లండన్ కు చేరుకున్న సీఎం జగన్
Breaking News
రహదారి భద్రత.. సామాజిక బాధ్యత
Published on Mon, 11/20/2023 - 01:42
నగరంపాలెం: దేశవ్యాప్తంగా ఏడాదికి ఐదు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 1.60 లక్షల మంది మృత్యువాతకు గురవుతున్నారని, మరో ఐదు లక్షల మంది గాయపడుతున్నారని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం అన్నారు. రహదారి ప్రమాదాల బాధితుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రవాణా, పోలీస్ శాఖ సంయుక్తంగా ఆదివారం పోలీస్పరేడ్ గ్రౌండ్ నుంచి నగరం పాలెం మూడు బొమ్మల సెంటర్ వరకు విద్యార్థులు, ఆటో/ బస్ డ్రైవర్లతో వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 900 రహదారి ప్రమాదాల జరిగాయని, అందులో 320 మంది మృత్యువాతపడగా, 1200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ప్రతి వాహన చోదకుడు రహదారి భద్రత సామాజిక బాధ్యతగా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే ఆలోచనతో వాహనాలను జాగ్రత్తగా నడపాలని అన్నారు. ట్రాఫిక్ డీఎస్పీ బాలసుందరరావు మాట్లాడుతూ విచక్షణరహితంగా వాహనాలు నడపవద్దని, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ ఆర్ఎం ఎం.రవికాంత్ మాట్లాడుతూ పదో తరగతి ఉత్తీర్ణతైన విద్యార్థులు వాహనాలు నడుపుతూ ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. తద్వారా రూ.5 వేలు జరిమానా, కోర్టు శిక్షలు కూడా అమలు చేస్తారని పేర్కొన్నారు. ఆర్అండ్బీ అధికారి సమర్పణరావు, ఎస్సీ పంచాయతీరాజ్ అధికారి జి.బ్రహ్మం, వాహన తనిఖీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags