మీనాక్షినాయుడు చెవిలో ‘పువ్వు’ !  | Sakshi
Sakshi News home page

మీనాక్షినాయుడు చెవిలో ‘పువ్వు’ ! 

Published Thu, Mar 28 2024 4:34 AM

It is inevitable that BJP will have to contest from Adoni - Sakshi

ఆదోని బీజేపీ అభ్యర్థిగా పార్థసారథి 

నిర్వేదంలో మీనాక్షినాయుడు.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసే యోచన! 

సాక్షి ప్రతినిధి కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు ఫలించలేదు. రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని బీజేపీ చేసిన ప్రతిపాదనకు టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆదోని నుంచి బీజేపీనే పోటీ చే­యాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ పార్టీ పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవా­ని­కి 15 రోజుల ముందే ఆదోని స్థానం బీ­జేపీ ఖాతా­లోకి చేరిందనే విషయం మీనాక్షినాయు­డు­కు తెలుసు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు.

ఈ క్రమంలో బీజేపీకీ అభ్యర్థి దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు మీనాక్షి నాయు­డు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్‌ చేసి రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుని, ఆలూరు కావాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతామని ఆఫర్‌ ఇచ్చారు. అయితే అంత డబ్బులు ఇవ్వలేమని మీనాక్షినాయుడు చెప్పడంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది.   

మీనాక్షినాయుడు రాజకీయ భవితవ్యం ఎటు? 
కర్నూలు జిల్లా రాజకీయాల్లో మీనాక్షినాయుడు సీనియర్‌ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆదోని నుంచి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999­, 2009లో వైఎస్సార్‌ ప్రభంజనంలో­నూ ఆదోనిలో ఆయన విజయం సాధించారు. 1999లో కోట్ల సూర్య­ప్రకాశ్‌రెడ్డిపైనా గెలుపొందా­రు. టీడీపీ మిన­హా ఇత­ర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలో­చన కూడా  చేయలేదు. టీడీపీని అంటిపెట్టుకుని ఆదోనిలో పార్టీ ఉన్న­తికి తోడ్పడ్డారు.

చివరిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయా­లని లేదా తన తనయు­డిని బరిలో నిలపాలని ఆయ­న అభిలషించారు. అలాంటి వ్యక్తిని కాదని పోటీ చేసేందుకు శక్తి లేక రూ.3 కోట్లకు సీటు వదలుకునేందుకు సిద్ధమైన పార్టీకి టీడీపీ అసెంబ్లీ సీటు ఇవ్వ­డాన్ని మీనాక్షినాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయనకు టీడీపీ గౌరవం ఇవ్వలేనప్పుడు ఆయన పార్టీలో ఎందుకు కొనసాగాలనే చర్చ కూడా నడుస్తోంది. 

Advertisement
Advertisement