ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

2 May, 2018 12:17 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలయ్యాయి. ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్‌లో లక్షా 38వేల మంది ఉత్తీర్ణత సాధించారని, 72.28శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలిపారు.  ఈ ఏడాది ఏపీ ఎంసెట్‌లో భాగంగా 1,90,924 మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు హాజరవ్వగా.. 73,371మంది అగ్రి, మెడికల్‌ పరీక్షలకు హాజరయ్యారు.

గతంలో విడుదల చేసిన ఎసెంట్‌ కీకి సంబంధించి.. 224 అభ్యంతరాలు వచ్చాయని, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి.. అభ్యంతరాలను నివృత్తి చేస్తుందని మంత్రి గంటా తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎంసెట్‌లో విద్యార్థుల అర్హత శాతం తగ్గిందని చెప్పారు. ఇంజినీరింగ్‌లో భోగి సూరజ్‌ కృష్ణ (95.27శాతం మార్కులు) ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా, రెండో ర్యాంకును మైత్రేయ (94.93), మూడో ర్యాంక్‌ను లోకేశ్వర్‌రెడ్డి, నాలుగో ర్యాంక్‌ను వినాయక్‌ వర్ధన్‌ (94.20), ఐదో ర్యాంక్‌ను షేక్‌ వాజిద్‌ సొంతం చేసుకున్నారు.

ఇక ఎంసెట్‌ ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. జూన్‌ 11 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. అగ్రికల్చర్‌ విభాగంలో సాయిసుప్రియ (94.78శాతం మార్కులతో) మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. రెండో ర్యాంక్‌ వాత్సవ్‌ (93.26), మూడో ర్యాంక్‌ హర్ష (92.47) సాధించారు.

ఏపీ ఎంసెట్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు