ఏపీలో ‘వేట’ సాయం వెంటనే

17 Apr, 2020 08:47 IST|Sakshi

చేపలవేటపై నిషేధం, లాక్‌డౌన్‌తో 90 రోజులు పనులు కోల్పోయిన మత్స్యకారులు

10 వేలు చొప్పున ప్రభుత్వ సాయం 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే వీరికి అందచేసే సాయాన్ని రూ.10 వేలకు పెంచింది. గత నవంబరు 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్ధి్దదారుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
(చదవండి: మే 5 తర్వాత కరోనా తగ్గుముఖం : శారదా పీఠాధిపతి)

  • మార్చి 31 లోపు మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 
  • మరపడవలపై 8 మంది, మోటారు పడవలపై ఆరుగురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం అందించనుంది. 
  • గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు, ఇతర సిబ్బంది పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 
  • లబ్ధి్దదారుల జాబితా ఖరారు అయిన తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.
  • ఈ ఏడాది వేట విరామ సమయం ప్రాంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం అందజేస్తుందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి చెప్పారు.
    (చదవండి: డ్రోన్లతో థర్మల్‌ స్క్రీనింగ్‌)
మరిన్ని వార్తలు