రూ.1,210 కోట్లతో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలు

19 Jun, 2020 04:43 IST|Sakshi
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష 

కాలేజీల నమూనాల పరిశీలన

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలుండాలి

టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ ఉండాలి

ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ అభ్యర్థుల వివరాలపై సర్వే చేయాలి

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి

ఈలోగా పరిశ్రమల అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి

సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.1,210 కోట్లకు పైగా అంచనాలతో ఏర్పాటు చేస్తున్న 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కాలేజీల నమూనాలను పరిశీ లించారు. అనంతరం సీఎం ఇచ్చిన సూచనలు, జారీ చేసిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. 

► సంబంధిత రంగంలో టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగు పరచాలి.
► కాలేజీల నిర్మాణం పూర్తయ్యాక ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఈలోగా పరిశ్రమల అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి. 
► సింగపూర్, జర్మనీ, అమెరికా, యూకే దేశాల్లోని పలు యూనివర్సిటీలు, సంస్థలు మనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల వాటిని ఇందులో భాగస్వాములను చేయాలి. ఐటీఐ, పాలిటెక్నిక్‌ చేసిన వారికి మేలు జరిగేలా ఎన్‌ఏసీ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌)ని కూడా భాగస్వామిని చేయాలి. 

20 రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
► మొత్తం 30 చోట్ల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల నిర్మాణ నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. ఈ 30 కాలేజీల్లో 20 రంగాలలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి శిక్షణ ఇస్తారు. 
► దాదాపు 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభి వృద్ధిలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొం దిస్తున్నారు. స్థానిక పరిశ్రమలు, భారీ పరి శ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసర మైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు.
► కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్‌ మహీంద్ర, హెచ్‌సీఎల్, హ్యుందాయ్, వోల్వో, బాష్‌ వంటి కంపెనీల భాగస్వామ్యం ఉంటుంది. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ, ఐఐఐటీ బోధనా సిబ్బందితో అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తారు.
► సమీక్షా సమావేశంలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చల్లా మధు సూదన్‌ రెడ్డి, ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు