ఏపీ ఆటగాళ్ల జోరు

14 Dec, 2013 03:47 IST|Sakshi

 ముంబై: ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ టాటా ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇతనితో పాటు రాష్ట్రానికే చెందిన రెండో సీడ్ సాయిప్రణీత్ కూడా సెమీస్ చేరాడు. వీరితో పాటు పలువురు ఏపీ క్రీడాకారులు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీఫైనల్స్‌కు అర్హత సంపాదించారు. ఇక్కడి క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్‌సీడ్ గురుసాయిదత్ 21-12, 21-18తో చీ హంగ్ లూ (చైనీస్ తైపీ)పై విజయం సాధించగా, సాయిప్రణీత్ 16-21, 21-17, 21-15తో షెంగ్ జీ యంగ్ (చైనీస్‌తైపీ)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో గురు 21-15, 21-19తో మోహిత్ కామత్‌పై, ప్రణీత్ 21-14, 21-12తో ఆదిత్యప్రకాశ్‌పై నెగ్గారు.
 
 మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ పి.సి.తులసి (కేరళ), జాతీయ చాంపియన్ సయాలీ గోఖలేల పోరాటం ముగిసింది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తరుణ్ కొన-అశ్విని పొన్నప్ప జోడి 21-14, 21-17తో టిన్ జూ చీ-చింగ్ హూ చాంగ్ (చైనీస్ తైపీ) జంటపై గెలుపొందగా, మనీషా- ప్రణవ్ చోప్రా ద్వయం 21-15, 21-16తో టియన్ టన్-షెవోన్ జేమీ లే (మలేసియా) జోడిపై గెలిచింది. అయితే సిక్కిరెడ్డి-నందగోపాల్ జోడి 10-21, 17-21తో ప్రద్న్యా గాద్రే-అక్షయ్ దివాల్కర్ జోడి చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో గుత్తాజ్వాల-అశ్విని పొన్నప్ప జోడి 21-5, 21-9తో జాగ్రితి నాషీర్-జ్యోతి నాషీర్ జంటపై అలవోక విజయం సాధించగా, సిక్కిరెడ్డి-ప్రద్న్యాగాద్రే జోడి 21-18, 21-13తో వాన్ చింగ్ లిన్- జియావో మిన్ లీ (చైనీస్ తైపీ) ద్వయంపై, మనీషా-సాన్యోగితా జంట 21-16, 16-21, 21-12తో యా హన్ చంగ్-యి చూ షి (చైనీస్ తైపీ) జోడిపై గెలుపొందాయి.
 

మరిన్ని వార్తలు