Naga Chaitanya: మంచి మనుసు చాటుకున్న నాగ చైతన్య.. ఫోటోలు వైరల్‌

17 Nov, 2023 07:41 IST|Sakshi

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా  హైదరాబాద్‌లోని సెయింట్‌ జూడ్స్‌ చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో సందడి చేశారు. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులతో కొంత సమయం గడిపారు. వారి ముఖాల్లో నవ్వులు చిందించారు. నవంబర్‌ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ చిన్నారులకు బహుమతులు అందించి వారితో సరదాగ గడిపారు. వారితో కాసేపు ఆటలు ఆడటమే కాకుండా అందరితో కలిసి డ్యాన్స్‌ చేసి వారిని సంతోషపరిచారు.

వాటికి సంబంధించిన ఫోటోలు  తాజాగా బయటకు వచ్చాయి. అందులో నాగ చైతన్యతో  ఓ చిన్నారి ఏదో చెబుతుంటే శ్రద్ధగా వింటూ కనిపించాడు.  చైతూ రాకతో చైల్డ్‌ కేర్ సెంటర్ అంతా సందడిగా మారింది. ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ నాగ చైతన్య ఫ్యాన్స్‌ చాలా సంతోషిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలలో పాల్గొన్న చైతూను వారు అభినందిస్తున్నారు. ఈ ఏడాది ‘కస్టడీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చన నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో NC23 షూటింగ్‌కు రెడీగా ఉంది. మత్స్యకారుల జీవితాలను అద్దం పట్టే ఓ యథార్థ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా కోసం ఆయన ఇప్పటికే తన లుక్‌ను మార్చుకున్నారు. ఈ క్రేజీ కాంబోలో  సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు, నాగ చైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబరు 1 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.

మరిన్ని వార్తలు