెట్ (కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఇతరత్రా) ఉంటే, ఎన్నాళ్లయినా దాని విలువ పెరగడమే కానీ ఆవిరైపోకుండా ఉండటం అన్నమాట. ఉదాహరణకు లక్ష రూపాయలు పెట్టి బంగారం కొని, అదే సమయంలో లక్ష రూపాయలను దాచామనుకోండి. కొన్నేళ్ల తర్వాత పసిడి విలువ కచ్చితంగా పెరుగుతుందే తప్ప దిగజారదు. కానీ నగదు విలువ మాత్రం పడిపోతుంది. రెండేళ్ల కిందట కేజీ బియ్యం ధర రూ.40 స్థాయిలో ఉంటే ఇప్పుడు 70కి చేరింది. అంటే కరెన్సీకి ఉన్న కొనుగోలు విలువ అంతకంతకూ ఆవిరైపోతోందని అర్థం. స్టోర్ ఆఫ్ వాల్యూ కలిగిన అతి కొద్ది అసెట్లలో భూమి కూడా ఉన్నప్పటికీ, పుత్తడిలా వెంటనే సొమ్ము చేసుకోవడం (లిక్విడిటీ) కష్టం. కాబట్టి అసలుకు మోసం రాకుండా... లిక్విడిటీలోనూ పసిడిని మించింది లేదు. మన పెద్దలు ‘పొలం పుట్రా.. నగా నట్రా’ వెనకేసుకోమన్నది అందుకే!ఎలా కొన్నా.. బంగారమే!ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో దాదాపు సగం ఆభరణాల రూపంలోనే ఉంది. మగువలకు బంగారమంటే ఎంత మక్కువో చెప్పేందుకు ఇదే నిదర్శనం. రేటు ఎగబాకుతుండటంతో అందకుండా పోతుందేమోనన్న ఆతృత అందరిలోనూ పెరిగిపోతోంది. అందుకే పసిడి పెట్టుబడులూ జోరందుకున్నాయి. మరి ఏ రూపంలో కొంటే మంచిది అనేది చాలా మందికి వచ్చే డౌటు. నిజానికి పెట్టుబడికి కూడా మన దేశంలో ఇప్పటికీ ఆభరణాల రూపంలో కొనేవారే ఎక్కువ. ఎందుకంటే నచ్చినప్పుడు ధరించి, ఆనందించవచ్చనేది వారి అభిప్రాయం.దీనివల్ల తరుగు, మజూరీ పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, ధరించేందుకు అవసరమైనంత ఆభరణాలను పక్కనబెడితే, పెట్టుబడికి మాత్రం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనడం బెటర్. అయితే, ఇందులో కూడా అదనపు చార్జీల భారం ఉంటుంది. అంతేకాకుండా భౌతిక రూపంలో బంగారాన్ని కొన్నా, అమ్మినా 3 శాతం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బాదుడు తప్పదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో కొని దాచుకోవడం రిస్కు కూడా. పోనీ లాకర్లలో దాచుకోవాలంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మెరుగైన ప్రత్యామ్నాయం సార్వభౌమ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీలు), గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) తదితర రూపాల్లో లభించే డిజిటల్ గోల్డ్.అయితే, వీటిని కొనాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి. బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా షేర్ల మాదిరిగానే ఇవి కూడా ట్రేడవుతాయి. నచ్చినప్పుడు విక్రయించుకొని సొమ్ము చేసుకోవచ్చు. ఈటీఎఫ్లలో నామమాత్రంగా చార్జీలు ఉంటాయి. కానీ, ఎస్జీబీలకు ఎలాంటి చార్జీలూ లేవు. అంతేకాదు, వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. అయితే, ఏ రూపంలో కొన్నాసరే ఇన్వెస్టర్లు తమ తమ పెట్టుబడి మొత్తంలో కనీసం 10–15 శాతాన్ని బంగారానికి కేటాయించడం ఉత్తమమని, క్రమానుగత పెట్టుబడి(సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలనేది ఆర్థిక నిపుణుల ‘బంగారు’ మాట!బంగారు భారత్!ఆర్బీఐ దగ్గరున్న 817 టన్నుల బంగారాన్ని పక్కనబెడితే, అనధికారిక లెక్కల ప్రకారం భారతీయుల వద్ద ఆభరణాలు, ఇతరత్రా రూపాల్లో ఉన్న బంగారం మొత్తం 25,000 టన్నులకు పైగానే ఉంటుందని అంచనా. భూమ్మీద ఉన్న మొత్తం బంగారంలో ఇది 13 శాతం. అంటే దాదాపు 1.93 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ. 161 లక్షల కోట్లు. భారత స్థూల దేశీయోత్త్పత్తి (3.7 ట్రిలియన్ డాలర్లు)లో సగానికి సమానమన్నమాట!తులం... రూ. లక్ష!కనకం.. పూనకాలు లోడింగ్ అంటూ నాన్స్టాప్ ర్యాలీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొదలైన దూకుడుతో ఏకంగా 20 శాతం పైగా ఎగబాకింది. ఇప్పుడు కొనొచ్చా.. తగ్గేదాకా వేచి చూడాలా? ఇంకా పెరిగితే ఏంటి పరిస్థితి? అందరిలోనూ ఇవే సందేహాలు. అయితే, పుత్తడిని ఏ రేటులో కొన్నా దీర్ఘకాలంలో లాభాలే కానీ, నష్టపోయే పరిస్థితైతే ఉండదనేందుకు దాని ‘ధర’ చరిత్రే సాక్ష్యం! ఈ ఏడాదిలోనే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్కు 2,700 డాలర్లను తాకొచ్చని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ. 85,000కు చేరే అవకాశం ఉంది. అంటే తులం (11.6 గ్రాములు) బంగారం కొనాలంటే రూ. లక్ష పెట్టాల్సిందే. అయితే, పశ్చిమాసియా, ఉక్రెయిన్ వివాదాలు శాంతించడం, అమెరికాలో వడ్డీరేట్లు మరింత పెరగడం, లేదంటే యథాతథంగా కొనసాగించడంతో పాటు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లకు బ్రేక్ పడితే పసిడి ధరలకు కళ్లెం పడుతుందని గోల్డ్మన్ శాక్స్ అంటోంది.రూపాయి వాత.. సుంకం మోత!మన దేశంలో మగువలే కాదు పురుషులూ పసిడి ప్రియులే. అయితే, పుత్తడి రేటు విషయంలో మన జేబుకు అటు ప్రభుత్వం, ఇటు ‘రూపాయి’ బాగానే చిల్లుపెడుతున్నాయి. పసిడి దిగుమతులపై ప్రభుత్వం 15 శాతం సుంకం విధిస్తోంది. మరోపక్క, రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కుతూ పసిడి ధరకు ఆజ్యం పోస్తోంది. అది ఎలాగంటే, వాస్తవానికి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ (31.1 గ్రాములు) పసిడి ధర 2,400 స్థాయిలో ఉంది. ప్రస్తుత రూపాయి విలువ ప్రకారం 10 గ్రాముల మేలిమి బంగారం రేటు దాదాపు రూ.65,000. కానీ రేటు రూ.75,000 స్థాయిని తాకింది. అంటే 15 శాతం సుంకం లెక్కన ప్రభుత్వానికి రూ.10,000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, 2022లో డాలరుతో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉండేది. ఇప్పుడు 83.5కు పడిపోయింది. రూపాయి 80 స్థాయిలోనే ఉంటే ప్రస్తుత పసిడి ధర రూ.62,400. దీనికి 15 శాతం సుంకం కలిపితే, 71,720 కింద లెక్క!సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు ఎందుకు...ఏ దేశానికైనా ఎగుమతి–దిగుమతులు సజావుగా జరిగేందుకు విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు ఎంత అవసరమో, అందులో బంగారం నిల్వలను తగినంతగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, ఏదైనా అనుకోని ఆర్థిక విపత్తులు తలెత్తినప్పుడు, అంటే ఫారెక్స్ నిధులు అడుగంటి పోవడం వంటి సందర్భాల్లో ప్రభుత్వాలకు దన్నుగా నిలిచేది పుత్తడే! 1991లో దేశంలో ఫారెక్స్ నిల్వలు (డాలర్లు) నిండుకున్నాయి.దిగుమతులకు చెల్లించేందుకు, విదేశీ రుణాలపై వడ్డీ కట్టేందుకు డాలర్లు లేక చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వద్దనున్న బంగారాన్ని కుదువపెట్టి విదేశీ రుణాలను సమీకరించారు. దేశం దివాలా తీయకుండా కాపాడారు. అంటే, అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారం చేతిలో ఉంటే మనకు ఇట్టే అప్పు ఎలా పుడుతుందో.. ప్రభుత్వాలకు సైతం ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం స్వర్ణమే!మరికొన్ని ‘బంగారు’ ముచ్చట్లు...ప్రపంచంలో ఇప్పటిదాకా వెలికితీసిన బంగారం అంతటినీ కరిగించి ముద్దగా చేస్తే ఎటు చూసినా 21.8 మీటర్లుండే క్యూబ్లో పట్టేస్తుంది.అత్యధిక సాంద్రత, సాగే గుణం కారణంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారాన్ని 187 చదరపు అడుగుల పలుచని గోల్డ్ లీఫ్గా సాగదీయొచ్చట.ప్రతి యాపిల్ ఐఫోన్లో 0.034 గ్రాముల పసిడి ఉంటుందని అంచనా.దక్షిణాఫ్రికాలో కనుగొన్న ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని (విట్వాటర్స్రాండ్ గోల్డ్ఫీల్డ్) కార్మికుల కోసం 1900 శతాబ్ది ఆరంభంలో నెలకొల్పిన జొహానస్బర్గ్ సెటిల్మెంట్.. ఇప్పుడు ఆ దేశంలో అతిపెద్ద నగరం.ప్రస్తుతం సాధారణ గ్రేడ్ టన్ను క్వార్ట్›్జ ముడి ఖనిజం నుంచి ఓపెన్ పిట్ గనిలో సగటున 1.4 గ్రాములు, భూగర్భ గనిలో 5–8 గ్రాములు మాత్రమే బంగారం లభిస్తోంది.నేరుగా ముద్దల రూపం (నేటివ్ స్టేట్)లో కూడా దొరికే అతి విలువైన లోహం కూడా బంగారమే. ప్రపంచంలో అతిపెద్ద బంగారం ముద్ద ఆస్ట్రేలియాలోని విక్టోరియా గోల్డ్ ఫీల్డ్స్లో 1869లో దొరికింది. ‘వెల్కమ్ స్ట్రేంజర్’గా పేరు పెట్టిన దాని బరువు ఏకంగా 72 కేజీలు! మన కోలార్ గనుల్లోనూ బొప్పాయి, గణేషుడి రూపాల్లో ఇలా పసిడి ముద్దలు లభించాయట.అతిపెద్ద పసిడి భాండాగారాన్ని (వాల్ట్) న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. మాన్హటన్లోని బ్యాంక్ బేస్మెంట్లో ఉన్న భూగర్భ వాల్ట్లో ప్రస్తుతం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు చెందిన 7,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా.లండన్ బులియన్ మార్కెట్ పసిడి ట్రేడింగ్లో నంబర్ వన్గా నిలుస్తోంది. ప్రపంచంలో ట్రేడయ్యే మొత్తం గోల్డ్లో 70 శాతం వాటా దీనిదే.భారత్లోని మొత్తం బంగారంలో 3,000–4,000 టన్నులు దేవాలయాలకు చెందినవేనని అంచనా. కేరళ పద్మనాభస్వామి గుడిలోని నేలమాళిగల్లో దాదాపు 1,300 టన్నుల బంగారం నిక్షిప్తమై ఉందట. ఇక తిరుపతి వెంకటేశ్వరస్వామి తరఫున టీటీడీ ఇప్పటిదాకా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారం 11,329 కేజీలు (11.32 టన్నులు). ఒక్క 2023–24లోనే 1,031 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది.కేజీఎఫ్.. మన బంగారు కొండ!భారత్లో క్రీస్తు పూర్వం 1వ సహస్రాబ్ది నుంచి దక్కన్ ప్రాంతంలో పసిడి వేట జరుగుతోందని చరిత్ర చెబుతోంది. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో క్రీస్తు శకం 2–3 శతాబ్దాలకు పూర్వమే బంగారాన్ని వెలికితీశారు. ఆ తర్వాత గుప్తులు, చోళుల కాలంలో ఇక్కడ పుత్తడి మైనింగ్ కార్యకలాపాలు విస్తరించాయి. విజయనగర సామ్రాజ్యంలో, ఆపై టిప్పు సుల్తాన్ హయాంలో పసిడి ఉత్పత్తి జోరందుకుంది. అయితే, బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) దశ తిరిగిపోయింది. జాన్ టేలర్ అండ్ కంపెనీకి బ్రిటిషర్లు దీన్ని అప్పజెప్పారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘లిటిల్ ఇంగ్లండ్’గా పిలిచేవారు.1884–1904 మధ్య చాలా తక్కువ లోతులోనే బంగారం దొరికేది. మొదట్లో ఒక టన్ను క్వార్ట్›్జ ముడి ఖనిజం నుంచి 45 గ్రాముల పసిడి వచ్చేదట. దీంతో ప్రపంచంలో అత్యంత శ్రేçష్ఠమైన పసిడి నిల్వలున్న గోల్డ్ ఫీల్డ్గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత అమెరికాలోని నెవాడాలో కనుగొన్న ఫైర్ క్రీక్ భూగర్భ బంగారు గనిలో టన్ను ఖనిజం నుంచి గరిష్టంగా 44.1 గ్రాములు లభించింది. కానీ, మన కేజీఎఫ్ ‘గోల్డెన్’ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కేజీఎఫ్ 120 ఏళ్ల జీవిత కాలంలో సగటున టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే 15 గ్రాముల బంగారం లభ్యమైంది.దక్షిణాఫ్రికాలో అతిపెద్ద గోల్డ్ మైన్ విట్ఫాటర్స్రాండ్ బేసిన్లో సగటు ఉత్పత్తి 9 గ్రాములే. 1956లో ప్రభుత్వం కేజీఎఫ్ను జాతీయం చేసింది. అప్పటిదాకా జాన్ టేలర్ కంపెనీ చేతిలోనే ఉండేది. కేజీఎఫ్ చరిత్రలో దాదాపు 1,000 టన్నుల బంగారం ఉత్పత్తి అయినట్లు అంచనా. ఇందులో చాలావరకు బ్రిటిషర్లే తన్నుకుపోయారు. అయితే, తలకు మించిన ఉత్పాదక వ్యయం, పర్యావరణ సమస్యలతో కేజీఎఫ్ 2021లో పూర్తిగా మూతబడింది. అప్పటికి ‘చాంపియన్’ రీఫ్ మైన్ భూగర్భంలో 3.2 కిలోమీటర్ల లోతు వరకు మైనింగ్ జరిగింది. ప్రపంచంలోని అత్యంత లోతైన బంగారు గనుల్లో ఒకటిగా చరిత్రి సృష్టించింది.భూగర్భంలో 1,400 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు కేజీఎఫ్ కింద విస్తరించి ఉన్నాయట. అప్పుడప్పుడూ అవి కుంగడం వల్ల ఇప్పటికీ కోలార్లో భూమి కంపిస్తుంది. ఇక ప్రస్తుతం భారత్లో ఉత్పత్తి జరుగుతున్న ఏకైక గోల్డ్ మైన్ హట్టి. ఇదీ కర్ణాటకలోనే (రాయచూరు) ఉంది. ఇప్పటిదాకా 84 టన్నుల బంగాన్ని వెలికితీశారు. టన్ను ఖనిజానికి 3 గ్రాముల బంగారమే లభ్యమవుతోంది. ఏటా 1.5 టన్నుల పసిడి ఇక్కడ లభిస్తోంది. కాగా, దేశంలో కనుగొన్న పసిడి నిల్వల్లో 88 శాతం కర్ణాటకలోనే ఉన్నాయి.వినియోగంలో భారత్, చైనాలే టాప్..2023లో ప్రపంచ బంగారు ఆభరణాల డిమాండ్లో 50 శాతం భారత్, చైనాల్లోనే నమోదవుతోంది. దీనికి తోడు పసిడి పెట్టుబడులు కూడా క్రమంగా ఎగబాకుతున్నాయి. 2023లో గనుల నుంచి 3,600 టన్నుల బంగారం వెలికితీయగా అందులో భారత్ దాదాపు 800 టన్నులు, చైనా 824 టన్నులు దిగుమతి చేసుకున్నాయి. తద్వారా వినియోగంలో భారత్ను అధిగమించింది చైనా. అయితే, భారత్ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతుండగా. చైనా బంగారు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటం విశేషం.ద్రవ్యోల్బణానికి విరుగుడు... పెట్టుబడికి నిశ్చింత! ధరల పెరుగుదలకు సరైన విరుగుడు బంగారం. ఎందుకంటే ధరలు పెరిగే కొద్దీ.. కరెన్సీ విలువలు పడిపోతూనే ఉంటాయి. రాబడికి కూడా చిల్లు పడుతుంది. ఉదాహరణకు 5 ఏళ్ల వ్యవధికి ఓ లక్ష రూపాయలు బ్యాంకులో (ఫిక్స్డ్ డిపాజిట్) దాచుకుంటే సగటున 7 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం వచ్చే మొత్తం సుమారు రూ.1,41,500. అయితే, ద్రవ్యోల్బణం 7 శాతం గనుక ఉంటే, వచ్చే రాబడి సున్నా. పెట్టుబడి మాత్రమే మిగులుతుంది.ద్రవ్యోల్బణం మరింత పెరిగితే పెట్టుబడికీ చిల్లే! షేర్లు, బాండ్లు, క్రిప్టో కరెన్సీ, చివరికి బంగారం... ఇలా ఏ పెట్టుబడిలోనైనా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుంది. అయితే, పసిడి పెట్టుబడులు మాత్రం దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడులే (రెండంకెల స్థాయిలో) అందిస్తున్నాయి. దానికితోడు ఏమాత్రం రిస్కులేని వ్యవహారం. పసిడి ధర ఐదేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగింది. పదేళ్లలో నాలుగు రెట్లు ఎగబాకింది.స్టాక్ మార్కెట్లో (షేర్లలో) ఇంతకుమించి లాభాలొచ్చే వీలున్నా, అనుకోని పరిస్థితుల్లో మనం షేర్లు కొన్న కంపెనీ మూతబడితే అసలుకే మోసం రావచ్చు. నూటికి నూరు శాతం రిస్కుతో కూడుకున్నవి. ఇక భూమి, ఇళ్లు ఇతరత్రా స్థిరాస్తులు కూడా బంగారంలాగే రిస్కులేనివే! అయితే, పసిడి మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకుని సొమ్ము చేసుకునే అవకాశం వాటికి తక్కువ. అంతేకాదు, అతితక్కువ వడ్డీకే, బంగారంపై ఇట్టే రుణం కూడా పొందొచ్చు. అందుకే బంగారం అంటే భరోసా. పెట్టుబడికి ఢోకా లేకుండా, కష్టకాలంలో ఆదుకోవడంలో బంగారాన్ని మించింది మరొకటి లేదు!‘కంచు మోగినట్లు.. కనకంబు మోగునా’ అన్నట్లు.. ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలున్నా పసిడికున్న విలువ, వన్నెకు సాటిరావు. అందుకే బంగారం ఎప్పటికీ బంగారమే! – శివరామకృష్ణ మిర్తిపాటి -
Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత?
ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశంలోని కర్షకులు, కార్మికుల పాత్ర కీలకం. కార్మికశక్తిని సద్వినియోగం చేసుకుంటున్న దేశాలు, కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న దేశాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే, కార్మిక సంక్షేమాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేసిన దేశాలు దిగజారుతున్నాయి. కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకోని దేశాలు ఆర్థిక, సామాజిక అసమానతలతో కొట్టుమిట్టాడుతూ తరచు అలజడులకు, అశాంతికి ఆలవాలంగా ఉంటున్నాయి. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలు మాత్రమే కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకుంటున్నాయి. కార్మికులకు మెరుగైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. చట్టబద్ధంగా మెరుగైన వేతనాలు అందేలా చూస్తున్నాయి. భారత్ సహా చాలా దేశాలు కార్మిక సంక్షేమాన్ని తగిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయా దేశాల్లో కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి గుర్తుగా ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకొంటున్నా, కార్మికుల స్థితిగతులు ఆశించిన స్థాయిలో మెరుగుపడిన దాఖలాలు లేకపోవడం విచారకరం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశ దేశాల్లోని కార్మికుల స్థితి గతులు, కార్మిక సంక్షేమంలో వివిధ దేశాలు సాధించిన సాఫల్య వైఫల్యాలపై ఒక పరిశీలన. కార్మికుల హక్కులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్న దేశాలలో, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లిస్తున్న దేశాలలో అతిపెద్ద ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్ వంటి దేశాలు లేకపోవడం విడ్డూరం.కార్మికుల హక్కులకు భరోసా కల్పించడంలోను, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడంలోనూ యూరోపియన్ దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. వీటితో పోల్చుకుంటే, అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ప్రపంచ విపణిలో జబ్బలు చరుచుకుంటున్న దేశాల్లో కార్మికుల పరిస్థితులు అంత గొప్పగా లేవు. చాలా దేశాల్లో కార్మికుల పని పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం గగనంగా ఉంటోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఏటా విడుదల చేసే కార్మిక హక్కుల సూచిని (లేబర్ రైట్స్ ఇండెక్స్) పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఐఎల్ఓ గత ఏడాది విడుదల చేసిన లేబర్ రైట్స్ ఇండెక్స్–2022 జాబితా ప్రకారం...వారంలో పనిగంటలు, వార్షిక కనీస వేతనాలు మాత్రమే కాకుండా, కార్మికుల సగటు వార్షిక వేతనాలు, సమానమైన విలువ కలిగిన పనికి సమానమైన వేతనాల చెల్లింపు, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఏడాదిలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు, ప్రభుత్వ సెలవు దినాలు, కార్మికుల హక్కుల ఉల్లంఘన సంఘటనల సంఖ్య, కార్మికులు పనిచేసే చోట పని పరిస్థితులు, పని ప్రదేశంలో ప్రమాద నివారణ ఏర్పాట్లు, కార్మికుల ఆరోగ్య భద్రత, కార్మికులకు వైద్య సౌకర్యాలు, కార్మికులకు సంఘటితమయ్యే అవకాశాలు, సామాజిక భద్రత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎల్ఓ ఏటా లేబర్ రైట్స్ ఇండెక్స్ను రూపొందిస్తుంది.ఈ జాబితాలోని మొదటి పది దేశాల్లో ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న దేశాలేవీ లేవు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలలోనైతే కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంటోంది. సాంకేతికత అభివృద్ధి చెంది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి వచ్చినా, మురుగు కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు ఇంకా మనుషులే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.‘కోవిడ్’ దెబ్బకు పెరిగిన నిరుద్యోగం..‘కోవిడ్’ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులపై విపరీతంగా ప్రభావం చూపింది. దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘కోవిడ్’ కారణంగా నిరుద్యోగం బాగా పెరిగింది. ఉపాధి కోసం తగిన అవకాశాలు లేక కార్మికులు అసంఘటిత రంగంలోకి చేరుతున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాలు వంటివి దక్కే పరిస్థితులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుతున్న కార్మికుల్లో 58 శాతం– అంటే, దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి పనిచేసే చోట ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేవు.సంఘటిత రంగంలో అవకాశాలు దక్కకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే కార్మికులు అసంఘటిత రంగం వైపు మళ్లుతున్నారని, విపరీతమైన శ్రమదోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పలు ఆఫ్రికా దేశాలు, భారత్ సహా దక్షిణాసియా దేశాలలో అసంఘటిత కార్మికులు 75 శాతానికి పైగానే ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. భారత్లోని మొత్తం కార్మికుల్లో అసంఘటిత రంగంలో పనిచేసేవారు 83 శాతంగా ఉన్నారు. ‘కోవిడ్’కు ముందు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత 22.2 శాతం ఉంటే, ‘కోవిడ్’ తర్వాత 23.5 శాతానికి పెరిగారు.వీరెవరూ చదువు కొనసాగించడమో, నైపుణ్యం పెంచుకోవడానికి శిక్షణ పొందడమో చేయడం లేదు. చిన్నా చితకా పనులు కూడా చేయడం లేదు. ఇలా పూర్తిగా ఖాళీగా ఉన్న యువత సంఖ్య ‘కోవిడ్’ తర్వాత 28.90 కోట్లకు చేరుకుంది. పనిచేసే వయసులో ఉన్న యువత ఇలా ఖాళీగా ఉండటం వల్ల ప్రపంచ ఆర్థికరంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ‘కోవిడ్’కు ముందు మన దేశంలో 7.22 శాతం ఉన్న నిరుద్యోగం, లాక్డౌన్ ప్రకటించిన నెల్లాళ్లకే 23.52 శాతానికి చేరుకుంది. ‘కోవిడ్’ పరిస్థితులు చక్కబడటంతో లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు తిరిగి యథావిధిగా పనులు ప్రారంభించడంతో గత ఏడాది చివరి నాటికి దేశంలో నిరుద్యోగం 8.7 శాతంగా నమోదైంది.కనీస వేతనాలకూ కరవు..ఏ పని దొరికితే ఆ పని చేసుకుని బతికే సాధారణ కార్మికులకు కనీస వేతనాలు దక్కే పరిస్థితులు కూడా మన దేశంలో లేవు. అట్టడుగు స్థాయి సాధారణ కార్మికులకు రోజుకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని ప్రభుత్వం 2022లో రూ.178గా నిర్ణయించింది. కనీసావసరాల ధరలు పెరిగినా, 2023లోను, 2024లోను కూడా ఈ మొత్తంలో మార్పు చేయలేదు. కనీస వేతనాల మొత్తాన్ని రోజుకు రూ.375కు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. స్వయంఉపాధి కార్మికులు, సంఘటిత కార్మికుల పరిస్థితులు సాధారణ కార్మికుల కంటే బాగున్నా, వారి వేతనాల్లో కూడా గడచిన రెండేళ్లల్లో పెద్దగా పెరుగుదల లేదు.‘కోవిడ్’ ముందు రోజులతో పోల్చుకుంటే, ఈ కార్మికుల ఆదాయం స్వల్పంగా తగ్గడం శోచనీయం. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక ప్రకారం స్వయంఉపాధి కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ.12,988గా ఉంటే, 2021–22 నాటికి ఆదాయం రూ.12,089కి పడిపోయింది. సంఘటిత కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ19,690గా ఉంటే, 2021–22 నాటికి 19,456కు పడిపోయింది. సాధారణ కార్మికుల్లో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని కూడా ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక పేర్కొంది.ఇదిలా ఉంటే, సంఘటిత రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రత తగ్గినట్లు ‘పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’–2023 నివేదిక వెల్లడించింది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు వంటి వాటికి అర్హతలేని సంఘటిత కార్మికులు 2017–18లో 49.6 శాతం ఉంటే, వీరి సంఖ్య 2022–23 నాటికి 53.8 శాతానికి పెరిగింది. స్వయంఉపాధి పొందుతున్న మహిళల ఆదాయం కూడా తగ్గింది. స్వయం ఉపాధి మహిళల ఆదాయం 2017–18లో నెలకు 5,995గా ఉంటే, 2022–23లో 5,337గా ఉంది. అయితే, 2017–18లో స్వయం ఉపాధి పొందే గ్రామీణ మహిళలు 55.9 శాతం ఉంటే, 2022–23 నాటికి వీరి సంఖ్య 70.1 శాతానికి పెరిగింది.ఇదేకాలంలో స్వయం ఉపాధి పొందే పట్టణ మహిళల సంఖ్య 45 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. వీరిలో ఎక్కువమంది కుటుంబమంతా కలసి చేసే స్వయంఉపాధి వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా సహాయకులుగా పనిచేస్తున్నవారేనని ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక తేల్చింది. కార్మికుల ఉత్పాదకత 1982–2017 మధ్యకాలంలో ఆరురెట్లు పెరిగితే, వారికి వచ్చే వాస్తవ ఆదాయం ఒకటిన్నర రెట్లు మాత్రమే పెరిగిందని, అంటే, కార్మికులు తమ శ్రమకు తగిన న్యాయమైన వాటాను పొందలేకపోతున్నారని ఈ నివేదిక తెలిపింది.పేదరికం నిర్మూలనకు ప్రతిపాదనలు..కార్మికుల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి కనీస వేతన (మినిమం వేజెస్) విధానం స్థానంలో జీవన వేతన (లివింగ్ వేజెస్) విధానాన్ని వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పును అమలులోకి తేవడానికి తగిన సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక సంస్థను (ఐఎల్ఓ) కోరింది. ప్రస్తుతం ఉన్న కనీస వేతన విధానం ప్రకారం కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రోజుకు రూ.178గా కనీస వేతనాన్ని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు తమ తమ పరిధిలో కనీస వేతనాలను నిర్ణయించుకున్నాయి.ఉదాహరణకు బిహార్లో కనీస వేతనం రోజుకు రూ.160గా ఉంటే, ఢిల్లీలో రోజుకు రూ.423గా ఉంది. దేశంలోని దాదాపు 50 కోట్లకు పైగా ఉన్న కార్మికుల్లో 90 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే కావడంతో, వారి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం జీవన వేతన విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కనీస వేతనం అంటే, చట్టం నిర్దేశించిన అతి తక్కువ మొత్తం వేతనం. అలా కాకుండా, దేశ కాల పరిస్థితులను బట్టి సాధారణ పనిగంటల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి తగినట్లుగా చెల్లించే వేతనాన్ని ఐఎల్ఓ జీవన వేతనంగా నిర్వచించింది.జీవన వేతనం కార్మికులు, వారి కుటుంబాల ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం సహా ఇతర అవసరాలకు తగినట్లుగా లెక్కించడం జరుగుతుంది. జీవన వేతన విధానం అమలులోకి వచ్చినట్లయితే, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. జీవన వేతన విధానాన్ని జాతీయస్థాయిలో అమలులోకి తెస్తే, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని, వాటిని అధిగమించుకుంటూ ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీస వేతన విధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తీసుకొస్తే, ఇది చిన్న మధ్య తరహా వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు భారం కాగలదని, ఫలితంగా వాటి ఆదాయం తగ్గడమే కాకుండా, కొన్ని సంస్థలు నష్టాల్లో పడే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అలాగే, వివిధ రాష్ట్రాలు, నగరాల్లో జీవన వ్యయంలో వ్యత్యాసాలు ఉన్నాయని, కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కట్టుబడిన నేపథ్యంలో 2025లోనే కనీస వేతన వి«ధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తేవాలనుకుంటోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 8.4 శాతం ఉండటంతో కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడం పెద్ద సమస్య కాబోదని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త విధానం కార్మికుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచగలదని ఆశించవచ్చు.విద్యావంతుల్లోనే ఎక్కువ నిరుద్యోగం..ఉపాధికి సంబంధించి చాలా దేశాల్లో లేని విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఉంది. చదువులేని వారు, నామమాత్రపు చదువులు ఉన్నవారితో పోల్చుకుంటే, మన దేశంలో ఉన్నత విద్యావంతుల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. నిరక్షరాస్యులు మొదలుకొని ప్రాథమిక స్థాయితోనే చదువులు ఆపేసిన వారిలో నిరుద్యోగం 1.13 శాతం వరకు ఉంటే, గ్రాడ్యుయేషన్, ఆపై స్థాయి చదువుకున్న వారిలో నిరుద్యోగం 14.70 శాతం వరకు ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), లక్నో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.విద్యావంతులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించడంలో మన దేశం విఫలమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించడానికి మన దేశం కార్మికుల కొరత ఎదుర్కొంటున్న తైవాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కార్మిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. నైపుణ్యాలు లేని కార్మికులను, అరకొర నైపుణ్యాలు ఉన్న కార్మికులను ఆ దేశాలకు తరలించడానికి కుదుర్చుకున్న ఈ ఒప్పందాలపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పాలస్తీనాతో యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్కు మన దేశం నుంచి కార్మికులను తరలించడమంటే, వారి జీవితాలను కోరి మరీ ప్రమాదంలోకి నెడుతున్నట్లేనని, ఉపాధి కల్పనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రప్రభుత్వం కార్మికుల ప్రాణాలనే పణంగా పెడుతోందని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.గత ఏడాది మే నెలలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన దేశం 42 వేల మంది భవన నిర్మాణ కార్మికులను, నర్సింగ్ నిపుణులను ఇజ్రాయెల్కు పంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తైవాన్తో కూడా మన ప్రభుత్వం ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ కార్మిక మంత్రి భారత్ నుంచి వచ్చేవారిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులకు ప్రాధాన్యమివ్వాలంటూ చేసిన వివక్షాపూరితమైన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై మీడియా దుమ్మెత్తిపోయడంతో తైవాన్ కార్మిక మంత్రి వెనక్కు తగ్గి, భారత్ నుంచి వచ్చే ఏ కార్మికులనైనా ఒకే రీతిలో చూస్తామని చెప్పారు. -
హిమగిరుల సొగసరి కిర్గిజ్స్తాన్.. వైద్య విద్యకు కేరాఫ్!..అందులోనూ..
అమ్మాయిలు బయటకు వెళ్తుంటే బాడీగార్డ్స్లా అబ్బాయిలను తోడిచ్చి పంపే సీన్కి రివర్స్లో అబ్బాయిలు బయటకు వెళ్తూ తోడురమ్మని అమ్మాయిలను బతిమాలుకోవడం కనిపిస్తే.. పురుషులతో సమానంగా మహిళలకూ హక్కులుంటే.. ఇంటా, బయటా అన్నింటా అమ్మాయిలకు గౌరవం అందుతుంటే.. సలాం.. ప్రివేత్.. ఈ కిర్గిజ్ అండ్ రష్యన్ పదాలకు అర్థం వందనం! పై దృశ్యాలు కనిపించేదీ కిర్గిజ్స్తాన్లోనే! ఈ దేశం ఒకప్పటి యూఎస్సెస్సార్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్)లో భాగం అవడం వలన ఇప్పటికీ అక్కడ రష్యన్ అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగుతోంది కిర్గిజ్తోపాటు. అందుకే ప్రివేత్ కూడా! మొన్న మార్చ్లో కిర్గిజ్స్తాన్కి టేకాఫ్ అయ్యే చాన్స్ దొరికింది. ప్రయాణాలు కామనైపోయి.. అంతకంటే ముందే అంతర్జాలంలో సమస్త సమాచారమూ విస్తృతమై పర్సనల్ ఎక్స్పీరియెన్సెస్ని పట్టించుకునే లీజర్ ఉంటుందా అనే డౌటనుమానంతోనే స్టార్ట్ అయింది ఈ స్టోరీ ఆఫ్ జర్నీ! అయినా కిర్గిజ్స్తాన్లో నేను చూసినవి.. పరిశీలించినవి.. అర్థం చేసుకున్నవి మీ ముందుంచుతున్నాను! ఢిల్లీ నుంచి కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కేక్కి మూడున్నర గంటలు. అందులో దాదాపు రెండున్నర గంటలు టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మీంచే ఉంటుంది ఆకాశయానం. విండోలోంచి చూస్తే కొండల మీద వెండి రేకులు పరచుకున్నట్టు కనిపిస్తుంది దృశ్యం. మంచుకొండలు.. మబ్బులు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నట్టు.. భుజాల మీద చేతులేసుకుని కబుర్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇదొక అద్భుతమైతే.. బిష్కేక్.. మనాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లయిట్ దిగగానే కురిసే మంచుతో స్వాగతం మరో అద్భుతం! సిమ్లాలో హిమ వర్షాన్ని ఆస్వాదించినప్పటికీ బిష్కేక్లో మంచు కురిసే వేళలు గమ్మత్తయిన అనుభూతి. మేం వెళ్లిందే మంచు పడే లాస్ట్ డేస్. ఇంకా చెప్పాలంటే తర్వాతి రోజు నుంచి మంచు పడటం ఆగిపోయి.. కరగడం మొదలైంది. వర్షం వెలిసిన తర్వాత ఉండే కంటే కూడా రొచ్చుగా ఉంటుంది కరుగుతున్న మంచు. ఎండ చిటచిటలాడించినా.. మంచు కొండల మీద నుంచి వీచే గాలులు వేళ్లు కొంకర్లు పోయేంత చలిని పుట్టించాయి. అందుకే ఉన్న వారం రోజులూ షూ, థర్మల్స్, గ్లోవ్స్, క్యాప్ తప్పకుండా ధరించాల్సి వచ్చింది. ఇంకోమాట.. అక్కడి వాతావరణ పరిస్థితులకో ఏమో మరి.. షూ లేకుంటే అక్కడి జనాలు చిత్రంగా చూస్తారు. గోలలు.. గడబిడలకు నియత్.. బిష్కేక్ని కేంద్రంగా చేసుకునే అల అర్చా, ఇసిక్ కుల్ ఇంకా బిష్కేక్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాం. కాబట్టి వారం రోజులు బిష్కేక్తో మా అనుబంధం కొనసాగింది. సిటీ సెంటర్లోని హోటల్లో మా బస. అక్కడికి వెళ్లగానే అబ్జర్వ్ చేసిన విషయం.. కిర్గిజ్ ప్రజలు చాలా నెమ్మదస్తులని! గట్టిగట్టిగా మాట్లాడటాలు.. అరుపులు.. కేకలు, గడబిడ వాతావరణం వారికి నచ్చవు. పక్కనవాళ్లు ఏ కొంచెం గట్టిగా మాట్లాడినా చిరాగ్గా మొహం పెడ్తారు. నిర్మొహమాటంగా చెప్పేస్తారు గొంతు తగ్గించి మాట్లాడమని. ఇక్కడ మెజారిటీ రష్యనే మాట్లాడ్తారు. ‘నియత్’ అంటే ‘నో’ అని అర్థం. సైన్బోర్డ్స్, నేమ్ప్లేట్స్ కిర్గిజ్ అండ్ రష్యన్లో ఉంటాయి. ఇది సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నప్పుడు మామూలు వ్యవహారాలూ రష్యన్లోనే నడచి.. కిర్గిజ్ భాషా పదకోశం కుంచించుకుపోయిందట. స్వతంత్ర దేశమయ్యాక కిర్గిజ్ భాషా వికాసం మీద బాగానే దృష్టిపెట్టారని స్థానికులు చెప్పిన మాట. సర్కారు విద్యాబోధన అంతా కిర్గిజ్ మీడియంలోనే సాగుతుంది. వెస్ట్రనైజ్డ్గా కనిపించే పట్టణ ప్రాంతమే మొత్తం దేశాన్ని డామినేట్ చేస్తుంది. "ఈ దేశం విద్యుత్ అవసరాలను హైడల్ ప్రాజెక్ట్లు, బొగ్గే తీరుస్తున్నాయి. అయితే పట్టణాల్లోని సెంట్రలైజ్డ్ హీటింగ్, ఎయిర్ కండిషనింగ్కి బొగ్గునే వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని అక్కడి పర్యావరణవేత్తల ఆవేదన. కాలుష్యంలో బిష్కేక్ది ఢిల్లీ తర్వాత స్థానం." లోకల్ మార్కెట్లదే హవా.. ఇక్కడ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వేళ్ల మీద లెక్కపెట్టేన్ని కూడా లేవు. స్థానికులను అడిగితే.. కమ్యూనిజం ప్రభావం వల్లేమో ప్రైవేట్ బ్యాంకుల మీద పూర్తిస్థాయి నమ్మకం ఇంకా కుదరలేదని చెప్పారు. అఫర్డబులిటీ, బేరసారాలకు వీలుడంటం వల్లేమో లోకల్ మార్కెట్సే కళకళలాడుతుంటాయి. ఇక్కడ ఓష్ బజార్, దొర్దోయి, అక్ ఎమిర్ లోకల్ మార్కెట్లు చాలా పాపులర్. మేం ఓష్ బజార్కి వెళ్లాం. రెండు రోజులు మార్కెట్ అంతా కలియతిరిగాం. సిల్వర్ జ్యూలరీ దగ్గర్నుంచి హ్యాండ్ అండ్ లగేజ్ బ్యాగ్స్, బట్టలు, వంట పాత్రలు, వెచ్చాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వరకు సమస్త సరకులకూ నిలయమిది. ఏ వస్తువులకు ఆ వస్తువుల సపరేట్ మార్కెట్ల సముదాయంగా కనిపిస్తుంది. బేరం చేయకుండా చూడాలంటేనే రోజంతా పడుతుంది. అన్నట్లు కిర్గిజ్లో సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చాలా ఫేమస్. ఓష్ బజార్లో ఒక్క సిల్వర్, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యూలరీయే ఉంటుంది. ఈ దేశం లెదర్ గూడ్స్కీ ప్రసిద్ధే! లోకల్ ఫ్యాషన్ని చూడాలంటే ఇక్కడి బట్టల మార్కెట్ని సందర్శించొచ్చు. ఓష్ బజార్ ఈ మార్కెట్లో ఇంకో అట్రాక్షన్.. కిర్గిజ్స్తాన్ హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్. వీళ్ల సంప్రదాయ వేషధారణలోని కల్పక్ (సూఫీలు ధరించే టోపీని పోలి ఉంటుంది) దగ్గర్నుంచి వీళ్ల సాంస్కృతిక చిహ్నమైన యర్త్ హోమ్, సంప్రదాయ సంగీత వాద్యం కోముజ్ (వాళ్ల నేషనల్ మ్యూజిక్ సింబల్)ల కళాకృతులు, ఎంబ్రాయిడరీ.. ఊలు అల్లికల వరకు కిర్గిజ్ హస్తకళల నైపుణ్యానికి ప్రతీకలైన వస్తువులన్నీ ఈ షాపుల్లో దొరుకుతాయి. అయితే ఏది కొనాలన్నా చాలా బేరం ఆడాలి. కొన్ని చోట్ల వర్కవుట్ అవుతుంది. కొన్ని చోట్ల కాదు ఈ మార్కెట్లో అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లూ ఉంటాయి. అయితే మేం వెళ్లింది అక్కడి వింటర్లో కాబట్టి పెద్దగా కనిపించలేదు. చలికాలాలు మైనస్ డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది కావున పంటలన్నీ వేసవిలోనే. యాపిల్స్, కమలా పళ్లు బాగా కనిపించాయి. ఇక్కడి కమలాలు భలే బాగున్నాయి రుచిలో. నిమ్మకాయ కన్నా కాస్త పెద్ద సైజులో ఉండే ఈ పండ్లే మా బ్రేక్ఫస్ట్ అక్కడున్నన్ని రోజులూ! కిర్గిజ్స్తాన్లో మరో ముఖ్యమైన కాపు వాల్నట్స్. ఇవి ఓష్బజార్లో రాశులు రాశులుగా కనిపిస్తాయి. బ్రౌన్ షెల్స్వే కాకుండా నాటుకోడి గుడ్డు పరిమాణంలో వైట్ షెల్స్తో కూడా ఉంటాయి. వీటిని చాక్లెట్లో రోస్ట్ చేసి అమ్ముతారు. ఒలుచుకోవడానికి ఒక హుక్లాంటిదీ ఇస్తారు. వీటితోపాటు ఇంకెన్నో రకాల నట్స్, డ్రైఫ్రూట్స్ ఈ మార్కెట్లో లభ్యం. కానీ మన దగ్గరకన్నా వాల్నట్సే చాలా చవక. మంచి క్వాలిటీవి కూడా సగానికి సగం తక్కువ ధరకు దొరుకుతాయి. రష్యన్ బ్రెడ్ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ దాన్ని ట్రై చేయొచ్చు. చాక్లెట్స్ కూడా ఫేమస్. వాటికీ ప్రత్యేక దుకాణ సముదాయముంది. ఇంకో విషయం.. ఇక్కడ సూపర్ మార్కెట్లలో లిక్కర్కీ ఒక సెక్షన్ ఉంటుంది. రకరకాల కిర్గిజ్, రష్యన్ వోడ్కా బ్రాండ్స్ కనిపిస్తుంటాయి. "జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు ప్రధానులుగా వాళ్ల వాళ్ల కాలాల్లో కిర్గిజ్స్తాన్ను సందర్శించారు. ఆయా సమయాల్లో అక్కడ పుట్టిన ఆడపిల్లలందరికీ ఇందిర అని పేరు పెట్టుకున్నారట. వాళ్లలో ఒకరు.. హయ్యర్ మెడికల్ డిగ్రీస్ పొందిన కిర్గిజ్స్తాన్ తొలి మహిళ.. డాక్టర్ ఖుదైబెర్జెనోవా ఇందిరా ఒరొజ్బేవ్నా. కిర్గిజ్స్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడి తర్వాత అన్ని అధికార లాంచనాలు అందుకునే రెండో వ్యక్తి ఆమే! ఇంకో విషయం ఇక్కడున్న మన ఎంబసీ వీథి పేరు మహాత్మా గాంధీ స్ట్రీట్". మీడియా.. "ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో ఇక్కడ ప్రింట్ మీడియా అంతగా కనిపించదు. అందుకే ఎలక్ట్రానిక్ మీడియానే పాపులర్. ప్రభుత్వ చానెల్స్తోపాటు డజన్కి పైగా ప్రైవేట్వీ ఉన్నాయి. రష్యన్ చానెల్స్కే ఆడియన్స్ ఎక్కువ. ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లూ ఎక్కువే". కిర్గిజ్స్తాన్.. "ఈ ముస్లిం నొమాడిక్ ల్యాండ్కి సెంట్రల్ ఆసియా స్విట్జర్లండ్గా పేరు. యూఎస్సెస్సార్ విచ్ఛిన్నం తర్వాత 1991లో స్వతంత్ర దేశంగా మారింది. టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మధ్య ఒదిగి.. కజకిస్తాన్, చైనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఎన్నో నాగరికతలకు కూడలిగా ఉన్న సిల్క్రూట్లో భాగం. సెక్యులర్ కంట్రీ. అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం. వ్యవసాయమే ప్రధానం. కెనాళ్లు, చెరువులు సాగుకు ఆధారం. పత్తి, మొక్కజొన్న, గోధుమలు, తృణధాన్యాలు ప్రధాన పంటలు. తేనెటీగలు, మల్బరీ తోటల పెంపకమూ కనిపిస్తుంది. వ్యవసాయం యంత్రాల సాయంతోనే! చిన్న కమతాల రైతులు మాత్రం గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారు. బొగ్గు, బంగారం, కాటుకరాయి, పాదరసం గనులున్నాయి. కొంత మొత్తంలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిల్వలూ ఉన్నాయి. మాంసం, పాల ఉత్పత్తులు, ఉన్ని ప్రధాన ఎగుమతులు. కరెన్సీ. సోమ్. జనాభా.. దాదాపు 67 లక్షలు. పురుషుల కన్నా మహిళలే అధికం". 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చూద్దామనే ఉత్సుకతతో ఒక రోజు ఆ షాపింగ్కీ వెళ్లాం. అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా కాస్టీ›్ల. అంత ధరపెట్టి 14 క్యారెట్ కొనేబదులు అదే ధరలో ఎంతొస్తే అంత 22 క్యారెట్ గోల్డే బెటర్ కదా అనే భారతీయ మనస్తత్వంతో కళ్లతోనే వాటిని ఆస్వాదించి వెనక్కి తిరిగొచ్చేశాం. సెకండ్స్ ఎక్కువ.. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ చాలా పెద్దది. ఫోర్ వీలర్స్ అన్ని సెకండ్సే. అందుకే ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్.. అన్నీ మోడల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీటి కోసం బిష్కేక్కి దగ్గర్లోనే దాదాపు 20 ఎకరాల్లో ఒక మార్కెట్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ స్టీరింగ్.. రెండూ ఉంటాయి. పర్వత ప్రాంతమవడం వల్లేమో రైల్వే కంటే రోడ్డు రవాణాయే ఎక్కువ. మన దగ్గర కనిపించే స్వరాజ్ మజ్దాలాంటి వాహనాన్ని మార్ష్రూత్కా అంటారిక్కడ. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి దాన్నే ఎక్కువగా వాడతారు. మనకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులుంటాయి. వాటిని ట్రామ్స్ అంటారు. వీటికి రోడ్డు మీద పట్టాలేం ఉండవు. పైన కరెంట్ తీగతో పవర్ జనరేట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఏం కాదు కానీ ధర చాలా చాలా తక్కువ. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ధర కాస్త ఎక్కువే. ట్రాఫిక్ చాలానే ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. అయినా ట్రాఫిక్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అత్యంత అవసరమైతే తప్ప హాంకింగ్ చేయకూడదు. ఫోన్లు కూడా సెకండ్ హ్యాండ్సే అధికం.. బ్రాండ్ న్యూ ఫోన్లు ఉన్నా! ఐఫోన్ వాడకం ఎక్కువ. బ్రాండ్ న్యూ హై ఎండ్ ఫోన్లు డ్యూటీ ఫ్రీతో మన దేశంలో కన్నా గణనీయమైన తక్కువ ధరకు లభిస్తాయి. నాడీ పట్టుకున్నారు.. "కిర్గిజ్స్తాన్లోని బిష్కేక్, ఇసిక్ కుల్ లాంటి చోట్ల భారతీయవిద్యార్థులు అందులో తెలుగు వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. కారణం.. మెడిసిన్. అవును ఈ దేశం వైద్యవిద్యకు హబ్గా మారింది. ఇది ప్రైవేట్ రంగాలకిస్తున్న ప్రోత్సాహాన్ని గ్రహించి.. రష్యాలో మెడిసిన్ చదివిన కొత్తగూడెం వాసి డాక్టర్ పి. ఫణిభూషణ్ 20 ఏళ్ల కిందటే ఇక్కడ ఐఎస్హెచ్ఎమ్ (ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్)ను స్థాపించాడు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకొస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి ఐకే అకున్బేవ్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కేఎస్ఎమ్ఏ) ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఈ సంస్థకు తమ యూనివర్సిటీలో అఫిలియేషన్ ఇచ్చింది. ఐఎస్ఎమ్ ఎడ్యుటెక్ అనే కన్సల్టెన్సీ ద్వారా మన తెలుగు స్టూడెంట్స్ ఎందరికో కేఎస్ఎమ్ఏలో అడ్మిషన్స్ ఇప్పించి.. వాళ్ల వైద్యవిద్య కలను సాకారం చేస్తున్నారు డాక్టర్ ఫణిభూషణ్. ఈ రెండు యూనివర్సిటీల్లో దాదపు రెండువేలకు పైగా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ఎందుకంటే ఇది అమ్మాయిలకు సురక్షిత దేశం కాబట్టి. ఇక్కడా మెడిసిన్ అయిదున్నరేళ్లే! ఇంగ్లిష్లోనే బోధన సాగుతుంది. చక్కటి ఫ్యాకల్టీ, హాస్టల్ సదుపాయాలున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద అనాటమీ ల్యాబ్స్లలో ఒకటి కేఎస్ఎమ్ఏలో ఉంది. కమ్యూనికేషన్కి ఫారిన్ స్టూడెంట్స్ ఇబ్బందిపడకూడదని కిర్గిజ్, రష్యన్ భాషలనూ నేర్పిస్తారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కోసం పీఈటీ కూడా ఉంటుంది. ఇది అకడమిక్స్లో భాగం. వారానికి రెండుసార్లు ఇండియన్ ఫ్యాకల్టీతోనూ క్లాస్లుంటాయి. ఫారిన్లో మెడిసిన్ పూర్తిచేసుకున్న స్టూడెంట్స్కి ఇండియాలో పెట్టే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్జీఈ) కోసమూ ఇక్కడ ప్రత్యేక శిక్షణనిస్తారు. అయితే కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదవడానికి మన నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ‘ఇండియాలో మెడికల్ సీట్లు తక్కువ. కాంపీటిషన్ చాలా ఎక్కువ. ఎంత కష్టపడ్డా మంచి కాలేజ్లో సీట్ దొరకదు. ‘బీ’ కేటగరీ సీట్కి కనీసం కోటి రూపాయలుండాలి. అంతే ఫెసిలిటీస్.. అంతే మంచి ఫ్యాకల్టీతో ఇక్కడ 35 లక్షల్లో మెడిసిన్ అయిపోతుంది. అదీగాక మంచి ఎక్స్పోజర్ వస్తోంది’ అని చెబుతున్నారు అక్కడి మన తెలుగు విద్యార్థులు. ‘పిల్లల్ని మెడిసిన్ చదివించడానికి ఆస్తులు తాకట్టుపెట్టిన పేరెంట్స్ని చూశాను. డెడికేషన్ ఉన్న స్టూడెంట్స్కి మెడిసిన్ అందని ద్రాక్ష కాకూడదని, తక్కువ ఖర్చుతో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ని అందించాలనే సంకల్పంతో ఈ సంస్థను స్టార్ట్ చేశాం. అంతేకాదు యాక్టర్ సోనూ సూద్ సహకారంతో ఫీజులు కట్టలేని నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ని మా కాలేజెస్లో ఫ్రీగా చదివిస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ ఫణిభూషణ్". - డాక్టర్ ఫణిభూషణ్ విద్య, వైద్యం ఫ్రీ.. ఇందాకే ప్రస్తావించుకున్నట్టు మౌలిక సదుపాయాల విషయంలో ఈ దేశం ఇంకా కమ్యూనిజం విలువలనే పాటిస్తోంది.. విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ! ప్రైవేట్ బడులు, ఆసుపత్రులు లేవని కాదు.. చాలా చాలా తక్కువ. చదువు విషయంలో ఇంగ్లిష్ మీడియం కావాలనుకునే వాళ్లే ప్రైవేట్ బడులకు వెళ్తారు. అయితే ఈ బడుల్లో కూడా కిర్గిజ్, రష్యన్ నేర్పిస్తారు. ఆటలంటే ప్రాణం పెడతారు. ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాల్సిందే! పాఠశాల విద్య నుంచి ప్రొఫెషనల్ కోర్స్ మెడిసిన్ దాకా ఆటలనూ అకడమిక్స్గానే పరిగణిస్తారు. పాఠ్యాంశాలతోపాటు పీఈటీకీ మార్కులుంటాయి. అథ్లెటిక్స్, వాలీబాల్ ఎక్కువ. బిష్కేక్లోని పార్క్స్, గ్రౌండ్స్లో అథ్లెట్స్ ప్రాక్టిస్ చేస్తూ కనపడ్తారు. లెవెంత్ క్లాస్ తర్వాత ప్రతి విద్యార్థి సైన్యంలో శిక్షణ తీసుకోవాలి. ప్రతి శని, ఆదివారాలు స్కూల్ పిల్లలు నగర వీథులను శుభ్రం చేయాలి. మొక్కలు నాటాలి. నీళ్లు పోయాలి. ప్రభుత్వాసుపత్రులైతే ఆధునిక సదుపాయాలతో ప్రైవేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉంటాయి. జీరో క్రైమ్.. నో డొమెస్టిక్ వయొలెన్స్! బిష్కేక్లో మేం తిరిగిన ప్రాంతాల్లో ఎక్కడా మాకు పోలీస్ స్టేషన్లు కనించలేదు. ఆశ్చర్యపోతూ మేం తిరిగిన మార్ష్రూత్కా డ్రైవర్లను అడిగితే.. నవ్వుతూ ‘ఉంటాయి కానీ మా దగ్గర క్రైమ్ చాలా తక్కువ. దాదాపు జీరో అని చెప్పుకోవచ్చు’ అన్నారు. డొమెస్టిక్ట్ వయొలెన్స్కీ తావులేదు. ఇక్కడ ఇంటికి యజమానురాలు మహిళే. ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి అన్నిటినీ ఆమే చూసుకుంటుంది. లీడ్లోనే చెప్పుకున్నట్టు మహిళలను గౌరవించే దేశం. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్.. అన్నిట్లో మహిళలే ఎక్కువ. ట్రక్ని డ్రైవ్ చేస్తూ.. సంస్థల్లో ఫ్రంట్ ఆఫీస్ నుంచి మేనేజర్లు.. ఆంట్రప్రన్యూర్స్ దాకా.. లాయర్లుగా.. డాక్టర్లుగా.. ఇలా ప్రతిచోటా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు. అల అర్చా నేషనల్ పార్క్ విమెన్స్ డే జాతీయ పండగే.. కిర్గిజ్ ప్రజలు మహిళలకు ఎంత విలువిస్తారో చెప్పడానికి ఇక్కడ జరిగే విమెన్స్ డే సెలబ్రేషనే ప్రత్యక్ష్య ఉదాహరణ. దాన్నో జాతీయ పండగలా నిర్వహిస్తారు. ఆ రోజు మగవాళ్లందరూ గిఫ్ట్స్తో తమ ఇంట్లో.. తమ జీవితంలోని స్త్రీలకు గ్రీటింగ్స్ చెప్తారు. తమ మనసుల్లో వాళ్లకున్న చోటు గురించి కవితలల్లి వినిపిస్తారు. మేం వెళ్లింది విమెన్స్ డే అయిన వారానికే కాబట్టి బిష్కేక్లో ఇంకా ఆ సంబరం కనిపించింది.. సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ మార్కెట్లలో విమెన్స్ డే స్పెషల్ కలెక్షన్స్తో! దీని ప్రభావం కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదువుకుంటున్న మన తెలుగు విద్యార్థుల మీదా కనిపించింది.. వాళ్లు చదువుకుంటున్న కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కిర్గిస్తాన్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం)కి వెళ్లినప్పుడు! వాళ్ల క్లాస్ రూమ్స్ కారిడార్ వాల్స్ మీద రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ అతికించి ఉన్నాయి. ఆ కాలేజ్లోని ప్రతి అబ్బాయి వాళ్లమ్మ .. అమ్మమ్మ.. నానమ్మ.. అత్త.. పిన్ని.. అక్క.. చెల్లి.. టీచర్.. ఫ్రెండ్.. ఇలా వాళ్లకు సంబంధించిన .. వాళ్లకు పరిచయమున్న మహిళలు.. అమ్మాయిల గురించి ఆ గ్రీటింగ్ కార్డ్స్ మీద రాసి తమకు వాళ్ల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అమ్మాయిలను తమకు ఈక్వల్గా ట్రీట్ చేయాలని కిర్గిజ్స్తాన్ కల్చర్ని చూసి నేర్చుకుంటున్నామని చెప్పారు భారతీయ విద్యార్థులు. యర్త్ హోమ్స్ సిటీ ఆఫ్ గార్డెన్స్.. బిష్కేక్లో ఎటుచూసినా విశాలమైన గార్డెన్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. మేం వెళ్లినప్పుడు స్ప్రింగ్ సీజన్కి ముస్తాబవుతున్నాయి. వింటర్ అయిపోయే సమయంలో మట్టి తవ్వి.. కొత్త మట్టి వేసి.. కొత్త మొక్కల్ని నాటుతారట. మాకు ఆ దృశ్యాలే కనిపించాయి. స్ప్రింగ్ టైమ్లో ఈ కొత్త మొక్కలన్నీ రకరకాల పూలతో వసంత శోభను సంతరించుకుంటాయి. అసలు కిర్గిజ్స్తాన్ని స్ప్రింగ్ సీజన్లోనే చూడాలని స్థానికుల మాట. తోటల్లోనే కాదు.. కొండలు .. లోయల్లో కూడా మంచంతా కరిగి.. మొక్కలు మొలిచి.. రకారకాల ఆకులు.. పూలతో కొత్త అందం పరచుకుంటుంది. అందుకే ఆ టైమ్లోనే పర్యాటకుల సందడెక్కువ. సిటీ స్క్వేర్.. ఒక పూటంతా బిష్కేక్ సిటీ స్క్వేర్లో గడిపాం. మార్చి 21.. కిర్గిజ్స్తా¯Œ కొత్త సంవత్సరం నూరోజ్ పండగ. మేం అక్కడికి వెళ్లేప్పటికి ఆ వేడుక కోసం పిల్లలంతా జానపద నృత్యాలు.. పాటలతో రిహార్సల్స్ చేసుకుంటూ కనిపించారు.. కిర్గిజ్స్తాన్ ఎపిక్ హీరో మనాస్ విగ్రహం ముందు. పదిలక్షలకు పైగా పద్యాలతో ఉన్న ఈ మనాస్ కావ్యం కిర్గిజ్ ప్రజల చరిత్ర, సంస్కృతి, ఫిలాసఫీని అభివర్ణిస్తుంది. ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కావ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కింద దీని సంరక్షణ బాధ్యతను యునెస్కో తీసుకుంది. అంతటి ప్రాశస్త్యమున్న మనాస్ విగ్రహానికి పక్కనే కొంచెం దూరంలో ఆ దేశ పార్లమెంట్ ఉంటుంది. విశాలమైన రోడ్లు.. వాటికి ఆనుకుని గార్డెన్లు.. పాత్వేలతో ఎక్కడో యూరప్లోని దేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నూరోజ్ కోసం బిష్కేక్ ప్రత్యేకంగా ముస్తాబవుతుందట. యర్త్ హోమ్లు.. హస్తకళల ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. ఆ సన్నాహాలు కనిపించాయి. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ వేడుకలు ఇసిక్ కుల్ సాల్ట్ లేక్.. ఒకరోజు బిష్కేక్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల అర్చా వెళ్లాం. అ ్చ అటఛిజ్చి అంటే రంగురంగుల జూనపర్ చెట్లు అని అర్థం. రకరకాల పక్షులు, అడవి మేకలు, జింకలు, కొమ్ముల మేకలు, తోడేళ్లకు నిలయం ఈ ప్రాంతం. ఇక్కడున్న నేషనల్ పార్క్ చూడదగ్గది. మంచు కొండల మీద ట్రెకింగ్, పైన్ చెట్లు.. వాటర్ ఫాల్స్, టీయెన్ షాన్ శ్రేణుల నుంచి పారే నదులు.. నిజంగానే స్విట్జర్లండ్లో ఉన్నామేమో అనే భ్రమను కల్పిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడి స్వచ్ఛమైన గాలి.. ఓహ్.. అనుకుంటాం గానీ పాడు చలి చంపేస్తుంది. పార్క్ ఎంట్రెన్స్ నుంచి మంచులో దాదాపు మూడు గంటలకు పైగా నడిస్తే గానీ నదీ తీరానికి వెళ్లలేం. ఆ తీరం వెంట ఇంకాస్త ముందుకు వెళితే వాటర్ఫాల్స్. అలాగే మరికాస్త వెళితే అక్ సై హిమానీ నదం. ఇది అద్భుతమని చెబుతుంటారు స్థానికులు. అక్కడ నైట్ క్యాంప్ వేసుకోవచ్చట. ఇసిక్ కూల్ లేక్ కానీ మైనస్ డిగ్రీల టెంపరేచర్లో మాకు అర కిలోమీటర్ నడిచేసరికే కాళ్లు, చేతులు కొంకర్లు పోయి.. ముక్కు, పెదవులు పగిలి.. మాట మొద్దు బారిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. అలాగని అక్కడే ఉండి పక్షుల కిలకిలారావాలు.. పైన్ చెట్ల తోపులను ఆస్వాదించలేకపోయాం ఇది ప్రొఫెషనల్ ట్రెకర్స్కే సాధ్యమని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ తిరిగొచ్చి మార్ష్రూత్కాలో కూలబడ్డాం. అందులోని హీటర్కి చలికాచుకున్నాం. మా చలివణుకు చూసి డ్రైవర్లు ఒకటే నవ్వులు. ఇంకోరోజు ఇసిక్ కుల్కి ప్రయాణమయ్యాం. బిష్కేక్ నుంచి ఇది దాదాపు 260 కిలోమీటర్లు. సూర్యోదయానికి ముందే స్టార్ట్ అయ్యాం. దార్లో సిల్క్రూట్ టచ్ అవుతుంది కిర్గిజ్స్తాన్ – కజకిస్తాన్ బార్డర్లో. మసక చీకటి.. మంచు.. మార్ష్రూత్కా విండో గ్లాసెస్ మీది ఫాగ్ తుడుచుకుని.. కళ్లు చిట్లించుకున్నా బయటి దృశ్యం స్పష్టంగా లేదు. వెహికిల్ ఆపడానికి లేదు. వచ్చేప్పుడు చూడొచ్చులే అనుకున్నాం. వచ్చేప్పుడూ సేమ్ సీన్. రాత్రి.. చీకటి.. మంచు అయితే ఇసిక్ కుల్ సాల్ట్ లేక్ ఆ నిరాశను కాస్త మరిపించింది. కాస్పియన్సీ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా.. టిటీకాకా తర్వాత రెండవ అతిపెద్ద మౌంటెన్ లేక్ సరస్సుగా పేరుగాంచిందీ భూతల స్వర్గం. ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించే మంచు పర్వతాల ఒడిలో నింగి నీలంతో.. చల్లదనంలో ఆ హిమ గిరులతో పోటీ పడుతూ నా ఊహల్లోని మానస సరోవరానికి కవలగా కనపడింది. మైనస్లోకి పడిపోయే టెంపరేచర్లోనూ ఇది గడ్డకట్టదు. ఈ లేక్లో బోటింగ్ కూడా ఉంటుంది. దీనికి విశాలమైన ఇసుక బీచ్ ఉంటుంది. ప్రతి సెప్టెంబర్లో ఇక్కడ వరల్డ్ నొమాడిక్ గేమ్స్ జరుగుతాయి. దీన్ని 2014లో కిర్గిజ్స్తానే ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంచార ప్రజల సంస్కృతీసంప్రదాయల పునరుద్ధరణ, సంరక్షణతోపాటు.. ఈ గేమ్స్లో పాల్గొంటున్న దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో! మొదటి సంవత్సరం ఇందులో 19 దేశాలు పాల్గొంటే 2018 కల్లా 66 దేశాల నుంచి 1500 మంది పాల్గొన్నారు. ఇవి ఒక్క క్రీడాకారులనే కాదు పలురంగాల్లోని కళాకారులందరినీ ఏకం చేస్తోంది. ఈ సంబరాల్లో ఒక్క ఆటలే కాదు.. కిర్గిజ్స్తాన్ కల్చర్, ఫుడ్, ఆర్ట్స్, షాప్స్ అన్నీ తరలి వస్తాయి. వందల సంఖ్యలో యర్త్ హోమ్స్ వెలసి.. ప్రపంచ అతిథులకు ఆతిథ్యాన్నిస్తాయి. ఆ సమయంలో ఇసిక్ కుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకూడని ఈవెంట్ ఇదని స్థానికులు అంటారు. ఇసిక్ కుల్ నుంచి వచ్చాక ఒకరోజు బిష్కేక్ పొలిమేరలో పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ నడిపిస్తున్న ఓ రష్యన్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాం. అతని పేరు దినేశ్. అరే.. ఇండియన్ నేమ్ అని మేం ఆశ్చర్యపోతుంటే.. అతను నవ్వి.. యూఎస్సెస్సార్లో బాలీవుడ్కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ ప్రభావంతోనేమో తనకు దినేశ్ అనే పేరుపెట్టారని చెప్పాడు. నిజమే అక్కడ మాకు కుమార్ అనే పేరూ కామన్గా వినిపించింది. బిష్కేక్లో మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్టల్స్లో ఉండి చదువుతున్న భారతీయ వైద్యవిద్యార్థుల కోసం పాలు, చికెన్, కూరగాయలను సప్లయ్ చేయడం కోసమే తను ప్రత్యేకంగా డెయిరీ, పౌల్ట్రీ ఫామ్లను నడుపుతున్నాని, కూరగాయలను సాగు చేస్తున్నాని చెప్పాడు దినేశ్. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ మిస్సింగ్.. ఉన్న వారంలో చలి.. ఎండ.. వాన మూడు కాలాలనూ చూపించింది కిర్గిజ్స్తాన్. ఎండ, వాన ఉన్నా చలి కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ వెదర్.. చిన్నపిల్లలమైపోయి మంచులో ఆటలు.. స్కీయింగ్, రోప్ వే సాహసాలు.. కిర్గిజ్, రష్యన్ మాటల్ని నేర్చుకోవడం.. వాళ్ల క్రమశిక్షణకు అబ్బురపడటం.. ఆ ప్రశాంతతను ఆస్వాదించడం.. ఉన్నదాంట్లో తృప్తిపడుతున్న వాళ్ల నైజానికి ఇన్స్పైర్ అవడం.. అక్కడి ఆడవాళ్ల సాధికారతకు గర్వడటం.. మొత్తంగా కిర్గిజ్స్తాన్ మీద బోలెడంత గౌరవంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం! కానీ ఒక్క అసంతృప్తి మిగిలిపోయింది. జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు వంటి ఎన్నో పుస్తకాలతో ఎప్పుడో కిర్గిజ్స్తాన్ని పరిచయం చేసిన చెంఘిజ్ ఐత్మతోవ్ని కలిపే ఆయన మ్యూజియాన్ని చూడలేపోయామని! బిష్కేక్లో ఉందా మ్యూజియం. దాంతోపాటు కిర్గిజ్స్తాన్ హిస్టరీ అండ్ ఆర్ట్స్కి సంబంధించిన మ్యూజియమూ ఉంది. ఇదీ చూడలేదు.. సమయాభావం వల్ల! ఐత్మతోవ్ పుట్టిన నేల మీద నడయాడమన్న కాస్త ఊరటతో కిర్గిజ్స్తాన్కి సలామత్ బొలుప్ జక్ష్య (ఇప్పటికి వీడ్కోలు)! ఎప్పుడైనా స్ప్రింగ్లో ఒకసారి కిర్గిజ్స్తాన్ను చూసి.. ఐత్మతోవ్ని పలకరించాలని ఆశ! రహమత్ .. స్పసీబా.. థాంక్యూ! — శరాది ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
Cover Story: ఆ ఖాళీ సమాధి యేసు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యం!
‘‘యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూడవనాడు లేచెన్.. లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయమొంది.. మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్.. జయం జయం’’ అంటూ రాబర్ట్ లౌరీ వ్రాసిన పాటను గొంతెత్తి పాడే సమయం ఈస్టర్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం ఝెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ‘‘ఆ కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతడిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు’’ ఈ మాటలను చరిత్రకారుడు ఫ్లావియస్ జోసఫస్ తన పుస్తకంలో వ్రాశాడు. ఆయన రాసిన సంగతులు నేటికీ చరిత్రకు ఆధారంగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జన్మను, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ధ్రువీకరించాడు. ‘‘యేసుక్రీస్తు నిజంగా జీవించి, మరణించి, మృతులలో నుండి లేచాడన్న తమ దృఢ విశ్వాసము కొరకు వారు శ్రమపడి మరణించారు’’ అని సుటోనియస్ అనే చరిత్రకారుడు వ్రాశాడు. ఇతడు రోమా చరిత్రకారుడు. హేడ్రియన్ అనే రాజు వద్ద అధికారిగా పనిచేసేవాడు. చరిత్రకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తన వ్రాతలలో పొందుపరచాడు. రోమన్ చక్రవర్తులైన జూలియస్ సీజర్ నుండి డొమీషియన్ వరకు గల 12 మంది చక్రవర్తుల జీవిత చరిత్రలను వ్రాశాడు. రోమా సామ్రాజ్యంలోని రాజకీయాల గూర్చి, కవులను గూర్చి, సామాన్య ప్రజలను గూర్చి చాలా విషయాలు వ్రాసి భద్రపరచాడు. మొదటి శతాబ్దంలో రగిలిన ఉజ్జీవాన్ని, సంఘం పొందిన శ్రమలను, ధైర్య విశ్వాసాలతో పరిస్థితులను ఎదుర్కొన్న దేవుని ప్రజల పరిస్థితిని సుటోనియస్ వివరించుట ద్వారా యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదని, ఆయన మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి మూడవ రోజున తిరిగిలేచిన సజీవుడని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి దోహదమయ్యింది. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. సి.ఎస్.లూయీ అనే సుప్రసిద్థ సువార్తికుడు, వేదాంతవేత్త ఇలా అంటాడు. ‘‘యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే అని చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధీకుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతి స్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ట బోధలు చేసియుండేవారు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు.’’ తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని, అయన ప్రేమతత్త్వాన్ని తాను రచించిన ఎనిమిది వేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ట బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది. సమాధి ఆయనను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్ళు విడచుట మానండి ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’’ ఈ మాటలను తన హృదయాంతరాళాల్లోంచి వ్రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువు చేసింది క్రాస్బీ. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ‘‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు’’– (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఝెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం ఝెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకసార్లు తన శిష్యులకు ఇలా చెప్పాడు. ‘‘మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను’’– (లూకా 18:3133). క్రీస్తు తనకు సంభవింపబోవు వాటిని ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తుకు పొంతి పిలాతు అనే రోమన్ గవర్నర్ ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తిని తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈ నాటికి ఝెరూషలేమునకు వెళ్ళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గములో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫనిషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. యేసు సిలువను మోసుకొంటూ గొల్గొతా అనే ప్రాంతాన్ని చేరుకోగానే ఆయనను సిలువపై ఉంచి చేతులలోను కాళ్ళలోను మేకులు కొట్టి వేలాడదీశారు. శుభ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు యేసును సిలువవేశారు. సుమారు ఆరు గంటలు యేసు సిలువపై వ్రేలాడి ఏడు మాటలు పలికారు. నేటికి అనేకమంది సిలువలో క్రీస్తు పలికిన యేడు మాటలను ధ్యానం చేస్తుంటారు. పలుకబడిన ఒక్కోమాటలో ప్రపంచానికి కావల్సిన అద్భుతమైన సందేశం ఉందని క్రైస్తవులు విశ్వసిస్తారు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను అంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. అంతవరకు తనలో గూడుకట్టుకున్న భయాన్ని వదిలి పిలాతు దగ్గరకు వెళ్ళి తన ప్రభువును పాతిపెట్టడానికి అనుమతి కోరాడు. సిలువ వేయబడిన ఒక వ్యక్తికోసం మహాసభ సభ్యుడైన అతడు బహిరంగంగా తీసుకొన్న తన నిర్ణయం వలన పిలాతుకు కలిగిన ఆశ్చర్యం, యూదులకు కలిగిన అసహనం ఊహించవచ్చు. యోసేపు తనకోసం తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ‘‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గురించి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ, మరణపు ముల్లును విరిచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది గెలుపు. ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని ఇచ్చేది. భూమ్మీద బతికే అందరికి ముఖ్యమైనది కూడా. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం వల్ల దక్కిన సంతృప్తితో కాలం గడపాలని కోరకుంటాడు. ఓటమి అంగీకరించడం చేదైన విషయమే! మింగుడు పడని వ్యవహారమే! ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో.. ఇంకా మరెన్నో! ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే ఇంత సంతోషంగా మానవుడుంటే, ప్రతి మనిషికి ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే?! మృత్యువునే గెలిస్తే?! ఇంకెంత ఆనందం, ఇంకెంత ఉత్సాహం! సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణం మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరినీ తన గుప్పిట్లో బంధించిన మరణం మరణించింది. అసలు ఈ పుట్టుకకు, మరణానికి, దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికి అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. గొప్పవ్యక్తులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బాబిలోను రాజైన నెబూకద్నెజర్ మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికి అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోమ్లో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ఋజువు చేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్లతరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తర్వాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి, ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోనికి తీసుకొచ్చారు గాని, వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు.. స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలను ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా! సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని, చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షంలోనే యేసుకు మేకులు కొట్టబడ్డాయి. ముళ్ళకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియ అంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ‘ఆ నీతిమంతుని జోలికి పోవద్దు’ అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్ను కలుసుకుని, ఇలా అడిగింది ‘‘సిలువలో మరణించిన క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి? ఆ మహనీయుని గురించి ఏమనుకుంటున్నావు?’’ ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పై నుండి కిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరతాడు. ఈసారి ఆయనను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనిషికి సమాధానం, ధైర్యం, నిరీక్షణ అనుగ్రహించబడ్డాయి. సమాధానం.. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి శిష్యులకు ఆదివారం సాయంత్రం పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమయ్యాడని అపొస్తలుడైన యోహాను తన సువార్తలో వ్రాశాడు. శిష్యులంతా ఇంటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ‘మీకు సమాధానం కలుగునుగాక’ అని వారితో చెప్పెను. మూడున్నర సంవత్సరాలు తనతో ఉండి గెత్సేమనే తోటలో తనను పట్టుకుంటున్నప్పుడు విడిచి పారిపోయిన వారిని బహుశా ఎవరైనా చీవాట్లు పెడతారేమో గాని ప్రేమపూర్ణుడైన ప్రభువు వారి స్థితిని సంపూర్ణంగా తెలుసుకున్నవాడై వారికి శాంతి సమాధానాలను ప్రసాదించాడు. సమాధానకర్తయైన ప్రభువును హృదయాల్లోనికి ఆహ్వానించడమే ఆశీర్వాదకరం. ఈనాడు అనేకులు తమ పరిస్థితులను బట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్యహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే! నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూసి ఇలా అన్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’’ ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. గెలుపుబాటలో దూసుకుపోయారు. భయపడకుడి.. ఆదివారం ఉదయం తెల్లవారకముందే కొంతమంది స్త్రీలు క్రీస్తు సమాధిని చూడడానికి వచ్చారు. వారక్కడికి వచ్చినప్పటికే ఒక గొప్ప భూకంపం వచ్చింది. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి సమాధిరాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అక్కడ ఉన్న రోమా కావలివారు వణికి చచ్చినవారివలె ఉన్నారు. వారు భయపడాల్సింది ఏదీలేదనే వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. లోకమంతా ఎన్నో భయాలతో నిండింది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, ఇంకా ఎన్నో సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వదు. గమ్యంవైపు సాగనివ్వదు. భయం గుప్పిట్లో జీవిస్తున్న మనిషికి నిజమైన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్నది లేఖన సత్యం. నిరీక్షణ.. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని కొనసాగించువారికి నిత్యజీవాన్ని అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై ఉండకని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు మనకున్న నిరీక్షణ ఎన్నడూ అవమానకరము కాదు. ‘‘విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువును గెలిచి నేడు వేంచెసె యజమానుడెల్ల ప్రయాసములు ఎడబాప స్వజనులను రక్షింప సమసె సిలువమీద... విజయంబు మానవుల పాపము నివృత్తిని విభుడొనరింపన్ కుజనులచే అతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువునుండి విజయుండై వేంచేసె’’ అంటూ కీర్తనలు పాడుచూ క్రీస్తు పునరుత్థానమును ఆధ్యాత్మిక ఆనందంతో, నిండు హృదయంతో దేవుని ప్రజలంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. (సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు). — డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి ఇవి చదవండి: Funday Story: 'ఋతధ్వజుడు మదాలసల గాథ' -
నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!
నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి. అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది. అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది. కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు.. ► గత ఏడాది రంజాన్ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి. ► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్–19’కు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి. ‘కోవిడ్’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్ అని, చైనా ఇంటెలిజెన్స్ అధికారి దీనిని లీక్ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్ పత్రిక 2019లో ఫిలోవైరస్పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది. ఒక టీవీ చానల్ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్ను కరోనా వైరస్కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్’ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి. ► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి. ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు. ► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి. నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్ కమిటీ డైరెక్టర్ ఓలావ్ ఎన్జోస్తాద్ ఈ కథనాలను ఖండించారు. ► పాకిస్తాన్లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్లోని సంతోష్ నగర్ దరాబ్జంగ్ కాలనీ మస్జిద్ ఏ సలార్ ముల్క్కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు. ► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్ చానల్ 1962 నాటి భారత్–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్ చానళ్లు తైవాన్ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి. ► పాకిస్తాన్ పార్లమెంటు 2020 అక్టోబర్ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్.. ఓటింగ్’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి. అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్ సబ్ కుఛ్ హోగా, సబ్ కుఛ్ హోగా, సబర్ రఖియే ఆప్’ (ఓటింగ్ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్ ఏమిటంటే ‘మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి. పత్రికల ‘పచ్చ’కామెర్లు ► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్ న్యూస్’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్ న్యూస్’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్ డిజార్డర్’– సమాచార జాడ్యం, ‘మాల్ ఇన్ఫర్మేషన్’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు. అప్పట్లో అమెరికాలో విలియమ్ రాండాల్ఫ్ హర్ట్స్ నడిపే ‘న్యూయార్క్ జర్నల్’లో రిచర్డ్ ఔట్కాల్ట్ ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ వేసేవాడు. ‘న్యూయార్క్ జర్నల్’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి ► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి. గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్లోని ‘తొలి వాట్సాప్ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్’ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది. ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్బుక్’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది. ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!! -
థింక్ ట్యూన్ అప్
‘ఆలోచనను బట్టే ఆచరణ, ఆచరణను బట్టే కర్మఫలం’ ప్రతిదానికీ ఆలోచనే మూలం. అందుకే ఒక మనిషి మనుగడకు ప్రాణవాయువు, అన్నపానీయాలు ఎంత అవసరమో ఆలోచించడం కూడా అంతే అవసరం. నిజానికి మనిషిని సమస్తజీవకోటి నుంచి వేరు చేసిందే ఆలోచన. మానవాళి మనుగడకు మార్గం వేసేదే ఆలోచన. మరి అలాంటి ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ‘మంచి ఆలోచనకు మించిన మనుగడ లేదు, చెడ్డ ఆలోచనకు పోలిన చావు లేదు’ అంటారు పెద్దలు. అవసరాన్ని బట్టి బుద్ధికుశలతను ఉపయోగించడం, పరిస్థితిని బట్టి వివేకంగా వ్యవహరించడం, సందర్భానుసారంగా విచక్షణతో నడుచుకోవడం, క్లిష్టమైన సమయాల్లో కూడా జ్ఞానాన్ని ప్రదర్శించడం.. ఇవన్నీ ఆలోచన పరిధికి గుణకారాలే! అయితే అందుకు సాధన ఎంతో అవసరం. థింక్ ట్యూన్ అప్ ట్యూన్ అప్ అంటే స్వరాన్ని పెంచడం.. లేదా అడ్జస్ట్ చేసుకోవడం. సాధారణంగా రేడియోకో.. ఇయర్ ఫోన్ కో, బ్లూటూత్కో ఉండే ట్యూన్ బటన్ ని మనకు తగ్గట్టుగా.. మనకు కావాల్సినట్లుగా సెట్ చేసుకుంటాం. మరి మది ఆలోచల్ని ఎలా ట్యూన్ అప్ చేసుకోవాలి? మనసు స్వరాల్లో మంచి స్వరాన్ని ఎలా ఎంచుకోవాలి? ఎలా పెంచుకోవాలి? ‘ఒక సీసా నిండా గాలి ఉన్నప్పుడు అందులోని గాలిని బయటకు పంపాలంటే, ఆ సీసాలో నీళ్లు నింపడమే మార్గం. అలాగే మనసులోని ప్రతికూల భావాలు ఆవిరైపోవాలంటే, మనసు నిండా సానుకూల ఆలోచనలను పెంచుకోవాలి. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్.. ఈ రెండింటికీ ప్రభావవంతమైన శక్తులు ఉంటాయని, మనం దేన్ని నమ్ముతామో అదే జరుగుతుందని చెబుతారు సానుకూలపరులు. ‘సే సమ్థింగ్ పాజిటివ్ అండ్ యు విల్ సీ సమ్థింగ్ పాజిటివ్’... ‘మంచి గురించి మాట్లాడితే, మంచే కనిపిస్తుంది’ అని దీని అర్థం. అంటే మాట మంత్రంలా పని చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వైర్లెస్గా పనిచేస్తాయి. ఇక్కడే ఆధ్యాత్మికతకు.. శాస్త్రీయతకు పొంతన కుదురుతుంది. మనస్సుకు ఆహారం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, మనసు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మంచివాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని మాత్రమే కోరుకోవాలి. అందుకే ‘మంచి ఆలోచనలే మనసుకు మంచి ఆహారం’ అంటారు మానసిక నిపుణులు. ఒక మంచి విషయాన్ని మనం బలంగా నమ్మితే, ప్రపంచం మొత్తం ఆ కోరికను నిజం చేయడానికి కుట్ర చేస్తుందట. అంటే ప్రకృతి ఆజ్ఞతో.. తెలియకుండానే చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు మనకు సహకరిస్తారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటే, జీవితం సాఫీగా సాగుతుంది. మనసులో తలెత్తే అపోహలు, భయాలు, ప్రతికూల భావాలకు వ్యతిరేకంగా, మంచి సంకల్పాలను మనంతట మనమే సృష్టించుకోవాలి. ఉదయం లేవగానే.. ‘ఈ రోజు నాకు మంచి జరుగుతుంది. ఈ రోజు చాలా బాగుంటుంది’ అని మనసును ఉత్తేజపరచేలా ప్రకృతికి చెప్పడం నేర్చుకోవాలి. ‘ఎందుకొచ్చిన జీవితంరా సామీ?’ అంటూ ఏడుస్తూ నిద్రలేస్తే ఆ రోజు మొత్తం అంతే అసంతృప్తిగా ముగుస్తుందట. ఆలోచనలతో ఆరోగ్య ప్రయోజనాలు సానుకూల ఆలోచనలతో.. ప్రమాదకరమైన జబ్బుల్ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆశావాద దృక్పథం ఉంటే.. అది తీవ్ర అనారోగ్యాలను సైతం అరికడుతుందట. రొమ్ము క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, మానసిక రుగ్మతలు ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సమూలంగా తగ్గించే గుణం.. కేవలం సానుకూల ఆలోచనలకే ఉందట. ‘నాకేం కాదు’ అనే సంకల్పంతోనే బతికి బయటపడుతున్నారట. అందుకే ‘పాజిటివ్ థింకింగ్.. మెరుగైన రోగనిరోధక శక్తి’ అంటున్నారు నిపుణులు. పాజిటివ్ థింకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? 1. ప్రతిక్షణం ఆలోచనలను గమనించుకోవాలి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవడం నేర్చుకోవాలి. ప్రతికూలమైన ఊహలు కలిగినప్పుడు.. నిట్టూర్పులను పక్కన పెట్టి.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా తీసుకుని.. మళ్లీ మనసుకు అనుకూలమైన ఊహలను రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎలాగంటే.. మనకు బాగా ఇష్టమైన మనిషికి ప్రమాదం జరిగి ఉంటుందేమో? అని మనసు భయపడుతుంటే, దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి. ఆ మనిషి తిరిగి మీ కళ్ల ముందుకు వచ్చినట్లుగా, తనతో మీరు చెప్పాలనుకున్న కొన్ని మాటలుచెబుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ వైబ్రేషన్సే నిజంగా జరగబోయే ప్రమాదం నుంచి సైతం ఆ మనిషిని కాపాడే అవకాశం ఉంటుంది. 2. కృతజ్ఞతతో కూడిన ఆలోచనలు కూడా మనిషిని సానుకూలంగా మారుస్తాయి. మనసులోని క్రూరత్వాన్ని, అహంకారాన్ని పక్కకు నెడతాయి. ఇప్పటి దాకా సాఫీగా సాగుతున్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. మీతో పాటు పని చేసే ల్యాప్టాప్కి మీరెప్పుడైనా థాంక్స్ చెప్పారా? మిమ్మల్ని గమ్యానికి చేర్చే వాహనాన్ని మీరెప్పుడైనా కృతజ్ఞతా భావంతో చూశారా? వింతగా అనిపించినా ఇది నిజం. ప్రయత్నించి చూస్తే ఫలితం అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రపంచంలోని చాలా మతాలు చలనం లేని వస్తువుకు కూడా ప్రాణం ఉంటుందని నమ్ముతాయి. హిందూమతంలో యంత్రపూజ కూడా ఆ కోవకే వస్తుంది. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక ఎనర్జీ అక్కడుందని భావించి, బలంగా నమ్మితే.. దాని కిరణాలు మీ మదిని తాకుతాయి. అదే ‘యద్భావం తద్భవతి’ అనే నానుడిలోని సారాంశం. 3. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రతికూలమైన ఆలోచనలే చుట్టుముడతాయి. అప్పుడు సానుకూలమైన ఆలోచనలను ప్రేరేపించడానికి మనసులోనే చర్చ జరగాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. అలాంటి చర్చ మదిలో జరిగితే.. ఒత్తిడి మాయమవుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. 4. ప్రతిక్షణం క్షమాగుణంతోనే ఆలోచించాలి. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందనే నిజాన్ని గ్రహించుకోవాలి. చాలాసార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి, మనల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. అందుకే శత్రువుకు కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోమంటారు కొందరు జ్ఞానబోధకులు. మంచి మార్గం ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామాలు, ధ్యానం, యోగాలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడంతో పాటు.. పాజిటివ్ సంకల్పాలు స్వయంగా రాసుకుని, చదువుకోవడం అలవరచుకోవాలి. దాని వల్ల కూడా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాంటి సంకల్పాలతో పాజిటివిటీని అందిపుచ్చుకునే ఎన్నో మార్గాలు నెట్టింట దొరుకుతూనే ఉన్నాయి. వాటిల్లోంచి అనుకూలమైన మార్గాన్ని ఎన్నుకుని అనుసరించొచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన మనిషి ఆలోచనా విధానాన్ని మూడు రకాలుగా విభజించాడు. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే పేర్లతో ఆలోచనా తీరును వివరించాడు. ఇడ్: ఈ ఆలోచన మనిషి మనసులో అచేతనావస్థలో ఉంటుంది. ఇది నైతిక విలువలను పాటించదు. నియమాలు, తప్పొప్పులు దానికి తెలియవు. మనసులో కలిగే కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా మనిషిని తొందరపెడుతుంది. ఎక్కువ స్వార్థ చింతనతో ఉంటుంది. ఇగో: ఈ ఆలోచన చేతనావస్థలో ఉంటుంది. ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. వాస్తవాలను గ్రహించి.. సమయానుకూలంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సూపర్ ఇగో: ఇదే మనిషి అంతరాత్మ. నైతిక, సామాజిక విలువలను కచ్చితంగా పాటిస్తుంది. ఇగోకు మంచి చెడులను గుర్తు చేసి.. సాంఘిక ఆచారాలను పాటించేట్లు చేస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి ఇది మరింత పరిణతి పొందుతుంది. ఇది ఎక్కువగా నైతిక సూత్రాలపై ఆధారపడి అడుగులు వేస్తుంది. ఉదాహరణకు.. ‘దొంగతనంగా సినిమాకు వెళ్దాం’ అని ఇడ్ ప్రోత్సహిస్తే.. ‘దొంగతనంగా ఎలా వెళ్లొచ్చో?’ ఆలోచిస్తుంది ఇగో. కానీ ‘దొంగతనంగా వెళ్లడం సరికాదు, తప్పు, ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది, దాని వల్ల మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది’ అని హెచ్చిరిస్తూనే నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది సూపర్ ఇగో. ఇలా మనిషి ఆలోచన సరళిని విశ్లేషించాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్య్ర సమరయోధులు, కట్టుబాట్లపై, మూఢత్వాలపై తిరుగుబాటు చేసిన సంఘసంస్కర్తలు.. వీళ్లంతా ఉన్నతమైన ఆలోచనాపరులే. గొప్ప ఆలోచనల నుంచి ఉద్భవించిన కొన్ని సూక్తులు ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. దయతో జీవించండి, ఎవరినీ ఎప్పుడూ నిరుత్సాహపరచకండి. ఎవరు ఎంత తక్కువగా కనిపించినా.. ఏదో ఒకరోజు పురోగతిని సాధిస్తారు. -ప్లేటో చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం -రవీంద్రనాథ్ టాగోర్ ప్రేమ, స్నేహం, ఆగ్రహం, కరుణలతో ఇతరుల జీవితానికి విలువను ఆపాదించినంత కాలం.. మీకు కూడా విలువ ఉంటుంది -సిమోన్ ది బూవా మొదట అర్థం చేసుకోలేకపోతే.. దేన్నీ ప్రేమించలేరు, దేన్నీ ద్వేషించలేరు. ∙ఇబ్బందుల్లో కూడా నవ్వగల వారిని నేను ప్రేమిస్తున్నాను, నేర్చుకోవడానికి మనసు ఎప్పటికీ అలసిపోదు. -లియోనార్డో డా విన్సీ ‘చెయ్యాల్సిన పని పట్ల అవగాహన లేకపోతే.. భయపడటం పరిష్కారం కాదు.. నేర్చుకోవడమే మార్గం’ -ఐన్ రాండ్ మేధస్సుకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. -అల్బర్ట్ ఐన్ స్టీన్ సమానత్వంలోనే ధర్మం వర్ధిల్లుతుంది. స్త్రీ హక్కులను పంచుకోనివ్వండి. ఆమె పురుషుల ధర్మాలను కూడా అనుకరిస్తుంది. ఎందుకంటే విముక్తి పొందినప్పుడు ఆమె మరింత పరిపూర్ణంగా ఎదగాలి. -మేరీ వోల్స్టోన్ క్రాఫ్ట్ శత్రువును రెచ్చగొడితే అది మనకే నష్టం. అందరినీ ప్రేమించండి, కొందరిని నమ్మండి, ఎవరికీ నష్టం చేయకండి -షేక్స్పియర్ ప్రపంచంలో ప్రభావవంతమైన ఆలోచనాపరులు ఈ మానవాళిలో ఎందరో ఆలోచనపరులు.. తమ కోసం కాకుండా ప్రపంచం కోసం ఆలోచించారు. అందుకే నేటికీ ఆదర్శంగా నిలిచారు. ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు కాళోజీ. కానీ తమ ఒక్క ఆలోచనతో కోట్లాది ప్రజలను కదల్చగలిగారు ఎందరో విశ్లేషకులు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వంటి గ్రీకు తత్వవేత్తలతో పాటు.. డార్విన్ , కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి వారు తమ ఆలోచనలతో చరిత్ర గమనాన్ని మార్చారు. డార్విన్ మనుషుల్లోని మూఢనమ్మకాలను చెదరగొడితే.. కార్ల్ మార్క్స్.. మనిషి బతకడం ఎలానో నేర్పించారు. చార్లెస్ డార్విన్ ఈయన ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పులను తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్విన్ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. కార్ల్ మార్క్స్ ఈయన ఆలోచనలను, సిద్ధాంతాలను కలిపి సమష్టిగా.. ఈ ప్రపంచం ‘మార్క్సిజం’ అని పిలుస్తోంది. ప్రతి అంశంలోనూ న్యాయమైన వాదన వినిపించిన ఆలోచనాపరుడు కార్ల్ మార్క్స్. పిల్లలు పనికి పోకూడదని, బడికి వెళ్లాలని వాదిస్తూ భావితరాల గళం అయ్యాడు. ‘ఎంతసేపు ఉద్యోగమే కాదు.. మనిషికి వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకూ ఇష్టాయిష్టాలు ఉండాలి. జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి’ అనే కాంక్షను బలపరచింది మార్క్సిజం. మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి చాలా అవసరమని చెప్పింది ఈయనే. మార్పుకి ప్రజలే ప్రతినిధులు అనే మార్క్స్ రాతలతోనే.. ప్రపంచరూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వాలపైన, మీడియాపైన ఓ కన్ను వేస్తూ ఉండాలని ప్రజలకు తెలిపింది మార్క్సిజం. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? న్యాయాన్యాయాల మధ్య నిలిచే అశాంతి నేటి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మనిషి ఆలోచనాశక్తిని కుంగదీస్తోంది. బలవంతుడు అన్యాయం చేసి గెలిస్తే, బలహీనుడు మరో నలుగురు బలహీనుల సాయం తీసుకుని వాడిపై గెలవగలడట. మనం ఎంతటి బలవంతులమైనా ఆలోచనలో సవరణలు, సడలింపులు లేకపోతే పతనం వెన్నంటే ఉంటుంది. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె’ అన్న సుమతీ శతకం చెప్పే నీతి అదే! ఆవు–పులి కథ ఒకనాడు మేత కోసం అడవికి వెళ్ళిన ఓ ఆవు పెద్దపులి కంటపడుతుంది. వెంటపడిన ఆ పులి తనని తినబోతుంటే.. ‘నీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టమే కాని, నాకు కొంత సమయం కావాలి’ అని వేడుకుంటుంది ఆవు. ఆవు కన్నీళ్లు చూసి కరిగిన పులి.. ‘సమయం దేనికి?’ అని అడుగుతుంది. ‘ఇంటి దగ్గర పాలకు ఏడ్చే నా బిడ్డ ఉంది. దానికి కడుపు నిండా పాలిచ్చి, మంచి చెడు చెప్పి వస్తాను’ అంటుంది ఆవు. మొదట అనుమానించిన పులి చివరికి ఒప్పుకుని పంపిస్తుంది. ఆవు అన్న మాట ప్రకారం చెప్పిన సమయానికి వచ్చి.. ‘ఇక నన్ను తిను’ అంటుంది. ఆవు నిజాయితీకి మెచ్చిన పులి జాలితో ఆవును విడిచిపెట్టేస్తుంది. చిన్నప్పుడు ఈ ‘ఆవు–పులి’ కథ వినే ఉంటారు. ఈ కథలో ఆవు మంచిది. మాట మీద నిలబడింది. ఆవులో కన్నతల్లి ప్రేమ, ఇచ్చిన మాటకోసం ప్రాణాలను త్యాగం చేసేంత ఔదార్యం, కష్టాన్ని మొరపెట్టుకోగలిగేంత వినయం.. ఇలా మనిషి నేర్చుకోదగ్గ ఎన్నో గొప్ప సత్యాలు ఉన్నాయి. కానీ, కథలో ఉన్న నీతి అక్కడి వరకే అనుకుంటే పొరబాటు. కథలో నిజమైన హీరో పులి. పులి స్వతహాగా బలమైన ప్రాణి. దానికి ఆవు మాట వినాల్సిన అవసరమే లేదు. కానీ.. ఆవుకి దాని ఆవేదన చెప్పుకునే సమయాన్నిచ్చింది. ఆకలితో ఉన్న తన బిడ్డ దగ్గరకు ఆవు వెళ్తానంటే నమ్మి.. పంపించింది. తిరిగి వస్తే.. ఆ నిజాయితీని మెచ్చి జాలితో విడిచిపెట్టింది పులి. ఈ రోజు ప్రతి బలవంతుడు నేర్చుకోవాల్సిన నీతి ఇది. ఆలోచించాల్సిన తర్కమిది. పులికి పంజా విసరగలిగే సత్తా ఉంది. అంతకు మించి.. అవకాశం ఉంది, బలంతో కూడిన అధికారం ఉంది, తినాలనేంత ఆకలుంది, ఏం చేసినా ప్రశ్నించలేని నిస్సçహాయత ఆవు రూపంలో ఎదురుగా ఉంది. అయినా పులి ఆలోచించింది. అదే నైతికతంటే. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలో మన చేత్లులోనే ఉంది. కాదు కాదు మన ఆలోచనల్లోనే ఉంది. స్వచ్ఛమైన మనసులో చెలరేగే ఊహలను ఈ విశ్వం చెవులారా వింటుందట. మరింకెందుకు ఆలస్యం? సానుకూలమైన ఆలోచనలను శాంతి పావురాల్లా ఎగరనివ్వండి -సంహిత నిమ్మన -
ప్రయాణంతో చలి కాచుకుందాం!
'One must travel to learn' అంటాడు మార్క్ ట్వయిన్. 'To travel is to evolve' అంటాడు పియర్ బెర్నార్డో. ఎప్పటికప్పుడు కొత్త పరిసరాలు తద్వారా కొత్త విషయాలు తెలుస్తుంటేనే బుద్ధి వికసిస్తుంది. దీనికి ప్రయాణాన్ని మించిన గురువు లేడు. భ్రమణ కాంక్షను మించిన సిలబస్ లేదు. వారం, వర్జ్యం, సౌకర్యం చూసుకోకుండా బ్యాక్ ప్యాక్తో ట్రావెల్ని ప్లాన్ చేసుకునేళ్లను మించిన అదృష్టవంతుల్లేరు. ఆర్ట్ మూవీ ప్లాట్కి ఆ లీడ్ లైన్స్ పక్కాగా సూట్ అవుతాయేమో కానీ.. స్కూల్స్, ఆఫీసెస్, టార్గెట్స్, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వంటి ప్రాక్టికల్ ఫ్రేమ్స్లో స్కెడ్యూల్ అయిన లైఫ్లో అస్సలు సాధ్యపడవు! కదా..! అందుకేగా వెకేషన్స్ ఉన్నాయి! ఆ అకేషన్ బహానాతో పిల్లలు, పెద్దలు అందరూ వాళ్ల వాళ్ల అభిరుచికి అనుగుణంగా ట్రావెల్కి ట్రాన్స్పోర్ట్ వెదుక్కోవడమే! ‘అమ్మో చలిలోనా..’ అంటూ ముడుచుకోకండి. తేమ తుంపరలతో రొమాంటిక్ టచ్ని.. హేమంత తుషారాలతో చిలిపిదనాన్ని.. పొగమంచుతో దాగుడు మూతల అల్లరిని.. వణుకుతో ఆకతాయితనాన్ని తలపిస్తూ .. ఎంత గమ్మత్తుగా ఉంటుందని! ప్రయాణానికి ఇంతకు మించిన వాతావరణం ఉంటుందా? పైగా మన దేశంలో ట్రావెల్కి అనుకూలమైన సమయం (సెప్టెంబర్ నుంచి ఎప్రిల్ అంటారు) కూడా ఇదే! వీపున బ్యాక్ ప్యాక్ చేర్చి .. తలను క్యాప్తో కవర్ చేసి .. చేతులను జర్కిన్లో దూర్చి.. పాదాలను షూతో కప్పి చక్కగా దొరికిన కమ్యూట్తో కమ్యూనికేట్ అయ్యి కోరుకున్న ప్లేస్కు చేరుకోవచ్చు! ప్లేసెస్ ఏంటీ అంటారా? బ్యాగ్ నిండేన్ని! లిస్ట్ చూసుకుని.. సేవింగ్స్ అకౌంట్తో మ్యాచ్ అయ్యేలా కస్టమైజ్ చేసుకుని స్టార్ట్ అవడమే! సెలవులంతా కాకుండా.. సంక్రాంతి పండగకల్లా మళ్లీ ఇల్లు చేరాలి అనుకుంటే.. ఆ లిమిటిడెట్ హాలిడేస్కి తెలంగాణ వాళ్లకు ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రులకు తెలంగాణ పర్ఫెక్ట్ ప్లేసెస్. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కనున్న అనంతగిరి, ఆమ్రబాద్, నాగార్జునసాగర్ నుంచి వరంగల్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన రామప్ప, ఆదిలాబాద్ కవ్వాల్ ఫారెస్ట్, కాళేశ్వరం, జోడే ఘాట్ వంటివెన్నో చూడొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నుంచి కోనసీమ, వైజాగ్, బొర్రా కేవ్స్, అరకులోయ, లంబసింగి, రాయలసీమ మహానంది, లేపాక్షి, యాగంటి, బెలూం కేవ్స్, గండికోట, హార్సిలీ హిల్స్ లాంటి పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్క రాష్ట్రాల్లో అయితే బోలెడున్నాయి. ముందు మహారాష్ట్రకి వెళితే.. వెస్టర్న్ ఘాట్స్ అందాలకు ముగ్ధులవొచ్చు. ఈ పశ్చిమ కనుమల ఒళ్లోని స్ట్రాబెరీ తోటల పంచ్గని, పూల వనం కాస్ ప్లాటూ, కృష్ణా నది జన్మస్థానం మహాబలేశ్వర్, లోనావాలా, పుణె, ముంబై, సముద్ర తీరాలు.. రాజ కోటల నిలయం అలీబాగ్.. జనవరిలో అక్కడ జరిగే నారియల్ పానీ మ్యూజిక్ ఫెస్టివల్, ద్రాక్ష తోటలతో.. వైన్ లవర్స్కి భూతల స్వర్గమైన నాసిక్, ఔరంగాబాద్, దౌలతాబాద్ రంగుల కళ అజంతా, శిల్పాల ఎర ఎల్లోరా ఎట్సెట్రా అన్నీ పర్యటించాల్సిన ప్రాంతాలే. పుదుచ్చేరికి.. ఫ్రెంచ్ వీథులు, ఫ్రెంచ్ భవనాలు, ఫ్రెంచ్ సంస్కృతి, అరబిందో ఆశ్రమం, అందమైన బీచ్లతోపాటు పర్యాటకులను ప్రేమలో పడేసే మరెన్నో రొమాంటిక్ స్పాట్స్ ఉన్నాయిక్కడ. అంతేకాదు ఫ్రెంచ్ ఫుడ్.. వాటర్ స్పోర్ట్స్ మీ టైమ్ని క్వాలిటీగా మారుస్తాయి కచ్చితంగా! స్థానిక, వలస పక్షులకు నిలయమైన ఔస్టరీ (Ousteri Lake) లేక్ని అస్సలు మిస్ అవకూడదు. గోవాకు మళ్లితే.. సెలబ్రేషన్స్ కాపిటల్ ఆఫ్ ఇండియా ఇది. వార్మ్ వింటర్స్కి పర్ఫెక్ట్ అడ్రస్. అందుకే యూరప్ అంతా ఇక్కడే ఉన్నట్టుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రశాంతమైన బీచులు.. సందడి చేసే నైట్క్లబ్లు.. పగళ్లను తలపించే రాత్రుళ్లతో నిత్యం ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటుంది. లైఫ్ని ఒక సెలబ్రేషన్గా భావించేవాళ్లకు నచ్చకుండా ఉంటుందా గోవా! చలికాలమైతే అక్కడ పండగలే పండగలు.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి క్రిస్మస్ దాటి హోలీ దాకా! ఈ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే వింటర్లో గోవాను కచ్చితంగా విజిట్ చేయాల్సిందే! అక్కడున్న ఏ బీచ్లో అయినా సన్రైజ్.. సన్సెట్ని మిస్ అవకూడదు! కర్ణాటక చేరితే.. చారిత్రక కట్టడాలకు.. అలనాటి వైభోగాల జ్ఞాపకాలకు నిలయంగా ఉంటుందీ రాష్ట్రం. పశ్చిమ కనుమల సోయాగాలు, సముద్ర తీరాలు అదనపు ఆకర్షణలు. ఇదీ వింటర్ డెస్టినేషనే. గోకర్ణ బీచులు, జోగ్ జలపాతాలు, దైనందిన జీవితంలోని ఒత్తిడిని దూరం చేసి మంచు తెరల మధ్య ప్రశాంత వాతావరణంతో సేదతీర్చి.. కాఫీ తోటలతో ఆర్గానిక్ ఆహ్లాదాన్ని పంచే కూర్గ్.. అక్కడి నాగర్హోల్ నేషనల్ పార్క్ను చూడకుండా రావొద్దు. ఈ రాష్ట్రంలో.. యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన హంపీ మిస్ అవకూడని ప్రాంతం. దీన్ని చూడ్డానికి అనువైన సమయం డిసెంబర్, జనవరి నెలలు. ఏటా జనవరిలో హంపీ మహోత్సవ్ జరుగుతుంది. తోలు బొమ్మలాట.. నాట్య, సంగీత ప్రదర్శనలు.. క్రీడల సమ్మేళనమే ఈ ఉత్సవం. ఇక్కడి విరూపాక్ష గుడి, మాతంగా హిల్, విఠ్ఠల మందిరం, హజారా రామ గుళ్లను తప్పక దర్శించాలి. ఆ ఆనందంలో మైసూర్ని మరవొద్దు. నిజానికి దీన్ని దసరా సమయంలో చూడాలి. కానీ అప్పటి రద్దీని దృష్టిలో పెట్టుకుని వెళ్లని.. వెళ్లలేని వాళ్లు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. దేశంలోని రాయల్ సిటీస్లో ఇదొకటి. మైసూర్ ప్యాలెస్, కళాత్మకమైన పెయింటింగ్స్, మైసూర్ జూ, చాముండేశ్వరీ ఆలయం, జగన్మోహన్ ప్యాలెస్ నుంచి చవులూరించే మైసూర్ పాక్ దాకా దేన్నీ వదిలిపెట్టడానికి వీల్లేదిక్కడ. బెంగళూరు నుంచి మంగళూరు దాకా విస్టడోమ్ ట్రైన్లో జర్నీ ఆస్వాదించి తీరాల్సిందే! తమిళనాడుకు వస్తే.. ఉక్కపోత, వేడికి పుట్టిల్లుగా ఉన్న తమిళనాడు చలికాలంలో పర్యాటకులకు వార్మ్ వెల్కమ్ చెబుతుంది. ఇండియా మొత్తానికి దీన్ని వింటర్ డెస్టినేషన్గా పేర్కొనొచ్చు. పశ్చిమ కనుమల్లో భాగమైన నీలగిరి కొండల్లోని మంచు ఛాయలు.. మధుమలై అడవులు.. ఏళ్లుగా కోలీవుడ్కే కాదు టాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్తోపాటు బాలీవుడ్కీ సౌకర్యవంతమైన ఔట్డోర్ షూటింగ్ స్పాట్గా ఉంటూ.. సర్కారు బడుల నుంచి కార్పొరేట్ స్కూల్స్ వరకు అన్నిటికీ ఎక్స్కర్షన్లో భాగమైన ఊటీ.. అక్కడి బ్రిటిష్ కాలం నాటి సెయింట్ స్టీఫెన్స్ చర్చ్, కాఫీ తోటలు, పల్లవుల రాజధాని మహాబలిపురం.. అక్కడి శిల్పాలు, గుహలు, బీచ్లు, మొసళ్ల ఫామ్, చోళ దేవాలయా తంజావూరు, సముద్రంలో పంబన్ బ్రిడ్జి మీంచి రామేశ్వరానికి రైలు ప్రయాణం, దక్షిణ భారతంలో ఆఖరి ఊరు ధనుష్కోడి, కన్యాకుమారి.. ఎన్నని! పంబన్ బ్రిడ్జి మీంచి రైలు ప్రయాణం ఎంత ముఖ్యమో ఊటీకి టాయ్ ట్రైన్ జర్నీ అంతే ముఖ్యం.. మరువద్దు! గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో.. .. ప్రతి ప్రాంతం ఒక మనోహర దృశ్యమే. చిరాకు తెప్పించే ఉక్కపోత కాకుండా.. ఎముకలు కొరికే చలీ లేకుండా ఈ సీజన్లో ఆహ్లాదంగా ఉంటాయి ఇక్కడి పర్యాటక కేంద్రాలు. బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్ షికార్లు.. వెంబనాడ్ లేక్, మారారి బీచ్.. అలెప్పుళ బీచ్ల తీరం.. ఆయుర్వేదిక్ స్పాల కేంద్రం అలెప్పీ (నవంబర్లో అయితే ఇక్కడ స్నేక్ బోట్ పోటీలను చూడొచ్చు), కళ్లు తిప్పుకోనివ్వని సీనరీ.. టీ తోటలు.. జలజలపారే జలపాతాలతో కశ్మీర్ ఆఫ్ ద సౌత్గా పేరున్న మున్నార్.. అక్కడి ఎకో పాయింట్, అనాముడి పీక్, టాటీ టీ మ్యూజియంలో వైవిధ్యమైన తేనీటి రుచులు, హోమ్ మేడ్ చాకొలేట్స్ పర్యాటకులను ఊరిస్తాయి. వాయనాడ్ ఏమన్నా తక్కువా? పశ్చిమ కనుమల్లోని డ్రీమ్ డెస్టినేషన్ ఇది. రెప్పవేయనివ్వని ప్రకృతి, ట్రెకింగ్, వాయనాడ్ వైల్డ్లైఫ్ శాంక్చురీ, ఎడక్కల్ కేవ్స్, వాయనాడ్ ఘనమైన చరిత్ర, అద్భుతమైన సంస్కృతి, డిలీషియస్ ఫుడ్ పర్యటనను ఎక్సైటింగ్గా మారుస్తాయి. కుమారకోమ్ గురించీ చెప్పాలి. బ్యాక్ వాటర్స్ ప్రత్యేకత చూడాలంటే కుమార్కోమ్ వెళ్లాల్సిందే అంటారు పర్యాటకప్రియులు. చలికాలం వలస పక్షులకు నిలయం ఇది. ఇక్కడి కృష్ణపురం ప్యాలెస్, చంపకుళంలోని బెసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మిస్ అవకూడదు. ఇవన్నీ బాగా ప్రాముఖ్యంలో ఉన్న మచ్చుకు కొన్ని పర్యాటక స్థలాలు మాత్రమే. కాస్త ఎక్కువ రోజులు.. ఇంకాస్త ఎక్కువ దూరాలు.. మరికాస్త ఎక్కువ బడ్జెట్ను భరించొచ్చు అనుకుంటే ఉత్తరాదిలోని ఈ ప్రాంతాలకూ వెళ్లొచ్చు. ఒక్కసారి లుక్కేసి తర్వాత ఐటినరీ ప్రిపేర్ చేసుకోండి! నిజానికి చలికాలం నార్త్ ఇండియా అంతటినీ వణికిస్తుంది. కానీ రాజస్థాన్ వెచ్చగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి చలికాలమే కరెక్ట్ కాలం. ఏమేం చూడొచ్చంటే.. జైపూర్ రాజస్థాన్ రాజధాని.. పింక్ సిటీగా పేరు. ఈ టైమ్లో ఇక్కడ లిటరేచర్ .. కైట్ ఫెస్టివల్స్ ఉంటాయి. హవా మహల్, ఆమేర్ ఫోర్ట్, జల్ మహల్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ వంటివి ఇక్కడి దర్శనీయ స్థలాలు. ఉదయ్పూర్ వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు దీన్ని. లేక్ ప్యాలెస్, ఫతేహ్ సాగర్ లేక్, జగ్ మందిర్, లేక్ పిఛోలా వంటివన్నీ ఉదయ్పూర్కి ప్రత్యేక శోభనిస్తూ ప్రపంచవ్యాప్త టూరిస్ట్లను ఆకర్షిస్తుంటాయి. ఇక్కడి లేక్స్, ఆరావలి పర్వతాలు.. ఉదయపూర్ వాతావరణాన్ని వెచ్చగా ఉంచి దీని పర్యటనకు చలికాలాన్ని పర్ఫెక్ట్గా మారుస్తున్నాయి. ఏటా చలికాలం ఇక్కడ ఆర్ట్స్, క్రాఫ్ట్స్కి సంబంధించిన ఉత్సవం జరుగుతుంది. ఆ టైమ్లో కళాప్రియులు ఈ ట్రిప్కి ప్లాన్ చేసుకోవచ్చు. రనక్పూర్ జైన్స్కి ముఖ్యమైన ప్రాంతం ఇది. ప్రశాతంతకు నిలయం ఈ పట్టణం. ప్రసిద్ధ చౌముఖ ఆలయం నెలవైందిక్కడే. దీని నిర్మాణ కళ అమోఘం. ఏడాది పొడుగునా భక్తుల రాకతో కళకళలాడుతూంటుంది. ఉదయ్పూర్కి దగ్గర్లో ఉంటుంది. కాబట్టి ఉదయ్పూర్కి వెళ్లినప్పుడు ఈ ఊరిదాకా ప్రయాణాన్ని పొడిగించుకోవచ్చు. జైసల్మేర్ ఈ డెజర్ట్ సిటీని చూడ్డానికి డిసెంబర్, జనవరి నెలలే బెస్ట్. ఇప్పుడెలాగూ సంక్రాంతి సెలవులే కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. డెజర్ట్ క్యాంపింగ్, క్యామెల్ రైడ్స్, క్వాడ్ బైకింగ్, డ్యూన్ బాషింగ్, పారాసైలింగ్ .. ఇలా బోలెడు యాక్టివిటీస్తో జైసల్మేర్లో ఎంజాయ్ చేయొచ్చు. అడ్వెంచరస్ యాక్టివిటీస్కి దూరంగా ఉండేవాళ్లు.. డెజర్ట్ ఫెస్టివల్, నెరాసీ (Nerasi) మ్యూజిక్ స్కూల్, కుల్ధారా విలేజ్, సోనార్ ఖిలా వంటి కల్చరల్ రైడ్ను ఆస్వాదించొచ్చు. ఫేమస్ లాంగేవాలా పోస్ట్కి డ్రైవ్ను మిస్ కావద్దు. జోధ్పూర్ దీనికి బ్లూ సిటీ ఆఫ్ రాజస్థాన్గా పేరు. 7 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్తో ఆహ్లాదంగా ఉంటుంది. మెహరంగఢ్ ఫోర్ట్, ఉమైద్ భవన్ ప్యాలెస్, మహామందిర్ టెంపుల్ వంటి జోధ్పూర్ల్యాండ్మార్క్స్ని చక్కగా దర్శించొచ్చు. అక్టోబర్లో అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ జరుగుతుంది. వచ్చే ఏడాదికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇసుక ఎడారి సరే ఉప్పు ఎడారీ చూడాలనుకుంటే గుజరాత్లోని రణ్ ఆఫ్ కచ్కి టికెట్స్ బుక్ చేసుకోవాలి. నల్లటి ఆకాశంలో తెల్లగా మిలమిల మెరుస్తున్న చుక్కల కింద.. చల్లటి వాతావరణంలో తెల్లటి ఉప్పు తివాచీ మీద కూర్చుని.. క్యాంప్ ఫైర్తో చలి కాచుకుంటూ .. గుజరాత్ సంప్రదాయ ఫుడ్ను ఆస్వాదిస్తుంటే ఊహల్లోని స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది! అంతేకాదు పీక్ వింటర్ రెండు నెలలు ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది.. రణ్ ఉత్సవ్ పేరుతో. దీన్నే కచ్ ఫెస్టివల్ అనీ పిలుస్తారు. అద్భుతమైన గుజరాతీ సంప్రదాయ ఫుడ్తోపాటు స్థానిక హ్యాండీక్రాఫ్ట్స్, డెజర్ట్ సఫారీలు మనసును దోచుకుంటాయి. ఈ వేడుకను వీక్షించడానికి ప్రపంచ నలుమూల నుంచీ లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ముందస్తుగా బుక్ చేసుకుంటే మంచిది. ధోర్డో గ్రామంలో క్యాంపింగ్ మరచిపోయేది కాదు. కురిసే మంచును ఆస్వాదించాలనుకుంటే హిమాలయాల ఓడిలో మంచు ముసుగేసుకున్న ప్రాంతాలకు ప్రయాణమవాల్సిందే. థర్మల్స్, గ్లోవ్స్, షూస్.. కోల్డ్ క్రీమ్స్ మస్ట్! ఆ ప్రాంతాల్లో కొన్ని.. బిన్సర్ ఇది ఉత్తరాఖండ్లోని చిన్న హిల్ స్టేషన్. వింటర్లో తప్పక చూడాల్సిన జాబితాలో ఫస్ట్ పెట్టాల్సిన ప్లేస్. మబ్బులను ముద్దాడే కేదార్నాథ్, త్రిశూల్, నందా దేవి శిఖరాలు కళ్లు తిప్పుకోనివ్వవు. ఫొటోగ్రాఫర్స్కైతే ఇంచ్ ఇంచ్ అద్భుతమైన ఫ్రేమే! ఇక్కడి బిన్సర్ వైల్డ్లైఫ్ శాంక్చురీని పిల్లలకు చూపించాల్సిందే. ఇందులో అరుదైన పక్షి, జంతు జాతులను చూడొచ్చు. ఔలీ ఇదీ ఉత్తరాఖండ్లోని ప్రాంతమే. దీనికి స్కైయింగ్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియాగా పేరు. అద్భుతమైన నందా దేవి, నీలకంఠ, మన పర్వత శిఖరాల మీదుగా స్కైయింగ్ చేస్తూ హిమాలయ అందాలను వీక్షించొచ్చు. చలికాలం వైవిధ్యమైన కళను సంతరించుకుంటుంది. మందంగా పరచుకున్న మంచు మీద స్కైయింగ్ చేయడానికి సాహసవంతులు ఉవ్విళ్లూరుతుంటారు. డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్లోని డిఫరెంట్ హిల్ స్టేషన్. ఇక్కడి ఇళ్లు.. రోడ్లు.. కూడళ్లలో బ్రిటన్ ఆనవాళ్లు కనపడుతూంటాయి. కురుస్తున్న మంచులో ట్రెకింగ్ చేయాలనుకునే ఉత్సాహవంతులకు ఇది సరైన సమయమూ.. ప్రాంతమూ! నేషనల్ హిమాలయన్ వింటర్ ట్రెకింగ్ ఎక్సెపెడిషన్ని హోస్ట్ చేసేది డల్హౌసీనే! ఈ జాబితాలో సిమ్లా, కులు, మనాలి, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ వంటివాటినీ చేర్చుకోవచ్చు. గమనిక: పర్యటనకు కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకోగలరు. -
ఆ ప్రభుండు పుట్టెను.. బేత్లెహేమునందున!
‘రక్షకుండు ఉదయించినాడట... మనకొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి... శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె’ అంటూ ఎముకలు కొరికే చలిలో రక్షకుని ఆగమన వార్తను పాడుకుంటూ, అనేకుల హృదయాలలో క్రిస్మస్ ఉల్లాసాన్ని నింపి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మీటింగ్ నుంచి ఇంటికి బయలుదేరారు పాస్టర్ సైలస్. ఆయన దగ్గరకు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి ఒక ఘనమైన స్త్రీ దిగి పరుగు పరుగున పాస్టర్గారి దగ్గరకు వచ్చి ‘అన్నయ్యా బాగున్నారా!’ అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆమె చుట్టూ కొంతమంది అంగరక్షకులు కూడా ఉన్నారు. సామాన్య జనులంతా చాలా వింతగా చూస్తున్నారు. ఆమెను చూచి ‘బాగున్నానమ్మా! మీరెవరో గుర్తుకురావడం లేదు, కొంచెం పరిచయం చేసుకుంటారా?’ అడిగాడు. ‘నేనెవరో తెలుసుకోవాలనుకుంటే మీరొక పదేళ్లు వెనక్కు వెళ్ళాలి. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ మధుర రాత్రిని నేనెన్నడు మరువలేను. గురి, దరి లేని నా జీవితాన్ని మలుపుతిప్పి జ్యోతిర్మయుడైన ప్రభువు గొప్పదనాన్ని చాటి చెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు రోగిగా, అనాథగా, మోసపోయిన వనితగా, మృత్యువు ఒడిలో చేరిన అబలగా మీ దరికి చేరిన నన్ను– ఊహించలేని పరలోకపు ప్రేమతో ఆదరించి నన్ను తన కుమార్తెగా స్వీకరించి పరలోకపు ఔన్నత్యమును అనుగ్రహించాడు నా ప్రభువు. నాడు అభాగ్యురాలిగా నిలిచిన నన్ను ఉన్నత ఉద్యోగిగా, అర్హతలేని నన్ను ఎన్నో కృపలకు అర్హురాలుగా హెచ్చించాడు. నిజమైన క్రిస్మస్కు గుర్తుగా, సాక్షిగా నేను నేడు మీముందున్నాను’ అంటూ ఆనందబాష్పాలతో తనను తాను పరిచయం చేసుకుందామె. ‘ఆరోజు అర్ధరాత్రి మీ ఇంటి దగ్గర ఒక శవంలా పడి ఉండగా మీరే నన్ను క్రీస్తు ప్రేమద్వారా బతికించారు’ అని ఆమె వివరిస్తుండగా సైలస్గారు కాస్త ఉద్వేగానికి గురై ‘ఆ!... గుర్తొచ్చావమ్మా! కవితా, నువ్వా!’ అంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవ సేవకుడు పాస్టర్ సైలస్ వివాహం జరిగిన తరువాత తన భార్యతో కలిసి ఊరవతల ఒక చిన్న ఇంట్లో ఉంటూ సేవ ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ ఒక క్రిస్మస్ కూడికను ముగించుకొని ఆ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. కడుపు ఆకలితో అలమటిస్తున్నా, హృదయమంతా ప్రభువు నామస్మరణ ఉల్లాసంతో ఉరకలు వేస్తుంటే ఆ రోజు ఆ పశువుల పాకలో దూతలు పాడినట్లు ‘క్రీస్తు జన్మించాడు, రక్షకుడు ఉదయించినాడు’ అంటూ పాట పాడుకుంటూ గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు. ఒక స్త్రీ తమ ఇంటి ముందు పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ స్త్రీ ఇక్కడకు రావడమేంటి? సైలస్ గారి మదిలో చాలా ప్రశ్నలు.. అసలు ఎవరీమె? ఏమైంది? ఈమె బాధేమిటో, కథేమిటో? ఏమీ అర్థంకావట్లేదు. ఏ స్థితి లోనైనా మనం అడగగానే ప్రార్థించగానే జవాబిచ్చే పరమతండ్రి మనకు తోడున్నాడు కదా! ‘నాకు మొఱపెట్టుము నీకుత్తరమిచ్చెదను’ అని బైబిల్లో రాయబడిన మాట ఆ భార్యాభర్తలకు గుర్తుకొచ్చింది. ప్రేమ నిండిన హృదయంతో మెల్లగా ఆ స్త్రీ వద్దకు వచ్చి ఆమె మీద నీళ్ళు జల్లగానే ఆమె తేరుకుంది. భార్యాభర్తలిద్దరూ ఆమె చేయి పట్టుకొని పైకి లేవనెత్తి ఇంటిలోకి తీసుకెళ్ళారు. తీవ్రమైన జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది. చలితో వణకిపోతున్న ఆమెకు వెచ్చని రగ్గు కప్పి తాము సిద్ధపరచుకున్న కొద్దిపాటి ఆహారం ఆమెకు ఇచ్చారు. గ్లాసుడు పాలు తాగించి, రాత్రంతా ఆమెకు పరిచర్య చేస్తూ ఆమె కోసం ప్రార్థించసాగారు. కవిత ఆ రాత్రి ఆ ఘనమైన దైవజనుల నీడలో స్వస్థత, సాంత్వన పొందింది. సూర్యుని లేలేత కిరణాలు మీద పడగా నిశీధి రాత్రి భీకర ఛాయలన్నీ మరచి ఉదయ కాంతులను ఆస్వాదిస్తూ నిద్రలేచింది. మెల్లగా పాస్టర్ సైలస్ గొంతు సవరించుకొని ‘ఏమీ భయపడకు. నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో! చేతనైనంత సహాయం నీకందిస్తాము’ అని ప్రభువు ప్రేమతో కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఆ మాటలు విన్న కవిత కృతజ్ఞతతో భోరున ఏడ్వసాగింది. ‘ముక్కూ మొహం తెలియని నన్ను, అభాగ్యురాలనై, రోగంతో, ఆకలితో బాధపడుతున్న నన్ను క్రీస్తు ప్రేమతో ఆదరించి ఆశ్రయించి అక్కున చేర్చుకొని క్రిస్మస్కు శ్రేష్ఠమైన అర్థాన్ని చెప్పారు. నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాలపట్టిగా ఉన్న నేను యౌవనాశలకు లొంగిపోయి ఒక కిరాతకుని ఉచ్చులోపడి, నమ్మి మోహించి వాడి చెంతకు చేరాను. వాడు నా బలహీనతను ఆధారంగా చేసుకొని దొడ్డిదారిన నన్ను ఒక వేశ్యాగృహానికి తాకట్టుపెట్టబోయాడు. విశ్వప్రయత్నాలు చేసి వాడి చెర నుంచి బయటపడ్డాను. గత ఐదు రోజుల నుంచి ఆ రైలు ఈ రైలు ఎక్కి ఈ పట్టణంలో ప్రవేశించాను. నా అన్నవారు లేక ఈ రోడ్డుమీద తిరుగుతూ ఎంగిలి విస్తరాకులు నాకుతూ డ్రైనేజీ నీళ్ళను కూడా తాగడానికి వెనుకాడక అత్యంత హీన, దీనస్థితికి దిగజారిపోయాను. ఈ బతుకుని బతకలేక విషం తాగి శవంగా మారిపోవాలని ఓపిక తెచ్చుకొని పయనమౌతుండగా గత రాత్రి క్రిస్మస్ కార్యక్రమంలో మీరు అందించిన క్రీస్తు ప్రభువు మాటలు దూరంగా నిలబడి విన్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. క్రిస్మస్ కాంతులన్నీ నా జీవితంలో విరజిమ్మాయి. నాకోసం ఒక రక్షకుడు జన్మించాడన్న వార్త నాకు ఎంతో బలాన్నిచ్చింది. రక్తం కక్కుతూ అత్యంత భయానకంగా ఉన్న నా పరిస్థితి ఒక్కసారిగా చక్కదిద్దబడింది. నా హృదయంలో యేసయ్య చేరిన మరుక్షణం నా పాపాంధకార ఛాయలు మటుమాయమైపోయాయి. నా పాపఫలితమే ఇదంతా అని గుర్తించగలిగాను. నా ప్రతీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నా మనస్సులో గొప్ప ఆనందం, ఆదరణ, సమాధానం కలిగాయి. మీచెంతకు చేరి నా బాధంతా వెళ్ళబుచ్చుకొని తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు చేరాలనే ఆశతో అతికష్టం మీద మీ అడ్రస్ సంపాదించి మిమ్ము చేరుకోగలిగాను. మీకెంతో బాధ కలిగించాను, ఇబ్బందిపెట్టాను. కానీ మీరే నాకు ఆ సమయంలో దిక్కనిపించారు. మీ వద్ద నుంచి వెళ్ళిన తదుపరి జీవంగల దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని నా తల్లిదండ్రులను చేరుకున్నాను. నన్ను నా బంధువులు ఏరికోరి వారి కోడలుగా చేసుకున్నారు. నా భర్త ఒక గొప్ప ప్రభుత్వ అధికారి. ఆయన నన్ను ప్రోత్సహించి బాగా చదివించి ఒక డాక్టరుగా చేయగలిగారు. ఆ రాత్రి మీరు ఏర్పాటు చేసిన క్రిస్మస్కు దేవుని సన్నిధికి రాకుండా ఉండుంటే, ఆ మాటలు వినకుండా వుండుంటే ఆ రాత్రే నేను దిక్కులేని చావుతో శవమైపోయేదాన్ని లేదా చిరిగిన విస్తరిలా నా జీవితం మారిపోయేది. క్రిస్మస్ మాధుర్యాన్ని నాకు కనపరిచి నవ్యకాంతులమయమైన జీవితంగా నన్ను చేసినందుకు మీకేమిచ్చినా ఋణం తీర్చుకోలేను’ అంటూ ఉండగా పరవశంలో నిండిపోయాడు దైవజనుడు సైలస్. క్రిస్మస్ అసంఖ్యాక జీవితాల్లో నిర్మలమైన వెలుగులు నింపింది. క్రీస్తు జన్మించినప్పుడు బేత్లెహేము పొలాల్లో తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూత వారిని దర్శించింది. ఓ గొప్ప వెలుగు వారిని ఆవరించింది. ‘రక్షకుడు పుట్టియున్నాడు’ అనే వార్తను వారు విని యేసు దర్శించి పునీతులయ్యారు. క్రిస్మస్ అనుమాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థము. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినము క్రిస్మస్.యేసుక్రీస్తు శరీరధారిగా రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేము గ్రామంలో జన్మించాడు. యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే సందేహం కొంతమందిలో ఉండవచ్చు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘యేసు గ్రీకోరోమన్ తత్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల యొక్క మానసిక ఆవిష్కరణే గాని వాస్తవం కాదు. కొత్తనిబంధన ఒక పురాణమే గాని వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు.’ దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాత చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు: ‘ప్రపంచంలోని చాలా విషయాలకు చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా కేవలం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉన్నవి. క్రైస్తవ్యం అటువంటిది కాదు.’ క్రీస్తు రక్షకుడు, దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటులో గలిలయలోని దళమును నడిపిన వ్యక్తి. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు– ‘ద జ్యూయిష్ వార్స్’, ‘జ్యూయిష్ యాంటిక్విటీస్’ రచించాడు. ఫ్లావియస్ అనే పేరు రోమా పేరు కాగా జోసఫస్ అనే పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు: ‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుంచి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’ ఫ్లావియస్ జోసఫస్ రాసిన సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జననాన్ని, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ఒప్పుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గురించి సవివరంగా ఉంది. ఆ సువార్తికులు ఎవరనగా... మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరచే సువార్తలన్నీ క్రీస్తుశకం 70వ సంవత్సరం లోపే వ్రాయబడ్డాయి. అనగా యేసుక్రీస్తు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాల లోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు. మార్కు పరిస్థితులన్నీ అవగాహన చేసుకొన్న ఒక మంచి యవ్వనస్థుడు. లూకా ప్రసిద్ధిగాంచిన ఒక వైద్యుడు. యోహాను యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు. వీరందరూ క్రీస్తు జీవిత చరిత్రను వ్రాసారు. వాస్తవ సంగతుల ఆధారాలతో సువార్తలు వ్రాయబడ్డాయి గనుక ఎక్కడా కూడా భావ విరుద్ధమైనవి బైబిల్లో కనిపించవు’ అని జాన్ రాబిన్సన్ రాశాడు. యేసు శిష్యుడైన యోహాను నిర్ద్వంద్వంగా ఈ సత్యాన్ని వెల్లడిచేశాడు. ‘జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను’– (1 యోహాను 1:1,2). క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు. ‘కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు’. ఇమ్మానుయేలు అనుమాటకు దేవుడు మనకు తోడు అని అర్థము. క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్ని చరిత్రలో నెరవేర్చబడ్డాయి. మీకా అనే మరొక ప్రవక్త యేసు ‘బేత్లెహేము’లో జన్మిస్తాడని చెప్పాడు. ఆ మాట చెప్పబడిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యేసు సరిగ్గా అదే గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కనబడుతుందని, జ్ఞానులు ఆయన్ను వెదుకుతూ వస్తారని, క్రీస్తు ఆగమనాన్ని జీర్ణించుకోలేని హేరోదు రోదనధ్వనికి కారణమౌతాడని ఎన్నో విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఈ ప్రవచన నెరవేర్పు ప్రపంచానికి నేర్పించే పాఠము ‘క్రీస్తు ఒక ప్రవక్త కాదుగాని, ప్రవక్తలు ఎవరిగూర్చి ప్రవచించారో ఆ ప్రవచనాల సారము.’ బైబిల్లోని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే ‘రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు’ అనే మాట యేసుప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయనను దర్శిస్తారు అనడానికి నిదర్శనంగా కనబడుతుంది. యేసు పుట్టిన తర్వాత గొఱ్టెల కాపరులు, జ్ఞానులు ఆయనను దర్శించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన అందరికీ కావలసినవాడు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము గ్రహించగలము. జ్ఞానులు యేసుప్రభువును వెదుక్కుంటూ వచ్చి బంగారమును, బోళమును, సాంబ్రాణిని అర్పించారు. వారు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుముందు మోకరిల్లి, సాగిలపడి పూజించారు. జ్ఞానులు వివిధ దేశాల నుంచి, వివిధ సంప్రదాయాలను అనుసరిస్తున్న వారిలో నుంచి యేసుప్రభువును వెతుక్కుంటూ మొదటిగా యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత బేత్లెహేముకు వెళ్ళి యేసుప్రభువును దర్శించారు. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపంచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారని, రక్షకుడు ఉదయించాడు అనే సత్యం వారు ఆకాశంలో వెలసిన నక్షత్రం ద్వారా తెలుసుకోగలిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ‘రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేమునందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి’– (మత్తయి 2:12). తూర్పుదిక్కున నక్షత్రపు దిశను చూసి, నక్షత్ర పయనాన్ని చూసి వారు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము వచ్చారంటే వారికి ఖగోళశాస్త్రం మీద పట్టువుంది అని ఇట్టే మనకు అర్థమవుతుంది. అయితే జ్ఞానులను నడిపించిన ఈ నక్షత్ర మర్మమేమిటి? శాస్త్రవేత్తలలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించబడ్డాయి. యేసు పుట్టిన మొదటి శతాబ్దం నుంచి ఈ బేత్లెహేము తారను గూర్చి జ్ఞానులకు అగుపడిన నక్షత్రమును గురించి పండిత వర్గాలలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే కొందరు కొన్ని రకాలైన అభిప్రాయాలను వెల్లడిచేశారు. మొదటిగా సూపర్నోవా. ఈ నక్షత్రం తెల్లటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ పేలిపోతూ ఉంటుంది. నక్షత్రాలు అప్పుడప్పుడు విస్ఫోటం చెందుతూ ఉంటాయి. ఈ విస్ఫోటం వలన ఆ నక్షత్రం కాంతి నేల నుంచి లక్షల రెట్లు పెరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. గొప్ప వెలుగు ఆకాశంలో కనబడుతుంది. అయితే వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఈ సూపర్నోవా విస్ఫోటం చెందినప్పుడు ఎక్కువకాలం కనిపించే అవకాశాలు ఉండవు. దీన్నిబట్టి యేసుప్రభువు పుట్టినప్పుడు నక్షత్ర విస్ఫోటం జరగలేదు. రెండవ అభిప్రాయం– హేలీ తోకచుక్క కనబడిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. క్రీస్తు పూర్వము 5వ సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలలో కొత్త నక్షత్రం ఒకటి కనబడినట్లుగా చైనా దేశం వారు తమ చరిత్రలో రాసుకున్నారు. అయితే ఆ నక్షత్రం తోకచుక్కా లేదా సూపర్నోవా అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. వాస్తవానికి తోకచుక్కల గురించి మనకందరికీ విదితమే! తోకచుక్కలు ప్రతి నిర్ణీత కాలానికోసారి ఆకాశంలో కనబడుతుంటాయి. ఉదాహరణకు హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం హేలీ తోకచుక్క క్రీస్తు పూర్వము 12 సంవత్సరంలో కనబడింది గనుక హేలీ తోకచుక్క కనబడిందనేది గూడా ఒక అవాస్తవంగా మనం గ్రహించాలి. మూడవది శాస్త్రవిజ్ఞాన రంగంలో యేసుప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది అని బైబిల్ చెప్పినప్పుడు దానికి చాలా దగ్గరగా ఉన్న వ్యాఖ్యానం– గ్రహకూటమి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జోహనెస్ కెప్లెర్ 1607వ సంవత్సరంలో యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రం గురించి పరిశోధన చేశాడు. ‘యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. బృహస్పతి, శని మరియు అంగారకుడు– ఈ మూడు గ్రహాలు కూడా ఒకే కక్ష్యలోనికి వచ్చి ఒక బ్రహ్మాండమైన వెలుగును విడుదల చేశాయి. ఈ మూడు గ్రహాలు కూడా ఒక కక్ష్యలోనికి రావడం ద్వారా గొప్ప వెలుగు పుట్టి అది జ్ఞానులను నడిపించింది’ అని జోహనెస్ కెప్లెర్ వివరణనిచ్చాడు. ఆకాశంలో నక్షత్రం పుట్టినదానికి శాస్త్రయుక్తమైన వివరణ కావాలంటే జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ అత్యంత దగ్గరగా ఉంది. అయితే ఆకాశంలో నక్షత్రం పుట్టడమనేది అసాధారణ కార్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు గనుక ఆయన ఒక అద్భుతాన్ని ఆకాశంలో జరిగించి జ్ఞానులను నడిపించాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ రోజుల్లో శాస్త్రం దేనికైనా ఋజువులడుగుతుంది, వివరణలడుగుతుంది గనుక జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ శాస్త్రయుక్తంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు వెలసిన నక్షత్రానికి దగ్గరగా ఉంది.అయితే విచిత్రమేమిటి అంటే నక్షత్రం జ్ఞానులను యేసుప్రభు వున్నచోటికి నడిపించింది. వారు చదువుకున్న చదువు వారు సంపాదించిన జ్ఞానం వారిని ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడింది. వారు నక్షత్రం ద్వారా నడిపించబడి యెరూషలేముకు వచ్చి ఆకాలంలో యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజు వద్దకు వచ్చి తామెందుకు వచ్చారో వివరించారు. వారి రాకకు గల కారణాన్ని విని హేరోదు, అతనితో పాటు యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. ‘హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారిచేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనునూ వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను’– (మత్తయి 2:68). ఇక్కడ హేరోదు రాజులో ఉన్న దుర్భుద్ధి కనబడుతుంది. హేరోదు దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో లేడు. అయితే పైకి కనిపించడం మాత్రం ప్రజలందరికీ నేను కూడా పూజిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను అని చెబుతున్నాడు కానీ అతని మనసులో భయంకరమైన స్వభావం దాగియుంది. కలవరపడినవాడు దేవుడిని చంపాలనే చూశాడు తప్ప ఆయనను రక్షించాలని, పూజించాలనే ఉద్దేశం అతనిలో లేదు. హేరోదు భయంకరమైన వేషధారిగా కనబడుతున్నాడు. పైకి ఒకలా మాట్లాడటం, లోపల మరొక తత్వాన్ని కలిగియుండటం. పైకి మనుషులను ఒప్పించేలా మాట్లాడటం, లోపల ఆ దేవుడిని సమూల నాశనం చేయాలనే తలంపును కలిగి ఉన్నాడు. ఇది భయంకరమైన వేషధారణ. అందునుబట్టే వేషధారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి యేసుకు కానుకలు అర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. వారు అర్పించిన కానుకలలో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. బంగారము దైవత్వానికి, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థతకు సంకేతాలు. ఆ తదుపరి వారు దేవుని చేత బోధించబడినవారై వారి దేశమునకు ఒక నూతన మార్గములో తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడటం మానవ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. మాకన్నీ తెలుసులే, మేము కూడా జ్ఞానం కలిగినవారం, నక్షత్ర పయనాన్ని చూసే మేము దేవుడిని కనుగొనటానికి వచ్చాము గనుక ఇకపై మా జ్ఞానం, మా తెలివి, మా వివేచన ద్వారా నడుస్తాము; మా అంతటి జ్ఞానవంతులు మరొకరు లేరు, మేము ఎవరి మాట వినక్కర్లేదు అని జ్ఞానులు అనుకోలేదు గాని దేవునిచేత బోధించబడినవారై ఆ బోధకు అనుకూలంగా వారు స్పందించారు. ఆ బోధనను అనుసరించి వారు మరొక మార్గానికి తిరిగి వెళ్ళారు. మాకన్నీ తెలుసులే మాకు తెలిసిందే మేం చేస్తాం, దేవుని స్వరాన్ని మేము వినాల్సిన అవసరం మాకు లేదు అని గనుక వారు హేరోదు దగ్గరకు వెళ్ళి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో గాని, దేవుని మాటకు వారు లోబడటం ద్వారా మనకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు యేసుక్రీస్తు ప్రభువును ఏవిధంగా ఆరాధించారో, అటువంటి ఓ అద్బుత ఘటన మానవ చరిత్రలో 20వ శతాబ్దంలో చోటు చేసుకుంది. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న అపోలో– 11 అనే రాకెట్ మీద అక్షరాల 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి మనసారా మహనీయుడైన దేవుని స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘నిన్ను కాపాడువాడు’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా! నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళివచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి కొన్ని పరిశోధనలు చేసివచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు తీసుకు వచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచాడు. ప్రతి సభలో ఆయన ప్రకటించిన సత్యం... ‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు. అదీ గొప్ప విషయం’. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. ‘దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు’ అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ‘తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరిదేని గురించి అతడు ఆలోచించడు. కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుండి అపరాధముల నుండి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అనేది లేఖన సత్యం’– (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడి చేశాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటలో పాల్గొనడానికి చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొద్ది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే కచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ‘ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అమితానందభరితులయ్యారు’ అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం.ప్రపంచం ఎన్నడు మరువలేని హాస్యకళాకారుడు చార్లీ చాప్లిన్. డైలాగులు కూడా లేకుండా అతడు నటించిన ఎన్నో సినిమాలు అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. చాప్లిన్ లెక్కపెట్టలేనంత ధనాన్ని కూడా ఆర్జించాడు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిపోయిన అతని జీవిత చరమాంకంలో ఎవరో అడిగారు ‘నీ జీవితాన్ని ఒక్క ముక్కలో చెప్పగలవా?’ అని. ఆ ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం ‘నా జీవితం ఓ ప్రయోగాత్మకమైన జోక్’. ఆ సమాధానాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవాన్ని పరిశీలిస్తే నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ‘నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు’ అని ఒక కుబేరుడు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరచింది. భౌతిక అవసరాలు తీరితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. సమూయేలు అనే భక్తుడు రాసిన పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడూ మరచిపోదు. క్రీస్తు జన్మ విశిçష్ఠతను, ఆయన జీవితాన్ని, మరణ పునరుత్థానములను అద్భుతంగా వివరించే పాట అది. ‘పాపికాశ్రయుడవు నీవే. ఉన్నతలోకము విడిచిన నీవే... కన్నియ గర్భమున బుట్టిన నీవే, యేసు నీవే. చెదరిన పాపుల వెదకెడు నీవే... చెదరిన గొర్రెల కాపరివి నీవే. రోగులకు స్వస్థప్రదుడవు నీవే... మ్రోగునార్తుల యొక్క మొఱ విను నీవే. శాత్రవాంతరమున మృతుడవు నీవే... మైత్రిజూపగ మృత్యుద్ధతుడవు నీవే!’ సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ, ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
యాప్లతో సేఫ్టీకి భరోసా!
అడ్వాన్స్డ్ ఎరాలో ఉన్నాం.. మీట నొక్కే వేగంలో పనులు అయిపోతున్నాయి.. అయినా స్త్రీకి సంబంధించిన విషయంలో సమాజపు ఆలోచనలే ఇంకా ప్రగతి పంథా పట్టలేదు! అందుకే ఇప్పటికీ ఆమెకు భద్రత లేదు! ఆమె సేఫ్టీకి సాంకేతికత యాప్ల ద్వారా ఇస్తున్న భరోసా మనసావాచాకర్మణా సమాజం ఇవ్వడం లేదు! ఆ స్పృహను సాధించే వరకు.. మహిళ ఆ సేఫ్టీ యాప్లనే నమ్ముకోక తప్పదు!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యూఎన్ఓ ఈ ఏడాది ప్రకటించిన థీమ్.. డిజిటాల్: ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ (DigtALL: Innovation and technology for gender equality). . అవును ఏ ఆవిష్కరణ అయినా.. సాంకేతికతైనా స్త్రీ, పురుష సమానత్వాన్నే చాటాలి. ఈ సమానత్వ పోరు నేటిది కాదు.. దాదాపు 115 ఏళ్ల నాటిది. నాడు అమెరికాలో గార్మెంట్ ఇండస్ట్రీలో ప్రమాదరకమైన పని పరిస్థితులు.. స్త్రీల పట్ల వివక్ష.. అసమాన వేతనాలు వంటి విషయాల్లో మార్పు కోసం మహిళల సమ్మెతో మొదలైన పోరాటం.. అన్ని రంగాల్లో.. అన్ని విషయాల్లో జెండర్ ఈక్వాలిటీ దిశగా ఇంకా కొనసాగుతూనే ఉంది. శతాబ్దం మారింది.. అయినా సమానత్వ సాధన కోసం ఇంకా థీమ్స్ను సెట్ చేసుకునే దశ, దిశలోనే ఉన్నాం. ‘కాలం మారింది.. ఇప్పుడు అన్ని రంగాల్లో స్త్రీలు కనపడుతున్నారు.. వినపడుతున్నారు కదా!’ అని మనకు అనిపించినప్పుడల్లా.. ఒక్కసారి స్త్రీల మీద జరుగుతున్న క్రైమ్ రికార్డ్స్ను ముందేసుకుందాం! అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు కదా అని ఎత్తుకున్న తల దించేసుకుంటుంది. స్వేచ్ఛ ఉంటేనే సమానత్వం సిద్ధిస్తుంది. భద్రత ఉంటేనే ఆ స్వేచ్ఛకు అర్థం ఉంటుంది. ఇంట్లో హింస.. బయట హింస.. ఆఖరకు ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నా హింసే. ఈ వాక్యాలు రొడ్డకొట్టుడులా అనిపిస్తున్నాయి. అంటే పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదనే కదా! అందుకే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ సాధించాలంటే ముందు ఆడపిల్ల సురక్షితంగా ఉండాలి. ఇంటా.. బయటా బేఫికర్గా మసలగలగాలి! పోలీసులు, చట్టాలు ఉన్నాయి కదా అని తట్టొచ్చు! ‘నాకు సేఫ్టీ లేదు.. భయంగా ఉంది’ అని అమ్మాయి చెబితేనే కదా.. పోలీసులు స్పందించేది. ఆ అభద్రతను రిజిస్టర్ చేస్తేనే కదా.. రక్షణ చట్టాలు వచ్చేవి. ఇదంతా జరగాలంటే సమాజంలో అవగాహన రావాలి. అమ్మాయిలను చూసే తీరు.. వాళ్లతో ప్రవర్తించే పద్ధతులు మారాలి. వాళ్ల పట్ల మర్యాద పెరగాలి. వీటన్నిటికీ మగపిల్లలకు జెండర్ సెన్సిటివిటీ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో.. తనున్న పరిస్థితి పట్ల ఎరుక.. దాన్నుంచి బయటపడే చొరవ అమ్మాయిలకూ అంతే అవసరం. ముందు తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గుర్తించే ధైర్యం.. తెగువ చేయాలి. అందుకు ఇప్పుడు సాంకేతికత బోలెడంత సాయాన్ని అందిస్తోంది. యాప్ల రూపంలో! అలా ఫోన్లో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాల్సిన విమెన్ సెక్యూరిటీ యాప్లు కొన్ని ఇక్కడ.. దిశ ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో యాప్ను ఓపెన్చేసి.. మూడుసార్లు షేక్ చేయగానే ఫోన్లోని జీపీఎస్ యాక్టివేట్ అయ్యి.. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లు, డ్యూటీలో ఉన్న పోలీసులను అలర్ట్ చేస్తుంది లొకేషన్ను పంపించి. ఒకవేళ ఫోన్ షేక్ చేయకుండా యాప్లోని ఎస్ఓఎస్ బటన్ను నొక్కినా.. మీ సమాచారం మీరున్న ప్రాంతానికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్లు, ఆన్ డ్యూటీ పోలీసులకు చేరుతుంది. వెంటనే సహాయ సిబ్బంది మీ దగ్గరకు చేరుకుంటారు. ఈ యాప్ సహాయంతో 100 నంబర్, లేదా ఈ యాప్లో ఉన్న ఇతర హెల్ప్ లైన్ నంబర్స్కూ కాల్ చేయవచ్చు. ఈ యాప్ ప్రమాదస్థలికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ల వివరాలనే కాక.. ఇతర సేఫ్టీ ప్లేసెస్, ఆసుపత్రులు, ఇతర హెల్ప్లైన్ నంబర్లనూ అందిస్తోంది. విమెన్ సేఫ్టీ (Women Safety) ఈ యాప్లోని బటన్ను ఒక్కసారి తడితే చాలు.. మీరు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి.. లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ సహా మీ ఫోన్లో మీరు ఫీడ్ చేసుకున్న ఎమర్జెన్సీ నంబర్లకు చేరిపోతుంది. ఇందులోని బటన్లు మూడు రంగుల్లో ఉంటాయి. అంటే మీరున్న పరిస్థితి తీవ్రతను బట్టి ఆయా రంగుల్లో ఉన్న బటన్స్ను నొక్కాలి. షీ టీమ్స్ మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్ను ఏర్పాటు చేసింది. ఈ వింగ్ 2014లో ప్రారంభమైంది. తొలుత హైదరాబాద్లోని సైబరాబాద్ పరిధికే వీరి సేవలు పరిమితమైనా.. తర్వాత ఏడాదికి అంటే 2015కల్లా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 112 యాప్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆల్ ఇన్ వన్ యాప్ ఇది. ఉపయోగించడం చాలా తేలిక. ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఈ యాప్ను సింగిల్ ట్యాప్ చేస్తే చాలు.. మీరున్న డేంజర్ సిచ్యుయేషన్కు సంబంధించి అలారమ్ మోగుతుంది. తక్షణమే సహాయక చర్యల సిబ్బందీ స్పందిస్తారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఫోన్లకూ సెట్ అవుతుంది. ఈ 112 యాప్ మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. కీ ఫీచర్స్ ఏంటంటే.. ఎమర్జెన్సీ అలారమ్ను పంపించేందుకు ఇందులో ఆడియో/విజువల్ మీడియా ఉంటుంది. 24 గంటలూ ఈ యాప్ ద్వారా భద్రతా సేవలు పొందవచ్చు. అదనంగా.. సంఘటనల విచారణలోనూ తనవంతు సాయం అందిస్తుంది. మై సేఫ్టీపిన్ (My SafetyPin) డేటా మాపింగ్ టెక్నిక్స్ సాయంతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సేఫ్గా ఫీలయ్యేందుకు సాయపడుతుందీ అప్లికేషన్. వెలుతురు, వైశాల్యం, సెక్యూరిటీ గార్డ్స్, కాలిబాట, ప్రజా రవాణా వ్యవస్థ, జెండర్ యూసేజ్, భావోద్వేగాలు.. మొదలైన తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్ను రూపొందించారు. ఒకవేళ మీరు రాంగ్రూట్ని ఎంచుకున్నా ఇది వెంటనే మీ కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తుంది. భద్రమైన దారిని ఎంచుకునేందుకు మీకు తోడ్పడుతుంది. మీరు తప్పిదారి అంత భద్రతలేని ప్రాంతంలోకి వెళ్లినా.. ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. సెర్చింగ్లో మీ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్లు.. ఇతర సౌకర్యాల గురించీ మీకు సమాచారం ఇస్తుంది. దేశంలోని నగరాలను సురక్షిత నగరాలుగా మార్చడమే ‘మై సేఫ్టీపిన్’ లక్ష్యం. షీరోస్ ఇప్పుడున్న లీడింగ్ విమెన్ యాప్స్లో యూనిక్ యాప్ ఇది. మహిళల భద్రతకు సంబంధించే కాదు కెరీర్ గైడెన్స్, ఫ్రీ హెల్ప్ లైన్, రెసిపీలు మొదలు బ్యూటీ టిప్స్, ఇంట్లో ఉండే పనిచేసుకునే ఉపాధి అవకాశాల నుంచి కొత్త కొత్త పరిచయాలు, ఉచిత న్యాయ సలహాల వరకు మహిళలకు అవసరమైన చాలా అంశాల్లో ఈ యాప్ సహాయమందిస్తుంది. మీ నెలసరినీ ట్రాక్ చేస్తూ సూచనలిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది దీని గోప్యత, భద్రత. మీ ఫొటోలు, వీడియోలు మొదలు మీ వ్యక్తిగత సమాచారాన్నంత గోప్యంగా.. భద్రంగా ఉంచుతుంది. దీని సేవలను ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్.. రెండు ఫోన్లలోనూ పొందవచ్చు. స్మార్ట్ 24 గీ సెవెన్ ( స్మార్ట్ 24 X7) దీనితో ఇరవైనాలుగు గంటల కస్టమర్ సర్వీస్ సెంటర్తో సపోర్ట్ పొందవచ్చు. ఇది ఇటు యాపిల్ అటు ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్ అవుతుంది. ఆపదలో ఉన్న మహిళలు తమ దీని ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్స్ను కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు చుట్టుపక్కలనున్న ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, అంబులెన్స్ సర్వీసెస్కూ పంపిచవచ్చు. వాటి సహాయం పొందవచ్చు.ఆపదలో ఉన్న వాళ్లు బటన్ నొక్కగానే ఆ ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్లో వాళ్లు సేవ్ చేసుకున్న అయిదు ఎమర్జెన్సీ నంబర్లకు క్షణాల్లో సమాచారం వెళ్తుంది. ఒకవేళ జీపీఆర్ఎస్ అందుబాటులో లేకపోతే.. ఎస్మ్మెస్లు వెళ్తాయి. స్మార్ట్ 24 ఇంటూ సెవెన్ కస్టమర్ కేర్ సెంటర్ వాళ్లూ వెంటనే కాల్ చేస్తారు. బీసేఫ్ (bSafe) మహిళల మీద జరుగుతున్న హింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులను నివారించడమే కాక దురదృష్టవశాత్తు ఇలాంటి నేరాలు జరిగితే.. సంబంధించిన సాక్ష్యాధారాలనూ అందిస్తుంది. వాయిస్ యాక్టివేషన్, లైవ్ స్ట్రీమింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్, ఫాల్స్ కాల్, ఫాలో మీ, లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్తో మహిళల భద్రతకు భరోసానిస్తోంది. బటన్ను ఒక్కసారి నొక్కితే చాలు.. ఎస్ఓఎస్ సిగ్నల్ను సెండ్ చేసేస్తుంది. దీని ద్వారా.. అత్యవసర వేళల్లో ఫొటోలు తీసుకుని.. వాటిని పోస్ట్ చేయొచ్చు. మీరున్న చోటును మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. దీన్ని ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్ రెండు ఫోన్లలోనూ డౌన్లోడ్ చేçసుకోవచ్చు. నిర్భయ ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఫోన్లో డౌన్లోడ్ అయ్యాక.. ఒక్కసారి బటన్ను ప్రెస్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ బటన్ నొక్కడం వీలు పడకపోతే ఫోన్ షేకింగ్ ద్వారా, ఎస్సెమ్మెస్ల ద్వారా.. ఫోన్ కాల్ ద్వారా కూడా మన పరిస్థితిని తెలియజేయవచ్చు. అయితే వీటికి డేటా ప్లాన్, జీపీఎస్ అవసరం ఉంటాయి. ఆపదలో ఉన్నవారి లొకేషన్ను ఇది ప్రతి రెండు గంటలు.. లేదా ప్రతి మూడువందల మీటర్లకు మారినప్పుడల్లా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కు పంపిస్తూంటుంది. ఎస్ఓఎస్ – స్టే సేఫ్ ఇది ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో ఈ యాప్ యాక్టివేట్ అయితే చాలు.. ఫోన్ లాక్ మోడ్లో ఉన్నా ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ను అన్లాక్ చేసుకునేంత టైమ్ ఉండదు. వెంటనే స్పందించాలి. అందుకే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. ఆపదలో ఉన్నామని తెలియగానే ఫోన్ను రెండుమూడు సార్లు షేక్ చేయాలి.. అంతే.. మనకు సంబంధించిన సమాచారం.. మనమున్న లొకేషన్ సహా ఎమర్జెన్సీ కాంటాక్ట్కి వెళ్లిపోతాయి. ఒకవేళ షేక్ చేయడం తికమక వ్యవహారంలా అనిపిస్తే ఈ యాప్ హోమ్ బటన్ను ప్రెస్ చేసినా చాలు.. మన సమాచారం, లొకేషన్ సహా మప ఫోన్ బ్యాటరీ ఏ స్థితిలో ఉందో కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్కి చెప్పేస్తుంది. అంతేకాదు ఆడియో రికార్డింగ్నూ పంపుతుంది. రక్ష (Raksha) భద్రతతో కూడిన స్వావలంబన.. ఈ యాప్ లక్ష్యం. అందుకే అహర్నిశలూ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించడమూ తేలికే. మీరు ఆపదలో చిక్కుకున్నారని మీకు అనిపించిన వెంటనే యాప్లో సూచించిన బటన్ను ప్రెస్ చేస్తే చాలు.. మీరున్న లొకేషన్ సహా మీకు సంబంధించిన అలర్ట్స్ అన్నీ మీ కుటుంబ సభ్యులకు చేరుతాయి మీ వాళ్ల ఫోన్ నంబర్ల ద్వారా. నెట్వర్క్ లేకపోయినా.. ఈ యాప్ స్పందిస్తుంది. వాల్యూమ్ కీని మూడు సెకండ్ల పాటు ప్రెస్ చేస్తే చాలు.. మీ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. ఇందులో ఎస్ఓఎస్ కూడా ఉన్నందున.. ఇంటర్నెట్ లేని ఏరియాల్లో .. ఎస్సెమ్మెస్ ద్వారా మీకు సంబంధించిన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు చేరవేస్తుంది. ఐయామ్ శక్తి (Iam Shakthi) ఇదీ యూజర్ ఫ్రెండ్లీనే. ఫోన్లోని పవర్ బటన్ను రెండు సెకండ్ల వ్యవధిలో అయిదుసార్లు నొక్కితే చాలు.. ఫోన్లో ముందుగా సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కు లొకేషన్ సహా సమాచారం వెళుతుంది. బటన్ నొక్కిన వెంటనే లొకేషన్ను ట్రేస్ చేయలేకపోతే.. ట్రేస్ అయిన వెంటనే మళ్లీ అలర్ట్ మెసేజెస్ను పంపిస్తుంది. విత్యు (WithYou) ఇది కూడా ‘స్పాట్ఎన్సేవ్’ లాంటిదే. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్లోని పవర్ బటన్ను రెండుసార్లు నొక్కితే .. మనకు సంబంధించిన సమాచారమంతా లొకేషన్ సహా.. అంతకుముందే సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కు వెళుతుంది.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి. స్పాట్ఎన్సేవ్ ఫీల్ సెక్యూర్ ఇప్పుడున్న అన్ని సేఫ్టీ యాప్లోకెల్లా అడ్వాన్స్డ్ యాప్ ఇది. దీన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాచీలా మణికట్టుకు ధరిస్తే చాలు. అవును రిస్ట్ బ్యాండ్లా! డేంజర్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మీ ఫోన్ పవర్ బటన్ను రెండుసార్లు ప్రెస్ చేయాలి అంతే.. రిస్ట్బ్యాండ్లోని యాప్ యాక్టివేట్ అయ్యి మీరు ముందే సెట్ చేసి పెట్టుకున్న మీ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్స్కి.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి.. మీరున్న లొకేషన్ సహా వివరాలను అందిస్తూంటుంది. ఒకవేళ మీరు ఫోన్ను ఉపయోగించే స్థితిలో లేకపోతే రిస్ట్బ్యాండ్కున్న బటన్ను రెండుసార్లు ప్రెస్ చేసినా చాలు బ్లూటూత్ సాయంతో యాప్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఇటు చూడండీ.. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో)–2021 నివేదిక ప్రకారం.. దేశంలో మహిళల మీద జరుగుతున్న హింస 2020 సంవత్సరం కన్నా 2021లో 15.3 శాతం పెరిగింది. 2020లో 3,71,503 కేసులు నమోదైతే 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు ఈ హింసాత్మక సంఘటనల రేటు 64.5 శాతంగా నమోదైంది. 2020లో ఇది 56.5 శాతం. వీటిల్లో 31.8 శాతం గృహహింస కేసులే. మిగతావన్నీ వేధింపులు, కిడ్నాప్లు, లైంగికదాడుల కేసులు. మహిళల మీద జరుగుతున్న హింసలో అసోం రాష్ట్రం మొదటి స్థానపు అప్రతిష్ఠను మూటగట్టుకుంది. తర్వాత స్థానాల్లో ఒడిశా, హరియాణా, తెలంగాణ, రాజస్థాన్లు నిలిచి ఆ అవమానపు భారాన్ని మోస్తున్నాయి. షాకింగ్ ఏంటంటే.. గతంలో కన్నా తెలంగాణలో మహిళల మీద హింస పెరిగినట్టు చూపిస్తోంది ఎన్సీఆర్బీ. అత్యంత తక్కువ కేసులతో నాగాలాండ్ కాస్త మెరుగైన రాష్ట్రంగా కనిపిస్తోంది. మూడేళ్లుగా ఇది ఈ రికార్డ్నే మెయిన్టైన్ చేస్తోంది. హింస పెట్రేగుతున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లు నిలిచి తలవంచుకుంటున్నాయి. 2021 సంవత్సరం CEOWORLD మ్యాగజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోకెల్లా తొలి స్థానంలో నిలిచిన దేశం నెదర్లాండ్స్. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్వీడన్లు ఉన్నాయి. డెన్మార్క్ నాలుగో స్థానాన్ని పొందింది. చిత్రమేంటంటే.. అందరికీ పెద్దన్నలా వ్యవహరించే అమెరికా మొదటి పది స్థానాల్లో ఎక్కడా లేదు. 20వ స్థానంలో ఉంది! యునైటెడ్ కింగ్డమ్ది పదిహేడో స్థానం. మన గురించీ చెప్పుకోవాలి కదా.. మహిళల భద్రత విషయంలో మన పరువుకు దక్కిన ప్లేస్.. నలభై తొమ్మిది! -
తుర్కియే- సిరియా భూకంపాలు: కదిలే భూమిని కనిపెట్టలేమా!
మనిషి చూపులు అంతరిక్షం అంచులను తాకుతున్నాయి! కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఏముందో? ఏం జరుగుతుందో.. దుర్భిణుల సాయంతో ఇట్టే పసిగట్టగలుగుతున్నాం! కానీ.. మన కాళ్లకింద నేల లోపలి రహాస్యాలు మాత్రం.. ఇప్పటికీ చేతికి చిక్కకుండానే ఉన్నాయి! తుర్కియే- సిరియాల్లో ఇటీవలి భూకంపాలు రెండూ.. ఇందుకు తాజా నిదర్శనం! వాన రాకడ.. ప్రాణం పోకడలను కొంచెం అటు ఇటుగానైనా గుర్తించగల మానవ మేధ..భూకంపాల విషయానికి వచ్చేసరికి ఎందుకు విఫలమవుతోంది? ఫిబ్రవరి ఆరు.. 2023.. తెలతెలవారుతుండగానే తుర్కియే ఆగ్నేయ ప్రాంతాన్ని మహా భూకంపం కుదిపేసింది. ప్రజలింకా నిద్రలో ఉండగానే.. భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ముంచుకొచ్చిన ఈ విలయం తాకిడికి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం గురించి ప్రపంచానికి తెలిసింది కూడా ప్రకంపనల ద్వారానే అంటేనే ఈ భూకంపాలు ఎంత నిశ్శబ్దంగా మనిషిని కబళించగలవో ఇట్టే అర్థమైపోతుంది. తుర్కియేలో తొలి భూకంపం సంభవించిన కొన్ని గంటల తరువాత సిరియా ఉత్తర ప్రాంతంలో సుమారు 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. రెండు భూకంపాల కేంద్రాలూ భూమికి అతితక్కువ లోతులోనే పుట్టాయి. దీంతో కదలికల తీవ్రత ఎక్కువగా ఉండింది. ప్రధాన భూకంపం తరువాత వచ్చిన ప్రకంపనలూ ఎక్కువ కాలం కొనసాగాయి. రక్షణ చర్యలకు విఘాతం కలిగించే స్థాయిలో ఇవి ఉండటం గమనార్హం. సహాయక పనుల కోసం అక్కడికి చేరుకున్న వారు కూడా.. నేల కుప్పకూలిపోవడం, గ్రౌండ్ లిక్విఫికేష¯Œ వంటి ప్రమాదాల్లో చిక్కుకునే రిస్క్ ఉందని అమెరికా జియలాజికల్ సర్వే హెచ్చరించింది కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించడం వీలైంది. 228 గంటల తరువాత కూడా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది కానీ.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అందరి మనసులను.. ఈ భూకంపాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయామన్న ప్రశ్న మాత్రం వేధిస్తూనే ఉంది. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపాలతో సుమారు 41 వేల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. గాజియాన్టెప్ పట్టణం సమీపంలో తొలి భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి కంపించింది. ఈ ఆఫ్టర్షాక్స్ మధ్యలోనే ఇంకో భూకంపమూ సంభవించింది. తొలి భూకంపం తీవ్రత 7.8. ఆ లెక్కల ప్రకారం ఇది చాలా పెద్ద భూకంపం. భూమి లోపల వంద కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్లైన్ లో రావడంతో పరిసరాల్లోని భవనాలకు తీవ్ర నష్టం జరిగింది. ఏటా సంభవించే అత్యంత ప్రమాదకరమైన భూకంపాలను పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కేవలం రెండు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం, అంతకుముందు పదేళ్లలోనూ నాలుగు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం గమనార్హం. అలాగని కేవలం ప్రకంపనల ఫలితంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రజలు ఇళ్లల్లో నిద్రలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకో కారణం.. ఆ ప్రాంతాల్లోని భవనాల దృఢత్వం! తుర్కియే, సిరియా.. రెండింటిలోనూ భూకంపాలను తట్టుకోగల భవనాలు దాదాపుగా లేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 200 ఏళ్లుగా భూకంపాల్లేవు.. తుర్కియే, సిరియాల్లో గత 200 ఏళ్లుగా చెప్పుకోదగ్గ తీవ్రతతో భూకంపాలు లేవు. పోనీ చిన్నస్థాయిలోనైనా ప్రకంపనలేవైనా నమోదయ్యాయా? అంటే అదీ లేదు. దీంతో ఆ ప్రాంతంలో భూకంపాల సన్నద్ధత కూడా తక్కువగానే ఉండింది. 1970 నుంచి ఈ ప్రాంతంలో ఆరు కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు మూడే మూడు నమోదయ్యాయి. ఇంతకీ భూకంపాలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయన్న అనుమానం కలుగుతోందా? సమాధానాలు తెలుసుకుందాం! కాకపోతే ఇందుకోసం భూమి నిర్మాణాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ మాదిరిగానే భూమి కూడా పొరలు పొరలుగా ఉంటుందని మనం చదువుకుని ఉంటాం. ఈ పొరల్లో అన్నింటికంటే పైన ఉన్నదాన్ని క్రస్ట్ అంటారు. మన కాళ్ల కింద మొదలై కొన్ని కిలోమీటర్ల లోతు వరకూ ఉంటుంది ఈ పొర. దాని దిగువన మాంటెల్, అంతకంటే దిగువన కోర్ అని పేర్లున్న పొరలు ఉంటాయి. ఇప్పుడు పై పొర క్రస్ట్ గురించి కొంచెం వివరంగా.. భూమి మొత్తం ఇది ఒకే ఒక్కటిగా ఉండదు. ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఒక్కో ముక్కను టెక్టానిక్ ప్లేట్ అని అంటారు. ఈ ప్లేట్లు స్థిరంగా కాకుండా.. కదులుతూ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్లు కదిలే క్రమంలో ఘర్షణ పుడుతూంటుంది. రెండు ప్లేట్లు ఢీకొనడం.. లేదా ఒకదాని కిందకు ఒకటి చేరడం.. లేదా ఒకదానికి ఒకటి దూరంగా జరగడం వంటి నాలుగు రకాల కదలికల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ జరగుతూ ఉంటుంది. అత్యధిక పీడనం నిల్వ అవుతూ వస్తుంది. ఈ పీడనం కారణంగా ఒక్కోసారి ఒక ప్లేట్ అకస్మాత్తుగా ఇంకోదానిపై జరగడం వల్ల అప్పటివరకూ అక్కడ నిల్వ ఉన్న పీడనం భూకంపం రూపంలో విడుదల అవుతుంది. తుర్కియే, సిరియాల్లో భూకంపాలు సంభవించిన ప్రాంతం మూడు టెక్టానిక్ ప్లేట్ల సంగమ స్థలం. అనటోలియా, అరేబియన్ , ఆఫ్రికా ప్లేట్లు కలిసే చోటనే భూకంపాలు సంభవించాయి. అరేబియా ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్పై ఒత్తిడి తెచ్చిన కారణంగా భూకంపం సంభవించింది. 1822 ఆగస్టు 13న ఈ ప్రాంతంలోనే 7.4 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఆ తరువాత ఆ స్థాయి భూకంపం వచ్చింది ఈ ఏడాదే. 1822 నాటి భూకంపంలోనూ ఈ ప్రాంతంలో ప్రాణనష్టం, విధ్వంసం ఎక్కువగానే నమోదైంది. ఒక్క అలెప్పో నగరంలోనే 7000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏడాది పాటు కొనసాగిన ప్రకంపనలు మరింత విధ్వంసం సృష్టించాయి. తాజాగానూ ప్రకంపనలు మరికొంత కాలం కొనసాగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయాం? వాస్తవానికి భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి టెక్నాలజీ లేదు. చాలా చాలా కష్టమైన వ్యవహారమీ భూకంపాలు. భూకంపం జరిగిన తరువాత కూడా కేవలం ఒకట్రెండు నిమిషాలు మాత్రమే దాని సంకేతాలు మనకు తెలుస్తూంటాయి. అందుకే భూకంపాల గురించి తెలిసే ఈ అతికొద్ది సమాచారం ఆధారంగా వాటిని ముందుగానే గుర్తించడం పెను సవాలుగా మారింది. నిజానికి 1960ల నుంచే భూకంపాలను ముందుగా గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టెక్టానిక్ ప్లేట్ల అమరిక, లోటుపాట్లు (ఫాల్ట్లైన్స్) అత్యంత సంక్లిష్టంగా ఉన్న కారణంగా ఇప్పటివరకూ సాధించింది కొంతే. ప్రపంచం మొత్తం వ్యాపించిన ఫాల్ట్లైన్లకు తోడు భూమి లోపలి నుంచి పలు రకాల శబ్దాలు, సంకేతాలు వెలువడుతూండటం కూడా పరిస్థితిని మరింత జటిలం చేశాయి. భూకంపం ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? తీవ్రత ఎంత? అన్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగల పద్ధతిని ఆవిష్కరించగలిగితే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇప్పటివరకూ ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. జంతువుల ప్రవర్తన నుంచి అయనోస్ఫియర్ వరకూ.. భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశారు. భూకంపం వచ్చే ముందు జంతువులు ప్రవర్తించే తీరుతో మొదలుపెట్టి భూ వాతావరణపు పైపొర అయనోస్ఫియర్లోని కణాల పరిశీలన వరకూ అనేక రకాలుగా యత్నిస్తున్నారు. తాజాగా మనుషులు గుర్తించలేరేమో అని.. సూక్ష్మమైన సంకేతాలను గుర్తించేందుకు కృత్రిమ మేధను వాడే ప్రయత్నమూ జరుగుతోంది. భూమి మాదిరిగానే ఉండే మోడల్ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్ సాయంతో ఇటలీలోని సేపియేంజా యూనివర్సిటీ అధ్యాపకుడు క్రిస్ మరోన్ ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశోధనశాలలో తాము భూకంపాలను బాగానే గుర్తించగలగుతున్నామని, వాస్తవ పరిస్థితుల్లో మాత్రం విఫలమవుతున్నామని మరోన్ తెలిపారు. చైనాలో శాస్త్రవేత్తలు అయనోస్ఫియర్లో విద్యుదావేశంతో కూడిన కణాలు భూకంపాల వల్ల ఏవైనా కంపనలు సృష్టించాయా? వాటి ద్వారా ముందస్తు గుర్తింపు వీలవుతుందా? అన్నది పరిశీలిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఫోర్క్యాస్టింగ్కు చెందిన జింగ్ లియూ అంచనా ప్రకారం భూకంపానికి ముందు రోజుల్లో అయనోస్ఫియర్లో మార్పులు జరుగుతాయి. ఫాల్ట్ జోన్ల ప్రాంతం పైన భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు రావడం వల్ల విద్యుదావేశ కణాలు కంపనలు సృష్టిస్తాయి. 2010 ఏప్రిల్లో కాలిఫోర్నియాలోని బాజా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దానికి పది రోజుల ముందే అయనోస్ఫియర్లో మార్పులను గమనించామని ఆయన చెబుతున్నారు. చైనా ఇంకో అడుగు ముందుకేసి అయనోస్ఫియర్లో జరిగే ఎలక్ట్రికల్ తేడాలను గుర్తించేందుకు 2018లో ‘చైనా సెసిమో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శాటిలైట్’ను ప్రయోగించింది కూడా. గత ఏడాది చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్ సెంటర్ శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేస్తూ భూకంపానికి 15 రోజుల ముందు అయనోస్ఫియర్లోని ఎలక్ట్రాన్ల సాంద్రత గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2021 మే, 2022 జనవరి నెలల్లో చైనాలో వచ్చిన భూకంపాలకు ముందు ఈ పరిశీలనలు జరిగాయి. ఇజ్రాయెల్లోని ఏరియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము భూకంపాలను 48 గంటల ముందే 83 శాతం కచ్చితత్వంతో గుర్తించగలమని ఇటీవలే ప్రకటించారు. గత 20 ఏళ్లలో అయనోస్ఫియర్లోని ఎలక్ట్రాన్ కంటెంట్లో వచ్చిన మార్పులకు కృత్రిమ మేధను జోడించడం ద్వారా ఇది సాధ్యమైందని వారు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. జపాన్లో కొంతమంది కొన్ని విచిత్రమైన సూచనలు చేస్తున్నారు. భూకంపాలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో నీటి ఆవిరి ఆధారంగా భూకంపాలను ముందుగానే గుర్తించవచ్చునని, అది కూడా 70 శాతం కచ్చితత్వంతో చేయవచ్చునని చెబుతూండటం విశేషం. కాకపోతే ఈ పద్ధతిలో నెల రోజులు ముందు మాత్రమే భూకంపాన్ని గుర్తించ వచ్చు. మరికొందరు భూ గురుత్వాకర్షణ శక్తిలో వచ్చే మార్పుల ఆధారంగా భూకంపాలను గుర్తించవచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే.. శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ భూకంపాలను అవి సంభవించేందుకు ముందుగానే కచ్చితంగా గుర్తించడం సాధ్యంకావడం లేదనేది నిష్ఠుర సత్యం!! మీకు తెలుసా..? ► యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే లెక్కల ప్రకారం భూమి ఏటా కొన్ని లక్షల సార్లు కంపిస్తూంటుంది. వీటిల్లో చాలావాటిని మనం అస్సలు గుర్తించం. తీవ్రత తక్కువగా ఉండటం, లేదా జనావాసాలకు దూరంగా సంభవించడం దీనికి కారణం. అయితే ఏటా సంభవించే భూకంపాల్లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగినవని దాదాపు 17 వరకూ ఉంటాయి. ఎనిమిది స్థాయి తీవ్రత ఉన్నది ఒక్కటైనా ఉంటుంది. ► టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా హిమాలయాల ఎత్తు పెరుగుతోందని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అలాగే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం మొత్తం లాస్ ఏంజిలెస్ వైపు కదులుతోంది. మన గోళ్లు పెరిగినంత వేగంగా అంటే ఏడాదికి రెండు అంగుళాల చొప్పున ఈ కదలిక ఉన్నట్లు అంచనా. సా¯Œ ఆండ్రియాస్ ఫాల్ట్ రెండు వైపులు ఒకదాని కింద ఒకటి జారిపోతూండటం వల్ల ఇలా జరుగుతోంది. అయితే ఈ రెండు నగరాలు కలిసిపోయేందుకు ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల సమయం ఉందిలెండి! ► 2011 మార్చి 11న జపాన్ తీరంలో 8.9 తీవ్రతతో వచ్చిన భూకంపం మన రోజు లెక్కను మార్చేసింది. భూమిలోపలి పదార్థం పంపిణీ అయిన తీరులో భూకంపం మార్పు తేవడంతో భూమి కొంచెం వేగంగా ► భూకంపం తరువాత ఆ ప్రాంతాల్లోని కాలువలు, చెరువుల్లోని నీరు కొంచెం కంపు కొడతాయి. అడుగున ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదిలినప్పుడు అక్కడ చిక్కుకుపోయి ఉన్న వాయువులు పైకి రావడం దీనికి కారణం. ► 2010 ఫిబ్రవరి 27న సంభవించిన 8.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా చిలీలోని కోన్ సెప్కియాన్ నగరం పశ్చిమం దిక్కుగా సుమారు పది అడుగులు జరిగింది! మొత్తం భూకంపాల్లో 90 శాతం పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి వస్తూంటాయి. ► 2015లో నేపాల్లో వచ్చిన 7.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా పలు హిమాలయ పర్వతాలు కుంగిపోయాయి. ఇందులో ఎవరెస్టు కూడా ఉంది. కనీసం ఒక్క అంగుళం మేర దీని ఎత్తు తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
జ్ఞాపకాల అంగడి
వీటిలో ఎన్నిటిని గుర్తుపట్టారు? ఓ మై గుడ్నెస్ అన్నిటినా? అయితే మీరు పలు బ్రాండ్లకు మంచి బిజినెస్ ఇస్తున్నట్టే! వాట్ ఆర్ యూ టాకింగ్? ఇవి నా చిన్నప్పటి.. లేదా నా యూత్ మెమొరీస్.. వాటిని బ్రాండ్స్ ఏం చేసుకుంటాయి? బిజినెస్ చేసుకుంటాయి! ఎస్.. ఇప్పుడు వినియోగదారుల చిన్ననాటి.. టీనేజ్ జ్ఞాపకాలే పలు వ్యాపార సంస్థలకు పెద్ద బిజినెస్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ జ్ఞాపకాలే కొత్త బిజినెస్కు ఆలోచన పడేలా చేస్తున్నాయి.. నోస్టాల్జియాకున్న పవర్ అది! అందుకే దీన్ని నోస్టాల్జియా మార్కెట్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ తిరుగుతోంది ఈ ఇరుసు మీదే! ఇంట్లో.. బయటా.. ఎక్కడ ఏ వస్తువు కనపడినా.. ఏ పరిసరంలో తిరుగాడినా.. ఏ మాటలు.. పాటలు విన్నా.. అవన్నీ ఏదోరకంగా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నవే అయ్యుంటాయి! లేదంటే గతంలోని ఏదో ఒక సందర్భాన్ని.. అపూర్వ క్షణాలను.. వ్యక్తులను గుర్తుచేసేవే ఉంటాయి! గమ్మత్తయిన ఓ వర్ణం.. అమ్మకు తను కట్టుకున్న తొలి చీరను గుర్తుచేయొచ్చు. మనవరాలో.. మనవడో.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ కొనుక్కున్న ఓ స్టీల్ గిన్నె.. నానమ్మకు తన కాపురాన్ని జ్ఞాపకంలోకి తేవచ్చు. స్పాటిఫైలో పాట.. నాన్నకు తన బాల్యంలోని సినిమా థియేటర్ని అతని కళ్లముందు ఉంచొచ్చు. పఫ్తో హెయిర్ స్టయిల్ అత్తను తన యవ్వనపు రోజుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటీటీ సిరీస్లోని ఓ సన్నివేశంతో తన చిన్నప్పుడు దొంగతనంగా కాల్చిన సిగరెట్ దమ్ము.. తాతయ్య మది అట్టడుగు పొరల్లోంచి బయటకు రావచ్చు! ఇలా జ్ఞాపకల్లేని జీవితం ఉంటుందా? పైగా పాతవన్నీ మధురాలే! అందుకే కదా అన్నారు ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని! ఈ మాటనే వ్యాపార మంత్రంగా పట్టేసుకున్నాయి పలు వ్యాపార సంస్థలు. ఎలాగంటే.. ‘ఆరోజుల్లో... ’ అని మొదలుపెట్టే సంభాషణతో చుట్టూ ఉన్న వాళ్లు చిరాకు పడుతుండొచ్చు. విసుగు చెందుతుండొచ్చు. కానీ.. వ్యాపార సంస్థలు మాత్రం ఆ మాటల ప్రవాహాన్ని పట్టుకుని అందులో ఈది.. ఆ జ్ఞాపకాల్లో తమ బ్రాండ్స్ను దొరకబుచ్చుకుని పాత కొత్తల కలయికతో రీమేక్ చేసి యాడ్స్ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ ‘యాది’ అనే టెక్నిక్ను బిజినెస్ ట్రిక్గా మలచుకుంటున్నాయి. ఈ స్క్రిప్ట్కి లీడ్ అందింది ఎప్పుడు? ఇంకెప్పుడూ.. కరోనా టైమ్లోనే! భలేవారే.. అన్నిటికీ కరోనాతో ముడిపెడితే ఎలా? అంటే పెట్టాల్సిందే మరి! కరోనాతో కరెంట్ ఎరా.. కరోనాకు ముందు.. తర్వాత అని చీలిపోతుందని లాక్డౌన్లో జోస్యం చెప్పుకున్నాం! నెమ్మదిగా అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మార్కెట్లో లాభాలు సృష్టిస్తోంది. అంటే కాలం ఆ విభజనను స్పష్టం చేసిందన్నట్టే కదా! లాక్డౌన్లో చాలా మంది.. నాటి దూరదర్శన్ సీరియళ్లు, పాత సినిమాలు, పాటలతోనే కాలక్షేపం చేశారుట. ఆ కాలక్షేపంలో పల్లీ బఠాణీలు, పాప్కార్న్ని కాకుండా ఆ సీరియళ్లతో సమానంగా ఆస్వాదించిన నాటి ప్రకటనలను.. ప్రొడక్ట్స్ను.. వాటి తాలూకు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారని పలు అధ్యయనాల సారాంశం. ఆ సారాన్ని పట్టుకునే వ్యాపార సంస్థలు నోస్టాల్జియాలో మార్కెట్ను వెదుక్కున్నాయి. మిలెనీయల్స్కీ.. జెన్జెడ్కీ.. ఆ తరపు మెమోరీస్ని కొత్త ర్యాపర్లో చుట్టి ప్రకటనల గిఫ్ట్స్ని అందిస్తున్నాయి. ఈ జాబితాలో క్రెడ్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి క్యాడ్బరీ దాకా పలు ప్రముఖ బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఇలా కొత్త ర్యాపర్లో పాత యాడ్స్ను చుట్టి స్క్రీన్ మీద పరుస్తున్నాయి. ఆ మధురాలు పాత తరపు వినియోగదారుల భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యి నాటి ఆనందానుభూతులను తాజా చేసి ఆ బ్రాండ్స్ పట్ల వాళ్ల లాయల్టీని పెంచుతున్నాయి. ఈ తరమేమో ఆ గిమ్మిక్కి పడిపోయి.. ఆ బ్రాండ్స్కి కొత్త కన్జూమర్స్గా రిజిస్టర్ అవుతోంది. ఇలా ఒకే ఇంట్లో ఆబాలగోపాలన్ని అలరించి.. మెప్పించి తమ ఖాతాను స్థిరపరచుకుంటున్నాయి. ఇదే కాక క్రెడ్ ఓజీ (OG) పేరుతో రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్, జావగల్ శ్రీనాథ్, మనీందర్ సింగ్, సబా కరీమ్ లాంటి నాటి మేటి క్రికెటర్స్తోనూ యాడ్స్ రూపొందించింది. ఇలా రిలీజ్ అయిన వెంటనే అలా వైరల్ అయ్యాయి ఆ ప్రకటనలు. ఆ యాడ్స్లో కొన్ని.. క్యాడ్బరీ.. కుఛ్∙ఖాస్ హై 90ల్లో.. ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటాడు.. సెంచరీకి చివరి బంతి అన్నమాట. బంతి గాల్లో లేచి.. క్యాచ్ అవుతుందా అన్న ఉత్కంఠలో క్యాచ్ మిస్ అయ్యి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ చాక్లెట్ తింటూ టెన్షన్ పడ్డ అతని గర్ల్ఫ్రెండ్ ఆనందానికి అవధులుండవు. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేస్తూ స్టేడియంలోకి వస్తుంది.. సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! ఇప్పుడు క్రికెట్ స్టేడియం.. లేడీ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటుంది. సెంచరీకి ఒక రన్ తక్కువగా ఉంటుంది ఆమె స్కోర్. ఓ షాట్ కొడుతుంది. అది గాల్లో లేచి.. బౌండరీ దగ్గరున్న ఫీల్డర్ దోసిట్లో పడబోయి.. మిస్ అయి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ తింటూ టెన్షన్ పడిన ఆ క్రికెటర్ బాయ్ఫ్రెండ్ సంతోషానికి ఆకాశమే హద్దవుతుంది. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేసుకుంటూ స్టేడియంలోకి వస్తాడు సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! స్విగ్గీ ఇన్స్టామార్ట్.. ఫైవ్స్టార్తో కలసి అప్పుడు.. ఫైవ్స్టార్ ఇద్దరు యువకులు.. ఓ ప్యాంట్ను దర్జీకిస్తూ ‘నాన్నగారి ప్యాంట్.. ఒక అంగుళం పొడవు తగ్గించాలి’ అని చెప్పి వాళ్ల వాళ్ల షర్ట్ జేబుల్లోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసి ఓ బైట్ తిని .. ఆ ఇద్దరూ మొహాలు చూసుకుని అప్పుడే ఒకరినొకరు గుర్తుపట్టినట్టు.. ‘రమేశ్.. సురేశ్’ అని పిలుచుకుంటారు. ఇలా చాక్లెట్ తింటూ.. మైమరిచిపోయి.. దర్జీకి పదేపదే ఆ ప్యాంట్ను అంగుళం చిన్నది చేయమని పురమాయిస్తూంటారు. ఈలోపు ఆ ప్యాంట్ కాస్త నిక్కర్ అయిపోతుంది. ఇప్పుడు.. స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇందులోనూ రమేశ్, సురేశ్ ఇద్దరూ ఓ ప్యాంట్ తీసుకుని దర్జీ దగ్గరకు వస్తారు. ఆ ప్యాంట్ పొడవు తగ్గించాలని పురమాయించి.. ఫైవ్స్టార్ కోసం జేబులు వెదుక్కుంటూంటారు.. ఖాళీ అయిపోయిన ర్యాపర్స్ తప్ప చాక్లెట్స్ దొరకవు. అప్పుడు వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది.. ‘ఇప్పటికిప్పుడు చాక్లెట్స్ కావాలా? స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేయండి.. నిమిషాల్లో చాక్లెట్స్ మీ ముందుంటాయి’ అంటూ! అప్పుడు రమేశ్.. సురేశ్ పక్కకు చూడగానే చాక్లెట్స్ పట్టుకుని నిలబడ్డ స్విగ్గీ ఇన్స్టామర్ట్ డెవలరీ పర్సన్ కనపడుతుంది. క్రెడ్.. (క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ యాప్) నాడు.. దీపికాజీ (నిర్మా వాషింగ్ బార్) దీపికా చిఖలియా (నాటి టీవీ రామాయణంలో సీత పాత్రధారి) కిరాణా షాప్లోకి వెళ్లి.. నిర్మా బట్టల సబ్బు ఇవ్వమని షాప్ అతన్ని అడుగుతుంది. ‘దీపికాజీ.. మీరెప్పుడూ సాధారణ సబ్బే కదా తీసుకునేది.. మరిప్పుడూ?’ అంటూ ఆగిపోతాడు. ‘సాధారణ సబ్బు ధరకే నిర్మా బార్ వస్తుంటే ఎందుకు కాదనుకుంటాను’ అంటుంది దీపికా. నేడు .. కరిష్మాజీ (క్రెడ్ పేమెంట్ యాప్ కోసం) షాప్లోకి వెళ్తుంది కరిష్మా కపూర్ సెల్ఫోన్ చార్జర్ కోసం. సాధారణమైన చార్జర్ కాక స్టాండర్డ్ చార్జర్ అడుగుతుంది. ‘కారిష్మాజీ.. మీరు సాధారణంగా మామూలు చార్జరే అడుగుతారు కదా.. మరిప్పుడు?’ అని ఆగుతాడు. సాధారణ చార్జర్ ధరకే క్రెడ్ బౌంటీ స్టాండర్డ్ చార్జర్ ఇస్తుండగా ఎందుకు కాదంటాను!’ అంటుంది. పార్లే జీ.. భారత్ కా అప్ నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్ ) నిరుటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లే జీ ‘ భారత్ కా అప్నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్)’ పేరుతో నోస్టాల్జియా క్యాంపెయిన్ యాడ్ను విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమర ప్రయాణంలో మేమూ కలసి నడిచాం! చాయ్ తీపిని.. స్వాతంత్య్ర సాధన సంతోషాన్నీ రెట్టింపు చేశాం! దేశం సాధించిన ప్రతి విజయంలో భాగస్వాములమయ్యాం..’ అంటూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు దేశం సాధించిన ప్రగతిని చూపిస్తూ.. అప్పటి నుంచీ ఉన్న తన ఉనికినీ ప్రస్తావిస్తూ .. నాటి జ్ఞాపకాల వరుసలో తనను ముందు నెలబెట్టుకుని.. ఇప్పటికీ అంతే తాజాగా ఉన్నానని చెబుతూ తన ప్రొడక్ట్ అయిన బిస్కట్స్ను మిలెనీయల్స్ చేతుల్లో ఉన్న చాయ్ కప్పుల్లో.. పాల గ్లాసుల్లోనూ డిప్ చేసింది. టాటా సాల్ట్ కూడా బాక్సర్ మేరీ కోమ్ను పెట్టి.. ‘దేశ్ కా నమక్’ పేరుతో నోస్టాల్జియా, సెంటిమెంట్ను కలిపి కొట్టి కమర్షియల్ యాడ్ను రూపొందించింది. అది వర్కవుట్ అయింది. మదర్స్ రెసిపీ కూడా తన పచ్చళ్ల వ్యాపార ప్రమోషన్కు జ్ఞాపకాల ఊటనే వాడుకుంది. దిన పత్రికలూ నోస్టాల్జియా ప్రకటనలనే నమ్ముకున్నాయి. అందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా ‘హ్యాకీ చాంపియన్’ యాడే ఉదాహరణ. ఇవేకాక పేపర్ బోట్, గూగుల్ వంటి న్యూజనరేషన్ కంపెనీలూ నోస్టాల్జియాను ప్లే చేశాయి. రీలాంచ్ కూడా నోస్టాల్జియాతో ప్రొడక్ట్ ప్రకటలనే కాదు ప్రొడక్షన్ ఆగిపోయిన వస్తువులనూ తిరిగి ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటిల్లో పార్లే వాళ్ల రోలా కోలా ఒకటి. 80లు, 90ల్లో పిల్లలకు ఈ క్యాండీ సుపరిచితం. పదమూడేళ్లుగా ఇది ఆగిపోయింది. కానీ దీనితో ముడిపడున్న తీపి జ్ఞాపకాలు మాత్రం 80, 90ల్లోని పిల్లలతో పాటే పెరిగి స్థిరపడ్డాయి. అందుకే నాలుగేళ్ల కిందట.. కేరళకు చెందిన 29 ఏళ్ల సిద్ధార్థ్ సాయి గోపినాథ్ అనే యువకుడు రోలా కోలా ఫొటో పెట్టి.. దాన్ని పార్లేకి ట్యాగ్ చేస్తూ ఇది మళ్లీ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని రీట్వీట్స్ కావాలంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్కి పార్లే స్పందించింది. కనీసం పదివేల రీట్వీట్స్ కావాలని బదులిచ్చింది. అయిదారు నెలలకు సిద్ధార్థ కోరిక నెరవేరింది. ‘మంచి ఫలితానికి నిరీక్షణ తప్పదు.. కానీ నిరీక్షణ ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది.. రోలా కోలా ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ పార్లే ప్రకటించింది. సిద్ధార్థ్ ఈ రోలా కోలా కోసం ట్యాగ్ చేయని సెలబ్రిటీల్లేరు.. మెగా బ్రాండ్స్ లేవు. ఆఖరకు నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏవియేషన్ కంపెనీలనూ వదల్లేదు. కాంపా కోలా.. 1970, 80ల్లో తన టేస్ట్తో మార్కెట్ను రిఫ్రెష్ చేసిన సాఫ్ట్డ్రింక్ ఇది. గ్లోబలైజేషన్తో మన అంగట్లోకి వచ్చిన పెప్సీ, రీ ఎంటర్ అయిన కోకా కోలా థండర్ వేవ్స్కి తట్టుకోలేక దేశీ సాఫ్ట్డ్రింక్ కాంపా కోలా కనుమరుగైపోయింది. దీన్నిప్పుడు రిలయెన్స్ కొనుగోలు చేసింది.. దేశీ డ్రింక్గా నాటి జ్ఞాపకాల చల్లదనంతో వినియోగదారులను సేదతీర్చడానికి సిద్ధమైంది. మ్యాగీ ఏమైనా తక్కువ తిందా? నిర్ధారిత పరిమాణం కన్నా సీసం పాళ్లు ఎక్కువున్నాయన్న కంప్లయింట్తో నెస్లే ప్రొడక్ట్ మ్యాగీ మన వంటింటి కప్బోర్డులను ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళ్లింది వెళ్లినట్టు ఊరుకుందా? లేదు! పిల్లల ఆకలి తీర్చిన ఇన్స్టంట్ ఫుడ్ జ్ఞాపకాలను రెచ్చగొట్టింది.. మిస్ యూ.. కబ్ వాపస్ ఆయేగా యార్ (తిరిగి ఎప్పుడొస్తున్నావ్) అంటూ! ప్రకటనలు, నలుమూలలా హోర్డింగ్లతో హోరెత్తించింది. ఈ ఉత్సాహం, స్ఫూర్తితో చాలా కంపెనీలు.. షటర్ మూసుకున్న తమ ప్రొడక్ట్స్ని కొత్తగా ముస్తాబు చేసి తిరిగి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. కొత్తేం కాదు.. నోస్టాల్జియాతో మార్కెట్ను ఏలడం కొత్త అనుకుంటున్నాం కానీ.. కాదు. ఫ్యాషన్ ప్రపంచం ఫాలో అయ్యేది ఈ సూత్రాన్నే! బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్మన్ కలర్ కాలం నాటి ట్రెండ్స్ని రెట్రో స్టయిల్ పేరుతో ఎప్పటికప్పుడు మార్కెట్ చేయట్లేదూ..! అలా బెల్బాటమ్, త్రీ ఫోర్ హ్యాండ్స్ బ్లౌజెస్, పోల్కా డాట్స్ డిజైన్స్, ఫ్రెంచ్ కట్ బియర్డ్స్, పఫ్ కొప్పులు ఎట్సెట్రా లేటెస్ట్ ఫ్యాషన్గా ఎన్ని యూత్ని ఆకట్టుకోవడం లేదు! ఆధునిక సాంకేతికతకు కవల జంటలైన ‘ఈ’ జెనరేషన్కూ త్రోబ్యాక్ సుపరిచితమే సోషల్ మీడియా సాక్షిగా. నిజానికి ప్రస్తుతం పలు బ్రాండ్స్ చేస్తున్న ఈ నోస్టాల్జియా మార్కెట్కి ప్రేరణ సోషల్ మీడియా త్రోబ్యాక్ థర్స్డేతోపాటు అది పోస్ట్ అయిన పాస్ట్ ఈవెంట్స్.. ఇన్సిడెంట్స్లను తడవ తడవకు గుర్తుచేసే తీరే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్ట్రాటెజీ వల్ల పలు బ్రాండ్ల అమ్మకాలూ పెరిగాయనీ చెప్తున్నారు. ‘జ్ఞాపకాలనేవి భలే గిరాకీ బేరం. నాటి సంగతులను మంచి ఫీల్తో జత చేసుకుని వస్తాయి. ఎన్నటికీ ఇంకిపోని భావోద్వేగాల తడిని కలిగుంటాయి. కాబట్టే అవి మార్కెట్లో సేల్ అవుతున్నాయి’ అంటున్నారు ‘22ఫీట్ ట్రైబల్ వరల్డ్వైడ్’ నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ దేబాశీష్ ఘోష్. ‘టీబీడబ్ల్యూఏ ఇండియా’ సీసీఓ పరీక్షిత్ భట్టాచార్యేమో ‘నోస్టాల్జియా అనేది టైమ్ మెషిన్ లాంటిది. నడుస్తున్న కాలానికి అందులో యాక్సెస్ ఉండదు. మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనుకున్న క్షణాల్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది.. మళ్లీ జీవించేలా చేస్తుంది. ఆ బలహీనతనే కంపెనీలు ఎన్క్యాష్ చేసుకుంటున్నాయి’ అంటున్నారు. అయితే ఈ ప్రహసనంలో కొన్ని బ్రాండ్స్.. పాత ప్రకటన లేదా జ్ఞాపకానికి సమకాలీనతను జోడించే ప్రయత్నంలో వాటికున్న ఎసెన్స్ను కాపాడుతూ ఆధునికతను అద్దడంలో విఫలమవు తున్నాయి. పాత యాడ్స్.. ఆ కాలంలో అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అంతే అద్భుతమైన ఫలితాలనూ రాబట్టి ఉండొచ్చు. కాని వాటి విలువ సామాజికంగా కానీ.. కల్చర్ పరంగా కానీ ప్రాసంగికతను కలిగి ఉందా? దాన్ని నేటి తరం గ్రహించగలుగుతున్నదా? ఆ ప్రకటనల సారం నేటికీ సరిపోలనున్నదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి కొన్ని యాడ్స్ను ఇప్పుడు చూస్తే అంటే పరిణతి చెందిన ఆలోచనాతీరుతో.. ఇప్పుడు నెలకొని ఉన్న సున్నిత వాతావరణంలో పరికిస్తే అవి వివాదాస్పదంగా కనిపించవచ్చు. పురుషాధిపత్య ధోరణినీ చూపిస్తూండవచ్చు. కాబట్టి.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని పాత ప్రకటనలకు ఆ సెన్స్ను జోడించాకే నోస్టాల్జియా స్ట్రాటెజీని మార్కెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
వింత వింతల ఊళ్లు
దేశంలోని ఊళ్లన్నీ కాస్త హెచ్చుతగ్గులుగా దాదాపు ఒకేలా ఉంటాయి. ఇళ్లూ వాకిళ్లూ పొలాలూ పశువులూ, అరకొర సౌకర్యాలు, ఇక్కట్లతో ఈదులాడే జనాలు దాదాపు అన్ని ఊళ్లలోనూ ఉంటారు. అరుదుగా కొన్ని ఊళ్లు మాత్రం మిగిలిన ఊళ్లకు భిన్నంగా ఉంటాయి. కొన్ని ఊళ్లు వాటి వింతలు విడ్డూరాలతో మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇంకొన్ని ఊళ్లు పట్టణాలను తలదన్నే అభివృద్ధి సాధించి, అందరినీ అవాక్కయ్యేలా చేస్తాయి. ఏదో ఒక రీతిలో ప్రత్యేకత నిలుపుకొనే ఇలాంటి ఊళ్లే వార్తలకెక్కి, విస్తృత ప్రచారం పొందుతాయి. ఇలాంటి ఊళ్లు ప్రపంచంలోని అక్కడక్కడా ఉన్నాయి. అలాగే మన దేశంలోనూ కొన్ని వింత వింతల ఊళ్లు ఉన్నాయి. మన దేశంలో ఉన్న కొన్ని వింత వింతల ఊళ్ల కథా కమామిషూ తెలుసుకుందాం... ప్రాచీన జీవనశైలి కాలంతో పాటే లోకం ముందుకు పోతుంది. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వసతులను అందిపుచ్చుకుంటుంది. కాల గమనంలో ఇది సహజ పరిణామం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలను మానవాళికి అందిస్తూనే ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పురోగతి ఫలితంగా కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక, పాతవాటి వినియోగం క్రమంగా కనుమరుగవుతుంది. కాలంతో కలసి ముందుకు పయనించడమే మానవ స్వభావం. అందుకు భిన్నంగా వెనుకటి కాలానికి వెళ్లి ఎవరైనా జీవించాలనుకుంటే, అది కచ్చితంగా విడ్డూరమే! అలాంటి విడ్డూరం కారణంగానే శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం ఇటీవల విస్తృతంగా వార్తలకెక్కింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ గ్రామం గురించి, అక్కడి జనాలు స్వచ్ఛందంగా అనుసరిస్తున్న ప్రాచీన జీవనశైలి గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఫలితంగా దేశ విదేశాలకు చెందిన కొందరు సంపన్నులు కూర్మ గ్రామంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎగబడుతున్నారు. కూర్మ గ్రామంలో ఇళ్ల నిర్మాణం కూడా ప్రాచీన పద్ధతిలోనే ఉంటుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, కాంక్రీటు వాడరు. ఇక్కడివన్నీ సున్నం, బెల్లం, మినుములు, మెంతులు, కరక్కాయలు, గుగ్గిలం మిశ్రమంతో నిర్మించుకున్న మట్టి ఇళ్లే! ఈ గ్రామంలో విద్యుత్తు ఉండదు. విద్యుత్తుతో పనిచేసే ఏ వస్తువూ ఇక్కడ కనిపించదు. ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్’ (ఇస్కాన్) ఆధ్వర్యంలో దాదాపు ఐదేళ్ల కిందట ఇక్కడ గ్రామాన్ని నెలకొల్పుకున్నారు. వేకువ జామున నాలుగు గంటలకే నిద్రలేవడం, ‘హరేకృష్ణ’ నామ కీర్తన సాగిస్తూ ఊరంతా పదహారుసార్లు తిరగడం, ఆధ్యాత్మిక సాధన, వేదాధ్యయనం చేయడం, పాత పద్ధతుల్లోనే వ్యవసాయం ద్వారా గ్రామానికి అవసరమైన పంటలు పండించు కోవడం వంటి జీవనశైలి ఈ గ్రామాన్ని వార్తల్లో నిలిపింది. ఇక్కడ పన్నెండు కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ నడిపే గురుకులంలో పదహారుమంది విద్యార్థులు వేదాభ్యాసం చేస్తున్నారు. మరో ఆరుగురు బ్రహ్మచారులను కలుపు కొని ఈ గ్రామ జనాభా యాభైఆరు మంది. వీరంతా తమ ఇళ్లను తామే స్వయంగా నిర్మించుకుంటారు. తమ దుస్తులను తామే నేసుకుంటారు. ఈ గ్రామాన్ని తిలకించడానికి విదేశీయులు కూడా వస్తుంటారు. జీవితాలను యాంత్రికంగా మార్చేసిన అధునాతన సాంకేతికత కంటే, ఇక్కడి ప్రాచీనమైన గ్రామీణ జీవనశైలి ఎంతో హాయిగా ఉంటుందని పలువురు చెబుతుండటం విశేషం. సంస్కృతమే వారి భాష ప్రాచీన భాష అయిన సంస్కృతం మృతభాషగా మారిందని ఆధునికులు చాలామంది తీసిపారేస్తున్నా, ఆ గ్రామ ప్రజలు మాత్రం సంస్కృతాన్ని ఇప్పటికీ సజీవంగా బతికించుకుంటున్నారు. దేశంలోనే ఏకైక సంస్కృత గ్రామంగా పేరుపొందిన మత్తూరు గ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. ఇక్కడి ప్రజలు సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకుని, ఇప్పటికీ దాన్ని కాపాడుకుంటున్నారు. పిల్లలూ పెద్దలూ అందరూ ఇక్కడ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. మత్తూరు సంస్కృత గ్రామంగా మారడానికి వెనుక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ‘సంస్కృత భారతి’ సంస్థ ఈ గ్రామంలో 1981లో సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించింది. దీనికి హాజరైన ఉడిపి పెజావర మఠాధిపతి సంస్కృతం పట్ల గ్రామస్థుల ఆసక్తిని గమనించి, ఈ గ్రామాన్ని సంస్కృత గ్రామంగా తీర్చిదిద్దితే బాగుంటుందని చెప్పడంతో గ్రామస్థులు ఆ ఆలోచనను స్వాగతించారు. నాటి నుంచి సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకున్నారు. సంస్కృతాన్ని మాతృభాషగా చేసుకున్నప్పటికీ ఈ గ్రామస్థులు ఆధునికతకేమీ దూరం కాలేదు. ఇక్కడి నుంచి ఉన్నత చదువులు చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడినవారూ ఉన్నారు. సంస్కృతంపై ఆసక్తిగల వారెవరికైనా ఆ భాషను నేర్పడానికి వీరు నిత్యం సంసిద్ధంగా ఉంటారు. పక్షులే నేస్తాలు ఆ ఊరి ప్రజలకు పక్షులే నేస్తాలు. ఏటా నవంబర్ నుంచి జూలై మధ్య కాలంలో ఆ ఊళ్లో పక్షుల సందడి కనిపిస్తుంది. దేశ దేశాలు దాటి వచ్చే పక్షులు చనువుగా మనుషుల భుజాల మీద వాలే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ ఊరు కొక్కరెబెళ్లూరు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. వలసపక్షుల సీజన్లో ఇక్కడకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. శతాబ్దాలుగా ఇక్కడకు వలస పక్షులు వస్తున్నా, ఇక్కడి మనుషులు వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. సీజన్లో వచ్చే వలస పక్షులు యథేచ్ఛగా చెట్లపై గూళ్లు పెట్టుకునేవి. ఒక్కోసారి వేగంగా గాలులు వీచేటప్పుడు గూళ్లు నేల రాలేవి. వాటిలో పక్షులు పెట్టుకున్న గుడ్లు పగిలిపోయేవి. ఇంకా రెక్కలురాని పక్షిపిల్లలు పిల్లులకు, కుక్కలకు ఆహారంగా మారేవి. ‘మైసూర్ అమెచ్యూర్ నేచురలిస్ట్స్’ వ్యవస్థాపకుడు మను 1994లో ఇక్కడకు వచ్చినప్పుడు ఈ దయనీయమైన పరిస్థితిని గమనించారు. పక్షుల రక్షణ కోసం గ్రామస్థులు చొరవ తీసుకుంటే బాగుంటుందనుకుని, వారితో చర్చించారు. గ్రామంలో ‘హెజ్జర్లె బళిగె’ (కొంగలతో నేస్తం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులంతా ఇందులో భాగస్వాములయ్యారు. అప్పటి నుంచి ఈ గ్రామస్థులకు ఇక్కడకు వచ్చే వలసపక్షులతో స్నేహం మొదలైంది. అవి ఇక్కడ పెట్టుకునే గూళ్లు, వాటిలోని గుడ్లు, పక్షిపిల్లలు సురక్షితంగా ఉండేందుకు అన్ని సేవలూ చేస్తారు. అందుకే వలసపక్షులు ఈ గ్రామస్థులతో చాలా చనువుగా ఉంటాయి. -
సిరినామ సంవత్సరం
నేను చిన్న గింజనే.. కానీ చాలా గట్టిదాన్ని. ఇతర పంటలు మనలేని చోట్ల నేను పెరుగుతాను. ప్రతికూల వాతావరణాన్ని, కరువునూ తట్టుకుంటాను. ఏ పంటలూ చేతికి రాని కష్టకాలంలోనూ మీ కడుపు నింపుతాను. భూమిని, పర్యావరణ వ్యవస్థలను, జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తాను. నాలో ఎన్నెన్నో పోషకాలున్నాయి. విభిన్న రంగులు, రుచులున్నాయి. ఎన్నో రూపాల్లో దొరుకుతాను.. ప్రాచీన సంస్కృతులు, సంప్రదాయాలను బాగా ఎరిగిన ప్రత్యక్ష సాక్షిని నేను. ఆవిష్కరణలకు నేనొక సుసంపన్న చెలిమను. నా సుగుణాలను ప్రజలందరితోపాటు భూగోళానికి కూడా పంచి పెట్టాలన్నది నా ఆశ. కానీ, ఆ పనిని నేనొక్కదాన్నే చెయ్యలేను. అందుకే, మీ సాయం కోరుతున్నాను.. నన్ను మళ్లీ మీ భోజనాల్లోకి తెచ్చుకోమంటున్నాను. ‘వారసత్వ సుసంపన్నత.. సంపూర్ణ సామర్థ్యం’ ఇవీ నా భుజకీర్తులు. నేనేనండీ.. మీ చిరుధాన్యాన్ని! ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా అంతర్జాతీయ సమాజం అడుగులు వేస్తున్న సందర్భం ఇది.æముతక ధాన్యాలని, తృణధాన్యాలని ఛీత్కారాలతో చిరుధాన్యాలను దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశాం. భూతాపం, జీవన శైలి జబ్బుల విజృంభణతో తెలివి తెచ్చుకొని ‘పోషక ధాన్యాల’ (న్యూట్రి–సీరియల్స్) ఆవశ్యకతను గుర్తించాం. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నాం. చిరుధాన్యాలకు సుసంపన్న వారసత్వం ఉంది. సంపూర్ణ పౌష్టికాహార, ఆరోగ్య రక్షణ ఇవ్వగల సామర్థ్యం ఉంది. వరికి ఇచ్చిన స్థాయిలో సాగు, క్షేత్రస్థాయి ప్రాసెసింగ్ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ వరకు చిరుధాన్యాల ప్రోత్సాహక వ్యవస్థను నిర్మించటంపై ప్రభుత్వాలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన తరుణం ఇది. చిరుధాన్యాలు.. సిరిధాన్యాలు.. చిన్న చిన్న విత్తనాలతో కూడిన గడ్డి జాతి పంటల సమూహానికి చెందిన పంటలే ఈ చిరుధాన్యాలు. మనుషుల ఆహార అవసరాలతో పాటు పశువులు, చిన్న జీవాలకు మేత కోసం వీటిని ప్రపంచం అంతటా పండిస్తారు. ఇవి చాలా ప్రాచీనమైన పంటలు. మన పూర్వీకులు మొట్టమొదటిగా సాగు చేసిన పంటలు చిరుధాన్యాలే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొద్దిపాటి వర్షాలకే పండే పంటలివి. వీటిని మొట్టమొదటగా భారత్లో సాగైన అనేక రకాల చిరుధాన్యాలు తదనంతరం పశ్చిమ ఆఫ్రికాతోపాటు చైనా, జపాన్ తదితర 130 దేశాలకు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతల్లో ఆహార ధాన్యపు పంటలుగా విస్తరించాయి. ప్రాచీన సాహిత్యంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. మన దేశంలో చిరుధాన్యాల వినియోగం కాంస్య యుగం కన్నా ముందు నుంచే ఉన్నదని చరిత్ర చెబుతోంది. 50 ఏళ్ల క్రితం వరకు వ్యవసాయంలో చిరుధాన్యాలే ప్రధాన పంటలుగా ఉండేవి. స్థానిక ఆహార సంస్కృతిలో ఇవి అంతర్భాగమై కనబడేవి. పట్టణ ప్రాంతాల వినియోగదారులు ఎక్కువగా రిఫైన్డ్ ధాన్యాలపైనే ఆసక్తి చూపడంతో, రాను రాను చిరుధాన్యాల ప్రాధాన్యం తగ్గింది. ఆహారానికి వైవిధ్యాన్ని అందించే చిరుధాన్యాల స్థానంలో వరి, గోధుమల వినియోగం బాగా పెరిగింది. చిరుధాన్యాలు వర్షాధార, మెట్ట ప్రాంతాలకు అనువైన పంటలు. వీటిలో పోషక విలువలు ఎక్కువ. పండించడానికి ప్రకృతి/ఆర్థిక వనరుల ఖర్చు చాలా తక్కువ. అందుకే వీటిని అత్యంత మక్కువతో ‘సిరిధాన్యాలు’, ‘అద్భుత ధాన్యాలు’ లేదా ‘భవిష్య పంటలు’ అంటూ అక్కున చేర్చుకుంటున్నాం. ఈ చైతన్యాన్ని జనబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లటం పాలకులు, పర్యావరణ ప్రేమికులు, ఆరోగ్యాభిలాషులందరి కర్తవ్యం. అంతర్జాతీయ చిరు సంవత్సరం 2023.. ఇది అంతర్జాతీయ చిరుధాన్యాల పండుగ సంవత్సరం. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రెండేళ్ల క్రితం నిర్ణయించింది. 72 దేశాల మద్దతుతో ఈ అంతర్జాతీయ చిరుధాన్యాల పండుగ అమల్లోకి వచ్చింది. ఆరోగ్యపరమైన ప్రయోజనాలకు తోడుగా పర్యావరణ పరిరక్షణ పరంగా కూడా ఇవి మేలైన పంటలు. ఈ ఏడాదంతా చిరుధాన్యాలపై అవగాహన పెంచడం, ఆరోగ్య, పోషకాహార ప్రయోజనాల దృష్ట్యా, వీటి వినియోగం పెంచడానికి, సాగును విస్తృతం చేయడానికి అనువైన విధానాలు రూపొందించటంపైన మాత్రమే కాకుండా, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే రీతిలో మార్కెట్ అవకాశాలు పెంపొందించడంపైన కూడా దృష్టి సారించాల్సిన సమయమిది. మేజర్.. మైనర్ మిల్లెట్స్ పోషకాల గనులైన చిరుధాన్యాలను ప్రాథమికంగా రెండు విధాలుగా విభజించ వచ్చు. జొన్నలు, సజ్జలు, రాగులు.. గింజలపై పొట్టు తియ్యాల్సిన అవసరం లేని పెద్ద గింజల పంటలు. మేజర్ మిల్లెట్స్. కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగలు, అండుకొర్రలు.. గింజలపై నుంచి పొట్టు తీసి వాడుకోవాల్సిన చిన్న గింజల పంటలు. మైనర్ మిల్లెట్స్. పొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి రావటం వల్ల మైనర్ మిల్లెట్స్ ప్రాసెసింగ్ క్లిష్టతరమైన పనిగా మారింది. అందువల్లనే ఇవి కాలక్రమంలో చాలా వరకు మరుగున పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అధికంగా సాగవుతున్న పంట జొన్న. మొత్తం చిరుధాన్యాల్లో దీని వాటా 55.8 శాతం. 2010 నాటికి 4.22 కోట్ల హెక్టార్లలో జొన్న సాగు చేయగా 6.02 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. 2019 నాటికి జొన్న సాగు విస్తీర్ణం 4.02 కోట్ల హెక్టార్లకు, దిగుబడి 5.79 కోట్ల టన్నులకు స్వల్పంగా తగ్గింది. భారత్లో 1.38 కోట్ల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. హెక్టారుకు సగటున 1,248 కిలోల చొప్పున 1.72 కోట్ల టన్నుల దిగుబడి వస్తోంది. మన దేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత నాలుగో ముఖ్యమైన పంట జొన్న. 40.9 లక్షల హెక్టార్లలో 34.7 లక్షల టన్నుల జొన్నలు పండుతున్నాయి. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, అర్టెంటీనా, నైజీరియా, సూడాన్లో జొన్న విస్తారంగా సాగవుతోంది. భారత్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో సజ్జలు బాగా పండుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే.. 99.9% ఊదలు, 53.3% రాగులు, 44.5% సజ్జలు మన దేశంలోనే పండుతున్నాయి. అరికెలు, సామలైతే మన దేశంలో తప్ప మరెక్కడా పండించటం లేదని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) తెలిపింది. చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగంగా మార్చుకొని పౌష్టికాహార భద్రత పొందాలని ఐఐఎంఆర్ సూచిస్తోంది. 14 రాష్ట్రాలు.. 212 జిల్లాలు.. భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశాన్ని చిరుధాన్యాల అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ఆహార భద్రతా మిషన్ కింద 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంపుదలకు కృషి ప్రారంభమైంది. 2022–23లో 205 లక్షల టన్నుల చిరుధాన్యాల దిగుబడి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐఎంఆర్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, ఆధునిక ఆహారోత్పత్తులను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసే కంపెనీలు, స్టార్టప్లకు నాలెడ్జ్ పార్టనర్గా చేదోడుగా నిలుస్తోంది. చిరుధాన్యాలతో 67 రకాల సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక చిరుతిళ్లను వ్యాప్తిలోకి తెస్తోంది. కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అనేక చోట్ల రెండు రోజుల మిల్లెట్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. దేశంలో రెండో మిల్లెట్ మహోత్సవం ఇటీవలే విజయనగరంలో జరిగింది. చిరుధాన్యాలు సాగు చేసే రైతులు, స్వయం సహాయక మహిళా బృందాలకు, స్వచ్ఛంద సంస్థలకు, స్టార్టప్లకు ఈ మహోత్సవాలు మార్కెటింగ్ అవకాశాలను పెంపొందిస్తూ కొత్త ఊపునిస్తున్నాయి. మిల్లెట్ ఉత్పత్తుల మార్కెటింగ్ను ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ముందుకొచ్చింది. బెంగళూరులో ప్రతి ఏటా జనవరిలో జరిగే అంతర్జాతీయ మిల్లెట్స్, ఆర్గానిక్ ట్రేడ్ఫెయిర్ సేంద్రియ చిరుధాన్యాల సాగు, వినియోగం వ్యాప్తికి దోహదం చేస్తోంది. మిల్లెట్ మిషన్ ద్వారా ఒడిశా ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరుధాన్యాల సాగుకు, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. మిల్లెట్ బోర్డును ఏర్పాటు చేసింది. పంటల వారీగా మిల్లెట్ క్లస్టర్లను ఏర్పాటు చేయటం ద్వారా ఈ ఏడాది 4.87 లక్షల టన్నులకు చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. డయాబెటిస్, బీపీలకు చెక్ ప్రొటీన్లు, ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చిరుధాన్యాలు పోషక సంపన్న ఆహారంగా గుర్తింపు పొందాయి. వరి, గోధుమలతో పోల్చితే డైటరీ ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడే వారికి చిరుధాన్యాలు అనువైనవి. ఆరోగ్యాన్ని పెంపొందించే ఫెనోలిక్ కాంపౌండ్స్తో కూడి ఉన్నందున అనేక జీవన శైలి సంబంధమైన వ్యాధులను ఎదుర్కోవడానికి మిల్లెట్స్కు మించిన ఆహారం లేదంటే అతిశయోక్తి కాదు. మైనర్ మిల్లెట్స్ను రోజువారీ ప్రధాన ఆహారంగా తినగలిగితే ఏ జబ్బయినా కొద్ది కాలంలో తగ్గిపోతుందని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి చెబుతున్నారు. ఊరూరా తిరిగి సభలు పెట్టి మరీ ప్రజలకు ‘సిరిధాన్యాలతో ఆహార వైద్యం’ చేస్తున్నారు. జబ్బులు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నా, జబ్బుల్ని సమూలంగా పారదోలాలన్నా సిరిధాన్యాలు, గానుగ నూనెలు, తాటి/ఈత బెల్లం వంటి దేశీయ ఆహారాన్ని రోజువారీ ఆహారంగా తీసుకోవటమే మార్గమని చెబుతూవస్తున్నారు. డా. ఖాదర్ చెబుతున్న విషయాలన్నీ ‘సాక్షి’ చొరవ, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల కృషితో ఉచిత పుస్తకాలు, యూట్యూబ్ వీడియోల రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సబ్సిడీ ఇవ్వాల్సింది పోయి జీఎస్టీ పెంపా?! పౌష్టికాహార లోపం ఎక్కువగా ఎదుర్కొంటున్న పేద ప్రజల ఆహారంలోకి చిరుధాన్యాలను తిరిగి తేవాలంటే.. వరితో సమానంగా చిరుధాన్యాలపై కూడా ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. అంతర్జాతీయ సంవత్సరం పేరుతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించటం, మీటింగ్లు, రోడ్షోలు పెట్టడంతో సరిపెడుతోంది. స్టార్టప్లు చిరుతిళ్లను అమ్మినంత మాత్రాన, ఎగుమతి చేసినంత మాత్రాన చిరుధాన్యాలు తిరిగి పళ్లాల్లోకి రావు. ఈ పని జరగాలంటే తగిన విధాన నిర్ణయాలు జరగాలి. చిరుధాన్య రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి. ఎమ్మెస్పీ ప్రకటించినా ప్రభుత్వ సేకరణ లేదు. సామలు, అండుకొర్రలు తప్ప తక్కువ ధరకే రైతులు అమ్ముకుంటున్నారు. రెండు, మూడు పంచాయతీలకు ఒక చోటైనా స్మాల్ మిల్లెట్స్ ప్రాసెసింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలి. గోదాముల్లో నిల్వ చేయడానికి (రాగులు, కొర్రలకు తప్ప) ప్రమాణాలను నిర్ణయించలేదు. వరి బియ్యం స్థానంలో 25% చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వగలిగితేనే ప్రజల పళ్లాల్లోకి చిరుధాన్యాలు వస్తాయి. కానీ, కేంద్రం ఈ ఏడాదే చిరుధాన్యాల ఉత్పత్తులపై, ప్రాసెసింగ్ యంత్రాలపై జీఎస్టీని 5 నుంచి 18%కి పెంచింది. ప్రజాపంపిణీ వ్యవస్థలోను, అంగన్వాడీలకు సబ్సిడీపై చిరుధాన్యాలు ఇవ్వాలి. ఈ దిశగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. – ఎ. రవీంద్ర, డైరెక్టర్, వాసన్, స్వచ్ఛంద సంస్థ ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని దేశంలో విస్తృతం చేయడానికి కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తూ చిరుధాన్యాల సాగు, వినియోగంపై విజ్ఞానాన్ని పంచుతున్నాం. మేలైన చిరుధాన్య వంగడాలను రూపొందించి, విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. కొత్తగా చిరుధాన్యాలను తినటం ప్రారంభించే వారు తొలుత ఉదయం/రాత్రి దోసెలు, ఇడ్లీలు వంటి టిఫిన్లతో మొదలు పెట్టటం మంచిది. కొంత అలవాటైన తర్వాత అన్నంగా తీసుకోవచ్చు. మిల్లెట్ అటుకుల ఉప్మా చాలా బావుంటుంది. ఓట్స్కు బదులుగా వాడొచ్చు. వరి, గోధుమల్లో కన్నా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకేసారి మూడుపూటలా కేవలం చిరుధాన్యాలనే తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలను రోజుకు మూడు పూటలా అన్ని రకాల ఆహారాల్లోనూ నిక్షేపంగా తీసుకోవచ్చు. చిరుధాన్యాలతో 67 రకాల ఆహారోత్పత్తులను తయారు చేసే ఆధునిక సాంకేతికతలను ‘న్యూట్రిహబ్’ ద్వారా అభివృద్ధి చేశాం. ఆహారోత్పత్తుల కంపెనీలకు, స్టార్టప్ సంస్థలకు అందిస్తున్నాం. ప్రతి నెలా 3వ శనివారం మా కార్యాలయంలో గృహిణులకు చిరుధాన్య వంటకాలపై నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్నాం. వివరాలకు మా వెబ్సైట్ చూడవచ్చు. – డా. సి.వి. రత్నావతి, సంచాలకులు ఆయన చెప్పినట్లు కషాయాలు తాగి, సిరిధాన్యాలు తిని అనంతపురం జిల్లాలో ఓ గ్రామంలో 30 మంది డయాబెటిస్, బీపీల నుంచి బయటపడ్డారు. రెడ్స్, ఆర్డిటి స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో ఉచిత కామన్ కిచెన్ను నిర్వహిస్తూ, వైద్య పరీక్షల ద్వారా శాస్త్రీయంగా అన్ని వివరాలనూ నమోదు చేయటం విశేషం. ఇటువంటి అద్భుత ప్రయత్నాలు అన్ని చోట్లా జరగాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇటువంటి క్షేత్రస్థాయి ప్రయోగాలపై పరిశోధనలు చేపట్టాలి. ఆరోగ్య భారతాన్ని నిర్మించడటం ద్వారా ప్రపంచానికి సిరిధాన్యాల సత్తా చాటాలి. మిల్లెట్ మిక్సీలు చిరుధాన్యాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నది ఇటీవలి సంవత్సరాల్లోనే. కానీ, కొన్ని దశాబ్దాలుగా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న విశేష కృషిని మరువరాదు. తెలుగు రాష్ట్రాల్లో డెక్కన్ డవలప్మెంట్ సొసైటీ, టింబక్టు, సహజాహారం, వాసన్, ఎర్త్ 360, సంజీవని, మన్యదీపిక, సహజ సమృద్ధ వంటి స్వచ్ఛంద సంస్థలు చిరుధాన్యాల సాగును పెంపొందిం చడంతో పాటు వాటిని తిరిగి ప్రజల ఆహారంలోకి తేవడానికి ఉద్యమ స్థాయిలో విశేష కృషి చేస్తుండటం మంచి సంగతి. సహజ సమృద్ధ ఆధ్వర్యంలో ప్రచురితమైన ‘మిల్లెట్ క్యాలెండర్’ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ సంస్థల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టాలి. కొర్రలు, సామలు వంటి స్మాల్ మిల్లెట్స్ ధాన్యం పైన పొట్టు తీసి బియ్యం తయారు చేయడానికి సాధారణ మిక్సీలకు స్వల్ప మార్పులు చేస్తే చాలు. డా. ఖాదర్ వలితో పాటు వాసన్ స్వచ్ఛంద సంస్థ మిల్లెట్ మిక్సీలను రైతులకు, ప్రజలకు పరిచయం చేశారు. గ్రామ స్థాయిలో స్మాల్ మిల్లెట్స్ వినియోగంతో పాటు రైతుల ఆదాయం పెరగడానికి ఇది దోహదపడుతుంది. స్వావలంబనను సాధించే ఇటువంటి విజయాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ప్రజల ఆహార అలవాట్లలో చిరుధాన్యాలను మళ్లీ భాగం చేయడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలకు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఓ మంచి అవకాశం. మన దేశంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. పంచాయతీ స్థాయిలో ప్రాసెసింగ్, వినియోగ అవకాశాలను, పోషకాహార భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి. నిర్మాణాత్మక కృషి చెయ్యాలి. ఆహారం సరైనదైతే ఔషధం అక్కరలేదు. ఆహారం సరిగ్గా లేకపోతే ఏ ఔషధమూ పని చేయదు’. ఆరోగ్యమే మహాభాగ్యమని చాటే మన సంప్రదాయ చిరుధాన్యాల ఆహారం తిరిగి మన వంట గదుల్లోకి, పళ్లాల్లోకి ఎంత ఎక్కువగా తెచ్చుకోగలిగితే పుడమికి, మనకు అంత మేలు. చిరుధాన్యాల పునరుజ్జీవానికి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఒక ఊతంగా మారి ప్రజా ఉద్యమంగా రూపుతీసుకుంటుందని ఆశిద్దాం - పంతంగి రాంబాబు -
Funday Cover Story: ఆర్.. ఆర్.. ఆర్
చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కానీ ఇది కలియుగం! భూమికి మనమందరం కలిసి చేస్తున్న ద్రోహం ఎంత చెప్పుకున్నా తీరేది కానేకాదు. గాలి, నీరు.. భూమి.. ఖనిజాలు.. ఇలా భూమ్మీది వనరులన్నింటినీ... విచ్చలవిడిగా వాడేసిన ఫలితంగా ముంచుకొస్తున్న.... భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాలంటే... ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే! మానవాళి మొత్తం... మన మనుగడ కోసమే చేస్తున్న ఈ యుద్ధంలో.. అందరి తారక మంత్రం ఒకటే కావాలి. అదేమిటంటారా.... వాతావరణ మార్పుల గురించి కానీ... పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతల గురించి కానీ ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. కనీసం రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి నియమించిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ తరచూ అధ్యయన పూర్వకంగా విడుదల చేసిన నివేదికల్లో హెచ్చరిస్తూనే ఉంది. భూమి సగటు ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే పెనుముప్పు తప్పదని, సముద్ర తీర నగరాలన్నీ మునిగిపోవడం మొదలుకొని అకాల, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలతో భూమిపై మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఇప్పటివరకూ వెలువడిన ఆరు ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విపత్తు ముంచుకొస్తోందని తెలిసినా.. జంతుజాతి వినాశనం అంచున కొట్టుమిట్టాడుతోందన్నా ప్రపంచదేశాలు ఇప్పటికీ వీటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడం!! బాధ్యులెవరు? ఖర్చులు ఎవరు భరించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నెపం ఇంకొకరిపైకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది మరెంతో కాలం కొనసాగే సూచనలు లేవు. నిరుడు యూరప్ మొత్తం కరవు చుట్టుముట్టింది. అలాగే ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలు పాకిస్థాన్ను పలకరించాయి. ఈ ఏడాది మొదట్లోనూ వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయింది. ఈ వైపరీత్యాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావమేనని స్పష్టమైతేనైనా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రపంచదేశాలు ముందుకు కదులుతాయి. ఈ అంశం అలా పక్కనుంచితే... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చిరకాలంగా సూచిస్తున్న తారక మంత్రం రెడ్యూస్.. రీసైకిల్.. రీ యూజ్! క్లుప్తంగా ఆర్ఆర్ఆర్ అని పిలుచుకుందాం. వ్యక్తుల స్థాయిలో... ప్రభుత్వాలూ చేపట్టగల ఈ మూడు పద్ధతులను అమలు చేయగలిగితే.. ఒకవైపు వనరుల సమర్థ వినియోగం సాధ్యమవడమే కాకుండా... భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఎలా మొదలైంది? ఆర్ ఆర్ ఆర్ గురించి దశాబ్దాలుగా మనం వింటున్నాం. కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. చెత్తను తగ్గించుకునేందుకు, వనరులను ఆదా చేసుకునేందుకు, ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చి మళ్లీ మళ్లీ వాడేందుకు తమదైన రీతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాల రూపకల్పన సరేసరే. అంతా బాగుంది కానీ.. ప్రపంచమంతా ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ ఆర్ ఆర్ ఆర్ ఎలా మొదలైంది? ఊహూ.. స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే ఏటా ఏప్రిల్ 22న నిర్వహించే ఎర్త్ డేకు ఈ ఆర్ ఆర్ ఆర్కూ కొంత సంబంధం ఉందని చాలామంది అంగీకరిస్తారు. 1970లో అమెరికాలోని విస్కాన్సిన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఈ ఎర్త్ డేను ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సుమారు రెండు కోట్ల మంది వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. జాతరలు, ప్రదర్శనలు, ఊరేగింపుల్లాంటివి నిర్వహించారు. తద్వారా పర్యావరణ పరంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని, ప్రమాద నివారణకు వ్యక్తిగత స్థాయిలో చేయగల పనులను ఈ సందర్భంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయానికి అమెరికా మొత్తమ్మీద వాడి పారేసే వస్తువులతో పెద్ద సమస్యగా ఉండేదట. 1950లలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందడంతో మొదలైన ఈ సమస్య 1970ల నాటికి పతాక స్థాయికి చేరుకుందన్నమాట. కుప్పల్లోనూ చెత్త పేరుకుపోయి ఉండేది. ఎర్త్ డే సందర్భంగా చెత్త సమస్యపై ప్రజల దృష్టి పడటంతో ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ను సిద్ధం చేసింది. ఈ చట్టం కారణంగా వస్తువులను రీసైకిల్ చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పే రిసోర్స్ రికవరీ యాక్ట్ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంలోనే అమెరికాలో ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే పదం ప్రజల నోళ్లల్లో నానడం మొదలైంది. క్రమేపీ ఒక ఉద్యమంలా మారిందని అంటారు. ఆర్ ఆర్ ఆర్...ఇంతకీ వీటి పరమార్థం? ఆర్ ఆర్ ఆర్ పరమార్థం ఒక్క ముక్కలో చెప్పాలంటే దేన్నైనా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోమ్మని. పిసినారిగా ఉండమని చెప్పినా తప్పేమీ కాదు. దీనివల్ల ఆర్థికంగా మనకు కొంచెం లాభం చేకూరడమే కాకుండా... భూమి మొత్తాన్ని కాపాడేందుకు మన వంతు సాయం చేసినట్టూ ఉంటుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూమ్మీద ఉన్న వారందరూ చేయిచేయి కలిపినా రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేము. తీవ్రత కొంచెం తగ్గవచ్చు అంతే. ప్రజలతోపాటు ప్రభుత్వాలు తగు విధానాలు సిద్ధం చేసి, తగినన్ని నిధులు, టెక్నాలజీలను సమకూర్చి కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం. ఈ దిశగా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్లలో మొదటిదైన రెడ్యూస్ విషయాన్ని పరిశీలిద్దాం. చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చెత్త తగ్గాలంటే మనం వాడే వనరులను కూడా మితంగా అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అది కరెంటు కావచ్చు.. నీళ్లు కావచ్చు. ఇంకేదైనా వనరు, పదార్థం కావచ్చు. మితంలోనే పరమార్థమన్నమాట. వ్యక్తులుగా దీన్ని సాధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. మీలో కొందరు ఇప్పటికే వీటిని పాటిస్తూండవచ్చు కూడా. అవేమిటంటే... ఇంటికి కావాల్సిన వస్తువులను చిన్న చిన్న మొత్తాల్లో కాకుండా... నెలకు లేదా కొన్ని నెలలకు సరిపడా ఒకేసారి కొనేయడం. దీనివల్ల ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ మోతాదుల్లో కొంటే ఖర్చులూ కలిసివస్తాయి. మళ్లీమళ్లీ వాడుకోగల సంచులను దగ్గరుంచుకుంటే మరికొంత ప్లాస్టిక్ను చెత్తకుప్పలోకి చేరకుండా నిలువరించవచ్చు. వాడి పారేసే వస్తువుల కంటే మళ్లీమళ్లీ వాడుకోగలవాటికే ప్రాధాన్యమివ్వండి. ఇంట్లో అవసరమైనప్పుడు.. అవసరమైన చోట మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వాడటం ద్వారా విద్యుత్తును తక్కువగా వాడవచ్చు. కుళాయిల్లో, బాత్రూమ్ సింక్లలో లీకేజీలు లేకుంటే బోలెడంత నీళ్లు మిగుల్చుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాంసాహారం మానేసినా పాడి పశువుల పెంపకానికయ్యే వనరులు తగ్గి భూమికి మేలు జరుగుతుందంటారు నిపుణులు. విమాన ప్రయాణాలను తగ్గించుకోవడం, వీలైనప్పుడల్లా కాళ్లకు పనిచెప్పడం లేదా సైకిళ్లను ఉపయోగించడమూ రెడ్యూస్ కిందకే వస్తుంది. కర్బన ఉద్గారాలు మరింత ఎక్కువ కాకుండా ముందుగానే అడ్డుకోవడం అన్నమాట. ► 98 %: వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో (క్యారీబ్యాగుల్లాంటివి) చమురులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యేవి. ► 7.5 – 19.9 కోట్ల టన్నులు: సముద్రాల్లోకి చేరి కాలుష్యం సృష్టిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం. ► 450 ఏళ్లు: ప్లాస్టిక్ బాటిళ్లు నశించేందుకు పట్టే సమయం. ► 2800 కోట్లు: ఏటా చెత్తకుప్పల్లోకి చేరుతున్న గాజు బాటిళ్ల సంఖ్య. వీటిల్లో మూడొంతులు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. ► 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల టన్నుల కాగితాన్ని రీసైకిల్ చేశారు. చెత్తకుప్పల్లోకి చేరిన కాగితాల్లో ఇది 68 శాతం మాత్రమే. ఈ ఏడాది తయారైన కార్డ్బోర్డులో 91.4 శాతం రీసైకిల్ చేసిన కాగితం. ఒకే ఒక్క శాతం చెత్తకుప్పల్లోకి చేరే చెత్తలో అల్యూమినియం మోతాదు ఇది. అలసిపోయేంతవరకూ రీసైకిల్ చేసుకోగలగడం ఈ లోహపు ప్రత్యేకత కూడా. కానీ.. ఏటా దాదాపు 70 లక్షల టన్నుల అల్యూమినియం రీసైకిల్ కావడం లేదు. వాడి వాడి.. మళ్లీ వాడి... పర్యావరణ పరిరక్షణ తారక మంత్రం ఆర్ ఆర్ ఆర్లో రెండోది రీ యూజ్. పేరులో ఉన్న మాదిరిగానే వస్తువులను వీలైనంత ఎక్కువగా వాడటమే ఇది. నిజానికి ఈ విషయం భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. చిరిగిన చీరలిక్కడే బొంతలవుతాయి.. అలాగే వాడేసిన తువ్వాలు తుండుగుడ్డ అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలు... పచారీ సామాను నిల్వకు వాడేదీ ఇక్కడే మరి!! మోజు తీరిన దుస్తులు అనా«థ శరణాలయాలకు చేరడమూ మనం చూస్తూంటాం. రీ యూజ్ వల్ల కలిగే అతిపెద్ద లాభం వాడదగ్గ వస్తువులు చెత్తగా కుప్పల్లోకి చేరకుండా నిలువరించడం. ఉన్నవాటినే ఎక్కువ కాలం వాడటం వల్ల కొత్తవి కొనే అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు ఆదాతోపాటు భూమికీ మేలు జరుగుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. అవసరానికి తగ్గట్టు కొత్త ఉత్పత్తులను కాకుండా.. సెకెండ్ హ్యాండ్వి కొనగలిగితే వనరులను మిగుల్చుకోగలం. ప్రపంచమంతా.... ఆర్ ఆర్ ఆర్లలో ఇది చాలా పాపులర్. తరచూ అందరికీ వినిపించే రీసైక్లింగ్. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులు మార్చి ఇంకో అవసరానికి వాడుకోవడాన్ని రీసైక్లింగ్ అనవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యర్థానికి కొత్త అర్థం చెప్పడమన్నమాట. ఈ రీసైక్లింగ్ జాబితాలోకి రాని వస్తువు అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్లాస్టిక్ లాంటి పదార్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలోకి ఇటీవలే వచ్చి చేరిన కొత్త రకం వ్యర్థం ఈ–వేస్ట్. యూఎస్బీ డ్రైవ్లు మొదలుకొని, ఎయిర్పాడ్స్, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తమ జీవితకాలం తరువాత వృథా అయిపోతూండటం వల్ల ప్లాటినమ్ వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇక సేంద్రీయ వ్యర్థాల విషయానికి వస్తే... పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలు మొదలుకొని ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం వరకూ చాలావాటిని కుళ్లబెట్టి సహజసిద్ధమైన ఎరువులు లేదా వంటగ్యాస్లను తయారు చేసుకోవచ్చు. గ్యారీ ఆండర్సన్ సృష్టి.. ఈ లోగో! ఆర్ ఆర్ ఆర్లు మూడు వేర్వేరు అంశాలు కావచ్చు కానీ.. వీటిని సూచించేందుకు వాడే గుర్తు లేదా సింబల్ మాత్రం ఒక్కటే. మూడు ఆరో గుర్తులతో ఒక వృత్తంలా ఉండే ఈ గుర్తును దాదాపు ప్రతి ప్యాకేజ్పైనా చూడవచ్చు. ఆసక్తికరమైన అంశం ఈ లోగోను రూపొందించింది ఎవరన్న విషయం. ఒక ప్రైవేట్ సంస్థ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా పెట్టిన డిజైన్ పోటీల్లో పాల్గొన్న యూఎస్సీ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్యారీ అండర్సన్ దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో సీసీఏ రీసైక్లింగ్ పనిలోనూ ఉండటం వల్ల దాన్ని సూచించేందుకు లోగోను రూపొందించాలని పోటీ పెట్టారు. పోటీలో నెగ్గిన తరువాత ఆ లోగోతోపాటు గ్యారీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఎందరో మహానుభావులు... ఎనెన్నో ప్రయత్నాలు! భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థల స్థాయిల్లో పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషతుల్యమైన కాలుష్యాలను వాతావరణం నుంచి తొలగించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటి గురించి స్థూలంగా చూస్తే... ఓషన్ క్లీనప్ ప్రాజెక్టు... చెత్తకుప్పల్లోంచి నదుల్లోకి.. అటు నుంచి సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి కొత్త రూపంలో ఆ వ్యర్థాలను వాడుకునేందుకు బోయన్ స్లాట్ అనే యువ ఔత్సాహిక శాస్త్రవేత్త చేపట్టిన ప్రాజెక్టు ఇది. సముద్రాల్లోని ప్లాస్టిక్లో అధికభాగం జల ప్రవాహాల ఫలితంగా పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పోగుపడ్డాయి. ‘ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్’ అని పిలిచే ఈ చెత్తకుప్ప సైజు ఎంత ఉందో తెలుసా? ఫ్రాన్స్ దేశ వైశాల్యానికి మూడు రెట్లు... లేదా టెక్సస్ వైశాల్యానికి రెండు రెట్లు ఎక్కువ. అంకెల్లో చెప్పాలంటే కొంచెం అటు ఇటుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు! 2017 నాటి లెక్కల ప్రకారమే ఇక్కడ పోగుపడ్డ ప్లాస్టిక్ బరువు సుమారు 29.7 కోట్ల టన్నులని అంచనా. ఈ నేపథ్యంలో సముద్ర జీవులకు పెను ప్రమాదంగా పరిణమించిన ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ను తొలగించేందుకు 2013లో బోయన్ స్లాట్ అనే నెదర్లాండ్ కుర్రాడు ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టాడు. సముద్రపు అలల సాయంతోనే చెత్తను పోగుచేసి బయటకు తరలించేందుకు అవసరమైన టెక్నాలజీలను సిద్ధం చేశాడు. బోయన్స్లాట్ స్థాపించిన ఓషన్ క్లీనప్ సంస్థ ఐదేళ్ల కాలంలో ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్లో సగాన్నైనా ఖాళీ చేయాలని సంకల్పిస్తోంది. గత 30 రోజుల్లో ఓషన్ క్లీనప్ సంస్థ ఎనిమిది ఇంటర్సెప్టర్ల సాయంతో 1,11,804 కిలోల ప్లాస్టిక్ చెత్తను తొలగించింది. ఇప్పటివరకూ తొలగించిన చెత్త 20,68,237 కిలోలు. సముద్రాల్లో మాత్రమే కాకుండా... నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ను కూడా అక్కడికక్కడే ఒడిసిపట్టేందుకు బోయన్ స్లాట్ ప్రయత్నిస్తున్నాడు. డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్... భూతాపోన్నతికి ప్రధాన కారణం? గాల్లో కార్బన్డైయాక్సైడ్ వంటి విష వాయువుల మోతాదు ఎక్కువ కావడం. అందుకేనేమో కొందరు ఈ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే... గాల్లోని కార్బన్ డైయాక్సైడ్ను నేరుగా తొలగించేందుకు డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్ పేరుతో పలు ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలిని పోగు చేయడం.. అందులోని కార్బన్ డైయాక్సైడ్ను రసాయనాల సాయంతో తొలగించి వేరు చేయడం స్వచ్ఛమైన గాలిని మళ్లీ వాతావరణంలోకి వదిలేయడం ఈ ప్రాజెక్టుల పరమోద్దేశం. వేరు చేసిన కార్బన్ డైయాక్సైడ్ను భూమి అట్టడుగు పొరల్లో భద్రపరచడం లేదా కొన్ని ఇతర టెక్నాలజీ సాయంతో విలువైన ఇంధనం, ఇతర పదార్థాలుగా మార్చి వాడుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. చిన్నా చితక కంపెనీలను వదిలేస్తే డైరెక్ట్ క్యాప్చర్ టెక్నాలజీలో చెప్పుకోవాల్సిన కంపెనీలు క్లైమ్వర్క్స్ ఒకటి. దీంతోపాటు కార్బన్ ఇంజినీరింగ్, గ్లోబల్ థెర్మోస్టాట్లు అనే రెండు కంపెనీలు కలిపి మొత్తం 18 చోట్ల ఫ్యాక్టరీలను స్థాపించి గాల్లోని కార్బన్ డైయాక్సైడ్ను వేరు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఏడాది ఒక టన్ను నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యమున్నవి ఉన్నాయి. అత్యధిక సామర్థ్యమున్న కంపెనీ ఏడాదికి ఎనిమిది వేల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ను వాతావరణం నుంచి తొలగిస్తోంది. అమెరికాలో ఇప్పుడు ఏడాదికి పది లక్షల టన్నుల సామర్థ్యమున్న ఫ్యాక్టరీ ఒకటి వచ్చే ఏడాదికల్లా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా... మరికొన్ని సంస్థలు కూడా గాల్లోని కార్బన్ డైయారక్సైడ్ను సమర్థంగా పునర్వినియోగించుకునేందుకు కొన్ని టెక్నాలజీలను సిద్ధం చేశాయి. వీటిల్లో రెండు మన దేశంలోనే ఉండటం విశేషం. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చక్ర ఇన్నొవేషన్స్ సంస్థ డీజిల్ జనరేటర్లు, బస్సుల పొగ గొట్టాల నుంచి వెలువడే కాలుష్యం నుంచి కర్బనాన్ని వేరు చేసి ప్రింటింగ్ ఇంక్గా మారుస్తూంటే... పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ కార్బన్ క్రాఫ్టస్ డిజైన్ వాటితో భవన నిర్మాణాల్లో వాడే టైల్స్గా మారుస్తోంది. రీసైకిల్కు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ.. రీయూజ్, రెడ్యూస్లకు సంబంధించినవి తక్కువే. అలాగని ప్రయత్నాలు జరగడం లేదని కాదు. ముంబైలో ఓ యువకుడు చెత్తకుప్పల్లోకి చేరిన తెల్లటి క్యారీబ్యాగులను సేకరించి వాటితో సరికొత్త కాలిజోళ్లు సిద్ధం చేస్తూండటం రీయూజ్కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే.. టెట్రాప్యాకులను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో కుర్చీలు, బల్లలు తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తోంది ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ. ఇలా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలోనూ వ్యక్తులు, సంస్థలు కూడా ఉడతాభక్తి చందంగా ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి!! -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం
క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దైవజనులలో ఇంగ్లాండు దేశానికి చెందిన చార్లెస్ వెస్లీ ఒకరు. తన అన్న జాన్వెస్లీ అద్భుత ప్రసంగీకుడైతే చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటల రచయిత. తన జీవిత కాలంలో దాదాపుగా తొమ్మిదివేల పాటలను రచించి దేవుని నామమును మహిమపరచాడు. అతడు రాసిన పాటల్లో చాలా ప్రాచుర్యం పొందిన పాట ‘దూత పాట పాడుడీ’. ఆ పాటలోని ప్రతి అక్షరంలో అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం కనిపిస్తుంది. ఈ పాట అనేకమందికి క్రిస్మస్ గొప్పతనాన్ని చాటుతుంది. ప్రపంచంలోని క్రైస్తవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూతలు ప్రకటించిన సువార్త నేడు కూడా అనేక హృదయాలలో మారుమ్రోగుతుంది. ‘యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళిని రక్షించుటకు మానవ ఆకారంలో ఈ లోకానికి ఏతెంచారు’– కేంబ్రిడ్జ్లో విద్యనభ్యసించి ఆ తదుపరి దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకొని శ్రేష్ఠమైన గ్రంథాలెన్నింటినో రచించిన థామస్ వాట్సన్ కలం నుంచి జాలువారిన మాటలివి. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరాళాల నుంచి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలో నింపుకోవాలన్నా ఘనుడైన దేవుని ఆరాధించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ క్రీస్తే! ‘కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను’ అని అపొస్తలుడైన పౌలు ధన్యసత్యాన్ని గలతీ సంఘానికి తన పత్రిక రాస్తూ తెలియచేశాడు. పాపపంకిలమైన లోకంలో బతుకుచున్న మనలందరిని తన బిడ్డలుగా చేసుకోవాలన్నదే దేవుని నిత్య సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదల యెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలను కొంతకాలం పక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్లు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. ఆ దివ్యమైన అనుభూతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన సువార్తికుడైన మత్తయి ఇలా అంటాడు. ‘వారు ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’ (మత్తయి 2:10, 11). యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అని కొందరు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానాలున్నాయి. ఈనాటి ప్రపంచంలో సుమారుగా 4400 పట్టణాలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన పట్టణాలు కొన్నయితే, మనస్సును ఆహ్లాదపరచే ప్రకృతి రమణీయతను కలిగిన పట్టణాలు మరికొన్ని. అయితే వీటిలో దేనికీలేని ప్రాధాన్యం, ప్రాచుర్యం బేత్లెహేము అనే పట్టణానికి ఎందుకుంది? వాస్తవానికి బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్తనిబంధన. పాతనిబంధన చరిత్ర క్రీస్తుకు ముందు జరిగిన చరిత్ర. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన చరిత్ర, ఆయన తరువాత సంఘం ద్వారా దేవుడు చేసిన కార్యాలు రాయబడ్డాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో రక్షకుని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా వివరించబడినవి. రక్షకుని ఆగమనం ఆకస్మికంగా జరిగినది కాదు. ప్రవక్తలు సామాన్య ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశారు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ప్రతి విషయానికి పాతనిబంధన గ్రంథంలో ప్రవచనాలున్నాయి. యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మిస్తాడనేది వాటిలో ఒక ప్రముఖమైన ప్రవచనం. మొదటిగా యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించుట అనేది ప్రవచన నెరవేర్పు. మోరెషెత్గతు అను కుగ్రామానికి చెందిన మీకా అనే ప్రవక్త దేవుని ఉద్దేశాలను బయలు పరచడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. ఇతడు ప్రవక్తయైన యెషయా సమకాలీకుడు. యెషయా యెరూషలేములో ప్రవక్తగా ఉండి అక్కడ పరిపాలించుచున్న రాజులను గురించి పరిస్థితులను గురించి తన గ్రంథంలో రాశాడు. అయితే మీకా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో యూదయ ప్రాంతంలో ఉన్న అబద్ధ ప్రవక్తలను భక్తిహీనులైన యాజకులను, లంచగొండులైన నాయకులను ఖండించాడు. అన్నిటికన్న ప్రాముఖ్యంగా రాబోయే మెస్సీయను గురించి ఆయన యొక్క నీతి పాలన గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. ‘బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండును’ (మీకా 5:2). ఏడు వందల సంవత్సరాల తరువాత రక్షకుడు భూమి మీద ఉద్భవించిన తరువాత యూదయను పాలిస్తున్న హేరోదు రాజు మెస్సీయ పుట్టుక స్థలమును గురించి యాజకులను, శాస్త్రులను ప్రశ్నించినప్పుడు వారు మీకా గ్రంథమునందలి ఈ ప్రవచనమును జవాబుగా తెలిపారు. ‘దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడిచేసిన ఏ ప్రవచనమును నిరర్థకం చేయలేదు. ఎందుకంటే ప్రవచనము మనష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు. కానీ మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వాటిని పలికిరి’ (2పేతురు 1:21). ప్రవక్తయైన మీకా ద్వారా బేత్లెహేమును గురించిన ప్రవచనం మాత్రమే గాక ఆయన గురించి మరికొన్ని ప్రవచనాలు కూడా పలికిరి. మెస్సీయ స్థాపించే రాజ్యము సమాధాన ముతో ఉంటుందని ప్రవచించారు. ‘ఆయన సమాధానమునకు కారకుడగును’ (మీకా 5:5). యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తనయందు విశ్వాసముంచిన వారిని దేవునితో సమాధానపరుస్తారు అనే విషయాన్ని ఆత్మ నడిపింపు ద్వారా మీకా ప్రవక్త తెలిపాడు. మొదటి శతాబ్దంలో అపొ. పౌలు ఎఫెసీ సంçఘానికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్ట మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు’ (ఎఫెసీ2:14, 16). దేవుడు అనుగ్రహించే సమాధానము విశిష్ఠమైనది. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతును’ అని ప్రభువు సెలవిచ్చారు. ఆయన పాదాల చెంతకు వచ్చిన అనేకులను తన దివ్యశక్తితో, శాంతితో నింపి వారిని బలపరిచాడు. ప్రస్తుతకాలంలో మానవుడు శాంతి సంతోషాలను అనుభవించాలన్న ఆశతో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమౌతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం, సమాధానం కోసం వెదుకుతున్నారు. నేటి కాలంలో యువత మత్తు పదార్థాలకు, వింత పోకడలకు బానిసలౌతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే, ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువౌతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవికూడా కోల్పోతూ ఆఖరుకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నారు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే, హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువై ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలలోనూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయాడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసెయ్యడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తిని పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాలుగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్గారు. ప్రపంచఖ్యాతిని ఆర్జించిన వర్జీనియా ఊల్ఫ్ గురించి తెలియని వారు లేరు. ఆమె రచనలు ఇప్పటికీ అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాల్యదినాల్లోనే అనేక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. వర్జీనియా ఊల్ఫ్ ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. ఆరేళ్ళ వయస్సులో ఉన్న ఆమెను సవతి సోదరుడు అత్యాచారం చేశాడు. యవ్వనంలోనికి వచ్చేంతవరకు అది కొనసాగుతూనే ఉంది. పదమూడేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. సమస్యల వలయంలో చిక్కుకొని ఏడుస్తూ ఉండేది. కొంతకాలానికి తండ్రిని కూడా కోల్పోయింది. మనుషులంటే విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. తన మదిలో ఉన్న భయాలను పోగొట్టుకోవడానికి, మానసిక సంక్షోభం నుండి బయటపడడానికి రాయడం ప్రారంభించింది. ఆమె రచనలు విప్లవాత్మకంగా ఉండేవి. కొందరు వాటిని అంగీకరించకపోయినా తాను రాసే అలవాటును మానుకోలేదు. మానసిక వ్యధను తగ్గించుకొనేందుకు 1917వ సంవత్సరములో హోగార్త్ ప్రెస్ను ప్రారంభించింది. ‘ది వోయేజ్ ఔట్, నైట్ అండ్ డే, మండే ఆర్ ట్యూస్డే, మిసెస్ డాలోవె’లాంటి రచనలు చేసింది. అయితే ఇవేవీ ఆమెకు సాయపడలేదు. తన మనోవ్యధను తగ్గించలేదు. విజయవంతమైన ఆమె రచనలు, వాటి ద్వారా ఆమె సంపాదించిన కీర్తి ఏమీ ఆమెకు ఇసుమంతైనా సహాయం చేయలేదు. నిరంతరం తనను వెంటాడుతున్న తన వ్యథను, అశాంతిని జయించలేక తనను ప్రేమించి తన కష్టసుఖాలను పంచుకున్న భర్తకు ఓ చిన్న లేఖ రాసి తన ఇంటి సమీపంలో ఉన్న నదివద్దకు వెళ్ళి తన జేబుల నిండా రాళ్ళు నింపుకొని ఆ నదిలోనికి మెల్లగా నడిచివెళ్ళి మునిగిపోయి తన జీవితాన్ని ముగించుకుంది. ఇలాంటి విషాదాలు ఎన్ని లేవు చరిత్రలో! ఎందుకు మనిషి తన మరణాన్ని తానే శాసించుకుంటున్నాడు? బలవన్మరణానికి పాల్పడుతున్నాడు? కారణం శాంతి సమాధానాలు లేక. దేవుడు శాంతికర్త. తన శరణుజొచ్చినవారికి శాంతి సమాధానాలను ఉచితంగా అనుగ్రహించగలిగే సమర్థుడు. ‘హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ. పాపాత్ములెల్ల యేసునున్ కీర్తించి పాడుడీ. హాయి రక్షకుండు ఏలును. సాతాను రాజ్యమున్ నశింపచేసి మా యేసే జయంబు నొందును’ అంటూ ఓ అద్భుతమైన పాటను రచించాడు ఐజక్ వాట్స్ అనే దేవుని సేవకుడు. యేసుక్రీస్తు ప్రభువు తన చెంతకు చేరినవారికి అనుగ్రహించే ఆశీర్వాదాలను చాలా చక్కగా పాటలో వర్ణించాడు. ‘పాప దుఃఖంబులెల్లను నివృత్తిచేయును. రక్షణ సుఖ క్షేమముల్ సదా వ్యాపించును’. అవును మనిషి చేస్తున్న పాపమే మనిషిని దుఃఖసాగరంలో ముంచుతుంది. ఆజ్ఞాతిక్రమణమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. సర్వశక్తుడైన దేవుడు సకల చరాచర సృష్టిని తన సంకల్పంతో కలుగచేశాడు గనుక ప్రతి మానవుడు ఎలా జీవించాలన్నది కూడా దేవుడే సంకల్పించాడు. ఆ చిత్తానికి, ఆ సంకల్పానికి ఎదురొడ్డి నిలబడడమే పాపమంటే. పాపానికి బానిసైన మానవుడు దేవున్ని చూడలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. దేవుడు పరమ పవిత్రుడు. పరిశుద్ధమైన తన రాజ్యంలోనికి పాపముతో నింపబడిన మానవుడు ప్రవేశించడం అసాధ్యం. పాపం మనిషిని దేవునికి దూరం చేయుటయే గాక అశాంతి కూపంలోనికి నెట్టివేసింది. భయంకరమైన పాప జీవితం నుంచి మానవుడు విడుదల పొందినప్పుడే దేవుని ప్రసన్నతను అనుభవించగలడు, అనిర్వచనీయమైన శాంతి సమాధానాలను పొందుకొనగలడు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు మనుష్యాకారంలో ఈ లోకానికి దిగివచ్చి తన పవిత్రమైన రక్తాన్ని చిందించుట ద్వారా సర్వలోకానికి రక్షణ ప్రసాదించాడు. ఎవరైతే విశ్వాసంతో ఈ సత్యాన్ని హృదయంలో విశ్వసించి యేసు రక్షకుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటారు. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో అప్పుడు శాంతి సమాధానాలు మనిషి వశమౌతాయి. యేసుక్రీస్తు కాపరిగా వ్యవహరిస్తాడని మీకా ప్రవచించాడు. ‘ఆయన నిలిచి, తన మందను మేపును’ (మీకా 5:4). యేసుక్రీస్తు ఒక కాపరి తన గొర్రెలను ఎలా సంరక్షిస్తాడో అలాగో తన ప్రజలను సంరక్షిస్తాడని తన ప్రవచనాలలో తెలిపాడు. యేసుక్రీస్తు ప్రభువు తాను ఎందుకీ లోకానికి వచ్చారో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. ‘నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. తప్పిపోయి నశించిన వారిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి ఏతెంచాడు. ప్రవక్తయైన మీకా ద్వారా ఆత్మ పలికిన మాటలన్నీ చరిత్రలో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు బేత్లెహేములో జన్మించినది ప్రవచన నెరువేర్పు కొరకు.’ రెండవదిగా క్రీస్తు బేత్లెహేములో జన్మించింది వాగ్దాన నెరవేర్పు కొరకు. ప్రభువు దావీదునకు గొప్ప వాగ్దానం అనుగ్రహించాడు. ‘నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసియున్నాను’ (కీర్త 89:3,4). దావీదుకు చేయబడిన వాగ్దానమిది. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పాలించిన తరువాత సొలొమోను అతని బదులుగా రాజైనాడు. నలభై సంవత్సరాలు సొలొమోను పాలన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా రాజ్యమును రెహబాము, ఇశ్రాయేలు రాజ్యమునకు యరొబాడు రాజులైనారు. కొంతకాలానికి ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. మరికొంతకాలానికి యూదా రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. దావీదుకు చేయబడిన వాగ్దానం సంగతి ఏది? వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మరచిపోతాడా? వాగ్దానాన్ని నిరర్థకం చేశాడా? అని కొందరు అనుకొని ఉండవచ్చు. కాని తగిన సమయంలో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చువాడు. దేవుని వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. దావీదు సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు దావీదు వంశములో దావీదు పట్టణంలో జన్మించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆకాశం, భూమి గతించినను దేవుని మాటలు ఎన్నడూ గతించవు. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక ‘తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను’ (లూకా2:4,5). ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు’ (లూకా 2:11). ‘యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడెను’ (రోమా 1:27). మనుష్యులు చాలామంది చాలా రకాలైన వాగ్దానాలు చేస్తారు. కాని వాటిని నిలబెట్టుకొనే సమయానికి తప్పించుకొని తిరుగుతుంటారు. కొందరు రాజకీయవేత్తలు అధికారం కోసం వాగ్దానాలు చేస్తారు. తర్వాతి కాలంలో వాటిని నెరవేర్చకుండానే గతించిపోతారు. దేవుడు అలాంటివాడు కాడు. తన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కల్దీయ దేశాన్ని విడచి నేను చూపించు దేశానికి వెళ్తే అబ్రహామును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు’ అని ప్రభువు పలికాడు. ఏ లోటు లేకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నూరేళ్ళ ప్రాయంలో వాగ్దాన పుత్రుని అనుగ్రహించి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మూడవదిగా మనుష్యులందరికి అందుబాటులో ఉండులాగున యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించారు. భూ ఉపరితల రూపాలు, లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు. టోపోగ్రఫీ ప్రకారం ఈ భూమ్మీద మానవుడు నివసిస్తున్న దేశాలు, స్థలాకృతిని అధ్యయనం చేసినప్పుడు యేసుక్రీస్తు జన్మించి, సంచరించి, మరణించి మరియు పునరుత్థానుడై లేచిన ఇశ్రాయేలు దేశం భూమికి మధ్య ప్రాంతంగా గుర్తించారు. ఆయన భారతదేశంలోనో లేక మరే ఇతర పెద్ద దేశంలోనో జన్మిస్తే బాగుంటుందని అనేకులకు అనిపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలం ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతం. ఆయన అందరివాడు గనుక భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడనడంలో అతిశయోక్తి లేదు. ఒక దీపం అందరికీ వెలుగునిచ్చేలా పెట్టాలంటే అది అందరికీ మధ్యలో ఉంచాలి. అప్పుడే ఆ వెలుగు అన్నివైపులా సమానంగా ప్రసరిస్తుంది. ‘వెలుగైయున్న దేవుడు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండులాగున ఆయన ఈ భూమికి మధ్యస్థానంలో జన్మించారు’. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా రాయబడడం గమనార్హం. ‘ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును’ (యెషయా 11:10). ‘జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయుము. భూమి నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చుము’ (యెషయా 11:12). ప్రవచనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే యెష్షయి వేరు చిగురు అనగా యేసుక్రీస్తు. ఆయననే ధ్వజముగా వర్ణించాడు. ఆ ధ్వజము నలుదిక్కుల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి జాతి, ప్రతి ప్రాంతం యేసుక్రీస్తుకు పాదాక్రాంతమై విరాజిల్లుతుంది. బేత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం. జీవపు రొట్టె అయిన ప్రభువు ఆ ప్రాంతమును ఎన్నుకోవడం అర్థరహితం కాదుకదా? ప్రభువు జన్మించినప్పుడు ఆయన్ను మొదటిగా దర్శించుకున్నది ఎవరు? దానికి సమాధానం గొర్రెల కాపరులు. అతి సామాన్యమైన ప్రజలు. అటువంటివారికి రక్షకుని ఆగమన వార్త మొదట తెలిసింది. దేవుని ప్రేమ అభాగ్యుల పట్ల, దీన దరిద్రుల పట్ల ఎంత అధికంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ సంఘటన ఓ నిదర్శనం. బేత్లెహేము పొలాల్లో వారు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. అయితే ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా’నని చెప్పి రక్షకుని ఆగమనాన్ని గూర్చి ప్రకటించింది. సువార్తికుడును వైద్యుడైన లూకా తెలిపిన ప్రకారం గొర్రెల కాపరులు చీకటిలో ఉన్నారు. భయంతో జీవిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్నవారిని లోకంలో ఉన్నవారెవరూ పట్టించుకోరు. కాని సృష్టికర్తయైన దేవుడు వారికి తన సందేశాన్ని పంపాడు. ఇకపై వారు దేనికి భయపడనక్కరలేదని చెప్పాడు. వారి కోసం రక్షకుడొచ్చాడు గనుక వారు ధైర్యంగా బ్రతకొచ్చు. వారికొక ఆనవాలు ఇయ్యబడింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పశువుల తొట్టెలో పుట్టడం ఆశ్చర్యమే. అవును అది నిజంగా అబ్బురమే. పశుల తొట్టెలో పరుండియున్న క్రీస్తు ప్రభువును గొర్రెల కాపరులే మొదట దర్శించుకున్నారు. హేరోదు అంతఃపురంలోనో మరో సంపన్న స్థలంలోనే క్రీస్తు ప్రభువు జన్మించియుంటే వారికి ఆ దర్శన భాగ్యం దొరికేది కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఆయన్ను చూడాలనే ఆశ ఉంటే చాలు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకు దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! ప్రస్తుతకాలంలో బేత్లెహేము వెళ్తే యేసు పుట్టిన ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ప్రతి యేటా కోట్లాదిమంది ఆ దేవాలయాన్ని దర్శించి దానిలోపల క్రీస్తు పుట్టిన స్థలాన్ని చూసి ఆనంద పరవశంతో నిండిపోతారు. కాన్స్టాంటైన్ ద గ్రేట్ తల్లియైన సెయింట్ హెలెనా క్రీస్తు శకం 325లో యెరూషలేమును, బేత్లెహేమును దర్శించింది. ఆమె వెళ్లిన తరువాత బేత్లెహేములో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. ఆ తదుపరి 339వ సంవత్సరం మే 31న దేవాలయం ప్రజల సందర్శనార్థం అందుబాటులోనికి వచ్చింది. ఆ తర్వాత సమరయుల తిరుగుబాటు సమయంలో చర్చి అగ్నిప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. బహుశా క్రీస్తు శకం 529లో బైజాంటైన్ చక్రవర్తి జస్టినియన్ ద్వారా మరలా నిర్మించబడింది. ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. విశాలమైన స్థలంలో నిర్మించబడిన ఈ గొప్ప దేవాలయానికి ఒకే ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. సుమారుగా ఇరవైఐదు అడుగుల పొడవున్న ఈ చర్చికి కేవలం నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ‘ఎవ్వరైనా క్రీస్తు ప్రభువు పుట్టిన స్థలాన్ని దర్శించాలనుకుంటే తలవంచి అహంకారాన్ని విడిచి నమస్కరించుకొంటూ లోపలికి ప్రవేశించాలి. దేవునిముందు నిలబడడానికి అహంకారం ఉపయోగపడదు దీనత్వం మాత్రమే ఉపకరిస్తుంది. నాలుగవదిగా బేత్లెహేములో రిక్తునిగా యేసుక్రీస్తు జన్మించుట ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించాడు. దేవుని ప్రేమ వర్ణనకు అందనిది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’ (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్నివందల రకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిని సంతోషం, ప్రేమ, ఆశ్చర్యం, ఆవేశం, దుఃఖం, భయం, అసహ్యం మొదలైనవిగా విభజించవచ్చు. చిరాకు, కోపం, నిరాకరణ ఇవన్నీ ఆవేశాన్ని ప్రతిబింబించే చర్యలైతే విశ్రాంతి, సంతృప్తి, ఆనందం అనేవి సంతోషానికి సంబంధించినవి. అయితే వీటన్నింటిలో మనకు ఎక్కువగా వినిపించేది, అనిపించేది ప్రేమ. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. నేటి యువతకు ప్రేమ అనే మాటకు సరైన అర్థం తెలియడం లేదు. సినిమాలలో, సీరియల్స్లలో చూపిస్తున్న కొన్ని కథలను ప్రేమ అనుకోవడం సహజం అయిపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను, వ్యామోహాన్నే ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ పేరిట అనేక మోసాలు, వంచనలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ప్రేమకు నిర్వచనం ఏమిటి? ఎవరు దానిని నిర్వచించారు? అని మానవుడు ఆలోచించగలిగితే పరమార్థాన్ని చేరుకుంటాడు. ప్రేమకు నిర్వచనాలు ఎవరెన్ని విధాలుగా చెప్పినా ఒకటి మాత్రం ఆలోచించదగినది. ఆచరణీయమైనది కూడా. ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ఇతరుల కోసం బలైపోవడం అని నిరూపించాడు యేసుక్రీస్తు. ఈ అద్భుత సత్యాన్ని ఎవరైతే తమ జీవితంలో హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారి జీవితం ఆనందమయం అవుతుంది. ఆదర్శప్రాయమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రేమను గూర్చి అనేక మాటలు రాయబడ్డాయి. ‘దేవుడు ప్రేమాస్వరూపి! దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు. తానే మొదట మనలను ప్రేమించాడు’లాంటి మాటలన్నీ దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేవే. ప్రేమిస్తున్నానని చెప్పుట మాత్రమే గాక ప్రేమను ఋజువు చేసిన ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్మస్ ఆచరించడమంటే ఎవరికి వారు ఆనందించడం కాదు. అనేకులకు ఆనందం పంచడం. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించి, వారికి మనస్ఫూర్తిగా సహాయపడడం. త్యాగాన్ని ప్రేమను వేరువేరుగా మనం చూడలేము. నిరాశ, నిస్పృహలో ఉన్నవారిని భుజంతట్టి ప్రోత్సహించడం చేయగలిగితే క్రిస్మస్కు నిజమైన అర్థం ఉంటుంది. సుప్రసిద్ధ క్రైస్తవ పాటల రచయిత చెట్టి భానుమూర్తి రాసిన అద్భుతమైన క్రిస్మస్ పాట దేవుని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘రారే చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సీయా రాజితంబగు తేజమదిగో. దూత గణములన్ దేరి చూడరే దైవవాక్కులన్ దెల్పగా. దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున’ ‘సాక్షి’ పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా.జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
Winter: వేడినీటి బుగ్గల్లో స్నానాలు.. ముల్లంగి, తామరతూళ్లు తింటే..!
Funday Cover Story- Worldwide Winter Festivals: శీతకాలం చిరుచలితో మొదలై, గజగజ వణికించే స్థాయికి చేరుతుంది. చలిపంజా దెబ్బకు జనాలు రాత్రివేళ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే వెనుకాడుతారు. శీతకాలం రాగానే, అప్పటివరకు అలమరాల అట్టడుగున పడివున్న చలిదుస్తులు ఒంటిమీదకు వస్తాయి. వీథుల్లో చలిమంటల సందడి మొదలవుతుంది. చలితీవ్రత పెరిగే కొద్ది, మనుషులకు వణుకూ పెరుగుతుంది. చలిలో ఆరుబయటకు వచ్చేవాళ్లు ఒద్దికగా చేతులు కట్టుకుని చలిని కాచుకుంటారు. చలికాలంలో కొన్నిచోట్ల తెరిపిలేని హిమపాతంతో నేలంతా మంచుతో నిండిపోతుంది. శీతకాలం మొదలయ్యే వేళ దీపావళి, శీతకాలం తారస్థాయిలో ఉండేటప్పుడు మకరసంక్రాంతి వేడుకలను మనం జరుపుకొంటాం. శీతకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయ వేడుకలను జరుపుకొంటారు. వ్యవసాయ పనులు ముగిసి, కాస్త తీరిక దొరికే కాలం కావడంతో సంబరాలు చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా ప్రత్యేకమైన వంటకాలను ఆగరిస్తారు. ఆరుబయటకు చేరి ఆట పాటలతో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వివిధ దేశాల్లో జరుపుకొనే శీతకాల సంబరాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం... షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్ స్కాట్లాండ్లోని షెట్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ముగిసినప్పటి నుంచి మూడునెలల వరకు సుదీర్ఘంగా కొనసాగే చలిమంటల వేడుక ‘షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్’. స్థానికంగా ఈ వేడుకలను ‘అప్ హెలీ ఆ’ అంటారు. షెట్లాండ్ రాజధాని లెర్విక్లో ఈ వేడుకల్లో భాగంగా జనవరి మూడో మంగళవారం రోజున జనాల ఆట పాటలతో వాద్యాల హోరుతో భారీ ఊరేగింపు జరుగుతుంది. వైకింగ్ల పొడవాటి పడవలను అనుకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి, మేళతాళాలతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. తొలినాళ్లలో తారుపీపాలకు నిప్పుపెట్టి స్లెడ్జిబళ్ల మీద మంచునిండిన వీథుల్లోకి లాక్కొచ్చేవారు. ఇటీవలికాలంలో తారుపీపాలకు నిప్పుపెట్టడం వంటి పనులు మానేసి, ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని, వేడుకలు జరుపుకొంటున్నారు. వెనిస్ కార్నివాల్ ఇటలీలోని వెనిస్ నగరంలో శీతకాలం ముగుస్తూ ఉండే సమయంలో జరిగే ఉత్సవం ఇది. క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘లెంట్’ రోజుల్లోని ‘యాష్ వెన్స్డే’ నుంచి మొదలయ్యే వెనిస్ కార్నివాల్ ‘ష్రోవ్ ట్యూస్డే’ వరకు మూడువారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున జనాలు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి సుమారు ముప్పయి లక్షలకు పైగా జనాలు వెనిస్ వీథుల్లో జరిగే ఊరేగింపుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో రకరకాల మాస్కులు ధరించి తిరుగుతూ సందడి చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా వెనిస్ కూడళ్లలో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ముఖాలకు మాస్కులు ధరించడాన్ని రోమన్ చక్రవర్తి 1797లో నిషేధించడంతో చాలాకాలం ఈ వేడుకలు కనుమరుగయ్యాయి. ఇటలీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా 1979 నుంచి పునఃప్రారంభించడంతో వెనిస్ కార్నివాల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది. లా ఫాలాస్ వాలెన్షియా స్పెయిన్లోని వాలెన్షియా నగరంలోను, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోను ఈ వేడుకలు ఏటా మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ వేడుకల్లో మార్చి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెయింట్ జోసెఫ్ స్మారకార్థం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీథుల్లో చలిమంటలను వెలిగించి ఆటపాటలతో జనాలు కాలక్షేపం చేస్తారు. మార్చిలో శీతకాల సంబరాలేమిటా అనుకోకండి. అక్కడ మార్చిలోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. చలిమంటల ముందు సేదదీరుతూ విందు వినోదాలు, గానా భజానాలతో జనం ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ మాదిరి ‘ప్యేలా’ అనే వంటకాన్ని సామూహిక విందుల్లో వడ్డిస్తారు. దీని తయారీలో బియ్యం, మేక, గొర్రె, కుందేలు, కోడి, చేపలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. లా ఫాలెస్ వాలెన్షియాను ‘యునెస్కో’ వారసత్వ వేడుకగా గుర్తించింది. నయాగరా వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నయాగరా జలపాతం మామూలుగా చూస్తేనే కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక శీతకాలంలో రాత్రివేళ ఈ జలపాతం వద్ద ఆరుబయట చేసే విద్యుద్దీపాలంకరణలు చూస్తే, రంగు రంగుల నక్షత్రాలు కళ్లముందే కదలాడినట్లుంటుంది. నయాగరా జలపాతం వద్ద కెనడాలో ఏటా శీతకాలం పొడవునా ‘వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ వేడుకలను దేదీప్యమానంగా నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. విద్యుద్దీప కాంతుల వెలుగులో ధగధగలాడే నయాగరా అందాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు కూడా జరుగుతాయి. హార్బిన్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్ చైనాలో ఏటా శీతకాలంలో జరిగే అంతర్జాతీయ హిమశిల్పకళా వేడుకలు ఇవి. హీలోంగ్జియాంగ్ ప్రావిన్స్లోని హార్బిన్ నగరంలో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు రెండుకోట్ల మంది వరకు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత భారీ హిమశిల్పాలు ఈ ఉత్సవాల్లో కొలువుదీరుతాయి. హార్బిన్ నగరంలోని కూడళ్లలోను, నగరం మీదుగా ప్రవహించే సోంఘువా నదీ తీరంలోను భారీ ఎత్తున హిమశిల్పాలను ఏర్పాటు చేస్తారు. సైబీరియా మీదుగా వీచే చలిగాలుల వల్ల సోంఘువా నదిలోని నీళ్లు గడ్డకట్టిపోతాయి. నదిలో నుంచి వెలికితీసిన భారీ మంచుదిమ్మలతోనే స్థానిక కళాకారులు శిల్పాలను చెక్కి, ప్రదర్శనకు ఉంచుతారు. చైనాలో ఈ వేడుకలు 1963 నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ వేడుకల ద్వారా చైనా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం దండిగానే లభిస్తుంది. టోజి మత్సురి జపాన్లో జరుపుకొనే శీతకాల వేడుకలు ‘టోజి మత్సురి’. ఈ వేడుకలనే ‘టోజిసాయి’ అని కూడా అంటారు. మంచు కురిసే ప్రాంతాల్లో ఆరుబయట గుడారాలు వేసుకుని, వాటి ముందు చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో గడుపుతారు. ‘ఓన్సెన్’ అనే వేడినీటి బుగ్గల్లో స్నానాలు చేస్తారు. నిజానికి ఈ వేడినీటి బుగ్గల్లో ఏడాది పొడవునా స్నానాలు చేస్తుంటారు గాని, శీతకాలం తప్పనిసరిగా వీటిలో స్నానం చేయడం ఆరోగ్యకరమని జపానీయులు నమ్ముతారు. గతించిన పెద్దలను తలచుకుంటూ చెరువుల్లో దీపాలను విడిచిపెడతారు. శీతకాలంలో గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, తామరతూళ్లు తినడం శుభప్రదమనే నమ్ముతారు. ముఖ్యంగా తామరతూళ్లతో తయారుచేసే రెన్కాన్ చిప్స్ను చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు. రేక్జావిక్ వింటర్ లైట్స్ ఫెస్టివల్ ఐస్లాండ్లోని రేక్జావిక్ నగరంలో ఏటా శీతకాలంలో వింటర్ లైట్స్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. నగరంలోని చారిత్రిక కట్టడాలు, మ్యూజియమ్లు, పార్కులు, ఈతకొలనులు, మైదానాలు వంటివాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నగరంలోని వేడినీటి బుగ్గలలో జనాలు ఈతలు కొడతారు. వేడుకలు జరిగేంత కాలం రాత్రివేళల్లో మ్యూజియమ్లన్నీ సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. కూడళ్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలపైనా, నగరంలోని రంగస్థలాలపైన సంగీత, నృత్య, వినోద కార్యక్రమాలు కోలాహలంగా సాగుతాయి. హ్వాషియోన్ సాన్షియోనియో ఐస్ ఫెస్టివల్ దక్షిణ కొరియాలోని గాంగ్వన్ డో ప్రావిన్స్లో ఏటా శీతకాలంలో ఐస్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. హ్వాషియోన్ నగరంలో గడ్డకట్టిన నదిపై రకరకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది ఎగువ ప్రాంతంలోని సాన్షియోనియో వద్ద మంచుదిమ్మల మీద ఏర్పడిన రంధ్రాల గుండా చేపలను పట్టే పోటీలను నిర్వహిస్తారు. భారీస్థాయి మంచుశిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొరియన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాల నుంచి 15 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. డ్రాగన్ కార్నివాల్ స్లోవేనియా రాజధాని ల్యూబ్లీయానలో ఏటా శీతకాలంలో జరిగే సంప్రదాయ వేడుక డ్రాగన్ కార్నివాల్. పురాతన పేగన్ సంస్కృతికి ఆనవాలుగా కొనసాగే ఈ వేడుకల్లో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది చిత్రవిచిత్రమైన మాస్కులు, రంగు రంగుల దుస్తులు ధరించి పాల్గొంటారు. భారీసైజులోని ఆకుపచ్చని డ్రాగన్ బొమ్మను మోసుకుంటూ ఊరేగిస్తారు. సంప్రదాయ వాద్యపరికరాలను మోగిస్తూ, నాట్యం చేస్తూ నగర వీథుల్లో సందడి చేస్తారు. పదమూడో శతాబ్దిలో పేగన్, క్రైస్తవ సంస్కృతులు పరస్పరం కలగలసిపోయిన నాటి నుంచి డ్రాగన్ కార్నివాల్ జరుగుతూ వస్తోందని చెబుతారు. నలభైరోజుల లెంట్ ఉపవాస దినాలకు ముందుగా, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సంబరాన్ని నిర్వహిస్తారు. కలోన్ వింటర్ కార్నివాల్ జర్మనీలోని కలోన్ నగరంలో ఏటా వింటర్ కార్నివాల్ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. పదకొండో నెల పదకొండో తేదీన– అంటే, ఏటా నవంబర్ 11న ఉదయం 11.11 గంటల నుంచి ‘కార్నివాల్’ సీజన్ మొదలవుతుంది. వీథుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో నిర్వహించే ఊరేగింపులతో ఈ వేడుకలు జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ రోజుల్లో ‘ఫ్యాట్ థర్స్డే’ నుంచి ‘యాష్ వెన్స్డే’ వరకు వారం రోజులను ‘క్రేజీ డేస్’ అంటారు. ఈ వారం రోజుల్లోనూ మరింత భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. పిల్లలూ పెద్దలూ వీథుల్లోకి చేరి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. వివిధ దేశాల నుంచి వచ్చే బ్యాండ్ బృందాలు, నృత్యబృందాలు ఊరేగింపుల్లో పాల్గొంటాయి. కలోన్ కార్నివాల్లో పాల్గొనేందుకు ముఖ్యంగా యూరోప్ నలుమూలల నుంచి జనాలు పెద్దసంఖ్యలో వస్తారు. సప్పోరో స్నో ఫెస్టివల్ జపాన్లోని సప్పోరో నగరంలో ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక ఇది. మంచుగడ్డ కట్టే పరిస్థితుల్లో మంచుతో శిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. ఈసారి 2023 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. సప్పోరో నగరంలోని ఓడోరి పార్క్, సుసుకినో, సుడోమ్ సహా పలు ప్రదేశాలు ఈ వేడుకల్లో హిమశిల్ప ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తాయి. ఓడోరి పార్క్లో హిమశిల్పాల పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. సప్పోరో స్నో ఫెస్టివల్ 1950లో తొలిసారిగా ఒకరోజు కార్యక్రమంగా మొదలైంది. అప్పట్లో ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు ఓడోరి పార్క్లో చేరి, మంచుతో శిల్పాలు మలచి సందర్శకులను ఆకట్టుకున్నారు. జపాన్ సైనిక దళాలు కూడా 1955 నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించడంతో ఇవి వారంరోజుల వేడుకలుగా మారాయి. అనతికాలంలోనే ఈ వేడుకలు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి హిమశిల్పాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు పాతిక లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్లో ఏటా శీతకాలంలో భారీ కార్నివాల్ జరుగుతుంది. ఈ కార్నివాల్ వెనుక ఒక కథ ఉంది. న్యూయార్క్కు చెందిన ఒక పాత్రికేయుడు సెయింట్ పాల్ను ‘మరో సైబీరియా’గా పోలుస్తూ కథనం రాశాడు. శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని అతను రాశాడు. ఈ కథనం స్థానికులకు కోపం తెప్పించింది. శీతకాలంలో కూడా సెయింట్ పాల్లో మనుషులు బతుకుతారని, అంతేకాదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలూ జరుపుకొంటారని రుజువు చేసేందుకు 1885లో మాంట్రియల్ సరిహద్దుల్లో ఒక మంచుసౌధాన్ని నిర్మించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 1937 వరకు ఒక క్రమం లేకుండా జరుగుతూ వచ్చాయి. తిరిగి 1946 నుంచి ఏటా క్రమపద్ధతిలో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ వేడుకల కోసం భారీ హిమసౌధాన్ని సిద్ధం చేస్తారు. వీథుల్లో పరేడ్లు, రాత్రివేళల్లో కాగడాల ఊరేగింపులు, సంగీత నృత్య కార్యక్రమాలు, హిమశిల్పాల తయారీ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యూబెక్ వింటర్ కార్నివాల్ కెనడాలోని క్యూబెక్ నగరంలో ఏటా ఫిబ్రవరిలో పదిరోజుల పాటు వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. క్యూబెక్లో 1893 నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్నివాల్లో పాల్గొనేందుకు కెనడా, అమెరికా, యూరోప్ల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలో పగలూ రాత్రీ కూడా కోలాహలంగా ఊరేగింపులు జరుగుతాయి. వాద్యపరికరాలను మోగిస్తూ, విచిత్రవేషధారణలతో వేలాది మంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంచుశిల్పాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. Funday Cover Story: అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా? -
మనుషులకే కష్టాలు.. మానులకు కాదు! ఈ నాలుగు ప్రాక్టీస్ చేయండి చాలు!
Sakshi Funday Cover Story: కష్టాలు మనుషులకు కాకుండా.. మానులకొస్తాయా! ఓదార్పు కోసం పెద్దవాళ్లు చెప్పే సాధారణమైన మాటిది. నిజమే కానీ.. సమాజంలో ఒకరిద్దరికి కష్టాలొస్తే ఇలాంటి ఓదార్పు మాటలు ఉపయోగపడతాయి! కానీ.. వందలో 42 మందికి తాము కష్టాల్లోనే బతుకీడుస్తున్నట్లు అనిపిస్తే? ఆ దుఃఖంలోనే వారు కుంగి కృశించి పోతూంటే.. అప్పుడు ఆ కష్టాలకు పెట్టుకోవాల్సిన పేరు.. ఒత్తిడి. ఇంగ్లిష్లో చెప్పుకుంటే స్ట్రెస్! ప్రపంచ దేశాలన్నింటిలోనూ అతిసామన్యమైపోతున్న ఈ మానసిక సమస్య గురించి భారత్లో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. చాలామంది... పైన చెప్పుకున్నట్లు ఓదార్పు మాటలతోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే.. ఆందోళనకరమైన ఈ సమస్య ఆనుపానులు సులువుగా... సచిత్రంగా!!! సాధనం-1: గ్రౌండింగ్ గ్రౌండింగ్ అంటే మీతో మీరు కనెక్ట్ కావడం. అంటే.. మీ శరీరం, ఆలోచనలు, భావాలు, పరిసరాలతో కనెక్ట్ కావడం. మీరు భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోతున్నప్పుడు నెమ్మదిగా మీ పాదాలను నేలకు ఆనించండి. భూమితో కనెక్ట్ అవ్వండి. తర్వాత మీ దృష్టిని శ్వాసపై నిలపండి. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం వాసన, రుచి చూడగలరనే విషయాన్ని శ్రద్ధగా గమనించండి. అంటే మీరు మీ ఆలోచనల నుంచి దూరంగా జరిగి.. మీతో, మీ చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకం అవండి. గ్రౌండింగ్ అంటే సింపుల్గా ఇంతే. గ్రౌండింగ్ను ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేక సమయం అవసరంలేదు. ఒకటి రెండు నిమిషాలు చాలు. ప్రతిరోజూ మీరు తినడం, వంట చేయడం లేదా నిద్ర పోవడం వంటి పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆలోచనల నుంచి బయటపడి, ఒత్తిడికి దూరంగా ఆనందంగా మారడాన్ని గమనించవచ్చు. మొదట చిన్న చిన్న పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో గ్రౌండింగ్ ఉపయోగించడం సులభం అవుతుంది. సాధనం-2: అన్ హుకింగ్ అన్ హుకింగ్ అంటే మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచనల గాలం నుంచి తప్పించుకోవడం. మూడు దశల్లో ఆ పని చేయవచ్చు. మొదట మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచన లేదా ఫీలింగ్ను గుర్తించండి. తర్వాత దాన్ని ఉత్సుకతతో గమనించండి. ఆ తర్వాత ఆ ఆలోచనకు లేదా అనుభూతికి ఓ పేరు పెట్టండి. ఇలా ఆలోచనలను, అనుభూతులను దూరంగా ఉండి గమనించడం, వాటికో పేరు పెట్టడం వల్ల.. మీరు, మీ ఆలోచనలు ఒకటి కాదనే స్పృహæ కలుగుతుంది. అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరంగా పెడుతుంది. ఆ తర్వాత మీతో ఎవరున్నారో, మీరేం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి. సాధనం-3: విలువలపై స్పందించడం ప్రతి మనిషికీ కొన్ని విలువలుంటారు. మీకు అత్యంత ముఖ్యమైన విలువలేమిటో ఎంచుకోండి. ఉదాహరణకు ప్రేమ, పని, ధైర్యం, దయ, కష్టపడి పనిచేయడం.. ఇలా చాలా! వీటికి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా మీరు ముఖ్యమైన నాలుగైదు విలువలేమిటో నిర్ణయించుకోండి. వచ్చే వారమంతా మీ విలువలకు అనుగుణంగా పనిచేసే ఒక చిన్న మార్గాన్ని ఎంచుకోండి. మీ విలువలకు అనుగుణంగా జీవించండి. మీరు పాటించలేని విలువల గురించి ఒత్తిడికి గురికాకుండా, మార్చగలిగే వాటిని మార్చండి. మార్చలేని వాటిని వదిలేసి ముందుకు సాగండి. సాధనం-4: ప్రేమతో నింపుకోండి మీరు మీ పట్ల ప్రేమతో, దయతో ఉంటే ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఆ ప్రేమ, దయ ఆకాశం నుంచి ఊడిపడవు. మీరే ఊహించుకోవాలి, సృష్టించుకోవాలి. మీ మెదడుకు ఊహకు, వాస్తవానికీ ఉన్న తేడా తెలియదు. కాబట్టి మీరు జస్ట్ ఊహించుకున్నా చాలు దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అందుకే మీ దోసిటి నిండా ప్రేమ లేదా దయ ఉన్నట్లు ఊహించండి. దాన్ని ఏ ఆకారంలో ఊహించుకుంటారనేది మీ ఇష్టం. తర్వాత, మీ శరీరంలో బాధ అనిపించే చోట చేతులుంచండి. మీ చేతుల నుంచి శరీరంలోకి ప్రవహించే ప్రేమను, దాని వెచ్చదనాన్ని అనుభవించండి. ఆ ప్రేమ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. -
అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా?
నీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. ఆకాశమే వాటి హద్దు. రెక్కల సత్తువకొద్ది ఎక్కడికంటే అక్కడకు హాయిగా ఎగిరిపోవడమే వాటికి తెలుసు. దారుల్లో తారసిల్లే తరులు గిరులు సాగరులను దాటి కోరుకున్న చోటుకు అవి రివ్వున చేరుకోగలవు. అప్పటి వరకు ఉంటున్న వాతావరణంలో కాస్త మార్పు కనిపించగానే, అనుకూల వాతావరణం ఉండే చోటును వెదుక్కుంటూ ఎంతదూరమైనా ఎగురుతూ పోవడమే వాటికి తెలుసు. వేల మైళ్లు ఎగురుతూ ప్రయాణిస్తూ, అనువైన చోటు దొరకగానే అక్కడ వెంటనే వాలిపోయి, కిలకిల రావాలతో సందడి చేస్తాయి. అక్కడ ఉండే జనాలకు కనువిందు చేస్తాయి. వలస వాటి జీవనశైలి. శీతాకాలం మొదలయ్యే తరుణంలో ఏటా ఠంచనుగా గుంపులు గుంపులుగా ఇక్కడకు వలస వస్తాయి. వేసవి మొదలవుతూనే తిరిగి తమ తమ నెలవులకు ఎగిరిపోతాయి. మన దేశానికి ఏటా వచ్చే వలస పక్షుల గురించి ఒక విహంగ వీక్షణం... మన దేశంలో వలస పక్షుల సీజన్ ఏటా సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారం నాటికి మొదలవుతుంది. సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరోప్ వంటి అత్యంత సుదూర ప్రాంతాలు సహా ఇరవై తొమ్మిది దేశాల నుంచి ఈ పక్షులు వేలాది కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి, ఇక్కడకు అతిథుల్లా వచ్చి వాలతాయి. వీటి రాకపోకల్లో ఏనాడూ క్రమం తప్పదు. మన దేశానికి 1,349 జాతులకు చెందిన లక్షలాది పక్షులు వస్తాయి. వీటిలో 212 పక్షిజాతులు ప్రమాదం అంచున ఉన్నట్లు పర్యావరణవేత్తలు ఇప్పటికే గుర్తించారు. వీటిని కాపాడుకోకుంటే, ఇవి త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఏటా మన దేశానికి వచ్చే పక్షులు ఇక్కడి సరోవర తీరాలను, తడి నేలలు గల ప్రదేశాలను తమ ఆవాసాలుగా ఎంచుకున్నాయి. ఇవి స్వయంగా ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో తప్ప మరెక్కడా వీటి సందడి కనిపించదు. అందుకే వలస పక్షులు చేరే ప్రదేశాల్లో ఏటా సీజన్లో పర్యాటకుల సందడి కూడా కనిపిస్తుంది. వలస పక్షుల ఆవాసాలలో వాటి రక్షణ కోసం ప్రభుత్వం అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. వలసపక్షుల విడిది కేంద్రాలు మన దేశంలో ఏటా వలసపక్షులు విడిది చేసే ప్రదేశాలు చిన్నా చితకా కలుపుకొని దాదాపు ఇరవైకి పైగానే ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద పక్షుల అభయారణ్యం గుజరాత్లో ఉంది. అది నల సరోవర్ అభయారణ్యం. అహ్మదాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలోని నల సరోవర తీరంతో పాటు, చుట్టుపక్కల 120 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన తడినేలల్లోని చెట్టూ చేమలన్నీ ఈ సీజన్లో వలసపక్షుల రాకతో సందడిని సంతరించుకుంటాయి. గుజరాత్లోనే కచ్ ప్రాంతంలో ఉన్న గ్రేట్ ఇండియన్ బర్డ్ సాంక్చుయరీకి కూడా పెద్దసంఖ్యలో వలసపక్షులు వస్తుంటాయి. మన దేశంలో వలసపక్షులు చాలా విరివిగా కనిపించే ప్రదేశాల్లో ఒడిశాలోని చిలికా సరస్సు ముఖ్యమైనది. ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సు 1100 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు, దీనిలోని రెండు దీవులు, సరస్సు పరిసరాల్లోని తడినేలల్లో ఉండే చెట్టు చేమలన్నీ ఈ సీజన్లో వలస పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గత ఏడాది దాదాపు పన్నెండు లక్షలకుపైగా వలస పక్షులు చిలికా తీరానికి చేరుకున్నాయి. ఒడిశాలోని కేంద్రపడా జిల్లా భితరకనికా జాతీయ అభయారణ్యానికి కూడా వలస పక్షులు పెద్దసంఖ్యలోనే వస్తుంటాయి. ఇక దేశంలోని రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ కూడా వలస పక్షులకు విడిది కేంద్రంగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్–తమిళనాడులలో విస్తరించిన ఈ సరస్సు విస్తీర్ణం 250–450 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పులికాట్ సరస్సు, పరిసర ప్రాంతాలతో కలుపుకొని పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యం 759 చదరపు కిలోమీటర్లలో విస్తరించి, సీజన్లో వలస పక్షులతో కళకళలాడుతూ కనువిందు చేస్తుంది. దేశంలో వలస పక్షులు పెద్దసంఖ్యలో చేరుకునే ముఖ్యమైన విడిది కేంద్రాల్లో రాజస్థాన్లోని భరత్పూర్ పక్షుల అభయారణ్యం ఒకటి. ఇక్కడ సీజన్లో వలసపక్షులతో పాటు ఏడాది పొడవునా స్థానికంగా ఈ అభయారణ్యంలో సంచరించే కుందేళ్లు, జింకలు, కృష్ణజింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, పులులు, చిరుతపులులు, మనుబోతులు వంటి వన్యజంతువులు కూడా కనిపిస్తాయి. హర్యానాలోని సుల్తాన్పూర్ పక్షుల అభయారణ్యం, గోవాలోని సలీం అలీ పక్షుల అభయారణ్యం, కేరళలోని కుమారకోం పక్షుల అభయారణ్యం, తమిళనాడులోని వేదాంతంగళ్ పక్షుల అభయారణ్యం, ఆంధ్రప్రదేశ్లోని హార్స్లీ హిల్స్ సమీపంలోని కౌండిన్య పక్షుల అభయారణ్యం, కొల్లేరు సరస్సు వద్ద ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం.. మహారాష్ట్రలోని వడుజ్ పట్టణం వద్ద మాయానీ పక్షుల అభయారణ్యం, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ ప్రాంతంలోని చంద్రశేఖర్ ఆజాద్ పక్షుల అభయారణ్యం, రాయ్బరేలీ సమీపంలో సమస్పూర్ పక్షుల అభయారణ్యం, కేరళలోని తట్టెకడ్ పక్షుల అభయారణ్యం, కర్ణాటకలోని మాండ్య జిల్లాలో రంగతిట్టు అభయారణ్యం, పశ్చిమబెంగాల్లో కోల్కతా శివార్లలోని చింతామణి కర్ పక్షుల అభయారణ్యం తదితర ప్రాంతాల్లో ఏటా అక్టోబర్–మార్చి మధ్య కాలంలో వలస పక్షుల సందడి కనిపిస్తుంది. రంగు రంగుల్లో కనిపించే అరుదైన పక్షులను తిలకించడానికి దేశాల విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో ఈ అభయారణ్యాలకు వస్తుంటారు. ఇవే కాకుండా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా తేలుకుంచి, తేలినీలాపురం గ్రామాల పరిసర ప్రాంతాలకు కూడా వందలాదిగా వలసపక్షులు వస్తుంటాయి. రకరకాల పక్షులు... రంగురంగుల పక్షులు... సుదూర తీరాల నుంచి ఎగురుతూ మన దేశంలో విడిది చేయడానికి వచ్చే రకరకాల పక్షులు, రంగు రంగుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. వీటిలో కొన్ని పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. మరికొన్ని గుప్పిట్లో పట్టేంత చిన్నగా కూడా ఉంటాయి. వేలాది మైళ్లు దాటి అవి ఇక్కడకు చేరుకోవడమే ఒక ప్రకృతి విచిత్రం. వాటి స్వస్థలాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కట్టే పరిస్థితులు ఉండటం వల్ల అక్కడ అవి ఆ కాలంలో మనుగడ సాగించలేవు. అందుకే సమశీతల వాతావరణాన్ని వెదుక్కుంటూ అవి ఇక్కడకు చేరుకుంటాయి. మన దేశంలో వేసవి తీవ్రత ఎక్కువ కావడంతో వేసవి మొదలవుతూనే, ఇవి స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఇక్కడ ఉన్నంతకాలం అనువైన చోట్ల గూళ్లు కట్టుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలను చేస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చే నాటికి వాటి తిరుగుప్రయాణ కాలం మొదలవుతుంది. వలస పక్షుల రాకపోకలు సజావుగా సాగుతున్నాయంటే, ప్రకృతి సమతుల్యత బాగున్నట్లే! వీటిలో కొన్ని జాతుల పక్షుల మనుగడ ప్రమాదం అంచుకు చేరుకుంటూ ఉండటమే కొంత ఆందోళన కలిగించే అంశం. ‘ఎక్కువగా సరోవర తీరాలకు చేరుకునే వలస పక్షులకు, సరోవరాల పరిసరాల్లోని చిత్తడి నేలలే ప్రధాన ఆవాసాలు. చిత్తడి నేలల్లో ఎలాంటి మార్పులు వచ్చినా, ఇక్కడకు వచ్చే వలస పక్షులకు ఇబ్బందే! రకరకాల జాతులకు చెందిన కొంగలు, రకరకాల జాతులకు చెందిన బాతులు, రంగురంగుల రామచిలుకలు, గిజిగాళ్లు, మైనాలు, విదేశీ పావురాలు, రకరకాల గద్దలు, డేగలు, రాబందులు, ఎన్నో చిత్ర విచిత్రమైన చిన్నిచిన్ని పిట్టలు ఇక్కడకు సీజన్లో వలస వస్తుంటాయి. వాటిలో గేటర్ ఫ్లమింగో, లెస్సర్ ఫ్లమింగో, గ్రేట్ వైట్ పెలికాన్, కాస్పియన్ టెర్న్, యురేషియన్ బిట్టెర్న్, యురేషియన్ స్పూన్బిల్, బ్లాక్ క్రెస్టెడ్ బుల్బుల్, బ్లాక్ నేపెడ్ మోనార్క్, ఈజిప్షియన్ వల్చర్, ఎమరాల్డ్ డవ్, లాఫింగ్ డవ్, రాక్ డవ్, టఫ్టెడ్ డక్, ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్.. లిటిల్ స్విఫ్ట్, వాటర్కాక్, ఆసియన్ ఓపెన్బిల్, గ్రేట్ ఎగ్రెట్, ఇంటర్మీడియట్ ఎగ్రెట్, కెంటిష్ ప్లవర్, గ్రేటర్ సాండ్ప్లవర్, రివర్ లాప్వింగ్, బ్రాడ్బిల్డ్ సాండ్పైపర్, గ్రేటర్ క్రెస్టెడ్ టెర్న్, లెస్సర్ క్రెస్టెడ్ టెర్న్, బ్లాక్వింగ్డ్ కైట్, బూటెడ్ ఈగిల్, అలెగ్జాండ్రిన్ పారాకీట్, రెడ్ రింగ్డ్ పారాకీట్, స్కార్లెట్ మినివెట్, మలార్డ్, గ్రీన్ బీ ఈటర్, హిమాలయన్ స్విఫ్ట్లెట్, పెయింటెడ్ స్టాక్, ప్లమ్హెడెడ్ పారాకీట్, పర్పుల్ హెరాన్, పర్పుల్స్వాంప్హెన్, రెడ్ క్రెస్టెడ్ పోచడ్ వంటి అరుదైన పక్షులు కూడా మన దేశంలోని వలసపక్షుల విడిది కేంద్రాల్లో ఈ సీజన్లో కనిపిస్తాయి. వీటిని ఫొటోలు తీసేందుకు, వీడియోలు తీసేందుకు దేశ విదేశాలకు చెందిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లు, అరుదైన పక్షుల తీరుతెన్నులను, వాటి అలవాట్లను నిశితంగా అధ్యయనం చేసే విహంగ శాస్త్రవేత్తలు (ఆర్నిథాలజిస్టులు) కూడా ఈ ప్రాంతాలకు వస్తుంటారు. అడుగడుగునా ప్రమాదాలే... వలస పక్షులకు అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. గుంపులు గుంపులుగా అవి వలస ప్రయాణంలో ఉన్నప్పుడు మార్గమధ్యంలో తలెత్తే తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, వేటగాళ్ల ఉచ్చులు, విద్యుదుత్పాదన కోసం ఎత్తయిన ప్రదేశాల్లో అమర్చే గాలిమరలు, సముద్ర తీరాల్లోని ఆయిల్ రిగ్స్, అలవాటైన ఆవాసాలలో తడినేలల తరుగుదల వంటివి వలసపక్షులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వేటగాళ్లు వలలు, ఉచ్చులు మాత్రమే కాకుండా, వలసపక్షులు వాలే చెట్ట కొమ్మల మీద జిగురుపూసి, వాటిని కదలకుండా చేసి బంధించే పద్ధతులు కూడా అవలంబిస్తున్నారు. కొన్ని సంపన్న దేశాల్లో అడవిపక్షుల మాంసానికి గిరాకీ ఉండటంతో ఇక్కడ పట్టుకున్న పక్షులను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాతావరణ మార్పులు ఒకవైపు, వేటగాళ్ల దారుణాలు మరోవైపు వలసపక్షుల మనుగడకు పెనుముప్పు కలిగిస్తున్నాయి. వలసపక్షుల ఆవాసాలలోని పొలాలు, తోటల్లో వాడే పురుగుమందులు, రసాయనాలు కూడా వాటి ప్రాణాలను హరిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా డీడీటీ వినియోగం విపరీతంగా ఉండేది. డీడీటీ దెబ్బకు కోట్లాదిగా పక్షులు మరణించాయి. మన దేశంలో 1972లో డీడీటీ వినియోగాన్ని నిషేధించారు. డీడీటీని నిషేధించినా, మరికొన్ని రకాల పురుగుమందుల వినియోగం నేటికీ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, నొప్పినివారణకు వాడే ‘డైక్లోఫెనాక్’ కూడా పక్షులకు ముప్పుగా మారుతోంది. మనుషులతో పాటు పశువైద్యంలోనూ ‘డైక్లోఫెనాక్’ ఇప్పటికీ వాడుతున్నారు. డైక్లోఫెనాక్ ఔషధానికి అలవాటుపడిన జంతువు మరణించాక, వాటి కళేబరాలను తినే రకరకాల రాబందులు, డేగలు, గద్దలు పెద్దసంఖ్యలో మరణిస్తున్నాయి. డైక్లోఫెనాక్ ఎక్కువగా వాడటం వల్ల జంతువులు కిడ్నీలు విఫలమై మరణిస్తున్నాయని, వాటి కళేబరాలు తినడం వల్ల రాబందులు, డేగలు వంటి పెద్ద పక్షులు మరణిస్తున్నాయని ముఖ్యంగా యూరోప్ నుంచి ఆగ్నేయాసియా ప్రాంతానికి వలసపోయే పెద్దపక్షులు దీనివల్ల ఎక్కువగా మరణిస్తున్నాయని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) దాదాపు దశాబ్దం కిందటే వెల్లడించింది. పట్టణీకరణ పెరగడంతో రాత్రిపగలు తేడా లేకుండా వీథుల్లో వెలిగే విద్యుద్దీపాల వెలుగులు కూడా వలసపక్షులకు ముప్పుగా మారుతున్నాయి. దీపాల కాంతి వల్ల ఈ పక్షులు గందరగోళంలో పడి, తమ ఆవాసాలవైపు వెళ్లలేక, దారీతెన్నూ లేక ఎగురుతూ అలసి సొలసి నేలకు రాలిపోతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఆకాశహర్మ్యాలలో అద్దాల గోడల వెనుక వెలిగే దీపాల ఆకర్షణలో చిక్కుకుని, అద్దాల గోడలను ఢీకొని నేలరాలిపోతున్న ఉదంతాలూ ఉంటున్నాయి. వాతావరణ మార్పులతోనూ సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న వాతావరణ మార్పులతోనూ వలసపక్షుల మనుగడకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. భూతాపం పెరుగుదల వల్ల రుతువుల రాకపోకల్లో తలెత్తే మార్పులను అంచనా వేయలేక వలసపక్షులు మనుగడను సాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయ విహంగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారిశ్రామిక విప్లవం మొదలైన నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల నమోదవుతోంది. ఇప్పటికైనా భూతాపాన్ని అదుపుచేసే చర్యలు చేపట్టకుంటే, రానున్న దశాబ్దకాలంలోనే సగటు ఉష్ణోగ్రతల్లో మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సహా వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల వలసపక్షుల ఆహార విహారాల్లోను, పునరుత్పత్తి క్రమంలోనూ మార్పులు వస్తున్నాయని, మార్పులను తట్టుకోలేని కొన్ని పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని వారు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు అడవుల నరికివేత కూడా వాతావరణ మార్పులకు దారితీస్తోంది. అడవుల నరికివేత వల్ల వలసపక్షులకు మరో సమస్య కూడా ఎదురవుతోంది. అవి గూళ్లు పెట్టుకోవడానికి అనువైన చెట్లు, చిత్తడి నేలల విస్తీర్ణం తగ్గిపోయి వాటికి అనువైన ఆవాసాలు తగినంతగా దొరకని పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా మనదేశానికి వలస వచ్చే పక్షుల సంఖ్య ఏడాదికేడాది క్రమంగా తగ్గిపోతోందని పర్యావరణవేత్త విజయ్కుమార్ బాఘేల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే (సీఏఎఫ్) మీదుగా మన దేశానికి వచ్చే 279 పక్షిజాతుల్లో 29 పక్షిజాతులు పూర్తిగా ప్రమాదం అంచుల్లో ఉన్నాయని, ఇప్పటికైనా వాటిని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మన దేశానికి వలస వచ్చే మొత్తం 1349 పక్షిజాతుల్లో 146 పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని, గడచిన ఐదేళ్ల వ్యవధిలోనే ఈ జాతులకు చెందిన పక్షుల సంఖ్య 80 శాతం మేరకు తగ్గిపోయిందని, అలాగే మరో 319 జాతులకు చెందిన పక్షుల సంఖ్య 50 మేరకు తగ్గిపోయిందని ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్’ నివేదిక ఈ ఏడాది ప్రారంభంలోనే వెల్లడించింది. పక్షుల రాకపోకలను, వాటి కదలికలను, తీరుతెన్నులను ఎప్పటికప్పుడు గమనించే విహంగ శాస్త్రవేత్తల పరిశీలనల్లో తేలిన అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ముఖ్యంగా సరస్సులు, ఇతర జలాశయాల వద్ద ఉండే చిత్తడినేలలకు వచ్చే పక్షిజాతుల్లో ఈ తగ్గుదల ఎక్కువగా నమోదవుతున్నట్లు ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్’ నివేదిక వెల్లడించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే, వలస పక్షులను కాపాడుకోవలసిన అవసరం ఉందని, వీటి పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ సహా పలు అంతర్జాతీయ సంస్థలు పిలుపునిస్తున్నాయి. సవాళ్లతో కూడుకున్న పని ప్రభుత్వాలు ఎన్ని అభయారణ్యాలను ఏర్పాటు చేసినా, పక్షుల రక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, వేటగాళ్లు అతిథుల్లా వచ్చే వలసపక్షులనూ విడిచిపెట్టడం లేదు. వేటగాళ్ల ధాటికి ఇప్పటికే సైబీరియన్ క్రేన్ జాతి పూర్తిగా కనుమరుగైంది. వలస పక్షులు విడిది చేసే ప్రాంతాల్లో సమీప జనావాసాలకు చెందిన ప్రజలు కూడా వీటి రక్షణలో పాలు పంచుకుంటేనే వీటి భద్రతకు భరోసా ఉంటుంది. ఏయే జాతుల పక్షులు కచ్చితంగా ఎక్కడెక్కడ విడిది చేస్తున్నాయో గుర్తించడం, అక్కడి పరిసరాల పరిస్థితులు విహంగాలకు సానుకూలంగా ఉండేలా కాపాడుకోవడం సవాళ్లతో కూడుకున్న పని. పక్షుల పరిరక్షణకు ప్రభుత్వాల చర్యలతో పాటు సమీప జనావాసాల్లోని ప్రజలు అవగాహన కలిగి ఉండటం కూడా ముఖ్యం. – అర్పిత్ దేవ్మురారి, వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్, వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ టెక్నాలజీ లీడ్, డబ్ల్యూడబ్యూఎఫ్– ఇండియా పక్షులలో వలస పక్షులే వేరు... భూమ్మీద దాదాపు పదకొండువేలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో దాదాపు నాలుగువేల పక్షిజాతులు రుతువుల్లో మార్పులు వచ్చినప్పుడు తమకు అనువైన ప్రదేశాలను వెదుక్కుంటూ వలసలు వెళుతుంటాయి. వీటిలో సుమారు 1800 జాతుల పక్షులు తమ తమ నెలవుల నుంచి అత్యంత సుదూర ప్రాంతాలకు సైతం వలస వెళుతుంటాయి. వీటిలో రోజుకు ఏకబిగిన వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ, దాదాపు 20వేల కిలోమీటర్లకు పైగా దూరాలను అధిగమించేవి కూడా ఉంటాయి. వలస పక్షుల జాతుల్లో దాదాపు 683 జాతులకు చెందిన పక్షులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ ఇటీవల వెల్లడించింది. పక్షుల వలస విశేషాలు వలస పక్షులకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అత్యధిక దూరాన్ని ఏకధాటిగా అతి తక్కువకాలంలో అధిగమించేవి కొన్ని, వేలాది కిలోమీటర్లు ప్రయాణించే గుప్పెడంత పిట్టలు కొన్ని... ఈ పక్షుల వలస విశేషాల్లో అరుదైనవి కొన్ని... ►అత్యధిక దూరం వలసపోయే పక్షి ఆర్కిటిక్ టెర్న్. ఇది ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే అధిగమించి, అలాస్కా నుంచి న్యూజిలాండ్కు చేరుకుంటుంది. ►సరస్సులు, ఇతర జలాశయాలు ఉండే చోటుకు వలసవచ్చే పక్షుల్లో మొదటగా బాతుజాతులకు చెందిన పక్షులు చేరుకుంటాయి. మిగిలిన వలసపక్షుల కంటే ఇవి దాదాపు నెల్లాళ్ల ముందే–అంటే సెప్టెంబర్లోనే మన దేశానికి చేరుకుంటాయి. ►చాలా ఎత్తున ఎగిరే వలసపక్షి బాతుజాతికి చెందిన బార్హెడెడ్ గీస్. ఇది సముద్ర మట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణం ప్రారంభించి, భారత భూభాగంలోని చిలికా, పులికాట్ తదితర సరస్సుల తీరాలకు చేరుకుంటాయి. ►అత్యధిక వేగంతో ప్రయాణించే వలసపక్షి గ్రేట్ స్నైప్. ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ►నిర్విరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్ టెయిల్డ్ గాడ్విట్. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. -
ప్రపంచమొక ఫుట్బాల్.. జగమంతా ఆడే ఆట
క్రిస్టియానో రొనాల్డో కోసం రాత్రంతా జాగారం చేయడానికి సిద్ధం... లయెనెల్ మెస్సీ మ్యాజిక్ గురించి గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఇప్పుడు ఎవరైనా రెడీ... ఏ దేశం వాడైనా ఫర్వాలేదు... వేల్స్ వాడైనా, ట్యునీషియాకు చెందిన స్టార్ అయినా మనకు చుట్టమే. సెనెగల్వాడితో, మొరాకో ప్లేయర్తో కొత్తగా బాదరాయణ సంబంధం కలుపుకుందాం... బైసైకిల్ కిక్ చూపించిన వాడే మనకు బాస్... బంతిని మెరుపుకంటే వేగంగా తీసుకెళ్లి గోల్ చేయించేవాడే మన దృష్టిలో మొనగాడు.. 29 రోజుల పాటు ఆ దేశం, ఈ దేశం అని లేకుండా మనందరం ఫుట్బాల్ పక్షమే. బరిలోకి దిగే 11 మందిలో సగం పేర్లు తెలియకపోయినా పర్లేదు... బంతి ఎటు వెళితే మన కళ్లు అటు వైపు... ఎవరూ చెప్పకుండానే కాళ్లలో కదలికలు సాగుతుంటాయి... అలా అలా నడుస్తూ బంతి లేని చోట కూడా సరదాగా అలా కిక్ కొట్టేసిన ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. కోట్లలో ఒకడిగా మనమూ ఫుట్బాల్ ఫ్యాన్స్గా మారిపోదాం... వరల్డ్ కప్ వినోదాన్ని ఆస్వాదిద్దాం...! కాలక్రమంలో మరో నాలుగేళ్లు గడిచిపోయాయి. ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ రూపంలో మరో విశ్వ క్రీడా సంరంభం మొదలుకానుంది. 2018లో రష్యా వేదికగా జరిగిన ప్రపంచకప్లో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా 32 జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. ఎప్పటిలాగే యూరోప్ జట్లు ఫేవరెట్స్గా కనిపిస్తున్నాయి. యూరోప్ దేశాలకు దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి మళ్లీ పోటీ వస్తుందనడంలో సందేహం లేదు. తొలిసారి ప్రపంచకప్లో ఆడుతున్న ఖతర్ తొలి రౌండ్ దాటగలిగితే అదే గొప్ప ఫలితంలా భావించాలి. 1966లో ఒకేఒక్కసారి ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయింది. గతంలో మూడుసార్లు ఫైనల్ చేరి మూడుసార్లూ ఓడిపోయిన నెదర్లాండ్స్ తొలిసారి ట్రోఫీని అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఫుట్బాల్ అనేది టీమ్ గేమ్. ప్రైవేట్ లీగ్ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ప్రపంచకప్ వచ్చేసరికి తమ జాతీయ జట్టును గెలిపించలేకపోతున్నారు. జట్టులో ఒకరిద్దరు కాకుండా జట్టు మొత్తం రాణిస్తేనే ఆశించిన ఫలితం లభిస్తుంది. - కరణం నారాయణ వారి కల ఫలించేనా... లయెనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో... ఆధునిక ఫుట్బాల్లో సూపర్ స్టార్లు. చాంపియన్స్ లీగ్తో పాటు ఇతర క్లబ్ టోర్నీలలో తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటారు. సాధించిన రికార్డులు, కీర్తి కనకాదులకు లెక్కే లేదు. కానీ వీరిద్దరి కెరీర్లో ఒకే ఒక లోటు తమ జాతీయ జట్టు తరపున ప్రపంచ కప్ గెలవలేకపోవడం. పోర్చుగల్ తరపున రొనాల్డో, అర్జెంటీనా తరపున మెస్సీ ఒక్క వరల్డ్ కప్ విజయంలోనూ భాగం కాలేకపోయారు. 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాకపోగా... రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. వీరిద్దరూ ఆఖరిసారిగా ప్రపంచ కప్ బరిలోకి దిగబోతున్నారు. ఈ సారైనా వీరు తమ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తారా లేక ఎప్పుడూ కప్ గెలవలేకపోయిన దిగ్గజాల జాబితాలో చోటుతో ఆటను ముగిస్తారా చూడాలి. జగమంతా ఆడే ఆట ... గత 92 ఏళ్లలో ఫుట్బాల్ ప్రపంచకప్కు ఆదరణ ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. ప్రస్తుతం ‘ఫిఫా’ పరిధిలో 211 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు వరల్డ్ కప్కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 13 దేశాలు ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన ఏడాది తర్వాతే వచ్చే ప్రపంచకప్ కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్లు మొదలు అవుతాయి. దాదాపు మూడేళ్లపాటు ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతాయి. 1978 వరకు 16 జట్లు... 1982 నుంచి 2002 వరకు 24 జట్లు పోటీపడ్డాయి. 2006 నుంచి తాజా ప్రపంచకప్ వరకు 32 జట్లు ప్రధాన టోర్నీలో బరిలో ఉన్నాయి. ప్రపంచకప్లో పాల్గొనే దేశాల సంఖ్యపై ఖండాలవారీగా ‘ఫిఫా’ స్లాట్లు కేటాయిస్తుంది. ప్రస్తుతం ఆసియా నుంచి 5... ఆఫ్రికా నుంచి 5... యూరోప్ నుంచి 13... ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దీవుల నుంచి 4... దక్షిణ అమెరికా నుంచి 4 స్లాట్లు ఉన్నాయి. ఆతిథ్య దేశం ఖతర్ ఆసియా నుంచి కావడంతో ఈసారి ఆసియా స్లాట్ల సంఖ్య ఆరు అయింది. 2026 ప్రపంచకప్ను 48 జట్లతో నిర్వహించాలని ‘ఫిఫా’ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ స్లాట్లలో మార్పు చేర్పులు ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా జట్లు అంతంతే... ప్రపంచకప్కు ఆదరణ పెంచేందుకు ‘ఫిఫా’ ఆసియా దేశాల్లో ఆటను ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. 1938లో ఇండోనేసియా.. వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మొత్తం 12 ఆసియా జట్లు ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొన్నాయి. 2002లో దక్షిణ కొరియా అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా నిలిచింది. మరోవైపు 13 ఆఫ్రికా దేశాలు కూడా ఈ మెగా టోర్నీలో భాగంకాగా... కామెరూన్, సెనెగల్, ఘనా మాత్రమే క్వార్టర్ ఫైనల్కు చేరడం అత్యుత్తమ ప్రదర్శన. ఏ ఆఫ్రికా జట్టూ ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరలేదిప్పటి వరకు. కప్ వెనుక కథ... 1930లో మొదలైన ఫుట్బాల్ ప్రపంచకప్.. చాంపియన్స్కు ఇచ్చే ట్రోఫీ ఒకసారి మారింది. 1930 నుంచి 1970 వరకు ఒకే రకమైన ట్రోఫీని ఇచ్చారు. మొదట్లో దీనిని ‘విక్టరీ’ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత ఈ ట్రోఫీకి ‘ఫిఫా’ మాజీ అధ్యక్షుడు ‘జూల్స్ రిమెట్’ పేరు పెట్టారు. 3.8 కిలోల బరువు, 35 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఈ ట్రోఫీని వెండితో తయారు చేసి బంగారు పూత పూశారు. టోర్నీ విజేతలకు దీని ‘రెప్లికా’ను మాత్రమే ఇచ్చేవారు. అయితే 1970లో బ్రెజిల్ మూడోసారి టైటిల్ గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం ‘ఒరిజినల్ ట్రోఫీ’ని బ్రెజిల్కు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో 1974లో ‘ఫిఫా’ కొత్త ట్రోఫీని రూపొందించింది. రెండు చేతులు గ్లోబ్ను మోస్తున్నట్లుగా ఉండే చిత్రంతో ఇది తయారైంది. దీని ఎత్తు 36.5 సెంటీమీటర్లు. బరువు 5 కిలోలు. దీనిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దిగువ భాగంలో విజేతల జాబితా ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈ ట్రోఫీని ఎవరికీ శాశ్వతంగా ఇవ్వరు. విజేతకు అదే తరహాలో ఉండే కంచు ట్రోఫీని మాత్రం అందజేస్తారు. ఆరుసార్లు ఆతిథ్య జట్టుకు అందలం... ఇప్పటివరకు 21 సార్లు ప్రపంచకప్ టోర్నీ జరిగింది. ఆరుసార్లు ఆతిథ్య జట్టు (1930లో ఉరుగ్వే; 1934లో ఇటలీ; 1966లో ఇంగ్లండ్; 1974లో పశ్చిమ జర్మనీ; 1978లో అర్జెంటీనా; 1998లో ఫ్రాన్స్) విశ్వవిజేతగా అవతరించింది. ‘ఫైవ్ స్టార్’ బ్రెజిల్... ఇప్పటి వరకు 13 దేశాలు మాత్రమే ఫైనల్కు చేరుకోగా... అందులో ఎనిమిది దేశాలు ప్రపంచ చాంపియన్స్గా నిలిచాయి. అత్యధికంగా బ్రెజిల్ జట్టు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002) విజేతగా నిలిచింది. జర్మనీ (1954, 1974, 1990, 2014), ఇటలీ (1934, 1938, 1982, 2006) దేశాలు నాలుగుసార్లు ట్రోఫీని సాధించాయి. అర్జెంటీనా (1978, 1986), ఫ్రాన్స్ (1998, 2018), ఉరుగ్వే (1930, 1950) రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచాయి. ఇంగ్లండ్ (1966), స్పెయిన్ (2010) ఒక్కోసారి ప్రపంచ చాంపియన్ అయ్యాయి. పాపం... నెదర్లాండ్స్ ప్రపంచకప్ చరిత్రలో దురదృష్ట జట్టు ఏదంటే నెదర్లాండ్స్ అని చెప్పవచ్చు. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక పోరులో తడబడటం నెదర్లాండ్స్కు అలవాటుగా మారింది. దాంతో ఇప్పటివరకు 10 సార్లు ప్రపంచకప్లో పాల్గొని మూడుసార్లు (1974, 1978, 2010) ఫైనల్ చేరినా ఈ జట్టు ఒక్కసారీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. హంగేరి (1938, 1954), చెక్ రిపబ్లిక్ (1934, 1962) రెండుసార్లు... స్వీడన్ (1958), క్రొయేషియా (2018) ఒక్కోసారి ఫైనల్కు చేరి ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకున్నాయి. ప్రతిభకు పట్టం.. ప్రపంచకప్ మొత్తం నిలకడగా రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. అందులో ముఖ్యమైనవి... గోల్డెన్ బాల్: టోర్నీలో ఉత్తమ ప్లేయర్కు అందించే అవార్డు. రెండో ఉత్తమ ప్లేయర్కు ‘సిల్వర్ బాల్’... మూడో ఉత్తమ ప్లేయర్కు ‘బ్రాంజ్ బాల్’ అందజేస్తారు. గోల్డెన్ బూట్: టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్కు అందజేస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి ‘సిల్వర్ బూట్’.. మూడో స్థానంలో నిలిచిన వారికి ‘బ్రాంజ్ బూట్’ ఇస్తారు. గోల్డెన్ గ్లవ్: టోర్నీలో ఉత్తమ గోల్కీపర్కు అందించే పురస్కారం. ఏ గ్రూప్లో ఎవరంటే... గ్రూప్ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్. గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్. గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా. గ్రూప్ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియా. గ్రూప్ ‘ఇ’: జర్మనీ, స్పెయిన్, జపాన్, కోస్టారికా. గ్రూప్ ‘ఎఫ్’: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మొరాకో. గ్రూప్ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, కామెరూన్, స్విట్జర్లాండ్. గ్రూప్ ‘హెచ్’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా. వీరే విజేతలు 1930 ఉరుగ్వే 1934 ఇటలీ 1938 ఇటలీ 1950 ఉరుగ్వే 1954 పశ్చిమ జర్మనీ 1958 బ్రెజిల్ 1962 బ్రెజిల్ 1966 ఇంగ్లండ్ 1970 బ్రెజిల్ 1974 పశ్చిమ జర్మనీ 1978 అర్జెంటీనా 1982 ఇటలీ 1986 అర్జెంటీనా 1990 పశ్చిమ జర్మనీ 1994 బ్రెజిల్ 1998 ఫ్రాన్స్ 2002 బ్రెజిల్ 2006 ఇటలీ 2010 స్పెయిన్ 2014 జర్మనీ 2018 ఫ్రాన్స్ అత్యధిక గోల్స్ చేసిన టాప్–10 జట్లు జట్టు గోల్స్ బ్రెజిల్ 229 జర్మనీ 226 అర్జెంటీనా 137 ఇటలీ 128 ఫ్రాన్స్ 120 స్పెయిన్ 99 ఇంగ్లండ్ 91 ఉరుగ్వే 87 హంగేరి 87 నెదర్లాండ్స్ 86 ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... లక్షల్లో జనాభా ఉన్న చిన్నచిన్న దేశాలు కూడా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధించి తమ ప్రత్యేకతను చాటుకుంటుంటే.. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం ఏనాడూ ఈ మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ 106వ స్థానంలో ఉంది. క్రికెట్ ఆదరణ పెరిగాక మన దేశంలో ప్రాభవం కోల్పోయిన ఎన్నో ఆటల్లో ఫుట్బాల్ కూడా ఒకటి. ప్రతి నాలుగేళ్లకు ప్రపంచకప్లో ఒక్క కొత్త జట్టయినా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటే భారత ఫుట్బాల్లో మాత్రం కదలిక కనిపించదు. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఇండియన్ సూపర్ లీగ్, ఐ–లీగ్ తదితర టోర్నీలతో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడంలేదు. 1950, 60వ దశకాల్లో భారత జట్టు ఆసియాలోని అత్యుత్తమ ఫుట్బాల్ టీమ్లలో ఒకటిగా నిలిచింది. 1951, 1962 ఆసియా క్రీడ్లలో స్వర్ణాలు సాధించిన మన జట్టు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలవడం మన అత్యుత్తమ ఘనత. అయితే 1970 నుంచి మన తిరోగమనం వేగంగా సాగింది. అప్పుడప్పుడు దక్షిణాసియా (శాఫ్) దేశాల పోటీల్లో మెరుపులు మినహా మిగతాదంతా శూన్యమే. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి తదితర స్టార్లు మాత్రమే వ్యక్తిగత ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. మస్కట్, అధికారిక బంతి, పాటలు... టోర్నమెంట్ అధికారిక మస్కట్ ‘లాయిబ్’. ఇది అరబిక్ పదం... ‘నిష్ణాతుడైన ఆటగాడు’ అని అర్థం. ఈ ఏప్రిల్ 1న మస్కట్ను ఆవిష్కరించిన అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) వెబ్సైట్లో లాయిబ్ గురించి ఇలా రాసింది.. ‘లాయిబ్ యువతలో స్ఫూర్తి నింపుతుంది. అదెక్కడుంటే అక్కడ హుషారు, ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతాయి’ అని! సృజన, ఆలోచనలతోనే వ్యక్తుల సంకల్పం పెరుగుతుందని తెలిపింది. అధికారిక బంతి ‘అల్ రిహ్లా’ మస్కట్ కంటే ముందు మార్చి 30న టోర్నీలో వాడే అధికారిక బంతి ‘అల్ రిహ్లా’ని ఆవిష్కరించింది. అరబిక్లో ‘అల్ రిహ్లా’ అంటే ప్రయాణం. ఖతర్ సంస్కృతి, నిర్మాణశైలి, పడవలు, పతాకం నుంచి ప్రేరణ పొందాలనే ఉద్దేశంతో ఆ పేరును ఖరారు చేశారు. మన్నికకే ప్రాధాన్యమిచ్చి ప్రత్యేకమైన జిగురు, సిరాలతో రూపొందించిన తొలి అధికారిక బంతి ఇది. ఆట పాట గతంలో ప్రతి ప్రపంచకప్కు ప్రత్యేక గీతాన్ని స్వరపరిచేవారు. మెగా టోర్నీకి ముందే అది సాకర్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేది. కానీ ఈసారి ఒక పాటతో సరిపెట్టకుండా పాటల ట్రాక్ను విడుదల చేశారు. హయ్యా... హయ్యా (కలిసుంటే కలదు సుఖం) పాటతో ఈ ట్రాక్ మొదలవుతుంది. దీన్ని ట్రినిడాడ్, కార్డొన, డేవిడో, ఐషా బృందం ఆలపించింది. ‘అర్హ్బో’, ‘లైట్ ద స్కై’ అనే ఇంకో రెండు పాటలు ఈ ప్రపంచకప్ గానా బజానాలో భాగమయ్యాయి. -
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణ నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి. దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిదిరోజుల ముందు నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, ప్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం న భూతో న భవిష్యతి అనేలా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయం పరిధిలోని నాలుగు మాడవీథుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీద ఊరేగుతారు. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనం ఆదిశేషుడైతే, చిన్నశేషవాహనం వాసుకి. హంసవాహనం రెండోరోజు రాత్రి స్వామివారు విద్యాప్రదాయని అయిన శారదామాత రూపంలో హంసవాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా శ్రీనివాసుడు హంసవాహనం అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగుతూ దర్శనమివ్వడం భక్తులకు నేత్రపర్వం. సింహవాహనం బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహవాహనం అధిరోహించి శ్రీవేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులలో మృగరాజైన సింహాన్ని తానేనంటూ మనుషులలో జంతు ప్రవృత్తిని నియంత్రించుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారని ముత్యాలపందిరి వాహనం మూడో రోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే సుకుమారసేవగా ముత్యాలపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు శ్రీవేంకటాద్రివాసుడు. కల్పవృక్షం– అన్నవస్త్రాదుల వంటి ఇహలోక సంబంధితమైన కోరికలను మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించే కారుణ్యమూర్తి. నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలోని భూపాలకులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్త జనావళికి కనువిందు చేస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం నేరుగా శ్రీవారి ఆలయం లోపలి నుంచే పల్లకిపై ప్రారంభం అవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా దైవానుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీథుల్లో విహరిస్తారు. గరుడవాహనం ఐదోరోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద స్వామివారు ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవేంకటేశ్వరుడిని తన కీర్తనలతో నానా విధాలుగా కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన ఛత్రాలను గరుడ వాహనంలో అలంకరిస్తారు. ఈ వాహనంలో ఊరేగే స్వామివారి వైభోగాన్ని చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని కూడా ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహనం ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో తనను సేవించుకున్న భక్త శిఖామణి హనుమంతుడిపై స్వామివారు తిరువీథుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను లోకులకు తెలిసేలా, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు చాటి చెబుతారు. గజవాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతారు. గజవాహనంపై ఊరేగుతుండగా స్వామిని దర్శించుకుంటే, పెనుసమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్తాశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామివారు సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగులు ప్రసాదించే సూర్య భగవానుడు తన ప్రతిరూపమేనని చాటిచెబుతారు. చంద్రప్రభ వాహనం ఏడోరోజు రాత్రి ధవళ వస్త్రాలు, తెల్లని పూలమాలలు ధరించి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. మనఃకారుకుడైన చంద్రుడి లక్షణం తనలోనూ ఉందని, తాను కూడా భక్తుల మనస్సుపై ప్రభావం చూపిస్తానని చాటి చెబుతారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియ జేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదోరోజు రాత్రి స్వామివారు అశ్వవాహనారూఢుడై ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వారును వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని ప్రతీతి. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్స వాలను ముగిస్తారు. డాలర్ లేని బ్రహ్మోత్సవం... ఈ ఏట తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు డాలర్ శేషాద్రి సందడి లేకుండానే జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న డాలర్ శేషాద్రి ఉరఫ్ పాల శేషాద్రి గత ఏడాది నవంబర్ 29వ తేదీన కన్ను మూయడంతో ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు డాలర్ లేకుండానే జరగనున్నాయి. 1978వ సంవత్సరంలో టీటీడీ లో విధుల్లో చేరిన శేషాద్రి అప్పటినుంచి గత ఏడాది వరకు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వచ్చారు. మధ్యలో 2009వ సంవత్సరంలో కోర్టు తీర్పు కారణంగా బ్రహ్మోత్సవాల విధులకు దూరమైన శేషాద్రి అటు తరువాత 2014వ సంవత్సరంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే గుండెపోటుకి గురై కొన్ని వాహనసేవలకు దూరమయ్యారు. ఈ రెండుసార్లు మినహాయిస్తే దాదాపు 44 సంవత్సరాల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉత్సవాల సమయంలో స్వామి వారి ఆలంకరణలను ఏవిధంగా చేయాలన్న దాని పై అర్చకులకు సహకరిస్తూ ఏ సమయంలో ఏ కైంకర్యం నిర్వహించాలో తెలుపుతూ సమయానికి అన్నీ సక్రమంగా జరిగేలా చూసుకునే వారు. ఆలయ మాడవీథుల్లో వాహన ఊరేగింపు జరుగుతున్నంత సేపు కూడా వాహనంతో పాటే ఉంటూ అన్నీ తానై వ్యవహరిస్తూ వాహన సేవ విజయవంతంగా సాగేలా సహకరించి అటు అధికారులతోపాటు ఇటు టీటీడీ పాలకమండలి మన్ననలను పొందేవారు. మరోవైపు ఉత్సవాలలో వాహన ఊరేగింపు ముందు సందడి చేస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని నింపేవారు. ఇలా బ్రహ్మోత్సవాలలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచే డాలర్ శేషాద్రి లేకుండానే ఈ ఏట శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 26.09.2022 అంకురార్పణ 27.09.2022 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం 28.09.2022 చిన్నశేషవాహనం హంసవాహనం 29.09.2022 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం 30.09.2022 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం 01.10.2022 మోహినీ అవతారం గరుడ వాహనం 02.10.2022 హనుమంతæవాహనం గజవాహనం 03.10.2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 04.10.2022 రథోత్సవం అశ్వ వాహనం 05.10.2022 చక్రస్నానం ధ్వజావరోహణం -
రాలని చినుకు చెప్పే చిత్రమైన కథలు! నన్ను చూస్తుంటే... ఏడవండి!!!
అమెరికా, యూకే, యూరప్లకు చినుకు కరవొచ్చింది...అట్లాంటి ఇట్లాంటిది కాదండోయ్! 500 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిది! డ్యాములు అడుగంటిపోయాయి.. నదులూ ఇంకిపోయాయి! వడగాడ్పులతో జనమూ బెంబేలెత్తిపోయారు! అయితే ఏంటి? అంటున్నారా? నిజమే కానీ.. కరువు, వర్షాభావం అనేవి...ఆ ప్రాంతాలకు దూరపుచుట్టాలు కూడా కాదు. అందుకే 2022 నాటి ఈ వాతావరణ దృగ్విషయానికి ప్రాధాన్యమేర్పడింది... అంతేకాదు.. రాలని చినుకుపుణ్యమా అని గతానికి చెందిన కథలెన్నో ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి! ఏమా కథలు.. వాటి విశేషాలంటే...!!!! స్విట్జర్లాండ్ పేరు చెబితే మంచు పర్వతాలు.. లండన్ పేరు విన్న వెంటనే అంచనాలకు అందని వాతావరణం గుర్తుకు వస్తాయి. ఈ రెండు ప్రాంతాలే కాదు.. యూరప్లోని చాలా దేశాలన్నీ పచ్చగా.. లేదంటే మంచుతో కప్పబడి ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఐదు వందల ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో వర్షాభావం.. తత్ఫలితంగా కరవు.. యూరప్తో పాటు అమెరికాలోనూ కనిపిస్తోంది. ఏడాది పొడవునా వేసవిని తలపించే ఎండలు.. తరచూ పలుకరించిన వడగాడ్పులతో పాశ్చాత్యదేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే పలు దేశాల్లోని నదులు, డ్యామ్లు, రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. బోసిపోయిన ఈ జలవనరులు ఇప్పుడు గత చరిత్ర ఆనవాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంనాటి బాంబు మొదలుకొని జర్మన్లు వాడిన యుద్ధ నౌక.. కోట్ల ఏళ్ల క్రితం తిరుగాడిన రాక్షసబల్లుల ఆనవాళ్లు... మధ్యయుగాల నాటి కరవు పరిస్థితులను సూచించే గుర్తులు బయటపడ్డాయి. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిలో భాగమైన పలు నగరాలు.. చారిత్రక అవశేషాలు కూడా ఈ ఏడాది కరవు పుణ్యమా అని ఇంకోసారి ప్రజలకు గతాన్ని గుర్తు చేస్తున్నాయి!! ఆఫ్రికా కొమ్ము నుంచి.... 2022లో పాశ్చాత్యదేశాలు అనేకం కరవులో చిక్కుకున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. ఆఫ్రికా ఖండంలోని పైభాగం (హార్న్ ఆఫ్ ఆఫ్రికా) మొదలుకొని ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్లలో విపరీత పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో భాగమైన ఇథియోపియా, సొమాలియా, కెన్యాల్లో నాలుగేళ్లుగా సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఆకలి కేకలు తీవ్రం కాగా.. ఫ్రాన్స్లో కోతకొచ్చిన మొక్కజొన్న పంట మొత్తం నశించిపోయింది. ఈ దేశంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందీ అంటే.. ఎండలు పెరిగిపోయి.. ఉప్పునీరు ఎక్కువ ఆవిరవుతూండటం వల్ల దేశంలో ఉప్పు ఉత్పత్తి రెట్టింపు అవుతోంది!! వర్షాభావం వల్ల జర్మనీలోని రైన్ ఓడరేవులో నీరు కాస్తా అడుగంటిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల సరుకుల రవాణా ఆలస్యం అవడం మాత్రమే కాకుండా ధరలు కూడా పెరిగిపోతున్నాయి. జర్మనీలోని పారిశ్రామిక ప్రాంతం గుండా ప్రవహించే రైన్ నదిలో నౌకల ద్వారా తిండిగింజలు మొదలుకొని రసాయనాలు, బొగ్గు వంటి అనేక సరుకులు దేశం ఒక మూల నుంచి ఇంకోమూలకు చేరుతూంటాయి. నీళ్లు తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు పడవల సామర్థ్యంలో 30 –40 శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఇబ్బంది.. జర్మనీ స్థూల జాతీయోత్పత్తిలో 0.5 శాతాన్ని తగ్గిస్తుందని అంచనా. విద్యుదుత్పత్తికీ అంతరాయం... యూరప్ వర్షాభావం, కరువు పరిస్థితులు విద్యుత్తు సరఫరాపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. స్పెయిన్లో జల విద్యుదుత్పత్తి 44 శాతం వరకూ తగ్గిపోగా, అణువిద్యుత్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. వేడెక్కిన ఇంధనాన్ని చల్లబరచేందుకు తగినన్ని నీళ్లు లేక ఫ్రాన్స్లో కొన్ని అణువిద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు కూడా. ఇటలీలో బయటపడ్డ బాంబు... ఇటలీలోని ప్రధాన నది ‘పో’ ఈ ఏటి వర్షాభావం పుణ్యమా అని దాదాపుగా ఎండిపోయింది. దీంతో మాన్టువా ప్రాంతంలో నది అడుగు భాగంలోంచి రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు ఒకటి బయటపడింది. పేలని ఈ బాంబును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు గాను స్థానికులు సుమారు 3000 మందిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. నదిలో నౌకల రవాణా, పరిసరాల్లోని ట్రాఫిక్ను కూడా నిలిపివేసి సుమారు 500 కిలోల బరువున్న బాంబును ఇంకో ప్రాంతానికి తరలించారు. అంతేకాదు.. ఈ ‘పో’ నదిలోనే 1943లో జర్మనీ వాళ్లు వాడిన భారీ సరుకు రవాణా నౌక ఒకటి కూడా బయటపడింది. కొన్ని నెలల ముందే దీని ఆనవాళ్లు నదిలో కనిపించినప్పటికీ వర్షాభావం కొనసాగడంతో ప్రస్తుతం అది నీటిలోంచి బయటపడినట్లుగా పూర్తిగా కనిపిస్తోంది. ఇక ఇటలీలోని రోమ్ నగరానికి వస్తే.. టైబర్ నది అడుగంటిన కారణంగా ఎప్పుడో రోమన్ల కాలంలో నీరో చక్రవర్తి కట్టినట్టుగా భావిస్తున్న వంతెన ఒకటి అందరికీ దర్శనమిచ్చింది. ఈ వంతెన క్రీస్తు శకం 50వ సంవత్సరం ప్రాంతంలో కట్టి ఉంటారని అంచనా. చర్చీలు, చారిత్రక అవశేషాలు... యూరోపియన్ దేశం స్పెయిన్లో వర్షాభావం.. క్రీస్తు పూర్వం ఐదువేల సంవత్సరాల నాటి అవశేషాలను మరోసారి చూసే అవకాశాన్ని కల్పించింది. యూకేలోని నిలువురాళ్లు స్టోన్ హెంజ్ గురించి మీరు వినే ఉంటారు. వృత్తాకారంలో ఉండే ఈ భారీ సైజు రాళ్లను ఎవరు? ఎందుకు? ఏర్పాటు చేశారో ఇప్పటికీ మిస్టరీనే. ఈ స్టోన్ హెంజ్ తరహా రాళ్లు స్పెయిన్ లోనూ ఉన్నాయి. కాకపోతే వాల్డెకానాస్ రిజర్వాయర్లో ఉంటాయి ఇవి. కాసెరెస్ ప్రాంతంలోని ఈ రిజర్వాయర్ ఇప్పుడు దాదాపు అడుగంటింది. డోల్మెన్ ఆఫ్ గులాడాల్ పెరాల్ అని పిలిచే ఈ రాతి నిర్మాణాలను జర్మనీ పురాతత్వ శాస్త్రవేత్త హూగో ఓబెర్మెయిర్ 1926లో గుర్తించారు. అయితే ఫ్రాన్సిస్కో ఫ్రాంకో నియంతృత్వ రాజ్యంలో 1963లో ఈ ప్రాంతంలో రిజర్వాయర్ కట్టడంతో డజన్ల కొద్దీ భారీ రాళ్లున్న స్టోన్ హెంజ్ కాస్తా మునిగిపోయింది. స్పెయిన్ , పోర్చుగల్ సరిహద్దుల్లోనూ ఓ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అసెరెడో పేరున్న గ్రామం ఒకటి బయటపడింది. రిజర్వాయర్ నిర్మాణం కారణంగా ఈ గ్రామం 1992లో మునిగిపోగా 30 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు చూడగలుగుతున్నారు. అలాగే స్పెయిన్ , బార్సిలోనాలోని బ్యుయెన్ డియా రిజర్వాయర్లో నీళ్లు ఇంకిపోవడంతో తొమ్మిదవ శతాబ్దం నాటి చర్చి ఒకటి వెలుగు చూసింది. ఇన్నేళ్లుగా నీళ్లలో మునిగి ఉన్నా ఈ చర్చి చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. నన్ను చూస్తుంటే... ఏడవండి!!! నన్ను చూసి ఎడ్వకురా అన్న నానుడి మీరు వాహనాల వెనుక భాగంలో చూసి ఉండవచ్చు కానీ.. యూరప్లో ఈ ఏడాది వర్షాభావం కారణంగా ‘‘నన్ను చూస్తున్నారంటే... ఇక మీకు ఏడుపే మిగిలింది’’ అని రాసున్న రాళ్లు బయటపడ్డాయి. నదుల వెంబడి ఉండే ఈ రాళ్లపైని ఈ రాతలు గతకాలపు కరవు చిహ్నాలన్నమాట. రాతలు కనిపించే స్థాయికి నీటి మట్టం పడిపోయిందంటే.. ముందుంది కరవు కాలం అని హెచ్చరికన్నమాట. మధ్య యూరప్ లోని పలు ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వీటిని ‘‘హంగర్ స్టోన్స్’’ లేదా కరవు రాళ్లని పిలుస్తారు. చెకస్లోవేకియా పర్వత ప్రాంతం నుంచి జర్మనీ మీదుగా నార్త్ సీలోకి ప్రవహించే ఎల్బే నదిలో ఈ ఏడాది ఈ హంగర్ స్టోన్స్ బయటపడ్డాయి. ఎప్పుడో 1616 తరువాత ఇవి మొదటి సారి మళ్లీ బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. పదిహేనవ శతాబ్దం నాటి ఈ రాయిపై ‘‘వెన్ డూ మిచ్ సైన్స్ ్ డాన్ వైన్ ’’ అని ఈ రాళ్లపై రాసుంది. దీనిర్థమే ‘‘నన్ను చూస్తూంటే.. ఏడవండి’’ అని. 2013లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. ఏళ్ల కరవు కాటకాలను అనుభవించిన తరువాతే రాళ్లపై ఈ రాతలు ప్రత్యక్షమై ఉంటాయని తెలిపింది. 17వ శతాబ్దపు ఉద్యానవనాలు... యునైటెడ్ కింగ్డమ్లోనూ వర్షాభావం గత చరిత్ర ఆనవాళ్లను కళ్లెదుటకు తెస్తోంది. డెర్బిషైర్లో లేడీబౌవర్ రిజర్వాయర్ నీళ్లు అడుగంటిపోవడంతో 1940 ప్రాంతంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా జలసమాధి అయిన డెర్వెంట్ గ్రామమూ అందులోని చర్చి ఇప్పుడు మళ్లీ అందరికీ దర్శనమిస్తున్నాయి. అలాగే కొలిఫోర్డ్ లేక్ రిజర్వాయర్లో వందల ఏళ్ల క్రితం నాటి వృక్షాల అవశేషాలు బయటపడగా ఇంగ్లాండ్ ఆగ్నేయ ప్రాంతంలోని స్వీడన్ లో పాతకాలపు ఉద్యానవన అవశేషాలు కనిపిస్తున్నాయి. 17వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న లైడయార్డ్ పార్క్లో ఎండ తాకిడికి గడ్డి మాడిపోవడంతో కిందనున్న నేల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు ముందు కొంచెం పక్కగా వేసిన మొక్కల తాలూకూ గుర్తులిప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. లాంగ్లీట్ ప్రాంతంలోనూ ఇలాంటి ఉద్యానవన ఆనవాలు ఒకటి బయటపడినట్లు సమాచారం. యునైటెడ్ కింగ్డమ్లో ఈ ఏడాది కరవు పరిస్థితి ఎంత భీకరంగా ఉందీ అంటే.. ఇంగ్లాండ్ మొత్తానికి ఆధారమైన... లండన్ మధ్యలో ప్రవహించే థేమ్స్కు నీరిచ్చే ప్రాంతాల్లో చుక్క నీరు లేదంటే అతిశయోక్తి కాదేమో!!! ఈ ఏడాది వేసవిధాటికి స్పెయిన్లోని లిమా నదిపై నిర్మించిన రిజర్వాయర్ అడుగంటిపోవడంతో బయటపడిన పురాతన రోమన్ గ్రామం. రెండువేల ఏళ్ల కిందటి ఈ గ్రామం రోమన్ సామ్రాజ్యకాలంలో సైనిక స్థావరంగా ఉపయోగపడేదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాటి కట్టడాలు, సైనిక స్థావరాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అగ్రరాజ్యం అమెరికాలోనూ... అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది వర్షాభావం తీవ్రంగా ఉంది. కాలిఫోర్నియాలో రాలని చినుకు కారణంగా లేక్మీడ్ దాదాపుగా అడుగంటిపోయింది. అలాగే టెక్సస్ రాష్ట్రంలోని దాదాపు 60 శాతం ప్రాంతం వర్షాభావాన్ని ఎదుర్కొంటోంది. నీళ్లు లేక ఎండిపోయిన జల వనరుల్లో సుమారు 11.3 కోట్ల ఏళ్ల క్రితం నాటి రాక్షసబల్లుల కాలిముద్రలు బయటపడ్డాయి. టెక్సస్లోని డైనోసార్ వ్యాలీ స్టేట్పార్క్లో బయటపడ్డ ఈ పాదముద్రలు అక్రోకాన్ థోసారస్ అనే రకం రాక్షసబల్లికి చెందిందని స్టేట్పార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. బతికి ఉండగా ఇది సుమారు 15 అడుగుల ఎత్తు ఉండేదని బరువు ఏడు టన్నుల వరకూ ఉండి ఉండవచ్చునని తెలిపింది. అలాగే ఈ ప్రాంతంలోనే సారోపొసైడన్ రకం రాక్షసబల్లి ఆనవాళ్లూ గ్లెన్ రోజ్లో బయటపడింది. ఇది బతికుండగా 60 అడుగుల ఎత్తు, 44 టన్నుల బరువు ఉండి ఉండేదని అంచనా. సాధారణ పరిస్థితుల్లో ఈ రాక్షసబల్లుల పాదముద్రలు నీటిలో మునిగి ఉండేవని, పైగా మట్టితో నిండిపోయి అస్సలు కనిపించేవి కావని స్థానికులు తెలిపారు. వర్షం పడితే.. మళ్లీ ఈ పాదముద్రలు నీటిలో మునిగిపోతాయి. అయితే వీటిని వీలైనంత వరకూ జాగ్రత్తగా కాపాడేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్ అధికారులు చెబుతున్నారు. లేక్మీడ్లోనూ యుద్ధ నౌక... అమెరికాలోని లాస్వేగస్కు కొంత దూరంలో ఉండే లేక్ మీడ్కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుల్లో లేక్మీడ్ ఒకటి. ఈ సరస్సుపైనే ప్రఖ్యాత హూవర్ డ్యామ్ నిర్మాణం జరిగింది. వర్షాభావం కారణంగా ఈ ఏడాది లేక్మీడ్ సరస్సు సామర్థ్యంలో కేవలం 27 శాతం మాత్రమే నీళ్లు ఉన్నాయి. 2000 సంవత్సరంతో పోలిస్తే 175 అడుగుల దిగువన లేక్మీడ్ జలమట్టం ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో హూవర్ డ్యామ్ ద్వారా జల విద్యుదుత్పత్తిని తగ్గించుకోవడంతోపాటు అరిజోనా, నెవెడా, మెక్సికో ప్రాంతాల్లో నీటి వినియోగాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టడం ఇది వరసుగా రెండో ఏడాది కావడం గమనార్హం. లేక్మీడ్కు నీటిని అందించే కొలరాడో నదీ పరీవాహక ప్రాంతంలో కొన్నేళ్లు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. - గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఆచార్య దేవో భవ..!
ఒక వ్యక్తి జీవితం మీద ఉపాధ్యాయుని ప్రభావం ఈ బిందువు దగ్గర అంతమైందని ప్రకటించడం దాదాపు అసాధ్యం. మనిషి జీవితాన్ని శాసించేవి, మార్చేవి, ఉత్థానపతనాలకు దోహదపడేవి విద్య, విజ్ఞానం. నేటితరం బాలలకి విద్యలోని శక్తిని పరిచయం చేసేవారే ఉపాధ్యాయులు. అలా వ్యక్తుల జీవితాలనీ, తద్వారా రేపటి సమాజాన్నీ తేజోమయం చేస్తారు గురువులు. లేలేత మనసుల పాలిట నైరూప్యచిత్రాల్లా ఉండే పాఠ్యాంశాలను క్రమంగా సుందరచిత్రాల్లా దర్శించే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. నేర్చుకోవడం, అభ్యసించడం అనేవి జీవితంలో ప్రధానంగా గురుముఖంగానే జరుగుతాయి. నాగరికత ఆరంభం నుంచి ఉన్న గురువుల వ్యవస్థ ఎప్పటికీ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే నాగరికత అనే జ్యోతి ఆరిపోకుండా తన చేతులొడ్డి రక్షించేవారే గురువులు అంటారు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ. - డా. గోపరాజు నారాయణరావు మారుతున్న కాలాన్ని బట్టి, అవసరాల మేరకు విద్య కొత్త పుంతలు పడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా కాలంతో పరుగులు పెట్టాలి. ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే తరగతిలో పాఠం చెప్పి, హోవ్వర్క్ ఇచ్చి ఇంటికి పంపేవారే కాదు, ఇంటి దగ్గర కూడా విద్యార్థి మెదడు పనిచేసే విధంగా చేయగలిగినవారే. ఇప్పుడు డిజిటల్ టీచర్ ఇవాళ్టి తరగతి గది అంటే రేపటి భారతదేశం. ఆ తరగతి గదికి నాయకుడు ఉపాధ్యాయుడు. విద్యార్థి స్వశక్తి ఏమిటో, అతడిలోని తృష్ణ ఎంతటిదో గుర్తించడం దగ్గర ఉపాధ్యాయుడు విఫలమైతే విద్యార్థి అతడి జీవితంలోనే విఫలమైపోతాడు. ఇలా ఎన్నయినా సంప్రదాయ చింతనతో చెప్పుకోవచ్చు. అలా అని అవి భ్రమలు కూడా కాదు. కానీ ఉపాధ్యాయుడి స్థానంలో వచ్చిన అతి పెద్ద మార్పు 21వ శతాబ్దంలో ఆయన డిజిటల్ టీచర్గా మారడమే. ఈ నేపథ్యంతో డిజిటల్ యుగంలో మారిన ఉపాధ్యాయుని బాధ్యతను ఒక్కసారి పరిశీలించాలి. 21వ శతాబ్దం పెనుమార్పుల వేదిక. నిన్నటి విద్యార్థికీ నేటి విద్యార్థికీ ఎంతో వైరుధ్యం ఉంది. ఇవాళ్టి విద్యార్థి నిన్నటి విద్యార్థి కంటే చాలా పరిణతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ పరిస్థితులు, శాస్త్రసాంకేతిక రంగాలలో సంభవించిన విస్ఫోటం వీళ్లకి ఆ అవకాశాలని దోసిళ్ల నిండుగా అందించాయి. ఈ కాలాన్ని శాసిస్తున్నదే సాంకేతిక పరిజ్ఞానం. ఆ క్రమంలోనే ఉపాధ్యాయుడు అన్న వ్యవస్థ కొత్త అర్థాలను సంతరించుకునే పనిలో నిమగ్నమయింది. కేవలం రెండు దశాబ్దాల క్రితం ఉపాధ్యాయుని స్థానం నేటి ఉపాధ్యాయుని స్థానం ఒక్కటి కానే కావు. ఆ ఉద్యోగం పరిధి, దానికి ఉండవలసిన దృష్టి అంచనాకు అందనంత మార్పుకు లోనయ్యాయి. ఆలోచించే నైపుణ్యం, జీవించే నైపుణ్యాల మీద ఆధారపడి 21వ శతాబ్దంలో విద్య నిర్మితమవుతున్నది. తరగతి గది నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన విద్యార్థి, బయటి వ్యవస్థల అవసరాలకు ఆసరా కాగల తీరులోనే ఇవాళ్టి చదువు ఉండాలని చెబుతున్నారు. తరగతిలో నేర్చుకున్నది బయటి ప్రపంచంలో విద్యార్థి బతకడానికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత అన్న దృష్టి ఈ పరిణామం నిండా కనిపిస్తుంది. కేవలం బోధకుడు కాదు ఇవాళ్టి ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు కాదు. ఉద్యోగితా నైపుణ్యాలను పెంచే బాధ్యతతో పాటు విద్యార్థుల మేధావికాసం, విశ్లేషణాత్మకంగా ఆలోచించేటట్టు చేయడం, సృజనాత్మక దృష్టిని పెంపొందించడం, జీవితాంతం గుర్తుండే విద్యను అందించడం కూడా వారు నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతలుగానే మారాయి. గ్లోబల్ యుగంలో డిజిటల్ ఆధారిత ఉద్యోగితా నైపుణ్యాల సాధనలో విద్యార్థికి నిర్దేశకులుగా ఉండవలసింది ఉపాధ్యాయులే. విద్యార్థుల నైపుణ్యాలు పెంచడానికి తమ నైపుణ్యాలను అవిశ్రాంతంగా పెంపొందించుకోవలసిన యుగంలో ఉపాధ్యాయులు ఉన్నారు. లేకపోతే ఎదురయ్యే ప్రమాదం తక్కువేమీ కాదు. ఇప్పుడు ఉపాధ్యాయునితో సమంగా విద్యార్థి కూడా పరిజ్ఞానం సంతరించుకో గలుగుతున్నాడు. కారణం ఇంటర్నెట్తో సాహచర్యం. తన నైపుణ్యానికి సృజనను కలిపి ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని అందించాలి. లేకపోతే డిజిటల్ యుగంలోను విద్యాధికులైన నిరుద్యోగులు పెరిగిపోతారు. ఇదే అసలు ప్రమాదం. కోటి మంది ఉపాధ్యాయులు ఎన్సీఈఆర్టీ ఏడో సర్వే, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం (2011–12) దేశంలో 10,31,000 పాఠశాలలు (గుర్తింపు కలిగినవి) ఉన్నాయి. 2019లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 900 విశ్వవిద్యాలయాలు, 40,000 కళాశాలలు ఉన్నాయి. ‘నో టీచర్ నో క్లాస్ భారత్లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ప్రకారం ప్రస్తుతం దేశంలో 97 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు (ఈ నివేదిక ప్రకారం మరొక పది లక్షల మంది ఉపాధ్యాయులు అవసరం). టాటా ట్రస్ట్లలోని ది టీచర్స్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్ (టీఈఐ) ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను నిలబెడుతూ, ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్న సంస్థ. వీటి ఆధ్వర్యంలో 2018లో స్థాపించిన సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కేంద్రంగా ఇది పనిచేస్తున్నది. చిరకాలంగా నిర్లక్ష్యానికి గురైన ఉపాధ్యాయ ప్రతిభను మెరుగుపరచే పనిని ఈ సంస్థ యునెస్కో సహకారంతో చేపట్టింది. ‘నో టీచర్ నో క్లాస్ భారత్లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ఇది ఇచ్చినదే. మంచి చెడు రెండింటి గురించి బేరీజు వేసుకుని ఈ సంస్థ తన పని సాగిస్తున్నది. 50 శాతం మహిళలతో ఉపాధ్యాయ వృత్తి స్త్రీపురుష నిష్పత్తిని సమంగా నిలబెట్టుకుంటున్నది. గ్రామీణ ప్రాంతం నుంచి యువత, స్త్రీలు ప్రధానంగా ఈ వృత్తిని ఇష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సామాజిక గౌరవం సాధారణంగానే ఉంది. దేశంలో ఎక్కువ పాఠశాలలు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయుడే కేంద్రకంగా పనిచేస్తున్నాయి. వారి నమ్మకాలే బోధనను నిర్దేశిస్తున్నాయని ఆ నివేదిక తేల్చింది. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశం పట్ల ఎక్కువ మంది ఉపాధ్యాయులు సానుకూలంగానే ఉన్నారని ఆ నివేదిక చెప్పడం శుభవార్తే! వీరిలో 25 శాతం విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనీ, 30 శాతం ఈ వృత్తి నుంచి తప్పించదగినవారే ఉన్నారనీ వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ఇందుకు కారణం ఇప్పటి వరకు ఉపాధ్యాయుల ప్రతిభకు పదును పెట్టే ప్రత్యేక ప్రయత్నమేదీ జరగలేదు. ప్రపంచ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న భారత్ ఈ అంశం మీద ఇక దృష్టి పెట్టక తప్పదు. ప్రోత్సాహమే సగం విద్య విద్యార్థి మరొక యుగానికి చెంది ఉంటాడు. కాబట్టి అతడి మీద మీ యుగపు పరిజ్ఞానం మేరకు పరిధులు విధించవద్దు అంటారు రవీంద్రనాథ్ టాగోర్. నిజమే, విద్యార్థులను ప్రభావితం చేసే శక్తి ఉన్న ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని ఇచ్చే వనరుల మీద పరిమితులు విధించరు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు కూడా. విద్యార్థిని ప్రభావితం చేయడానికి జ్ఞానాన్ని, కొత్త పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అభ్యసించే అవకాశం కల్పిస్తారు. అందుకే ఈ తరం ఉపాధ్యాయుని డిజిటల్ లీడర్గా కూడా చూస్తున్నారు. చేస్తున్న పనిని ఆస్వాదించడం, ఆస్వాదించే తీరులో పనిని తీర్చిదిద్దడం కూడా ఆయనకు తెలుసు. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. దీనితో విద్యార్థులు అలాంటి ఉపాధ్యాయులను మరింత గౌరవిస్తారు. నిజంగా విద్య అంటే పదింట తొమ్మిది వంతులు ప్రోత్సాహమే. నాలుగు ‘సి’లు ఇప్పుడు పోటీతత్వం మరింత పెరిగింది. అదే సమయంలో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎంపికలకు కూడా విద్యార్థులకు ఎన్నో కొత్తదారులు ఏర్పడ్డాయి. విద్యార్థి మనస్తత్వాన్ని బట్టి ఆ దారులకు మళ్లించే బాధ్యత ఉపాధ్యాయునిదే. భవిష్యత్తులో నాలుగు ‘సి’ల మీద విద్యార్థి భవితవ్యం ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.. క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ. ఈ పదాలు, వాటి భావనలతో విద్యార్థిని మమేకం చేయవలసిన బాధ్యత కూడా ఉపాధ్యాయునిదే. వాటి గురించి నిజమైన అవగాహన ఏర్పడితే కాలానికి తగినట్టు పోటీ ప్రపంచంలో నెగ్గడానికి విద్యార్థిలో సంసిద్ధత వస్తుంది. డిజిటల్ యుగంలో అందుబాటులో ఉన్న పెద్ద జ్ఞానసాగరం ఇంటర్నెట్. యూట్యూబ్, ట్యుటోరియల్, ఈబుక్ , ముద్రిత పత్రాలు ఇప్పుడు అందుబాటు ఉన్నాయి. నేటి ఉపాధ్యాయుని కర్తవ్యం విద్యార్థి అభిరుచిని బట్టి ఆ నైపుణ్యాలకు వారిని చేరువ చేయాలి. ఉపాధ్యాయుల సామర్థ్యానికి కూడా పరిధులు ఉన్నా, ఆ నైపుణ్యాల దిశగా విద్యార్థిని మళ్లించే వెసులుబాటూ ఉంది. నేర్చుకోవడానికి తగిన వాతావరణంలోకి వారిని తీసుకువెళ్లే నైపుణ్యం ఈ తరం ఉపాధ్యాయులలో ఉండాలి. భావి భారతాన్ని నిర్మించే బాధ్యత ఉన్నవారు మొదట తమను తాము నిర్మించుకోవాలి. ప్రాథమిక పాఠశాల కావచ్చు, ప్రాథమికోన్నత పాఠశాల కావచ్చు, కళాశాల లేదా విశ్వవిద్యాలయం కావచ్చు. ఉపాధ్యాయుడు ఎక్కడ బోధిస్తున్నా ఆయన ఒక విద్యార్థిని తయారు చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే. నూతన విద్యావిధానం 2020: ఉపాధ్యాయుడు మారుతున్న విద్య, ఉపాధ్యాయ వ్యవస్థలు సమాజంలో పాక్షికంగానే అమలు కావడం సరికాదనే ‘నూతన విద్యావిధానం 2020’ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అంగన్వాడీలలో చదువుకునే బాలలు సహా మన దేశ విద్యార్థి జనాభా 40 కోట్లనీ, వీరందరికీ బోధిస్తున్న 1.5 కోట్ల మంది ఉపాధ్యాయులనీ దృష్టిలో ఉంచుకుని ‘నూతన విద్యావిధానం 2020’ ఆవిర్భవించిందని నివేదిక రూపకల్పనలో భాగస్వామి, ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణ చెప్పారు. రెండు కోట్లు డ్రాపౌట్స్ ఉన్నా, 38 కోట్లు ఎప్పుడూ తరగతులలో ఉంటారు. ప్రభుత్వం ఎంత ఆధునిక, విస్తృత విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టినా దానిని అమలు చేయవలసింది ఉపాధ్యాయుడే. వచ్చే దశాబ్దం ఉపాధ్యాయ దశాబ్దం కావాలని ఈ నివేదిక లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచంలో బహుశా ఏ దేశంలోను కనిపించనంత భారతీయ అధ్యాపకశక్తిని సశాస్త్రీయంగా ఉపయోగించుకుంటే ఎంతో మార్పు తేవచ్చునన్న ఆలోచనతో విద్యా విధానం సూచనలు చేసింది. సమగ్ర బోధకుడు అనే భావనను ముందుకు తెచ్చిన ఆ నివేదిక ఉపాధ్యాయులకు నాలుగేళ్ల శిక్షణను సూచించింది. అంతేకాదు, వృత్తి నైపుణ్యం వృద్ధి చేసే ఒక నిరంతర శిక్షణను కూడా కొత్త విద్యా విధానం ముందుకు తెచ్చింది. ఉపాధ్యాయుడిగా జీవించాలి అన్న కోరిక ఉన్నవారే ఆ వృత్తిలోకి రావడం గురించి విద్యా విధానం చర్యలు తీసుకుంది. నేర్చుకుంటూనే నేర్పించాలి. ఇవాళ్టి మరొక పరిణామం కూడా ఉపాధ్యాయుల దృష్టిలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రస్తావన, వినియోగం లేకుండా ఇవాళ విద్యార్థి నేర్చుకోవడానికి సిద్ధం కాలేడు. మొదట ఉపాధ్యాయునికి ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్నెట్ మీద, దానిని అన్వేషించడం మీద ఉపాధ్యాయుని పరిచయం లేకుంటే ఆయన విద్యార్థులకు చెప్పలేరు. విద్యార్థులను సదా ప్రభావితం చేయగలిన ఉపాధ్యాయుడంటే జీవిత కాలం నేర్చుకునే లక్షణం కలిగి ఉంటారు. తాము బోధించే పాఠ్యాంశంలో వచ్చిన మార్పులు, చేర్పుల పట్ల స్పృహ కలిగి ఉంటారు. అంటే వచ్చే దశాబ్దంలో ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయో వారు చెప్పగలిగి ఉంటారు. విషయ సేకరణ ఆధారంగా చేసే విద్యార్జన ప్రాధాన్యం తెలిసి ఉండడం 21వ శతాబ్దం ఉపాధ్యాయుడి ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇప్పుడు నిపుణులు చెబుతున్న అద్భుతమైన ఒక సూత్రం గురించి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. 21వ శతాబ్దంలో నిరక్షరాస్యుడని ఎవరిని చెప్పవచ్చునంటే చదవడం రాయడం చేతకాని వారిని కాదు. నేర్చుకోలేనివారిని, నేర్చుకొనే సంసిద్ధత లేనివారిని, మళ్లీ మళ్లీ నేర్చుకుంటూనే ఉండాలన్న స్పృహ లేనివారినే. నేర్పించడం అనే కళ, శాస్త్రీయతలను మిళితం చేసే బోధనా పద్ధతులను ఇవాళ ఎక్కువ మంది ఉపాధ్యాయులు అలవరచుకుంటున్నారు. ఉపాధ్యాయుడు నేర్పించడాన్ని ప్రేమించాలి. నేర్చుకునేవాళ్లను ప్రేమించాలి. ఈ రెండింటినీ సమన్వయం చేయడానికి ఇంకా ఇష్టపడాలి. వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిండి ఉండే తరగతిలో బోధించే విధానానికి వారు అలవాటు పడాలి. ప్రతి విద్యార్థికి సంబంధించి విద్యావసరాలు, సామర్థ్యాలు, అభిరుచులపైన ఉపాధ్యాయులు దృష్టి పెడుతున్నారు. విద్యార్థుల ఐచ్ఛిక విద్యాభిరుచిని గమనించి సమాజంలో ఉత్పాదకతకు ఉపయోగపడే భాగస్వామిగా మలచడం ఇవాళ ఉపాధ్యాయుల ముందు ఉన్న ప్రథమ కర్తవ్యంగా అవతరించింది. స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీతో తరగతిలో మరింత చురుకుగా ఉండేటట్టు చేయడం, విద్యా సంబంధ కార్యకలాపాలలో చేయూత నివ్వడం ఉపాధ్యాయులు ఇవాళ ఒక సవాలుగా తీసుకుంటున్నారు. ఎలా నేర్చుకోవాలో చెప్పగలిగితే పిల్లలు మరింత కష్టపడతారు. ఎడ్యుకేటర్ లేదా ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత ఏదీ అంటే సమాజం ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలు పరిష్కరించడానికి ఉపకరించే విద్యా విధాన పద్ధతులను అన్వేషించాలి. మోతాదు మించుతున్నదా? ఇంతకీ విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం మోతాదుకు మించుతున్నదా? ఈ ప్రశ్న వేసుకోక తప్పదు. భారత సామాజిక నేపథ్యంలో ఈ ప్రశ్న మరింత అవసరం.అందుకు సంబంధించిన భయాలు ఇప్పుడు మొదలయినాయి కూడా. 2030 సంవత్సరానికి, అంటే కేవలం ఎనిమిదేళ్లలోనే గురువు అనే స్థానానికి సాంకేతిక పరిజ్ఞానం పంగనామం పెట్టబోతున్నదన్న భయాలు అవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్చైన్ తరగతి గదిని శాసిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ భయాల వెనుక విపరీతంగా ప్రవేశిస్తున్న శాస్త్రసాంకేతిక రంగాలు ఒక్కటే కారణం కాదు. సాంకేతికతకు మోకరిల్లుతున్న నేటి తరాలు కూడా కారణమే. పాలకులు, నేతలు, రాజకీయ సంస్థలు దేశం పురోగమించడం గురించి, ప్రపంచపటంలో దివ్యమైన స్థానం గురించి తమకున్న కల్పనలో విద్య స్థానం ఎక్కడో ఇప్పటికీ చెప్పడం లేదు. దేశాభివృద్ధికి పునాదులు తరగతి గదులలో పడతాయన్న వాస్తవం గుర్తించడానికి వారికి ఇంకెంత కాలం పడుతుందో తెలియడం లేదు. ఇవన్నీ ఉన్నా కొన్ని వాస్తవాలను అంగీకరించాలి. ఉపాధ్యాయుడికి పరిమితులు ఉన్న మాట నిజం. కానీ ఆయన తరగతిలో బోధించినట్టు, ఆయన కంటే ఎంతో ఎక్కువ ‘డేటా’ కలిగి ఉండే రోబో ఆయనకు ఏనాటికీ ప్రత్యామ్నాయం కాదు, కాలేదు. కాబట్టి 22వ శతాబ్దంలోకి ప్రవేశించినా పాఠ్యాంశాలు మారవచ్చు. పాఠశాలలు, అందులోని తరగతుల రూపురేఖలు అసాధారణంగా ఉండవచ్చు. బోధనా పద్ధతులు మారిపోవచ్చు. బాలలు మరింత చురుకుగా ఉండవచ్చు. కానీ అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అప్పుడే విద్యార్థికి మార్గదర్శనం లభిస్తుంది. గురుస్థానం శాశ్వతం కావాలి. విద్య, విలువలు, ఉపాధ్యాయుడు పిల్లల మేధను విద్యతో ప్రకాశింపచేసే క్రమంలో వాళ్ల హృదయాలను కూడా విద్యతో గుబాళింపచేయడం మరవరాదని దలైలామా అంటారు. ఈ పని కుటుంబంలో జరగాలి. ఆపై ఆ బాధ్యత ఉపాధ్యాయులు స్వీకరించాలి. పురోగమిస్తున్న సమాజంలో విలువలకు స్థానం లేకుంటే విపరీతాలకు దారి తీస్తుంది. ఒక భావిపౌరుడి ప్రవర్తన అతడికి ఉన్న విలువలను బట్టే నిర్మితమవుతుంది. నీతి నిజాయతీలు, విచక్షణ, సామాజిక సేవ పట్ల అనురక్తి, జాతీయ సమైక్యత పట్ల గౌరవం, సామాజిక న్యాయం పట్ల అవగాహన ఇవన్నీ కూడా విలువల నుంచి సంక్రమించేవే. యువత కౌమారమంతా తరగతి గదిలోనే గడుస్తుంది కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయంలో ఎక్కువ బాధ్యత స్వీకరించాలి. విలువలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడేవే. వీటన్నిటికీ మించినది క్రమశిక్షణ. అది విద్యార్థి జీవితం నుంచి మొదలు కావాలి. అదొక విలువ. గురుశిష్య బంధానికి అడ్డుకట్ట? గురుశిష్య బంధం అనివార్యం. కానీ ఈ బంధం తెగిపోతున్నదా అని ప్రశ్నించుకునే వాతావరణం ప్రస్తుతం కనిపించడం విషాదమే. చాలా కళాశాలలు, కొన్నిచోట్ల పాఠశాలలు కూడా మత్తు మందులకు చేరువ కావడం గురుశిష్య సంబంధం బలహీన పడుతున్నదని చెప్పడానికి ఉపకరించేదే! విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావడం సామాజిక ఉల్లంఘన. శిష్యులను అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరోధించలేకపోవడం గురువుల సామాజిక ఉల్లంఘన. ఎన్ని చట్టాలు వచ్చినా ర్యాగింగ్ భూతం లొంగకపోవడం విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరూ కూడా సామాజిక బాధ్యతను మరచిపోయిన ఫలితమే. అదుపు చేయాలని ఉపాధ్యాయులకు, ఒదిగి ఉండాలని విద్యార్థులకు లేకపోతే విపరీత పరిణామాలు తప్పవు. సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదు వెనువెంటనే కాకున్నా, సమీప భవిష్యత్తులో భారత్లో కూడా తరగతి గదిని సాంకేతికత శాసిస్తుంది. కరోనా ఈ అవసరాన్ని కాస్త ముందుకు తెచ్చింది కూడా. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సాంకేతికతను ప్రవేశ పెట్టడం గురించి వస్తున్న ఒత్తిడి కూడా తక్కువగా లేదు. ఎల్కేజీ దగ్గర నుంచి పలకా బలపాలు మాయమవుతున్నాయి. అయితే ఒక ప్రశ్న. సాంకేతికత ఉపాధ్యాయునికి నిజంగానే ప్రత్యామ్నాయం కాగలదా? డిజిటల్ వ్యవస్థ ఎంత విస్తరించినా, బలపడినా అది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాలేదు. నేపథ్యాన్ని బట్టి భారతీయ సమాజంలో విద్యార్థులంతా ఒకే విద్యా ప్రమాణాలు ప్రదర్శించే పరిస్థితిలో లేరు. విద్యార్థులందరి అభిరుచిని ఉపాధ్యాయుడు మాత్రమే గమనించగలడు. గురుశిష్య సంబంధం పాతబడేది కాదు. జీవితానుభవాన్ని, సృజనాత్మక శక్తిని మేళవించి పాఠ్యాంశాలను చెప్పగలిగేది గురువు మాత్రమే. ఉపాధ్యాయుడు తేగలిన మార్పు సాంకేతికతతో సాధ్యంకాదని ఇప్పటికే కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఎందుకంటే విద్య అంటే కేవలం కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని సమీకరణల సమ్మేళనం కాదు. అభ్యాసానికి అనుగుణమైన వాతావరణం గురుశిష్య సంబంధం నుంచి జనిస్తుంది. అది యంత్రం ద్వారానో, కంప్యూటర్ తెరతోనో సాధ్యం కాదు. విద్యార్థిని స్వతంత్రంగా ఆలోచింప చేసేదే విద్య. ఆ పని ఉపాధ్యాయుని ద్వారా జరుగుతుంది. భావి తరాలను విశ్వమానవులుగా తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు తయారు కావడం అవసరమే. ఆ క్రమంలో కొన్ని భ్రమలలో ఎవరూ కొట్టుకుపోరాదు. డిజిటల్ యుగంలో మనదైన చరిత్ర, మనదైన సాహిత్యం, కళ, సాంస్కృతిక వారసత్వం చిన్నబోయే పరిస్థితి ఏర్పడడం సరికాదు. మన ప్రాంతీయ భాషలకు గ్రహణం పట్టకూడదు. ఆధునిక విద్య, ఆధునిక విద్యారీతులు మత్తులో మళ్లీ వేరొక వ్యవస్థకు మన యుతరం బోయీలు కారాదు. విద్యావిధానం ఆధునికం కావాలి. అదే సమయంలో అందులో మట్టివాసన ఉండాలి. కంప్యూటర్కే, ప్రయోగశాలకే విద్యార్థిని పరిమితం చేయడమూ సరికాదు. విద్యావిధానంలో ఆధునికత సృజనాత్మకతకు, క్రీడాప్రతిభకు ఆస్కారం కల్పించాలి. డిజిటల్ విద్యావిధానానికి ఉపాధి కల్పన పునాదిగా ఉన్నప్పటికి, సామాజిక బాధ్యత పట్ల యువతకు నిరంతర స్పృహ అవసరమన్న విషయమూ గుర్తించాలి. కొత్త విద్యావిధానం విద్యార్థికీ, సమాజానికీ మధ్య అడ్డుగోడ కట్టేది కారాదు. ఎందుకంటే పాఠశాల అనేది సమాజానికి సుదూరంగా ఉండే వ్యవస్థ కాదు. కొత్తయుగంలో కొత్త తప్పిదాలకు చోటు లేకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోగలరు. ఎందుకంటే పాఠ్యప్రణాళిక రూపకల్పనలో వారి పాత్ర వాస్తవం. డిజిటల్ యుగం పాత సమస్యలను గమనించకుండా సాగితే అది వైఫల్యానికే దారి తీస్తుంది. భారతదేశానికి సంబంధించినంత వరకు అంతరాలు ఒక వాస్తవం. డిజిటల్, శాస్త్రసాంకేతిక వినియోగం అందరికీ సమంగా అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను అందుకు తగినట్టు రూపొందించాలి. డిజిటల్ లీడర్లు ఇటు వైపు చూడకపోతే సమాజంలో పెద్ద అగాధం ఏర్పడుతుంది. విద్యారంగంలో అంతరాలు నిరోధించడానికి కొన్ని దశాబ్దాల పాటు జరిగిన ప్రయత్నాలు నీరుకారాయన్న విమర్శ ఇప్పటికే ఉంది. ఒకప్పుడు అన్ని వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలకే వెళ్లి చదువుకునేవారు. సమాన అవకాశాలు అన్న సూత్రాన్ని వమ్ము చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చతికిలపడ్డాయి. చదువు ‘కొనడం’ అన్న మాట కూడా ఇప్పుడు వినవలసి వస్తున్నది. చదువు ప్రాథమిక హక్కుగా అవతరించిన తరువాత కూడా అక్షరం గగన కుసుమం కావడం పురోగతికి దోహదం చేసే పరిణామం కాదు. ఉపాధ్యాయులు తాము నేర్చుకుంటూనే విద్యార్థులకు నేర్పుతారు. ఆ క్రమంలో సరైన నడత నేర్చుకోమని ఉపాధ్యాయునికి ఎవరో చెప్పే పరిస్థితి రావడం విషాదమే. ఇటీవల వస్తున్న వార్తలు కొందరు ఉపాధ్యాయుల పట్ల అసహనాన్ని పెంచేవిగా ఉన్నాయి. మద్యం సేవించి పర్యవేక్షకునిగా పరీక్ష హాలుకు వచ్చిన వారు, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్టయినవారు ఇంకా తీవ్రమైన అసాంఘిక చర్యలకు ఉపాధ్యాయులు పాల్పడుతున్న సంగతులు బయటపడుతున్నాయి. ఇక విద్యార్థులను తీవ్రంగా దండిస్తున్న సంఘటనలకు అంతేలేదు. బయటి సమాజంలోని బలహీనతలు, ప్రలోభాలకు ఉపాధ్యాయులు లోను కాకుండా చేయడానికి నూతన విద్యా విధానం 2020లో ప్రతిపాదించిన నాలుగేళ్ల ఉపాధ్యాయ శిక్షణతో సాధ్యం కాగలదని విశ్వసిద్దాం. మారుతున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి మీద పెరుగుతున్న ఒత్తిడికి విరుగుడుగా ఈ విధానం సాధికారత కల్పించడం ఒక వెసులుబాటు. -
మిషన్.. స్వదేశీ
భారత స్వాతంత్య్ర పోరాటం జోరందుకుంటున్న తరుణమది. తెల్లదొరలు అడ్డగోలుగా చేసిన బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ 1905లో విదేశీ వస్తు బహిష్కరణ.. స్వదేశీ ఉద్యమం పెల్లుబికింది. దేశీయ ఉత్పత్తుల వినియోగానికి ప్రజలు ముందుకొచ్చారు. తదనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన సత్యాగ్రహ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు స్వదేశీ నినాదమే పట్టుగొమ్మగా నిలిచింది. ఈ ఉద్యమాలు అప్పటి ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్వదేశాగ్నిని రగిలించడంతో.. దేశంలో ఎన్నో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు పురుడుపోసుకున్నాయి. ‘మేడిన్ ఇండియా’ బ్రాండ్లు బోలెడన్ని పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని భారతీయుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని పురోభివృద్ధి సాధిస్తున్నాయి. మరికొన్ని కాలానుగుణంగా కొత్త మార్పులను సంతరించుకుని, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వావలంబన భారత్కు చేదోడుగా నిలుస్తున్నాయి. శతాబ్ది స్వాతంత్య్ర వేడుకల నాటికి ‘స్వదేశ్ 2.0’తో దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించేలా చేయాలన్నది ‘మేకిన్ ఇండియా’ లక్ష్యం. దీని సాకారానికి ‘ఆత్మనిర్భర్‘తో సమాయత్తమవుతున్న వేళ... 1947కు పూర్వం మొగ్గతొడిగిన మన స్వదేశీ వ్యాపారామృతాల్లో కొన్నింటి గురించి ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెమరువేసుకుందాం. బ్యాంకింగ్లో ‘పంజా’బ్! స్వదేశీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్.. దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం కూడా రావాలంటే స్వదేశీ సంస్థల ఏర్పాటుతోనే సాధ్యమని భావించారు. మన దేశ సంపదను బ్రిటిష్ బ్యాంకులు, కంపెనీలు కొల్లగొడుతున్నాయని, దీనికి అడ్డుకట్టవేయాలంటే.. మనకంటూ ఒక భారతీయ బ్యాంక్ ఉండాలనుకున్నారు. అలా ఆవిర్భవించిందే మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). 1895 ఏప్రిల్ 12న అవిభాజ్య భారతదేశంలోని లాహోర్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మొదటి బ్రాంచ్లో మొదటి బ్యాంక్ అకౌంట్ను తెరిచిన వ్యక్తి లాలా లజపతి రాయ్. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి స్వరాజ్య సారథులు సైతం ఈ బ్యాంకు ఖాతాదారులుగా మారారు. భారత్లో టెల్లర్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన తొలి బ్యాంక్ (1944లో) కూడా ఇదే. దేశ విభజనను ముందే పసిగట్టిన అప్పటి పీఎన్బీ సారథి లాలా యోద్ రాజ్.. బ్యాంక్ రిజిస్టర్డ్ ఆఫీసును లాహోర్ నుంచి ఢిల్లీకి తరలించారు. విభజన తర్వాత పశ్చిమ పాకిస్థాన్లోని 92 బ్రాంచ్లను పీఎన్బీ మూసేసింది. 1969లో ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడంతో పీఎన్బీ ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. సంక్షోభాలు, కుంభకోణాలు ఇలా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తన స్వదేశీ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇంట్లో బీరువా.. ఇంటికి తాళంకప్ప.. ఒంటికి సబ్బు! స్వదేశీ ఉద్యమ నినాదం మార్మోగుతున్న వేళ పారిశ్రామికవేత్త అర్దేశిర్ గోద్రెజ్.. సబ్బుల తయారీలో ‘స్వదేశీ‘ సత్తా ఏంటో చాటుతామని ప్రతినబూనారు. 1918లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెజిటబుల్ ఆయిల్తో స్నానపు సబ్బు ‘చావీ’ని తయారు చేసి రికార్డు సృష్టించారు. తొలుత నం. 2, తర్వాత నం.1 పేర్లతో ఈ బ్రాండ్లో సబ్బులు ప్రవేశపెట్టారు. ఈ స్వదేశీ సబ్బులకు రాజగోపాలాచారి, రవీంద్రనాథ్ టాగోర్ వంటి దిగ్గజాలు ప్రచారం చేయడం విశేషం. ఇక 1920 చివర్లో వచ్చింది గోద్రెజ్ ‘వత్నీ’! దీనికి అర్థం ‘వతన్ సే’.. అంటే ‘మాతృభూమి నుంచి’ అన్నమాట! వందేళ్ల తర్వాత కూడా నం.1 బ్రాండ్ ఉండటమే కాకుండా, ఏటా 38 కోట్లకు పైగా సబ్బులు అమ్ముడవుతున్నాయి. 1897లో సోదరుడితో కలసి గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ను స్థాపించారు అర్దేశిర్. మొదట్లో తాళాలు, సేఫ్లు, సెక్యూరిటీ పరికరాలను తయారు చేసేవారు. అంతేకాదు 1951లో జరిగిన తొలి భారత సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను తయారు చేసిందీ గోద్రెజే కావడం విశేషం. అప్పట్లో ఇంట్లో గోద్రెజ్ బీరువా, ఇంటికి గోద్రెజ్ తాళంకప్ప.. ఈ ఉత్పత్తులకు పర్యాయపదాలుగా మారాయి. ఫర్నిచర్ నుంచి కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, గృహోపకరణాలు, ఇన్ఫోటెక్, ఏరోస్పేస్.. ఇలా 15 రంగాలకు పైగా విస్తరించి ఆత్మనిర్భర్ భారత్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది గోద్రెజ్. షర్బత్ అంటే.. రూహ్ అఫ్జా! స్వాతంత్య్రోద్యమ కాలంలో పక్కా మేడిన్ ఇండియా బ్రాండ్గా ఆవిర్భవించింది ‘హమ్దర్ద్’. 1906లో హకీమ్ హఫీజ్ అబ్దుల్ ఢిల్లీలో ఈ యునానీ ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పారు. ఆ తర్వాత అది తన విలక్షణ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ చిరపరిచితంగా మారిపోయింది. షర్బత్ అంటే ‘రూహ్ అఫ్జా’ అనేంతగా ప్రాచుర్యం సంపాదించింది. అనేక యునానీ ఔషధాలనూ ఇది విక్రయిస్తోంది. హఫీజ్ మరణానంతరం కుమారుడు హకీమ్ అబ్దుల్ హమీద్తో కలసి భార్య రబియా బేగమ్ ఈ వ్యాపారాన్ని ఏమాత్రం రుచి తగ్గకుండా కొనసాగిస్తూ.. భారతీయుల మదిలో సుస్థిర స్వదేశీ బ్రాండ్గా నిలబెట్టారు. ఉద్యమానికి స్ట్రాంగ్ ‘చాయ్!’ స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో చాలా టీ ఎస్టేట్లు ఉన్నా.. వాటిని బ్రిటిషర్లు తమ చెప్పుచేతల్లో ఉంచుకొని ఆదాయాన్ని కొల్లగొట్టేవారు. సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న పీసీ ఛటర్జీ.. ఈ దుస్థితిని గమనించి.. తన వ్యాపారానికి సరికొత్త స్వదేశీ ‘రుచి’ని అందించాలని నిర్ణయించారు. ఆ విధంగా కోల్కతా కేంద్రంగా 1912లో లక్ష్మీ టీ కంపెనీ ఆవిర్భవించింది. కింగ్ ఆఫ్ పంజాబ్ – రాజా సింగ్ బ్లెండ్ నుంచి.. క్వీన్ ఎలిజబెత్ బ్లెండ్ వరకూ లక్ష్మీ టీ తన ప్రతి ఉత్పత్తిలోనూ చరిత్రను పెనవేసుకునేలా చేసింది. విఖ్యాత డార్జిలింగ్ టీతో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ఎస్టేట్లు లక్ష్మీ గ్రూప్ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా టీ ఎగుమతులు చేయడంతో పాటు అనేక అంతర్జాతీయ టీ బ్రాండ్లకు తేయాకు సరఫరా చేసేది ఇదే. ఏటా 3 కోట్ల కేజీల టీ ఉత్పత్తి చేస్తూ.. స్వదేశీ ఘుమఘుమలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతోంది. మన ‘చెప్పు’చేతల్లో...! మెట్రో షూస్.. ముంబైలోని ఒక చెప్పుల షాపులో సేల్స్మన్గా పనిచేసిన మాలిక్ తేజానీ.. దేశ విభజనలో ఆ షాపు యజమానులు పాకిస్థాన్ వెళ్లిపోవడంతో 1947లో తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి దాన్ని కొన్నారట. అప్పటి బొంబాయి నగరంలో పేరొందిన మెట్రో సినిమా దగ్గర్లో ఉండటంతో దానికి మెట్రో షూస్గా పేరు పెట్టారు. ఆయన తదనంతరం 16 ఏళ్ల వయసులో కంపెనీ పగ్గాలు చేపట్టిన ఆయన తనయుడు రఫీక్ తేజానీ.. అంచెలంచెలుగా దాన్ని దేశ ప్రజలకు ప్రియమైన పాదరక్షల బ్రాండ్గా మార్చేశారు. ఇప్పుడీ కంపెనీకి సీఈఓగా ఉన్న మాలిక్ మనుమరాలు ఫరా మాలిక్ భాంజీ దీన్ని మెట్రో బ్రాండ్స్ పేరుతో స్టాక్ మార్కెట్లో కూడా లిస్టింగ్ చేసి, తనదైన నడకలు నేర్పుతూ ముందడుగు వేస్తున్నారు. డెనిమ్ కింగ్.. అరవింద్ దేశంలో 1897లోనే లాల్భాయ్ దల్పత్ భాయ్ సారస్పూర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరుతో అహ్మదాబాద్లో టెక్స్టైల్ మిల్లును స్థాపించారు. అయితే, ఆ తర్వాత ఆయన కుమారుడు లాల్భాయ్.. కుటుంబ సభ్యులు కస్తూర్భాయ్, నరోత్తమ్భాయ్, చిమన్భాయ్ 1931లో మహాత్మాగాంధీ స్వదేశీ ఉద్యమం పిలుపుతో.. అరవింద్ మిల్స్ను అధునాతన సాంకేతికతతో నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం స్పీడు పెంచిన ఈ కంపెనీ.. 1980లో యువతకు భారతదేశపు తొలి డెనిమ్ (జీన్స్ క్లాత్) వస్త్ర బ్రాండ్ ఫ్లయింగ్ మెషిన్ను పరిచయం చేసింది. ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీదారుగా నిలుస్తోంది. అంతేకాదు, 2015లో తొలిసారిగా ఖాదీ డెనిమ్ను తీసుకొచ్చి స్వదేశీ వారసత్వాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అరవింద్.. టెక్స్టైల్స్తో పాటు రియల్టీ, రిటైల్ తదితర రంగాల్లోకీ విస్తరించింది. అరవింద్ తయారు చేసిన ఫ్యాబ్రిక్తో భూమిని 6 సార్లు చుట్టేసి రావచ్చట!! చెదపట్టని ‘ఎస్ చంద్!’ దేశంలో విదేశీ పుస్తకాలకు బదులు.. భారతీయ రచయితలు, విద్యావేత్తలు రాసిన అచ్చమైన స్వదేశీ పుస్తకాలను ప్రచురించి, ప్రజలకు అందుబాటు ధరలో తీసుకురావాలన్న లక్ష్యంతో ఆవిర్భవించినదే.. ఎస్ చంద్. 1939లో శ్యామ్లాల్ గుప్తా ఈ పబ్లిషింగ్ సంస్థను ప్రారంభించారు. ప్రొషెసర్ బహల్ అండ్ తులి రాసిన ‘టెక్ట్స్బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ’ అనేది ఎస్ చంద్ పబ్లిష్ చేసిన తొలి టెక్ట్స్బుక్. దేశంలోని బోర్డు స్కూళ్లు, కాలేజీ, యూనివర్సిటీ పరీక్షల్లో కోట్లాది విద్యార్థులకు ఎస్ చంద్ పుస్తకాలు చిరపరిచితమే. విద్యా రంగంలో పుస్తకాలకు ఎస్ చంద్ పెట్టింది పేరుగా నిలిచిపోయింది. ఏటా 5 కోట్ల టెక్ట్స్పుస్తకాలను విక్రయిస్తున్న ఈ 80 ఏళ్ల మేడిన్ ఇండియా బ్రాండ్.. పుస్తక ప్రపంచంలో ఇప్పటికీ తన స్థానానికి చెద పట్టనివ్వకుండా రెపరెపలాడుతోంది. వాహ్ తాజ్! దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు చెబితే పర్యాటకులకు టక్కున గుర్తొచ్చేది తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్! అయితే, దీని వెనుక పెద్ద కథే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం అప్పట్లో ముంబైలో ప్రసిద్ధి చెందిన వాట్సన్ లగ్జరీ హోటల్లోకి (దీని మొదటి యజమాని బ్రిటిషర్ జాన్ వాట్సన్) అడుగుపెట్టే భారతీయులను చాలా చిన్న చూపు చూసేవారట. దీంతో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా ఎలాగైనా మనకు కూడా యూరోపియన్ ప్రమాణాలకు దీటుగా ఒక లగ్జరీ హోటల్ ఉండాలనుకున్నారు. ఆ స్వదేశీ కాంక్షతోనే 1902లో ఇండియన్ హోటల్స్ కంపెనీని స్థాపించి, 1903లో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కట్టారు. తాజ్ హోటల్ దెబ్బకు ప్రభ కోల్పోయిన వాట్సన్ను 1944లో ఇండియన్ హోటల్స్ కొనుగోలు చేయడం విశేషం (తర్వాత 1980లలో దీన్ని అమ్మేసింది). 1984లో లండన్లోని సెయింట్ జేమ్స్ కోర్ట్ హోటల్ను చేజిక్కించుకుని బ్రిటిష్ కోటలో పాగా వేసింది. ఇండియన్ హోటల్స్ నేడు ప్రపంచవ్యాప్తంగా 80 నగరాల్లో 196కు పైగా హోటళ్లను నిర్వహిస్తోంది. అది ‘అరబిక్ కడలందం’గా నిలుస్తూ వాహ్ తాజ్ అనిపిస్తోంది!! టాటాల ‘ఉప్పు’ తింటున్నాం..! 1868లో 29 ఏళ్ల జంషెడ్జీ నుసర్వాన్జీ టాటా రూ.21,000 పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభించిన టాటా గ్రూప్.. నేడు ఆకాశమే హద్దుగా భారత్కు వ్యాపార జగత్తులో ఖండాతర ఖ్యాతిని తీసుకొచ్చింది. 1907లో జంషెడ్పూర్లో ఆసియాలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లలో ఒకటిగా టాటా స్టీల్ను నెలకొల్పి జంషెడ్జీ టాటా కలలను సాకారం చేశారు ఆయన తనయుడు సర్ దొరాబ్జీ టాటా. కోల్కతాలోని హౌరాబ్రిడ్జి, భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్టులు, కాండ్లా పోర్టు, చండీగఢ్ నగర నిర్మాణాలకు ‘స్టీలెత్తిన’ కంపెనీగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ టాప్–10 స్టీల్ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న టాటా స్టీల్.. 2006లో అంగ్లో–డచ్ కంపెనీ కోరస్ను ఏకంగా 8.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి బ్రిటిషర్లకు స్వదేశీ ‘ఉక్కు’ సంకల్పం అంటే ఏంటో చాటిచెప్పింది. 1910లో టాటా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ సప్లై కంపెనీగా ఆవిర్భవించిన టాటా పవర్ నేడు దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తోంది. 1929లో టాటా ఎయిర్లైన్స్ను నెలకొల్పి భారతీయుల ఆర్థిక స్వేచ్ఛా కలను వినువీధిలో విహరింపజేశారు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) టాటా. 1946లో ఎయిర్ఇండియాగా పేరుమార్చుకుని, స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం చెంతకు చేరినా.. తాజాగా మళ్లీ టాటాల గూటికే వచ్చి వాలింది ఈ లోహ విహంగం! ఇక హమామ్ బ్రాండ్ సబ్బు 1931లో టాటాలు తీసుకొచ్చిందే. ‘దేశ్ కా నమక్’గా పేరొందిన టాటా సాల్ట్ తయారీ సంస్థ టాటా కెమికల్స్ 1939లో ఆవిర్భవించింది. దేశంలో మొట్టమొదటిసారిగా ప్యాకేజ్డ్ ఐయొడైజ్డ్ ఉప్పును ప్రవేశపెట్టింది. 1945లో టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)గా ఆరంభమైన టాటా మోటార్స్.. 2008లో బ్రిటిష్ ఐకానిక్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్రోవర్ను చేజక్కించుకుని మన సత్తాను చాటింది. ఐటీ రంగంలో దేశానికి మణిమకుటంగా వెలుగొందుతోంది టీసీఎస్. 150 ఏళ్ల చరిత్రతో ఉప్పు.. పప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు 30కి పైగా కంపెనీలతో మిషన్ స్వదేశీకి మూలస్తంభంగా నిలుస్తోంది టాటా. టీవీ‘ఎస్!’ 1911లో టీవీ సుందరం అయ్యంగార్ స్థాపించిన టీవీఎస్ గ్రూప్.. మొదట సదరన్ రోడ్వేస్ పేరుతో బస్సులు, ట్రక్కుల ట్రాన్స్పోర్ట్ కంపెనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటి 2 సీట్ల మోపెడ్ (టీవీఎస్ 50)ను తయారు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత వివిధ విదేశీ ఆటోమొబైల్ కంపెనీల భాగస్వామ్యంతో ద్వి, త్రిచక్ర వాహన రంగంలో టాప్గేర్లో దూసుకెళ్లింది. ఇప్పుడిది ఆటోమొబైల్, ఏవియేషన్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, ఫైనాన్స్ వంటి రంగాల్లో అనేక కంపెనీలతో స్వదేశీ బహుళజాతి కంపెనీగా ఎదిగింది. టీవీఎస్ ఎక్స్ఎల్ పేరుతో మోపెడ్ రంగంలో ఇప్పటికీ ఈ కంపెనీ.. ఒకే ఒక్కడుగా చక్రం తిప్పుతోంది. స్వరాజ్య చరిత్రను లిఖించిన మన ‘రత్నం!’ స్వాత్రంత్య్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు రక్తాన్ని చిందిస్తే.. ఆ చరిత్రను లిఖించేందుకు తన సిరాను చిందించి.. అసలు సిసలు స్వదేశీ ‘రత్నం’గా నిలిచింది మన పెన్ను! 100% స్వదేశీ సిరా పెన్ను తయారు చేయాలన్న గాంధీజీ పిలుపుతో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కోసూరి వెంకట రత్నం 1932లో ‘రత్నం పెన్స్’ సంస్థను స్థాపించారు. 1935లో మహాత్మా గాంధీ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు స్వయంగా తమ సంస్థలో తయారైన పెన్నును ఆయనకు బహూకరించారట. ఈ ఫౌంటెన్ పెన్నులతో దాదాపు 31 వేల ఉత్తరాలను గాంధీజీ రాశారని ఆయన వారసులు చెబుతారు. అంతేకాదు, స్వదేశీ ఉద్యమానికి తన కలం ద్వారా ఇంకు నింపినందుకు రత్నంను అభినందిస్తూ ఆ పెన్నుతో గాంధీజీ స్వయంగా రాసిన లేఖ ఇప్పటికీ కేవీ రత్నం కుటుంబీకుల వద్ద భద్రంగా ఉంది. తొలి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. వంటి మహామహులందరూ రత్నం పెన్నులకు అభిమానులే. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్కు వచ్చినప్పుడు ప్రధాని మోదీ సైతం రత్నం సన్స్ తయారు చేసిన పెన్నును బహూకరించి, స్వదేశీ భారత్కు చెక్కుచెదరని బ్రాండ్గా దీని గొప్పతనాన్ని వివరించడం విశేషం. ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్ పీస్లా ఉండే ఈ పెన్నుల రేట్లు రూ. 300 నుంచి రూ. 35,000 స్థాయి వరకూ (స్టీల్ పాళీ నుంచి 22 క్యారెట్ల బంగారంతో తయారైన పాళీ దాకా) ఉంటాయి. ఏకంగా రూ. 2 లక్షల పైగా విలువైన ప్రత్యేకమైన గోల్డ్ పెన్ కూడా ఉంది. ఎలాంటి మార్కెటింగ్ గానీ, వెబ్సైట్ గానీ లేకుండానే కేవలం నోటిమాటే ప్రచారంగా.. ఈ పోటీ ప్రపంచంలో దాదాపు 90 ఏళ్లుగా సిసలైన రత్నంగా నిలుస్తోంది! ‘అమృతాంజనం! నొప్పొస్తే.. ‘అమ్మా కాదు.. అమృతాంజనం’ అనేంతలా జనాల్లోకి చొచ్చుకుపోయిన బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదేమో! 129 ఏళ్ల క్రితం 1893లో వ్యాపారవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు ఇలా ఒకటేంటి.. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన కాశీనాథుని నాగశ్వరరావు రూపొందించిన ఈ నొప్పి నివారణ ఔషధం.. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఎంతంటే, తలనొప్పి–అమృతాంజనం అనేంతలా! కుటుంబ సంస్థగా మొదలై.. 1936లో అమృతాంజన్ లిమిటెడ్ పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఈ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతోనే నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను కూడా ప్రారంభించి.. పత్రికా ప్రపంచంలో చరిత్ర సృష్టించడం విశేషం. స్వాతంత్య్రానంతరం అమృతాంజనానికి పోటీగా ఎన్ని రకాల ఔషధాలు వచ్చినా.. నేటికీ దీని స్థానం చెక్కుచెదరలేదు. అమృతాంజన్ హెల్త్కేర్గా పేరు మార్చుకుని, నాగేశ్వరరావు మనుమడు శంభు ప్రసాద్ సారథ్యంలో నేడు అమృంతాంజన్ సంస్థ ఫుడ్, సాఫ్ట్వేర్ రంగాల్లోకి కూడా విస్తరించింది. స్టాక్ మార్కెట్లో సైతం లిస్టయ్యి.. రూ. 2,400 కోట్ల మార్కెట్ విలువతో స్వదేశీ ‘బ్రాండ్’బాజా మోగిస్తోంది!! -శివరామకృష్ణ మిర్తిపాటి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement