కరోనా.. వివక్షను తొలగిద్దాం

12 May, 2020 03:08 IST|Sakshi

వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానికి వివరించిన సీఎం జగన్‌ 

కరోనా పాజిటివ్‌ వస్తే సమాజం చిన్నచూపు చూస్తుందనే భావన పోవాలి 

లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా వచ్చి వైద్యం పొందేలా మార్పు తేవాలి 

దాదాపు 98 శాతం కేసులు నయం అవుతుండటాన్ని తెలియజెప్పాలి 

రాష్ట్రాల సరిహద్దుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొంటేనే ఆర్థిక వ్యవస్థకు ఊపు 

తయారీ, రిటైల్‌ రంగం ఊపందుకోవాలి.. ప్రజల రాకపోకలు మెరుగుపడాలి 

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.. కేంద్ర సహకారం కావాలి 

ప్రజారోగ్య రంగానికి ఇచ్చే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకోకూడదు 

ఆసుపత్రులు, ఆరోగ్య మౌలిక వసతులకు కేంద్రం రూ.16 వేల కోట్లు ఇవ్వాలి 

ఎంఎస్‌ఎంఈ రంగానికి ఊతం ఇస్తూ రుణాలపై 6 నెలలు వడ్డీ మాఫీ చేయాలి 

పౌరులంతా సాధారణ జీవితం గడపడానికి తగిన చర్యలు తీసుకోవాలి  

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడినందున కేంద్ర సహకారం కావాలి. ఆరోగ్య రంగానికి, ఎంఎస్‌ఎంఈలకు ఊతమివ్వాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే పేదలకు మేలు జరుగుతుంది. పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి తగిన చర్యలు తీసుకోవాలి. 

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని సమాజం వేరుగా చూస్తుందన్న భావన నెలకొంది. వివక్ష కనిపిస్తోంది. దీనిని పోగొట్టేలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి. లక్షణాలు కనిపించిన వారు స్వయంగా ముందుకు వచ్చి వైద్యం పొందేలా చూడాలి. దాదాపు 98 శాతం కేసులు నయం చేయగలమని, 85 శాతం కేసుల్లో మైల్డ్‌ సింప్టమ్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయని తెలియజెప్పాలి. కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కునే వరకు దాంతో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై మరింత అవగాహన కల్పించాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కరోనా వైరస్, లాక్‌డౌన్‌ను అధిగమించి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే.. పాజిటివ్‌ వచ్చిన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష, ప్రజల్లో భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి తిరిగి గాడిన పడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే పేదలకు మేలు జరుగుతుందని, లాక్‌డౌన్‌ సడలింపు చర్యల నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధాన మంత్రి మోదీ సోమవారం ఢిల్లీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.  

వివక్ష, భయాందోళనలు తొలగిస్తేనే సాధారణ పరిస్థితులు 
లాక్‌డౌన్‌లో కేంద్రం ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చింది. తద్వారా కోవిడ్‌–19 కేసులను నియంత్రించగలిగాం.  
► రాష్ట్రంలో మూడు పర్యాయాలు సమగ్ర సర్వే జరిగింది. దాదాపు 30 వేల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో, వారందరికీ పరీక్షలు నిర్వహించాం. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్ల ద్వారా సర్వే కొనసాగించాం.  
► కరోనా పాజిటివ్‌కు గురైన కుటుంబాలు సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సమాజం వారిని వేరుగా చూస్తుందన్న భావన నెలకొంది. వివక్ష కనిపిస్తోంది. ఈ కారణం వల్లనే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం లేదు. ఇది మొత్తం కరోనా పరీక్షల ఉద్దేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోంది. 
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ, చిత్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు 

వ్యూహాత్మకంగా వ్యవహరించాలి 
► కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలను క్లస్టర్లు, కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించడం.. అదే విధంగా సంస్థాగతంగా క్వారంటైన్‌ ప్రక్రియపై మరోసారి ఆలోచించాల్సి ఉంది.  
► ఈ ప్రక్రియలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వ్యూహంతో వ్యవహరించాల్సి ఉంది.  

స్వచ్ఛందంగా వైద్యానికి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం 
► రాష్ట్రంలో అవసరమైన శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు, కోవిడ్‌–19 సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా, కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవడం, వైద్యం పొందేలా ప్రోత్సహిస్తున్నాం. 
► వాటితో పాటు టెలి మెడిసిన్, కాల్‌ సెంటర్లు కూడా కరోనా సోకిన వారికి పరీక్షలు, చికిత్స చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. హైరిస్క్‌ ఉన్న వారికి మరింత అవగాహన కల్పించడంతో పాటు, హోం ఐసోలేషన్‌కు సంబంధించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.  
► వృత్తాలు గీయడం (మార్కింగ్‌) ద్వారా ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేయడం, స్వీయ క్వారంటైన్‌కు సంబంధించి కూడా ఒక వ్యూహం రూపొందించాల్సి ఉంది .  

ప్రజల రాకపోకలతోనే తయారీ, రిటైల్‌ రంగానికి ఊపు 
► తయారీ రంగం పుంజుకోవడానికి ముడిసరుకులు అందడంతో పాటు ప్రజల రాకపోకలు చాలా అవసరం. ఈ నేపథ్యంలో సరుకుల రవాణాకు అనుమతించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో అవరోధాలు ఏర్పాడుతున్నాయి.  
► మా రాష్ట్రంలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా మార్కెట్లు, రిటైల్‌ రంగం మూత పడటంతో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ లేదు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మిగులుతో తీవ్రంగా దెబ్బ పడుతోంది.  
► రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి పంటకూ కనీస మద్దతు ధర ప్రకటించింది. 

ప్రజా రవాణాపై ఆంక్షలు తొలగించాలి  
► ప్రజలు వారి పనుల కోసం వెళ్లాలంటే ప్రజా రవాణా అందుబాటులో లేదు.  వివిధ రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో పని చేస్తున్న కూలీలు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోవడం చూస్తున్నాం. వారు తాము పని చేసిన చోటుకు తిరిగి రాకపోతే సా«ధారణ పరిస్థితులు నెలకొనవు. వారిలో భయం, ఆందోళన తొలగిపోవాలి.  

వైద్య వ్యవస్థలో చాలా మార్పులు తేవాలి 
► ఇప్పుడున్న వైద్య విధానం, వ్యవస్థలో చాలా మార్పులు తీసుకు రావాల్సి ఉంది. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ఆసుపత్రుల్లో పడకలతో పాటు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశాం. వాటిని ఇంకా.. ఇంకా పెంచాల్సి ఉంది. గ్రామ స్థాయి నుంచే టీచింగ్‌ ఆస్పత్రుల స్థాయిలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.  
► రోజులో 24 గంటల పాటు పని చేసే సిబ్బందితో గ్రామ క్లినిక్‌లు, ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా చాలా మందికి వైద్య సేవలు అందుతాయి. వాటిలో వైద్యులు, నర్సుల కొరత కూడా ఉండబోదు. 
► అన్ని ఆసుపత్రులను సమూలంగా మార్చి, జాతీయ స్థాయిలో వాటిని తీర్చి దిద్దాల్సి ఉంది. గ్రామాల్లో పని చేసే క్లినిక్‌లు కూడా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎవరికి ఏ జబ్బు లక్షణాలు కనిపించినా, ఆ క్లినిక్‌లకు వెళ్లి వైద్య సలహాలు పొందాలి. అవసరమైతే చికిత్స కూడా అందించాలి. ఆ స్థాయి ప్రమాణాలతో అవి పని చేయాల్సి ఉంది. 
► గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు జోరుగా సాగాల్సి ఉంది. ఇందుకు స్థానిక సంస్థలకు ఎన్నో నిధులు కావాలి.  

ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూత ఇవ్వాలి 
► రాష్ట్రంలో దాదాపు 87 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయి. 9.7 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ప్రతి యూనిట్లో కనీసం 10 మంది ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ రంగానికి చేయూత ఇవ్వకపోతే కుప్పకూలిపోతుంది. 
► ఎంఎస్‌ఎంఈ రంగం స్తంభించిపోతే.. అన్ని చోట్లా నిరుద్యోగం పెరుగుతుంది. 6 నెలలు, అంటే 2 త్రైమాసికాలు ఎంఎస్‌ఎంఈలకు వడ్డీ మాఫీ చేయాలి.   
► వ్యవసాయం విషయానికొస్తే ఉద్యానవన పంటలతో పాటు మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించాలి. సేకరణలో ప్రస్తుతం ఉన్న పరిమితిని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. అన్ని రాష్ట్రాల్లో హోల్‌సేల్‌ మార్కెట్లు తెరవాలి.  

ఆరోగ్య రంగానికి ఊతమివ్వాలి 
► రాష్ట్రంలో ఆసుపత్రులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కనీసం రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ విషయంలో కొత్త రాష్ట్రంగా మాకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.  
► వడ్డీలు లేని లేదా వడ్డీలు తక్కువగా ఉండే దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలి.  రాష్ట్రంలో మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను కూడా నిర్మిస్తాం.  
► ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఇచ్చే ఈ రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకూడదు. ఇతర రంగాలకు నిధుల కొరత రాకుండా ఈ 
సదుపాయం కల్పించాలి.  

సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలపై ప్రశంసలు
కోవిడ్‌–19ను కట్టడి చేసి, ప్రజలు తిరిగి సాధారణ జీవితం గడిపేలా చూసేందుకు తొలుత కరోనా పట్ల సమాజంలో ఉన్న వివక్షను తొలగించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలన్న ఆయన ప్రతిపాదనకు పలువురు మద్దతు తెలుపుతున్నారు.  సోమవారం ప్రధాని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్‌ జగన్‌ పలు విషయాలపై స్పష్టమైన సూచనలు చేశారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనను తగ్గించడానికి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను సమర్థవంతంగా వివరించారని వివిధ రంగాల నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా రోగులపై వివక్ష చూపనప్పుడే.. లక్షణాలు కనిపించిన వారంతా స్వచ్ఛందంగా వచ్చి వైద్యం పొందుతారని చెప్పడం అక్షర సత్యమని పలువురు వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయమై పలు జాతీయ చానళ్లలో సైతం వార్తలు రావడం విశేషం. ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందో చక్కగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌ మాటల్లో అన్ని విషయాల పట్ల లోతైన విశ్లేషణ, అవగాహన కనిపించిందన్నారు.

సాధారణ స్థాయిలో సరుకుల రవాణా జరగకుండా.. వలస కూలీలు, కార్మికులు ఆయా ఫ్యాక్టరీల్లో పని చేయగలిగే పరిస్థితులు లేకుండా.. రాష్ట్రాల సరిహద్దుల వద్ద సాధారణ పరిస్థితులు నెలకొనకుండా.. ప్రజలు వారి వారి పనులకు వెళ్లకుండా ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం రాదు.  

రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి అవరోధాలు పూర్తిగా తొలగిపోవాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఒక డ్రైవర్‌.. సరుకులను ఎక్కడికైనా సరే తీసుకు వెళ్లగలననే భరోసా ఉండాలి. తనను ఎవ్వరూ నిర్బంధించరని, క్వారంటైన్‌ చేయరనే నమ్మకం ఆ డ్రైవర్‌కు కలగాలి. 

మీడియాలో కరోనాపై భయాందోళనలు పెంచే కథనాల కన్నా, వాస్తవాలను వివరించాలి. దాదాపు 95–98 శాతం వరకు ఈ వ్యాధిని నయం చేయవచ్చన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా పూర్తి జాగ్రత్తలు పాటించడంతో పాటు, వారి కుటుంబాలను కూడా కాపాడుకునే విధంగా మార్పు తేవాలి.  

బస్సుల్లో సరిపడేంత భౌతిక దూరం పాటించాలి. ప్రజా రవాణాలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేయాలి. షాపింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూనే భౌతిక దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మాస్క్‌లు ధరించేలా చూడాలి. ఇవన్నీ సరిగ్గా అమలయ్యేలా స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

మరిన్ని వార్తలు