వడదెబ్బకు ఏపీలో 237 మంది మృతి

17 Jun, 2014 02:42 IST|Sakshi

- ఉత్తర కోస్తాకు తీవ్ర వడగాడ్పులు
- కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

 
 సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల తీవ్రత మళ్లీ పెరిగింది. వడదెబ్బకు గురై సోమవారం రాష్ట్రంలో 237 మంది మరణించారు. వడదెబ్బతో గత నాలుగు రోజుల్లో 431 మంది మరణించిన విషయం తెలిసిందే. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో 62 మంది, విశాఖపట్నం జిల్లాలో 37 మంది, విజయనగరం జిల్లాలో 34 మంది, కృష్ణాజిల్లాలో 27 మంది, శ్రీకాకుళం జిల్లాలో 26 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 24 మంది, ప్రకాశం జిల్లాలో 19 మంది, నెల్లూరు జిల్లా లో 12 మంది, చిత్తూరు జిల్లాలో నలుగురు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు వం తున, అనంతపురంలో ఇద్దరు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. తునిలో మరోసారి అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులుండగా దక్షిణ కోస్తాంధ్రలో వడగాడ్పుల వాతావరణం నెలకొంది.
 
 మరో 24 గంటలపాటు ఇవే పరిస్థితులు కొనసాగనున్నట్టు వాతావరణ నిఫుణులు వెల్లడించారు. పశ్చిమ గాలుల కొనసాగింపు, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా.. వర్షాలింకా మొదలవకపోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నట్టు పేర్కొన్నారు. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు తీరాన్ని ఆనుకుని అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని బాపట్ల వరకు విస్తరించాయి. మరో మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్నట్టు వాతావరణ నిఫుణులు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో తేమ ఏర్పడి, నైరుతి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ తీరంలోని గుజ రాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తదితర ప్రాంతాల్లో నైరుతి ప్రభావం బాగా ఉండటంతో రాష్ట్రంలో కూడా వాటి విస్తరణకు సానుకూలమేనన్నారు.

>
మరిన్ని వార్తలు