అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిడ్డలపై విపరీతమైన ప్రేమ.. అతిగారాబంతో అడిగినంత డబ్బు.. చివరకు!
Published on Fri, 11/04/2022 - 10:48
సత్తుపల్లి (ఖమ్మం) : సత్తుపల్లి పట్టణానికి చెందిన ఓ యువకుడు ఇటీవల హత్యకు గురికాగా, అతడి మిత్రబృందం స్థానికంగా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మృతదేహం తరలింపు సందర్భంగా బైక్లు, కార్ల ర్యాలీతో పాటు బాణసంచా కాలుస్తూ భారీ ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. అయితే, సదరు యువకుడిని తల్లిదండ్రులే సుపారీ ఇచ్చి అంతమొందించారని పోలీసులు తేల్చడంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. దంపతులిద్దరూ ఉద్యోగులే. సంపాదనకు లోటు లేదు. ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో చిన్ననాటి నుంచి గారాబంగా పెంచారు. అడిగినవన్నీ తెప్పించారు. అడగకున్నా ఖర్చుల కోసం డబ్బు ఇస్తూనే ఉన్నారు. కానీ చివరకు మత్తు పదార్థాలకు బానిసైన కుమారుడి అసాధారణ ప్రవర్తనే ఆయన హత్యకు పురిగొల్పిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
అతి గారాబంతో మొదలు..
తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బిజీగా ఉంటూ పిల్లల ప్రవర్తనపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అడిగిందే తడవు.. డబ్బులు ఇస్తున్నారే తప్ప వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారని ఆరా తీయడం లేదు. ఖాళీ సమయాల్లో ఎక్కడ, ఎవరితో గడుపుతున్నారనే విషయం గుర్తించడం లేదు. దీంతో చాలా మంది యువకులు కళాశాల స్థాయిలోనే సరదాగా సిగరెట్తో ప్రారంభిస్తూ గంజాయికి అలవాటవుతున్నారు. పదో తరగతి పూర్తయ్యాక ఇంటర్మీడియట్ స్థాయిలో దారి తప్పటడుగులు వేస్తున్నారు. కొంత మంది హాస్టళ్లలో ఉంటూ చెడు స్నేహాల ప్రభావానికి గురవుతున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీకి వచ్చేసరికి మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
(చదవండి: ఏటీఎంలో పెట్టాల్సిన నగదుతో డ్రైవర్ పరారీ.. 37 లక్షలు ఉన్నప్పటికి రూ.3 లక్షలతోనే..)
విద్యార్థి దశలోనే జైలుకు..
జల్సాలకు అలవాటుపడిన పలువురు విద్యార్థులు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. చైన్ స్నాచింగ్, గంజాయి రవాణా చేస్తూ కటకటాల పాలవుతున్నారు. గతేడాది సత్తుపల్లిలో సెల్షాపులో జరిగిన భారీ చోరీ, ద్విచక్రవాహనాల అపహరణ కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈజీ మనీకి అలవాటు పడి విశాఖ, అనకాపల్లి నుంచి గంజాయి రవాణా చేస్తూ పెనుబల్లి, సత్తుపల్లి, కల్లూరు పోలీస్స్టేషన్ల పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుబడిన కేసులు అనేకం ఉన్నాయి. పాకెట్ మనీ, ఖర్చుల కోసం గంజాయి రవాణా చేస్తున్నామని పోలీసుల విచారణలో వెల్లడించడం విస్తుగొల్పుతోంది. ఇక పుట్టినరోజు పార్టీల్లో విపరీత ధోరణి, వికృత చేష్టలతో ఘర్షణలు పరిపాటే.
ఫ్రెండ్లీ పోలీసింగ్..
యువతను సన్మార్గంలో నడిపేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కళాశాలల్లో తరచూ సదస్సులు ఏర్పాటు చేసి తప్పుదోవ పట్టకుండా అవగాహన కల్పిస్తున్నారు. చిన్న చిన్న సంతోషాల కోసం జీవితాలను పణంగా పెట్టొద్దని హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వారికి ఇబ్బంది కలగొద్దనే భావనతో కొన్ని విషయాల్లో చూసీ చూడనట్లుగా ఉంటున్నారు. పలు కేసుల్లో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. ‘విద్యార్థుల సున్నిత మనస్తత్వం నేపథ్యాన వారి పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నాం’ అని పోలీసు సిబ్బంది చెబుతున్నారు.
(చదవండి: తల్లిదండ్రులను వేధించిన కొడుకు.. రూ.8 లక్షల సుపారీతో ఖతం చేయించిన ఫ్యామిలీ)
► ఖమ్మం పట్టణానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి తనకు బైక్ కావాలంటూ ఇంట్లో గొడవపడ్డాడు. తల్లిదండ్రులు నిరాకరించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో లక్షలు ధారపోసినా చివరికి కన్నుమూశాడు. ‘బైక్ కొనివ్వలేక కాదు.. ఇంటర్ పూర్తయ్యాక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది’ అంటూ రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం బంధువుల వల్ల కాలేదు.
► మధిరకు చెందిన మరో ఇంజినీరింగ్ విద్యార్థి స్నేహితుల ప్రభావంతో మద్యానికి బానిసయ్యాడు. ఓ రోజు గంజాయి తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. ‘స్నేహితుల వద్ద ఉంటూ చదువుకుంటున్నాని చెప్తుండేవాడు.. అడిగినన్ని డబ్బులు పంపిస్తున్నాం.. ఇలా చెడిపోతాడని అనుకోలేదు’ అంటూ విద్యార్థి తండ్రి పోలీసుల వద్ద కన్నీరుమున్నీరయ్యా డు. ఈ ఒక్కసారికి వాడిని వదిలేయండి అంటూ వారి కాళ్లపై పడ్డాడు.
పై రెండు ఘటనలు ఇలా ఉండగా.. సత్తుపల్లి పట్టణానికి చెందిన పాతికేళ్ల ఓ యువకుడిని తల్లిదండ్రులే అంతమొందించడం గమనార్హం. చేతికందిన ఒక్కగానొక్క కొడుకును సుపారీ ముఠా ద్వారా మట్టుబెట్టడానికి వారిని పురికొల్పిన పరిస్థితులు ఏమిటి?
తల్లిదండ్రుల నిఘా ఉండాలి..
పిల్లల ప్రవర్తన, అలవాట్లపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాల్సిందే. కళాశాలకు పిల్లలు సరైన సమయానికి వెళ్తున్నారా.. చదువులో ఎలా ఉన్నారు.. స్నేహితుల ప్రభావం ఎలా ఉందనే విషయాలపై కచ్చితంగా సమాచారం సేకరించాలి. సత్తుపల్లి డివిజన్లో డ్రగ్స్కు బానిసలైన వారిని గుర్తించే పనిలో పోలీస్ యంత్రాంగం నిమగ్నమై ఉంది. తల్లిదండ్రులకు పిల్లలపై ఏదైనా సందేహం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పేర్లు గోప్యంగా ఉంచి సరైన కౌన్సిలింగ్ చేస్తాం.
– ఎన్.వెంకటేష్, ఏసీపీ, కల్లూరు
ఎన్నో కేసులు నా దృష్టికి వచ్చాయి..
సిగరెట్, గంజాయికి అలవాటై న వారిలో మానసిక మార్పు కనిపిస్తుంది. ఫిట్నెస్ కోల్పోవడంతో పాటు ఆలోచన ధోరణి మారుతుంది. డ్రగ్స్ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో మత్తులో ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అలాంటి వారికి కౌన్సిలింగ్ ద్వారా తిరిగి దారికి తీసుకురావచ్చు. నా దృష్టికి వచ్చిన ఎన్నో కేసులను సైకాలజిస్ట్కు రిఫర్ చేశాను. పిల్లలపై నిఘా ఉంటే చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఆదిలోనే అడ్డుకునే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, సత్తుపల్లి
Tags