ఆంధ్రా అతలాకుతలం..
Breaking News
ప్రాంతీయ ’పవర్’
Published on Tue, 05/14/2019 - 00:57
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు కలసి రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ బలోపేతం చేయడం వల్ల ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో కొత్త తరహా రాజకీయాలు మొదలు కావాలన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం సాయంత్రం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్తో గంటపాటు భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సమగ్రంగా చర్చించారు. ‘కేంద్రంలో జాతీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వాలతో ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ మౌలికవసతుల లోపం ఉంది. సమద్ర జలాలు వృథాగా పోతున్నాయి.
సాగునీరుకు ఇప్పటికీ ఇబ్బందులు తప్పడంలేదు. ప్రజల ఆకాంక్షలు ఒక రకంగా ఉంటే కేంద్ర ప్రభుత్వాల విధానాలు మరో రకంగా నడుస్తున్నాయి. భారతదేశంలో అంతర్లీనంగానే సమాఖ్య వ్యవస్థ ఉంది. సమాఖ్య వ్యవస్థ బలోపేతంతోనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరితేనే దేశం ముందుకు సాగుతుంది. జాతీయ పార్టీలతో ఇవి నెరవేరే పరిస్థితి లేదు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. ప్రాంతీయ పార్టీలే ప్రజల అవసరాలను సరిగ్గా గుర్తిస్తాయి. ఫెడరల్ ఫ్రంట్తోనే ఇది సాధ్యమవుతుంది. కేంద్రంలో ఈసారి పరిస్థితులు ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉండనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లకు సొంతంగా 150 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీల బలం పెరగనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. రెండు దశాబ్దాల క్రితంలాగే ప్రాంతీయ పార్టీలు కీలకమవుతాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో కీలకంగా వ్యవహరించవచ్చు.
ఇప్పటికే చాలా పార్టీలు కలసి వస్తున్నాయి. భారత రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే డీఎంకే సైతం కలసి రావాలి. ప్రాంతీయ పార్టీల కూటమిలో ప్రతిసారీ డీఎంకే ముందుండి నడిచింది. ఇప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా ఫెడరల్ ఫ్రంట్తో కలసి రావాలి’అని కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్తో అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి కలుద్దామని కోరారు. స్టాలిన్ సైతం తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించినట్లు టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెప్పారు. ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్తో కలసి వచ్చేందుకు డీఎంకే ఆసక్తిగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి భేటీ అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ గతేడాది కూడా డీఎంకే ముఖ్యనేతలతో కలసి చర్చించారు. కేసీఆర్ వెంట ఎంపీలు బి.వినోద్ కుమార్, జి.సంతోష్ కుమార్ ఉన్నారు. ఈ చర్చల్లో డీఎంకే నేతలు టి.ఆర్.బాలు, దొరైమురుగన్ పాల్గొన్నారు.
శ్రీరంగం, తిరుచ్చి ఆలయాల్లో సీఎం కేసీఆర్ పూజలు...
తమిళనాడు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుతో కలిసి సోమవారం శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుచ్చి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు రెండు ఆలయాల అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్తో భేటీ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
Tags