రైతులపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

24 Feb, 2018 12:03 IST|Sakshi

అమరావతి : ఉండవల్లిలోని ప్రజాదర్భార్‌ హాల్‌లో ఈ-ప్రగతి ఐఎస్‌బీ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి రైతులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సబ్సిడీలకు ప్రజలు బానిసలయ్యారన్నారు.ఇన్ పుడ్ సబ్సిడీ, క్రాప్ సబ్సిడీలకి జనం అలవాటు పడిపోయారు అంటూ మరోసారి రైతులను కించపరుస్తూ మాట్లాడారు. గతంలో చాలా సార్లు రైతులు, వ్యవసాయం పై చంద్రబాబు వివాదాస్పద కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రైతులు పంట నష్టపోయేటప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తారు. దాన్ని కూడా తప్పు పట్టే దోరణిలో చంద్రబాబు మాట్లాడారు. తాను వ్యవసాయానికి సంబంధించి రకరకాల సంస్కరణలు చేపట్టానని చెప్పే క్రమంలో ప్రజలందరూ సబ్సిడీలకు అలవాటుపడ్డారని రైతులను తక్కువ చేస్తూ ప్రసంగించారు.

ఇన్‌ పుట్‌ సబ్సిడీ అనేది విపత్కర పరిస్థితుల్లో పంట నష్టపోయినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు రైతులకు అందజేస్తాయి. నష్టాల్లో ఉన్న రైతుకు ఇన్‌ పుట్‌ సబ్సిడీని చెల్లించడాన్ని తప్పుబడుతూ, రైతులు బానిసైపోయారు అంటూ చంద్రబాబు మాట్లాడటంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతుకు సంబంధించినంత వరకు పంట చేతికొచ్చి, మంచి గిట్టు బాటు ధర వస్తే ఏ రైతు కూడా ఇన్ పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూడరు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతు విపత్కర పరిస్థితుల్లో వేసిన పంట చేతికి రానప్పుడు మాత్రమే ఇన్‌పుట్‌ సబ్సిడీల కోసం ఎదురు చూస్తారు. వ్యవసాయం అనేది ఇన్‌పుట్‌, క్రాప్‌ సబ్సిడీల కోసమే చేస్తున్నారు అని అర్థం వచ్చేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రైతుల మనోభావాలను దెబ్బెతీసేలా ఉన్నాయి. వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు