8న ఇడుపులపాయకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

4 Jul, 2019 06:51 IST|Sakshi

సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదిన జిల్లాకు రానున్నారు. తన తండ్రి.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో ఆయన  నివాళులు అర్పించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల విషయమై వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు బుధవారం అమరావతిలో చర్చించారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాష, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డాక్టర్‌ వెంకట సుబ్బయ్య, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు పాల్గొన్నారు.

ఫించన్‌ పథకాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. అవ్వతాతలను ఆదుకునే నిమిత్తం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఫించన్‌ పెంచుతామని ఆయన  ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫించన్‌ మొత్తాన్ని రూ.2250 పెంచుతూ తొలి సంతకం చేశారు. దీనిని జూలై నెలలో అందించనున్నట్లు ప్రకటించారు. 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున వైఎస్సార్‌ ఫించన్‌ కానుక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

మరిన్ని వార్తలు