సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
30న లక్ష జన మహా మానవహారం
Published on Thu, 08/29/2013 - 03:34
కర్నూలు(విద్య), న్యూస్లైన్: లక్ష గళ ఘోషను దిగ్విజయం చేసిన జిల్లా విద్యాసంస్థల ఐక్య కార్యాచరణ సమితి మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ నెల 30న కర్నూలులో లక్ష జన మహా మానవహారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్దనున్న కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు లక్ష జన మహా మానవహారం నిర్వహిస్తామన్నారు.
నగరంలోని అన్ని ప్రధాన రహదారుల నుంచి ఒక చైన్ తరహాలో లక్షలాది మంది కార్యక్రమంలో పాల్పంచుకుంటారన్నారు. కార్యక్రమం ప్రారంభానికి సూచికగా నగరమంతా వినిపించేలా ఒక ఔటు పేలుస్తామని, ముగింపు సందర్భంగా మరో ఔటు పేలుస్తామని తెలిపారు. ఈ సమయంలో నగరంలోని ప్రజలు ఎక్కడికక్కడ మానవహారంలో కలిసిపోయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, బీఈడీ, టీటీసీ, పండిట్ ట్రైనింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, ఆయా కళాశాలల సిబ్బంది, బ్యాంకింగ్, అన్ని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మేధావులు, అన్ని రకాల కుల సంఘాలు, అన్ని జేఏసీ సంఘాల సభ్యులు కార్యక్రమంలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. అయితే కార్యక్రమంలోకి రాజకీయ పార్టీల నాయకులను, ప్రజాప్రతినిదులను దరిచేరనివ్వొద్దని.. వచ్చినా నిరసన తెలిపి వెనక్కు పంపాలన్నారు. పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఉద్యమాన్ని మరో ఏడాది పాటైనా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. సమావేశంలో జేఏసీ నాయకులు వి.జనార్దన్రెడ్డి, జి.పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, పీబీవీ సుబ్బయ్య, వాసుదేవయ్య, సోమశేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags