అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
Breaking News
కొంప ముంచిన లాభాపేక్ష
Published on Fri, 07/06/2018 - 09:16
సాక్షి ప్రతినిధి, వరంగల్: బాణసంచా నిల్వ చేయాల్సిన చోట అక్రమంగా తయారీ మొదలు పెట్టారు. ఏళ్ల తరబడి ఈ పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా పదిమంది నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. భధ్రకాళి ఫైర్వర్క్స్ ప్రమాదంలో పోలీసు, అగ్నిమాపకశాఖ, రెవెన్యూ విభాగాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాశిబుగ్గకు చెందిన గుల్లపెల్లి రాజ్కుమార్ అలియాస్ బాంబుల కుమార్.. ఇతర ప్రాంతాల్లో తయారైన బాణసంచాను ఏడాదిపాటు అమ్ముకునేందుకు మాత్రమే అనుమతులు పొందాడు. తమిళనాడులోని శివకాశిలో తయారు చేసిన బాణసంచాను ట్రాన్స్పోర్టు ద్వారా వరంగల్కు తెప్పించి.. ఇక్కడ గోదాముల్లో నిల్వ చేసి అమ్మకాలు చేసుకోవచ్చు. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడకు తెచ్చి అమ్మడం కంటే ఇక్కడే తయారు చేసి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయనే దురాశే కొంప ముంచింది. దీంతో అమ్మకాల అనుమతుల మాటున దర్జాగా బాణసంచా తయారీ చేయడం ప్రారంభించారు. సంబంధిత అధికారులు కూడా మరో ఆలోచన లేకుండా వరుసగా అమ్మకాలకు అనుమతులు ఇస్తూ వెళ్లారు.
15 కేజీల వంతున
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. భద్రకాళి ఫైర్వర్క్స్లో నిబంధనలకు విరుద్ధంగా సుతిల్తాడు బాంబు, చిచ్చుబుడ్డి, రాకెట్లు, స్మాల్ షాట్స్, పేపర్షాట్స్ తయారు చేస్తున్నారు. దీనికి అవసరమైన గంధకం, పొటాషియం, ఎలక్ట్రికల్ పౌడర్, ట్రాజన్, బరాట, వైట్ (సెకండ్క్వాలిటీ, శక్తివంతమైన పేలుడు పదార్థం) తమిళనాడులోని చెన్నై, శివకాశి నుంచి రాజ్కుమార్ తెప్పిస్తున్నట్లు సమాచారం. ఒక్కో మెటీరియల్ను కనీసం 15 కేజీలు తగ్గకుండా ప్రైవేటు ట్రాన్సుపోర్టు సంస్థల ద్వారా వరంగల్కు రప్పిస్తున్నారు.
ఇలా వచ్చిన పదార్థాలను భద్రకాళి ఫైర్వర్క్స్ ఔట్లెట్ వెనక భాగంలో ఉన్న బాణసంచా తయారీ గదుల్లో భద్రపరుస్తున్నారు. ఈ మిశ్రమాన్ని వివిధ బాంబులకు అనుగుణంగా తగు మోతాదుల్లో కలిపి బాంబులు తయారు చేస్తారు. వివిధ మోతాదుల్లో మందుగుండు సామగ్రిని కలిపి మిశ్రమంగా చేసే పనిని రాజ్కుమార్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాడు. ఇలా రూపొందిన మిశ్రమాన్ని బాణసంచా తయారీలో వినియోగిస్తారు. ఇలా కలిపిన మిశ్రమంతో తొలుత కొన్ని శాంపిల్స్ బాణసంచా తయారు చేసి, ఒక రోజంతా పరిశీలనలో ఉంచుతారు. అనంతరం వాటిని పేల్చి పరీక్ష చేస్తారు. సరిగా పేలకుంటే మిశ్రమంలో మార్పు చేస్తారు. తగు మోతాదులో ఉందని తేలితే బాణసంచా తయారీలో వినియోగిస్తారు. మిశ్రమం రూపొందించే క్రమంలో ఏ మాత్రం ఒత్తిడి పెరిగినా మంటలు రాజుకోవడం సాధారణం.
మందుగుండు గదిలో మంటలు
ప్రమాదం జరిగిన రోజు మొత్తం 14 మంది భధ్రకాళి ఫైర్వర్క్స్లో పనికి వచ్చారు. కంపెనీ ముందుభాగంలో కంపెనీ కార్యాలయం, దాని పక్కన గదిలో తయారు చేసిన బాంబులు విక్రయిస్తారు. దీని వెనుక రెండో భాగంలో బాంబులు తయారు చేస్తారు. బుధవారం ఉదయం బాంబులు తయారు చేసే విభాగంలో మూడు గదులు ఉన్నాయి. ఇందులో చివరి గదిలో మల్లిఖార్జున్, రాకేశ్. అశోక్ బాంబులకు మందులను కలుపుతున్నారు. రెండో గదిలో నలుగురు మహిళా కార్మికులు కూర్చుని తయారు చేసిన బాంబులకు వత్తులు అమర్చుతున్నారు. మూడో గది తలుపు వద్ద పరికరాల మోహన్ బాంబుల తయారీలో అవసరమైన ఇసుకను పడుతున్నాడు. ఈ సమయంలో నలుగురు వ్యక్తులు బాంబులు కొనేందుకు వచ్చి తమకు శక్తివంతమైన బాంబులు కావాలంటూ ఔట్లెట్లో ఉన్న రఘుపతిని కోరారు. దీంతో రఘుపతి బాంబుల తయారీ యూనిట్కు వచ్చి చివరి గదిలోకి వెళ్లాడు. కాసేపటికే చివరి గదిలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది.
ఏం జరుగుతుందో తెలిసేలోగా ఆ గదిలో నుంచి పెద్ద ఎత్తున రాళ్లు, రేకు ముక్కలు, ఇనుప చువ్వలు బాణాల్లా వేగంగా గాలిలో దూసుకొచ్చి అక్కడ పని చేస్తున్న వారిని తీవ్రంగా గాయపరిచాయి. తొలి పేలుడు తీవ్రతకు మూడో గది తలుపు వద్ద ఉన్న మోహన్, బాంబులు కొనేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు పరిగెత్తుతూ వెళ్లి కింద పడిపోయారు. కాసేపు నేలపై పడిపోవడం వారి ప్రాణాలను కాపాడింది. బాణాల్లా దూసుకు వచ్చే ఇటుకలు, రాళ్లు, రేకు ముక్కలు, చువ్వల బారి నుంచి వీరు తప్పించుకోగలిగారు. భారీ పేళ్లులు ఆగిపోగానే వీరంతా లేచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది మరణించినట్లు గుర్తించగా.. ఇద్దరు మృతులను ధ్రువీకరించేందుకు డీఎన్ఏ టెస్ట్ నిమిత్తం హైదరాబాద్, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. గాయపడిన నలుగురిలో సురేశ్ పరిస్థితి విషమంగా ఉండగా, మోహన్కు కర్ణభేరీ దెబ్బతింది. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు కనకరాజు, రాజ్కుమార్ అక్కడి నుంచి బయటకు వచ్చారు.
Tags