Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
Breaking News
అడ్డంగా దొరికిపోయిన సీఎం రమేష్
Published on Thu, 03/29/2018 - 10:17
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ఏదో జరిగిందంటూ కట్టుకథ అల్లిన టీడీపీ ఎంపీల అసలు స్వరూపం బయటపడింది. ప్రధానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదాభివందనం చేశారంటూ ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో విజయసాయిరెడ్డిపై దుష్ప్రచారానికి దిగిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్.. సాక్ష్యాల విషయాన్ని కొచ్చేసరికి తెగ కంగారు పడ్డారు.
ఈ క్రమంలో కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారు. తొలుత సభలో ఏదో జరిగిందంటూ మీడియాతో మాట్లాడిన రమేశ్.. తర్వాత మాట్లాడేందుకు మరో ఎంపీ మురళీ మోహన్కు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఓ విలేకరి వైఎస్సార్ సీపీ ఎంపీల వాదనను ప్రస్తావించగా.. ‘సాక్ష్యాలిస్తే వాళ్లు రాజీనామా చేస్తారా?’ అని సీఎం రమేశ్ ఆవేశంగా మాట్లాడారు. అంతలో మురళీమోహన్ జోక్యం చేసుకుని ‘ఫుటేజీ ఉంది కదా!’ అనటం.. ‘ఉంది, ఉంది.. మీరు అది చెప్పొద్దు’ అంటూ మురళీమోహన్కు సీఎం రమేశ్ సూచించటం చూడొచ్చు. దీంతో రమేశ్ చేసే ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉన్నదన్నది అర్థమైపోతోంది.
మరోపక్క తనపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సీఎం రమేష్ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫుటేజ్ బయటపెట్టాలంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్కు విజయసాయిరెడ్డి లేఖ కూడా రాశారు.
Tags