వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ఇష్టానుసారం క్లోరోక్విన్ వాడితే..
Published on Mon, 04/13/2020 - 01:56
సాక్షి, హైదరాబాద్: ‘పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైరస్ విస్తరిస్తుండటంతో హైదరాబాద్వాసుల్లో ఆందోళన మొదలైంది. ఈ భయంతో చాలా మంది కరోనా చికిత్సల్లో వాడే యాంటీ మలేరియా మందు (హైడ్రాక్సీ క్లోరోక్విన్)ను వినియోగిస్తున్నారు. వైద్యుడు సిఫార్సు చేయకుండా నేరుగా ఈ టాబ్లెట్లను వాడితే గుండె రిథమ్, పంపింగ్లో తేడా వస్తుంది. ఆకస్మిక గుండెపోటుకు దారితీసే ప్రమాదం లేకపోలేదు’ అని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కార్డియో థొరాసిక్ సర్జన్, ప్రొఫెసర్ ఆర్వీకుమార్ స్పష్టం చేశారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో అవసరం లేకున్నా పలువురు క్లోరోక్విన్ కొనుగోలు చేస్తూ పరోక్షంగా కృత్రిమ కొరతకు కారణమవుతున్నారని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..
ఐసీఎంఆర్ చెప్పిందిది..?
కరోనా వైరస్కు ఇప్పటివరకు వాక్సిన్ లేదు. కొన్ని పరిశోధనల తర్వాత కరోనా సోకిన వ్యక్తికి చికిత్సలో భాగంగా ఇస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ మంచి రిజల్ట్ ఇస్తున్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. తొలిరోజు రెండుసార్లు 400 ఎంజీ చొప్పున, ఆ తర్వాత వారానికి ఒకటి (400ఎంజీ) చొప్పున ఏడు వారాలు వాడాలని సూచిం చింది. పెద్దవాళ్లకు మాత్రమే దీన్ని వాడాలి. జలుబు, జ్వరం తీవ్రతను బట్టి ‘అజిత్రోమైసిన్’ వంటి యాంటీబయాటిక్ కాంబినేషన్తోనూ దీన్ని వాడొచ్చని సూచిం చింది. ఈ కాంబినేషన్ మందులతో వైరస్ కూడా తగ్గుతుంది. తెలంగాణలో ఇప్పటికే 96 మంది కోలుకోవడం తెలిసిందే. దీంతో ఈ మందులకు డిమాండ్ పెరిగింది.
‘ఈసీజీ’ పర్యవేక్షణలో వాడొచ్చు
నిజానికి పాజిటివ్ బాధితులకు అజిత్రోమైసిన్ కాంబినేషన్లో ఈ మందులు వాడుతున్నారు. వారి నుంచి వారికి సన్నిహితంగా మెలి గిన వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి, ఇదే మందును వారి కుటుంబసభ్యులు, ఇతర సన్నిహితులకు కూడా సిఫార్సు చేస్తున్నారు. అం తేకాదు వైద్య సేవలందించే వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారమెడికల్ స్టాఫ్ సహా కేసులను ట్రేస్ చేసేందుకు వెళ్లే సర్వేలెన్స్ ఆఫీసర్లకు, శానిటైజ్ చేసే పారిశుద్ధ్య కార్మికులకు వైరస్ సోకవచ్చు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఈ హైరిస్క్ కేటగిరిలో పనిచేసే వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ను సిఫార్సు చేస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని వాడాలి. కానీ కొంతమంది ఎలాంటి కాంటాక్ట్ హిస్టరీ లేకపోయినా ముందస్తుగా ఈ టాబ్లెట్లను కొని వాడుతున్నారు. రోగుల బలహీనతను కొన్ని మెడికల్ షాపులు సొమ్ము చేసుకుంటున్నాయి.
గుండె పనితీరు, కంటిచూపుపై తీవ్ర ప్రభావం
వైద్యుల సిఫార్సు లేకుండా క్లోరోక్విన్ వాడితే గుండె రిథమ్ సహా పంపింగ్లోనూ తేడా వస్తుంది. కంటి రెటీనా దెబ్బతింటుంది. కరోనా పాజిటివ్ బాధితులకు కూడా ఈసీజీతీసి, వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతుంటారు. హైరిస్క్ జోన్లో ఉన్న వారు కాకుండా ఇతరులు కూడా ఈ మందులు ఇష్టానుసారం వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల గుండె లయ తప్పుతుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణలో తేడాలు ఏర్పడతాయి. ఫలితంగా హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం లేకపోలేదు.
Tags