వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
పురాతన చర్చిలో భారీ అగ్ని ప్రమాదం
Published on Tue, 04/16/2019 - 08:20
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పుట్టించింది. 850 సంవత్సరాల అతిపురాతనమైన నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 400 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు గాయపడ్డారనీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.
12వ శతాబ్దానికి చెందిన నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చర్చి భవనంలో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను అక్కడనుంచి దూరంగా తరలించారు. కానీ 93 మీటర్ల (305 అడుగుల) శిఖరం కూలిపోయింది. అయితే అనేక అమూల్య కళాఖండాలు, చారిత్రక చిహ్నాలను భద్రపరిచారు.
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యూల్ మాక్రోన్తో పాటు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తదితర ప్రపంచ నేతలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు, లేడీ ఆఫ్ ప్యారిస్ మంటల్లో చిక్కుకుందంటూ ఇమ్యాన్యూల్ ఒక భావోద్వేగ సందేశాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు.
పూర్తిగా కలపతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం యూరప్లో ప్రపంచ పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది. 1991లో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. పురాతన చర్చిని పునరుద్దరించేందుకు ఫ్రాన్స్ చేపట్టే చర్యలకు సహాయం అందిస్తామని యునెస్కో వెల్లడించింది.
The moment #NotreDame’s spire fell pic.twitter.com/XUcr6Iob0b
— Patrick Galey (@patrickgaley) April 15, 2019
Tags