మొదటి స్థానంలో రాష్ట్రం
తాజా పాజిటివ్ కేసులు 4,074
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ మరో రికార్డు సాధించింది. ప్రతి పది లక్షల మందిలో 25,000కు పైగా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు 33,580 మందికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 13,49,112కి చేరింది. దీంతో ప్రతి పది లక్షల మందిలో 25,264 పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. గడిచిన 24 గంటల్లో 4,074 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం బులెటిన్లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 53,724కి చేరాయి.
1,338 మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,228కి చేరింది. అలాగే కరోనా మరణాల రేటు పరంగా దేశంలో ఏపీ 13వ స్థానంలో ఉంది. మరణాల్లో దేశ సగటు 2.46 శాతంగా ఉంటే అది మన రాష్ట్రంలో 1.30 శాతంగా ఉంది. తాజాగా 54 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 696కి చేరింది. 4.43 శాతంతో గుజరాత్ రాష్ట్రంమొదటి స్థానంలో ఉంటే, 3.82 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 28,800 ఉన్నాయి.