amp pages | Sakshi

రాయపాటి చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు

Published on Thu, 01/26/2017 - 15:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత తలపెట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనలకు అడ్డంకులు కల్పిస్తున్న అధికార పార్టీ నేతలపై సినీ హీరో పవన్ కల్యాణ్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టకూడదని రాయపాటి సాంబశివరావుకు ఆయన సూచించారు. రాయపాటి లాంటివాళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాటం చెయ్యరు, చేసేవాళ్లను చెయ్యనివ్వరని అన్నారు. పైగా కష్టపడే రైతుల పచ్చని పొలాల్లో పోలవరం కాంట్రాక్టు లాభాల కోసం మట్టిని డంప్ చేయిస్తారని చెప్పారు. 
 
ఇలాంటి వ్యాపార ధోరణితో కూడిన రాజకీయాల వల్లే తెలంగాణ యువతకు కోపం తెప్పించి.. 'ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు' అన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారని విమర్శించారు. దురాశ, డబ్బు, పదవీ వ్యామోహాల కోసం భావి తరాల భవిష్యత్తును పాడుచేసే హక్కు రాయపాటికి లేదన్నారు. 
 
మరోవైపు యువత పోరాట స్ఫూర్తిని కేంద్రమంత్రి సుజనాచౌదరి పందుల పందాలతో పోల్చడం చాలా బాధాకరమని పవన్ అన్నారు. ఇక నోరు జారేకొద్దీ యువతను రెచ్చగొట్టడమే అవుతుందని, అలాగే కానివ్వాలని చెప్పారు.