కరోనా నియంత్రణపై సీఎం జగన్‌ సమీక్ష

19 Apr, 2020 14:22 IST|Sakshi

వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ రెండో స్థానం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న  కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షల నిర్వహణ వెంటనే పూర్తి చేయాలని సీఎం తెలిపారు. కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు.

ఇక కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ చెప్పారు. ప్రతి 2–3 రోజులకోసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని, ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా వ్యవస్థను తయారు చేయాలని సీఎం అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ఈ సందర్భంగా సీఎం జగన్‌ పరిశీలించారు. ఈ మాస్కులను రాష్ట్రంలో గుర్తించిన రెడ్‌జోన్లకు ముందస్తుగా పంపిణీ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి మనిషికి 3 చొప్పున మాస్కులు పంపిణీ ఇచ్చామన్నారు.

ఇక కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రతి 10 లక్షల జనాభాకి అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానానికి చేరుకుంది. ప్రతి  పది లక్షల జనాభాకు రాజస్తాన్ 685 పరీక్షలు చేస్తుండగా, ఏపీలో 539 పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్‌ కిట్స్‌ వినియోగించకుండానే రెండో స్థానానికి చేరుకుందని అధికారులు తెలిపారు. మరో 3–4 రోజుల్లో మరిన్ని టెస్టులు చేసే సంఖ్య బాగా పెరుగుతుందని పేర్కొన్నారు. రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు