మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే
Breaking News
అభివృద్ధి పథకాలపై భరోసా
Published on Mon, 11/02/2015 - 04:30
♦ వరంగల్లో విజయానికి టీఆర్ఎస్ పక్కా వ్యూహం
♦ సంక్షేమ పథకాలపై ఇంటింటా ఎన్నికల ప్రచారం
♦ నియోజకవర్గస్థాయి సమావేశాల్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు కదులుతోంది. గడిచిన పదహారు నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు పోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఇప్పటికే వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు మంత్రులను ఇన్చార్జులుగా నియమించిన టీఆర్ఎస్, ఆదివారం ఏడు సెగ్మెంట్లలో నియోజకవర్గస్థాయి సమావేశాలను నిర్వహించింది.
ఈ సమావేశాల్లో ప్రధానంగా కార్యకర్తల్లో ఎన్నికల వేడిని పుట్టించడంతో పాటు ప్రచార వ్యూహాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం. వీటికి ఇన్చార్జి మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, బాధ్యతలు అప్పజెప్పిన ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల (2014) ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇప్పటి దాకా అమలు చేసిన హామీలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలనే కాకుండా, అధికారంలోకి వచ్చాక చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాల గురించి కూడా సవివరంగా మంత్రులు వివరించారు. ఈ అంశాలనే నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలన్నారు.
ప్రభుత్వ పథకాలే ఆసరా..
కొత్త రాష్ట్రంలో తొలి సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పాలనే వరంగల్ ఉప ఎన్నికల్లో తమను గెలిపిస్తుందని పదే పదే పేర్కొంటున్న ఆ పార్టీ నేతలు ఆ దిశలో ప్రచార వ్యూహాన్ని కూడా రచించినట్లు చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల వంటివి సామాన్య జనానికి అంత తేలిగ్గా అర్థమయ్యేవి కావన్న ఆలోచనకు వచ్చిన పార్టీ నాయకత్వం, మారుమూల గ్రామాల్లోని అతి సామాన్యులకు సైతం తమ ప్రభుత్వం చే కూర్చిన లబ్ధి గురించి వివరించేందుకు సిద్ధమవుతోంది.
రూ. వెయ్యి పెన్షన్, పరిమితి విధించకుండా ప్రతీ కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలకు ప్రచారంలో పెద్ద పీఠ వేయాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. ప్రతీ ఇంటికీ తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ , ఊరూరా పూడికలు తీస్తున్న చెరువుల పథకం ‘మిషన్ కాకతీయ’ వంటి వాటిని బహుళంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని కూడా ఎక్కువగా ప్రచారం చేయాలని, గతంలో జరిగిన అక్రమాల గురించి వివరించడం.., అప్పటి ప్రభుత్వంలో స్థానిక నేతల జోక్యంతో కలిగిన ఇబ్బందులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రధాన వ్యూహంగా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో పల్లెలను ఎంతో ఇబ్బంది పెట్టిన విద్యుత్ సమస్యకు తమ ప్రభుత్వం ఎలా చెక్పెట్టింది, నిత్యం కరెంటు సరఫరా చేసేందుకు తీసుకున్న చర్యల గురించి ప్రచారం చేస్తామని ఆ వర్గాలు తెలిపాయి.
విపక్షాలపై ఎదురుదాడి
కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఒక వైపు వివరిస్తూనే, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండిన కాంగ్రెస్, టీడీపీల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఆయా రంగాల్లో చూపెట్టిన వివక్ష గురించి ఎండగట్టాలన్న ప్రణాళికను టీఆర్ఎస్ నాయకత్వం రచించింది. కొత్త ప్రభుత్వానికి కేంద్రం కల్పించిన అడ్డంకులు, టీడీపీ, బీజేపీలు క లసి పెట్టిన ఇబ్బందులనూ ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా విద్యుత్, రేషన్ బియ్యం, పెన్షన్లు.. వంటి అంశాలను ప్రతీ గ్రామంలో ఇంటింటికీ తీసుకువెళ్లాలన్న నిర్ణయం జరిగింది. ప్రతీ నియోజకవర్గంలోని దాదాపు అన్ని ఇళ్లను చుట్టివ చ్చే విధంగా, ప్రతీ ఓటరును పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగతంగా కలిసేలా వ్యూహం ఖరారైందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.
Tags