తీవ్ర తుఫానుగా మారిన ‘‘ఎంఫాన్‌‌’’

17 May, 2020 15:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ‘‘ఎంఫాన్‌’’  తుఫాను వాయువ్య దిశగా ప్రయాణించి తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం ఉదయం 08.30 గంటలకు తీవ్ర తుఫానుగా మారి అదే ప్రాంతంలో పారదీప్(ఒరిస్సా)కు దక్షిణ దిశగా 990 కి.మీ, డిగా(పశ్చిమ బెంగాల్) కు దక్షిణ నైఋతి దిశగా 1140 కి.మీ, ఖేపుపర(బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1260 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత తీవ్రమై రాగల 12 గంటలలో అతి తీవ్రతుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తదుపరి 24 గంటలలో ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాల వద్ద  సాగర దీవులు(పశ్చిమ బెంగాల్), హతియా దీవులు(బంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.

దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రాలలో కొన్ని ప్రాంతాలకు ఈరోజు (మే 17 వ తేదీన) నైఋతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించారు. రాగల 48 గంటలలో దక్షిణ బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులలో మిగిలిన ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :  

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ రోజు, రేపు, ఎల్లుండి  ఉరుములు,  మెరుపులు, ఈదురు గాలులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు  ఉరుములు,  మెరుపులు, ఈదురు గాలులతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు  ఉరుములు,  మెరుపులుతో పాటు రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు