జగన్ వెంటే జనమంతా..
Breaking News
ఉందామా! వద్దా!
Published on Mon, 10/07/2013 - 01:57
సాక్షి, ముంబై: మహాకూటమిలోని పరిణామాలపై అసంతృప్తితో ఉన్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే తన దారి తాను చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకూటమిలో కొనసాగాలా, తెగతెంపులు చేసుకోవాలనే అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆఠవలే రాజ్యసభ స్థానం డిమాండ్ చేయడంతో కొద్ది రోజులుగా శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమిలో ప్రతిష్టం భన నెలకొంది. అది ఎటూ తేలకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకునే సమయం దగ్గరపడిందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. అయితే ఆర్పీఐ అసంతృప్తికి చాలా కారణాలు ఉన్నాయి.
శివసేన దగ్గర ఒకే ఒక రాజ్యసభ సీటు ఉంది కాబట్టి ఆఠవలేకు రాజ్యసభ స్థానం ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అది తేల్చిచెప్పింది. బీజేపీ నుంచి ప్రయత్నం చేయాలని సూచించింది. శివసేన వైఖ రిపై అసంతృప్తికి గురైన ఆర్పీఐ అధినేత.. మహా కూటమి పక్షపాత ధొరణి అవలంభిస్తున్నట్లు తన సన్నిహితులతో చెబుతున్నారు. దీంతో పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సహా ఆఠవలే కూడా అసంతృప్తితో ఉన్నారు. త్వరలో తాడోపేడో తేల్చుకుని తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నా యి. శివశక్తి, భీంశక్తి ఒకటవ్వాలని దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే చేసిన ప్రతిపాదనకు ఆఠవలే స్పందించారు. తరువాత శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమితో ఆర్పీఐ జతకట్టడం తో దీనికి మహాకూటమిగా నామకరణం చేశారు.
శివసేన ఆఠవలేకు తప్పకుండా రాజ్యసభ అభ్యర్థిత్వం ఇస్తుందని కార్యకర్తలు భావించారు. ఆఠవలే ఇదే విషయాన్ని పలుసార్లు పార్టీ నాయకులతో చెప్పారు కూడా. చివరికి శివసేన కుదరదని తేల్చి చెప్పడంతో ఆర్పీఐలో అసంతృప్తి నెలకొంది. శివసేన తీసుకున్న ఈ నిర్ణయంతో దళిత సమాజానికి తప్పుడు సంకేతం పంపిందని ఆర్పీఐ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఆఠవలేకు రాజ్యసభ అభ్యర్థిత్వం నిరాకరించి శివసేన తమ అసలు రంగు బయటపెట్టుకుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్ నియోజక వర్గాలు తమకు వదిలేయాలని, అక్టోబరు ఆఖరు వరకు శాసనసభ సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్నామ్యాయ మార్గాన్ని వెతుకోవాల్సి ఉంటుందని ఇదివరకే ఆర్పీఐ కాషాయ కూటమిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఠవలే లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందు సిద్ధంగా లేరు. తనను రాజ్యసభకు పం పించాలని పట్టుబడుతున్నారు. శివసేన మాత్రం ఏ ఒక్క ప్రతిపాదననూ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే తెగదెంపులు తప్పకపోవచ్చని ఆర్పీఐ నాయకుడొకరు అన్నారు. ‘కూటమి నుంచి బయటపడాలా..? వద్దా..? అనే దానిపై తేల్చుకునేందుకు త్వరలో ఒక సమావేశం నిర్వహిస్తాం’ అని ఆర్పీఐ వర్గాలు వెల్లడించాయి.
Tags