నరసాపురం జనసంద్రం
Breaking News
కేవీకే రైతును వరించిన రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం
Published on Wed, 03/22/2023 - 23:56
కడప అగ్రికల్చర్ : కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం అభ్యుదయ రైతు లోమడ సదాశివరెడ్డికి గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు 2023 సంవత్సరానికి ఉత్తమ రైతు పురస్కారం అందజేశారు.
వ్యవసాయంలో ఆయన అవలంబించిన వినూత్న పద్ధతులకు రాయలసీమ ప్రాంతం తరపున ఉత్తమ రైతుగా ఈయనను ఎంపిక చేశారు. ఈమేరకు బుధవారం ఆయనకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతోపాటు రూ. 5 వేల నగదు అందజేసి సత్కరించారు. చాపాడు మండలం వి.రాజుపాలెం గ్రామానికి చెందిన లోమడ సదాశివారెడ్డి తన 14వ ఏట నుంచే తండ్రితో కలిసి వ్యవసాయాన్ని ప్రారంభించారు. 7వ తరగతి వరకు చదువుకున్న ఈయన తనకున్న 5 ఎకరాల్లో వేరుశనగ, మినుము వంటి వ్యవసాయ పంటలతోపాటు దోస వంటి ఉద్యాన పంటలను కొత్త కొత్త వంగడాలతో అధిక దిగుబడులు లక్ష్యంగా సాగు చేస్తున్నారు.
● 1992 నుంచి కడప వ్యవసాయ పరిశోధన కేంద్రం సహకారంతో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ తాను పండించిన విత్తనాలను నేరుగా ప్రభుత్వానికే విక్రయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
● 2017 సంవత్సరం నుంచి తిరుపతి ప్రాంత్రీయ వ్యవసాయ పరిశోధనస్థానం, కడప కృషి విజ్ఞానకేంద్రం సహాయంతో టీబీజీ–104 రకం మినుము, టీసీజీయస్ 1694 వంటి వేరుశనగ పంటలను పండిస్తున్నారు. ఏటా 150 క్వింటాళ్ల దిగుబడులను తీసి 30 క్వింటాళ్ల చొప్పున గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సరఫరా చేస్తున్నారు. అలగే ఇక్కడి ప్రాంత రైతులకు విక్రయిస్తున్నారు.
● తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, తిరుపతి, నెల్లూరు ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా సదాశివారెడ్డి వద్దకు వచ్చి విత్తనాలను తీసుకుని వెళుతుంటారు.
● అంతేకాకుండా జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులను, విధానాలను పాటిస్తూ అధిక దిగుబడులు ఆదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పురస్కారం పొందిన రైతు లోమడ సదాశివారెడ్డిని కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య, కేవీకే శాస్త్రవేత్తలు అభినందించారు.
రూ.5 వేల నగదుతోపాటు
ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేత
అభినందించిన కేవీకే కోఆర్డినేటర్, శాస్త్రవేత్తలు
Tags