మీకొకటి.. మాకొకటి!

24 Jul, 2015 02:33 IST|Sakshi

 కర్నూలు(అగ్రికల్చర్):జిల్లాకు గత జూన్ నెలలో 11,080 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఆ నెలలో శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండటంతో బడ్జెట్ వచ్చినా పలు మండలాల్లో పంపిణీ నిలి చిపోయింది. జూలై నెలలో కొత్త పింఛన్లకు రెండు నెలల మొత్తం పంపిణీ చేయాల్సి ఉంది. పంచాయతీ సెక్రటరీల ద్వారా మాన్యువల్‌గా పంపిణీ చేయిస్తుండటంతో ఈ విడత కొందరికి కలిసొచ్చింది. జూలై నెల పింఛను మాత్రమే పంపిణీ చేసిన కార్యదర్శులు.. జూన్ నెలలో ఎన్నికల కోడ్ వల్ల ఆ మొత్తం రాలేదని బుకాయించారు. కొన్ని మండలాల్లో రెండు నెలల మొత్తం పంపిణీ చేసినా.. మరికొందరు ఒక నెల పింఛను నొక్కేశారు. చాలా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు కొత్త పింఛను బడ్జెట్ సర్పంచ్‌లకు అప్పగించినా పంపిణీ ఇష్టారాజ్యంగా సాగింది.
 
  మొత్తం రూ.2.21 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసి దాదాపు రూ.కోటి స్వాహా చేశారు. ఒక నెల పింఛను అందుకోలేకపోయిన లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తే ఎక్కడ తొల గిస్తారోనని జంకుతున్నారు. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో కొత్త పింఛన్లకు ఒక నెల మొత్తమే అందజేశారు. ఇక్కడ ఓ గ్రామంలో 12 మందికి పింఛన్లు మంజూరు కాగా ఒక నెల మొత్తంతోనే సరిపెట్టారు. అందులోనూ రూ.200 చొప్పున కోతపెట్టారు. హొళగుంద మండలంలోనూ ఇదే పరిస్థితి. పింఛన్లను కొంతకాలం పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయడం.. ఆ తర్వాత ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి పంచాయతీ కార్యాలయాలకు మార్చడం గందరగోళానికి తావిస్తోంది. ఇదే సమయంలో మాన్యువల్‌గా పంపిణీ చేస్తుండటం కార్యదర్శులకు కలిసొచ్చినట్లయింది. తాజాగా ట్యాబ్‌ల సహాయంతో పంపిణీ తెరపైకి రావడంతో ఇదెలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది.
 

మరిన్ని వార్తలు